హోం మంత్రిత్వ శాఖ
ఒడిశాలోని ముండలిలో సీఐఎస్ఎఫ్ 57వ ఆవిర్భావ దినోత్సవంలో ప్రసంగించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
· ధైర్యానికీ, అంకితభావానికీ, త్యాగానికీ పర్యాయపదంగా సీఐఎస్ఎఫ్... ఆధునికతను అందిపుచ్చుకుని దేశ భద్రతకు రక్షణ కవచంలా నిలