పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ
గడచిన కొద్ది రోజుల్లో కొత్తగా జారీ అయిన 13,700 మించి పీఎన్జీ కనెక్షన్లు
ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారిన 7,300 మందికి పైగా వినియోగదారులు
మార్చి 13న ఉన్న 89 లక్షల నుంచి నిన్నటికి సుమారు 55 లక్షలకు తగ్గిన ముందస్తు బుకింగ్లు
రాష్ట్రాలకు ప్రత్యామ్నాయ ఇంధనాల సరఫరాను పెంచేందుకు పూర్తి మద్దతిస్తోన్న బొగ్గు మంత్రిత్వ శాఖ
అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎన్ఫోర్స్మెంట్ చర్యలు
గడచిన 24 గంటల్లోనే 4,500 కంటే ఎక్కువ దాడులు నిర్వహణ.. సుమారు 4,000 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం
శక్తిని ఆదా చేసేందుకు వీలుగా పీఎన్జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ స్టవ్ల వంటి ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలను ఉపయోగించాలని ప్రజలను ప్రోత్సహిస్తోన్న ప్రభుత్వం
ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న భారత సముద్రయాన రంగం
రద్దీ నమోదైనట్లుగా నివేదించని దేశీయ ఓడరేవులు
ఓమన్, మలేషియా, ఫ్రాన్స్, జోర్డాన్, ఖతార్ దేశాల నాయకులతో మాట్లాడిన ప్రధానమంత్రి
పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై స్పష్టమైన భారతదేశ వైఖరిని వారికి వివరించిన ప్రధాని
ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించడానికి.. శాంతిస్థాపన, సుస్థిరత కోసం చర్చలు, దౌత్యమే ఏకైక మార్గమని చెప్పిన ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
20 MAR 2026 4:50PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై నేడు జాతీయ మీడియా కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖలు (ఇంటర్ మినిస్ట్రీయల్) మీడియా సమావేశాన్ని నిర్వహించాయి. మారుతున్న పరిస్థితులపై మీడియాకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించడానికి ఇటువంటి సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. పెట్రోలియం- సహజ వాయువు, ఓడరేవులు- నౌకాయానం- జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అందిస్తున్న సహాయంపై తాజా వివరాలను వారు తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితి, ఆయా రంగాల్లో తీసుకుంటున్న చర్యలను మీడియాకు వివరించారు.
ఇంధన సరఫరా, లభ్యత
హోర్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిరంతర లభ్యతను నిర్ధారించడానికి తీసుకున్న చర్యలను పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంత్రిత్వ శాఖ ఈ కింది విధంగా పేర్కొంది:
ముడి చమురు, చమురు శుద్ధి కేంద్రాలు
-
అన్ని చమురు శుద్ధి కేంద్రాలు గరిష్ట సామర్థ్యంతో నడుస్తున్నాయి. తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉండటంతో పాటు పెట్రోల్, డీజిల్ విషయంలో తగినంత నిల్వలు అన్ని వేళలా ఉండేలా చూసుకుంటున్నారు.
-
సంక్షోభానికి ముందు ఉన్న ఉత్పత్తి స్థాయిలతో పోలిస్తే చమురు శుద్ధి కేంద్రాల నుంచి దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి సుమారు 40 శాతం పెరిగింది.
రిటైల్ విక్రయ కేంద్రాలు
-
చమురు మార్కెటింగ్ కంపెనీల రిటైల్ విక్రయ కేంద్రాల్లో ఎక్కడా ఇంధన కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు. పెట్రోల్, డీజిల్ సరఫరా క్రమం తప్పకుండా కొనసాగుతోంది.
-
తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నందున ప్రజలు అందోళనతో ముందస్తుగా కొనుగోళ్లు చేయొద్దని సూచించారు.
సహజ వాయువు
-
ప్రాధాన్యత రంగాలకు రక్షిత సరఫరా కొనసాగుతోంది. ఇందులో గృహ వినియోగ పీఎన్జీ, సీఎన్జీ రవాణా రంగానికి 100 శాతం సరఫరా అందుతోంది. పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు సరఫరాను సుమారు 80 శాతానికి పరిమితం చేశారు.
-
హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లు వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వడంలో ప్రాధాన్యత ఇవ్వాలని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు (సీజీడీ) సూచించారు.
-
పీఎన్జీ విస్తరణను వేగవంతం చేయడానికి, ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారడాన్ని ప్రోత్సహించడానికి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలతో పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమీక్షా సమావేశం నిర్వహించారు.
-
ఐజీఎల్, ఎంజీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీలు వినియోగదారులకు పలు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.
-
దరఖాస్తు చేసుకున్న సమయం నుంచి వినియోగదారుల ఇళ్లకు గ్యాస్ సరఫరా ప్రారంభమయ్యే మధ్య కాలాన్ని తగ్గించాలని.. అలాగే విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సీజీడీ సంస్థలను పీఎన్జీఆర్బీ ఆదేశించింది.
-
సీజీడీ విస్తరణకు సంబంధించిన అనుమతులను వేగవంతం చేయాలని 16.03.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.
-
18.03.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్పీజీలో అదనంగా 10 శాతం కేటాయించాలని ప్రతిపాదించింది. అయితే దీర్ఘకాలంలో ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారడానికి రాష్ట్రాలు సహకరించాల్సి ఉంటుంది.
-
ఈ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడం, సీజీడీ నెట్వర్క్ను విస్తరించడం.. గృహ, వాణిజ్య, పారిశ్రామిక పీఎన్జీ వినియోగదారులకు కనెక్షన్ల జారీని వేగవంతం చేయడం ఇప్పుడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల బాధ్యత.
-
19.03.2026 నాటి లేఖ ద్వారా మంత్రిత్వ శాఖకు రాజస్థాన్ ప్రభుత్వం నుంచి దరఖాస్తు అందింది. సీజీడీని ప్రోత్సహించడానికి, పీఎన్జీకి మారడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ సంస్కరణలు చేపట్టినట్లు అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉంది.
-
గడచిన కొద్ది రోజుల్లో 13,700 కంటే ఎక్కువ కొత్త పీఎన్జీ కనెక్షన్లు జారీ అయ్యాయి. అలాగే 7,300 మందికి పైగా వినియోగదారులు ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారారు. ఇది ఎల్పీజీ డిమాండ్పై ఒత్తిడిని తగ్గించడంలో ఎంతగానో దోహదపడింది.
ఎల్పీజీ సరఫరా పరిస్థితి
-
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎల్పీజీ సరఫరా ఇంకా ఆందోళనకరంగానే ఉంది. దీనిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.
-
డిస్ట్రిబ్యూటర్ల వద్ద కొరత ఉందన్న నివేదికలు ఎక్కడా లేవు.
-
భయాందోళనతో ముందస్తుగా చేసే బుకింగ్లు గణనీయంగా తగ్గాయి. మార్చి 13న 89 లక్షలుగా ఉన్న ఈ తరహా బుకింగ్లు నిన్నటికి సుమారు 55 లక్షలకు చేరుకున్నాయి. అదే సమయంలో గృహ వినియోగ ఎల్పీజీ డెలివరీలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
-
వాణిజ్య, గృహేతర ఎల్పీజీ కేటాయింపుల కోసం 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉత్తర్వులు జారీ చేశాయి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో దీని సరఫరా అందుబాటులో ఉంది.
-
విద్యా సంస్థలు, ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇస్తూ వాణిజ్య ఎల్పీజీలో సుమారు 50 శాతాన్ని వాటికే కేటాయిస్తున్నారు.
-
గత వారంలో సుమారు 11,360 మెట్రిక్ టన్నుల (ఎంటీ) వాణిజ్య ఎల్పీజీని సేకరించారు.
కిరోసిన్
-
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 48,000 కిలో లీటర్ల (కేఎల్) కిరోసిన్ను కేటాయించారు. పంపిణీ కేంద్రాలను గుర్తించాలని కూడా వాటిని కోరారు.
-
ఇప్పటివరకు 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ (ఎస్కేఓ) కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. హిమాచల్ ప్రదేశ్, లడఖ్లు ఎటువంటి అవసరం లేదని తెలియజేశాయి. నేటి వరకు ఇంకా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వాల సమావేశాలు
-
రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ‘నిత్యావసర సరకుల చట్టం' , 'ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వుల' ప్రకారం సరఫరాను పర్యవేక్షిస్తున్నాయి. నిరంతరం నిఘా ఉంచాలని, తనిఖీలు నిర్వహించాలని, ఎల్పీజీ రవాణా సాఫీగా సాగేలా చూడాలని వాటికి సూచించారు.
-
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి నిత్యావసరాల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడం, నియంత్రించడంలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ప్రాథమిక పాత్ర పోషించాల్సి ఉంటుంది.
-
అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి పెట్రోల్ పంపులు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ కేంద్రాలు, నిల్వ కేంద్రాలు మొదలైన చోట్ల సమన్వయంతో కూడిన తనిఖీలు, ఆకస్మిక దాడులు నిర్వహించాలని జిల్లా మేజిస్ట్రేట్లు లేదా కలెక్టర్లు, ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను ఆదేశించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం 13.03.2026 నాటి లేఖ ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను కోరింది.
-
18.03.2026 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఈ విధంగా కోరింది:
-
అక్రమ నిల్వలు, నల్ల బజారు క్రయవిక్రయాలు, గృహ వినియోగ ఎల్పీజీని ఇతర అవసరాలకు మళ్లించడం, ఇతర అక్రమాలను అరికట్టడానికి కఠినమైన నిఘా ఉంచాలి.
-
నిబంధనలను ఉల్లంఘించే వారిపై నిత్యావసర సరకుల చట్టం- 1955, పెట్రోలియం చట్టం- 1934, పెట్రోలియం నిబంధనలు- 2002, మోటార్ స్పిరిట్- హెచ్ఎస్డీ ఆర్డర్- 2005, ఇతర వర్తించే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.
-
ఎల్పీజీ ట్యాంకర్లు, సిలిండర్ల రవాణా ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగేలా చూడటంతో పాటు అవసరమైన పరిపాలనా, రవాణా పరమైన చర్యలు తీసుకోవాలి.
-
స్థానిక ప్రాధాన్యతలు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాణిజ్య ఎల్పీజీ పంపిణీకి సంబంధించి సరైన విధానాలను రూపొందించాలి.
-
ఆందోళనతో ముందస్తుగా చేసే కొనుగోళ్లను నివారించడానికి, ఎల్పీజీని పొదుపుగా వాడమని ప్రజలను ప్రోత్సహించడానికి, ఖచ్చితమైన సమాచారాన్ని చేరవేయడానికి ప్రజా సూచనలను జారీ చేయాలి.
-
జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ (ఎఫ్సీ-ఎస్) అధికారులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టవలసిందిగా కోరారు.
-
సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతిరోజూ మీడియా సమావేశాలను నిర్వహించాలని కోరారు.
-
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేయాలని.. వాటికి క్రమం తప్పకుండా విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు.
-
ఇప్పటివరకు 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశాయి. అనేక రాష్ట్రాలు ప్రతిరోజూ మీడియా సమావేశాలను కూడా నిర్వహిస్తున్నాయి.
-
31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి.
-
కంట్రోల్ రూంలు, జిల్లా పర్యవేక్షణ కమిటీలను ఇంకా ఏర్పాటు చేయని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తక్షణమే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.
ఎన్ఫోర్స్మెంట్ చర్యలు
-
అక్రమ నిల్వలు, నల్ల బజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ చర్యలు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 4,500 కంటే ఎక్కువ దాడులు నిర్వహించగా.. సుమారు 4,000 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
-
ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా చర్యలు తీసుకున్నట్లు నివేదికలు అందాయి.
-
సరఫరా సాఫీగా సాగేలా చూడటానికి, అక్రమాలను నిరోధించడానికి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు రిటైల్ విక్రయ కేంద్రాలు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ కేంద్రాల వద్ద 1,800 కంటే ఎక్కువ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి.
ప్రభుత్వం చేపడుతున్న ఇతర చర్యలు
ముఖ్యంగా గృహాలు, ఆసుపత్రులు, విద్యా సంస్థల వంటి ప్రాధాన్యతా రంగాలకు నిరంతరాయ ఎల్పీజీ సరఫరాకు, పీఎన్జీ విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది.
శుద్ధి కర్మాగార ఉత్పత్తిని పెంచడం, పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ వ్యవధులను 25 రోజులకు... గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు సవరించడం, ప్రాధాన్యతా క్రమంలో కేటాయింపులు చేయడం వంటివి ఈ చర్యల్లో భాగంగా ఉన్నాయి.
రాష్ట్రాలకు సరఫరాను పెంచేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ సహకారంతో... కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు అందుబాటులో ఉంచుతున్నారు.
అదనపు ఎల్పీజీ కేటాయింపుతో ముడిపడి ఉన్న ప్రోత్సాహకాల మద్దతుతో, పీఎన్జీ కనెక్షన్లను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
ప్రజలకు సూచనలు
పౌరులు సమాచారం కోసం అధికారిక వనరులపైనే ఆధారపడాలని, వదంతులకు దూరంగా ఉండాలని సూచించడమైనది.
హోమ్ డెలివరీ కొనసాగుతున్నందున వినియోగదారులు భయాందోళనలతో బుకింగ్లు చేయవద్దని, డిజిటల్ బుకింగ్ ప్లాట్ఫారమ్లను ఉపయోగించాలని, ఎల్పీజీ పంపిణీదారులను నేరుగా సంప్రదించడం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పీఎన్జీ, విద్యుత్-ఇండక్షన్ కుక్టాప్ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాలని, ఇంధనాన్ని పొదుపు చేయాలని పౌరులను ప్రోత్సహిస్తున్నారు.
నౌకా వాణిజ్య, నౌకాయాన కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్లో నెలకొన్న నౌకా వాణిజ్య పరిస్థితిని, భారతీయ నౌకలు, సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యల గురించిన సమాచారాన్ని నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మంత్రిత్వ శాఖ ఈ విషయాలను తెలియజేసింది:
ఈ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ క్షేమంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా కలిగిన నౌకలకు సంబంధించి ఎటువంటి నౌకా ప్రమాదం నమోదు కాలేదు.
ప్రస్తుతం, 611 మంది భారతీయ నావికులతో కూడిన 22 భారత జెండా గల నౌకలు పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నాయి. నౌకా యజమానులు, ఆర్పీఎస్ఎల్ ఏజెన్సీలు, భారత మిషన్ల సమన్వయంతో డీజీ షిప్పింగ్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది.
డీజీ షిప్పింగ్ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 24×7 పనిచేస్తూనే ఉంది. ప్రారంభం నుంచి 3,550 కాల్లు, 6,748 ఈమెయిళ్లను ఇది నిర్వహించింది. గత 24 గంటల్లో వచ్చిన 125 కాల్లు, 209 ఈమెయిళ్లు ఇందులో భాగంగా ఉన్నాయి.
డీజీ షిప్పింగ్ ఇప్పటివరకు విమానాశ్రయాలు, ప్రాంతీయ ప్రదేశాల నుంచి 513 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో సహాయపడింది. గత 24 గంటల్లో స్వదేశానికి తిరిగి వచ్చిన 25 మందీ వీరిలో ఉన్నారు.
గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి సహా ఆయా రాష్ట్రాల మారిటైమ్ బోర్డులు ధ్రువీకరించిన ప్రకారం... ఓడరేవుల అంతటా ఎటువంటి రద్దీ లేకుండా భారత నౌకా వాణిజ్య రంగ కార్యకలాపాలు సజావుగా కొనసాగుతున్నాయి.
సులభమైన నిర్వహణను నిర్ధారించడానికి, రద్దీని తగ్గించడానికి... జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, వి.ఓ. చిదంబరనార్ పోర్ట్ అథారిటీ, విశాఖపట్నం పోర్ట్, ముంద్రా పోర్ట్, దీన్దయాల్ పోర్ట్ అథారిటీ వంటి కీలక ఓడరేవుల్లో అదనపు సామర్థ్యాన్ని ఏర్పాటు చేశారు. నౌకల రాకపోకలను, సరుకు రవాణా కార్యకలాపాలను ఓడరేవులు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి.
న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీలో వాటాదారులకు మద్దతునిచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ చర్యల్లో భాగంగా ఈ నెల 14 నుంచి 31 వరకు ముడి చమురు, ఎల్పీజీ నౌకలకు సంబంధించిన సరుకు రవాణా ఛార్జీలను మాఫీ చేశారు. నిలిచిపోయిన ఎగుమతి కంటైనర్లకు గ్రౌండ్ రెంట్, రిఫర్ ఛార్జీలను మాఫీ చేయడంతో పాటు సుమారు 3,500 చదరపు మీటర్ల కవర్డ్ షెడ్, 76,000 చదరపు మీటర్ల ఓపెన్ యార్డ్లతో అదనపు నిల్వ సామర్థ్యాన్ని ఏర్పాటు చేశారు.
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా నౌకా రవాణా కార్యకలాపాలు, ఓడరేవు కార్యకలాపాలు, నావికుల భద్రత, నౌకా వాణిజ్య కార్యకలాపాల కొనసాగింపును నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తూనే ఉంది.
సంక్షోభ ప్రాంతంలో భారత పౌరుల భద్రత
భారత మిషన్ల ద్వారా కొనసాగుతున్న సహాయం, విస్తరణ సహా, ఈ ప్రాంతంలోని ఇటీవలి పరిణామాలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని పంచుకుంది. మంత్రిత్వ శాఖ కింది సమాచారాన్ని తెలియజేసింది:
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై భారత్ వైఖరిని తెలియజేస్తూ... ఉద్రిక్తతలను తగ్గించి శాంతి, స్థిరత్వాలను పునరుద్ధరించడానికి సంప్రదింపులు, దౌత్యం అవసరమని స్పష్టం చేస్తూ... ఒమన్, మలేషియా, ఫ్రాన్స్, జోర్డాన్, ఖతార్ దేశాల నేతలతో భారత ప్రధానమంత్రి మాట్లాడారు.
ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను ప్రధానమంత్రి తీవ్రంగా ఖండించారు. హార్మూజ్ జలసంధి గుండా సురక్షితమైన, స్వేచ్ఛాయుతమైన నౌకాయానాన్ని నిర్ధారించాల్సిన అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు.
ఒమన్: సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్తో మాట్లాడిన ప్రధానమంత్రి... ఆయనకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఒమన్ సార్వభౌమాధికార ఉల్లంఘనలను భారత్ ఖండిస్తోందని పునరుద్ఘాటించారు. భారత పౌరులతో సహా ప్రజలను సురక్షితంగా తరలించే సౌకర్యం కల్పించడంలో ఒమన్ పోషించిన పాత్రను ఆయన ప్రశంసించారు.
మలేసియా: మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మాట్లాడిన భారత ప్రధానమంత్రి, పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులపై అభిప్రాయాలను పంచుకున్నారు. హరి రాయా ఐదిల్ఫిత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఫ్రాన్స్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో భారత ప్రధానమంత్రి మాట్లాడారు. ఈ ప్రాంతంలో, వెలుపలా శాంతి, సుస్థిరతలను ప్రోత్సహించడం కోసం సన్నిహిత సమన్వయాన్ని కొనసాగించడానికి ఇరువురు నేతలు అంగీకరించారు.
జోర్డాన్: జోర్డాన్ రాజు అబ్దుల్లా II తో మాట్లాడిన ప్రధానమంత్రి, ఆయనకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించడం కోసం జోర్డాన్ చేస్తున్న కృషిని అభినందించారు. ఇరుపక్షాలు ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను ఖండించి, సరుకులు, ఇంధనంల నిరంతరాయ రవాణాకు మద్దతు తెలిపాయి.
ఖతార్: ఖతార్ అమీర్ గౌరవ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో మాట్లాడిన ప్రధానమంత్రి, ఆయనకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఖతార్కు సంఘీభావం తెలిపారు. ఇరుపక్షాలు ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను ఖండించాయి. హార్మూజ్ జలసంధి గుండా సురక్షిత నౌకాయానానికి తమ మద్దతును పునరుద్ఘాటించాయి.
భారతీయ పౌరుల భద్రత, క్షేమం, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ... పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతంలోని పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది.
ఇరాన్ నుంచి పొరుగు దేశాలకు 913 మంది భారత పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం ఎంతగానో కృషి చేసింది. వీరిలో 793 మంది అర్మేనియాకు, 120 మంది అజర్బైజాన్కు వెళ్లారు.
ఇరాన్ నుంచి బయలుదేరిన 284 మంది భారతీయ యాత్రికులంతా క్షేమంగా భారత్ తిరిగి వచ్చారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ భారత పౌరులకు సహాయం కొనసాగిస్తోంది. నిన్న దీనికి 10 కాల్లు, 6 ఈమెయిళ్లు అందాయి. వీటిలో అధికభాగం వాణిజ్య నౌకల్లో చిక్కుకుపోయిన భారత పౌరులకు సంబంధించినవే.
రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయం కొనసాగుతుండగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది.
ఈ ప్రాంతం అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టులు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు జారీ చేస్తూ నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. సముద్రయాన కార్మికులు, విద్యార్థులు, చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, స్వల్పకాలిక సందర్శకుల కోసం వీసా, కాన్సులర్, లాజిస్టికల్ సహాయం కొనసాగుతోంది.
ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఆ ప్రాంతం నుంచి సుమారు 3 లక్షల మంది ప్రయాణికులు భారత్ తిరిగి వచ్చారు. మొత్తం విమాన కార్యకలాపాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి.
యూఏఈలో పరిమిత సంఖ్యలో షెడ్యూల్ చేయని విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. ఈ రోజు సుమారు 90 విమానాలు భారత్ రానున్నాయి.
సౌదీ అరేబియా, ఒమన్ల నుంచి భారత్కు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
ఖతార్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉంది. ఈ రోజు ఖతార్ ఎయిర్వేస్ భారత్కు షెడ్యూల్ చేయని 10 విమానాలను నడపనుంది.
కువైట్ గగనతలం మూసి ఉంది. ఈ నేపథ్యంలో జజీరా ఎయిర్వేస్ సౌదీ అరేబియాలోని అల్ ఖైసుమా విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈరోజు కొచ్చికి తొలి విమానం బయలుదేరింది.
బహ్రెయిన్ గగనతలం మూసి ఉంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ ఎయిర్ సౌదీ అరేబియాలోని దమ్మమ్ నుంచి భారత్కు ప్రత్యేక విమానాలను నడుపుతోంది.
కువైట్, బహ్రెయిన్, ఇరాక్లలో ఉన్న భారత పౌరుల ప్రయాణానికి సౌదీ అరేబియా మీదుగా ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇరాన్లోని భారత పౌరులు అర్మేనియా, అజర్బైజాన్ల మీదుగా భారత్ వచ్చేందుకు సహాయం కొనసాగుతోంది.
ఇజ్రాయెల్లోని భారత పౌరులు జోర్డాన్ మీదుగా భారత్ చేరుకునేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ఈ నెల 18న రియాద్లో జరిగిన దాడిలో ఒక భారత పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం ఈ విషాద ఘటన పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తోంది. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించేందుకు మిషన్ స్థానిక అధికారులతో సమన్వయం చేస్తోంది.
ఇటీవలి ఘటనల్లో మొత్తం ఆరుగురు భారత పౌరులు ప్రాణాలు కోల్పోగా, ఒకరు గల్లంతయ్యారు. ఇద్దరు భారత పౌరుల పార్థివ దేహాలను ఇప్పటికే భారత్కు తరలించారు.
సౌదీ అరేబియా, ఒమన్, ఇరాక్, యూఏఈల్లోని భారత రాయబార కార్యాలయాలు గల్లంతైన వ్యక్తి కోసం, మిగిలిన మృతదేహాన్ని స్వదేశానికి తరలించడం కోసం అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి.
ఎమ్టీ సేఫ్సీ విష్ణు నౌక నుంచి రక్షించిన 15 మంది భారతీయ సిబ్బంది ఇరాక్ నుంచి బయలుదేరి, సౌదీ అరేబియా మీదుగా భారత్ తిరిగి రానున్నారు.
ఎమ్వీ ఎమ్కేడీ వ్యోమ్ నుంచి 16 మంది, ఎమ్టీ స్కైలైట్ నుంచి 8 మంది సహా, రక్షించిన మొత్తం 24 మంది భారతీయ నావికులు ఇప్పటికే ఒమన్ నుంచి భారత్ తిరిగి వచ్చారు.
***
(రిలీజ్ ఐడి: 2243233)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9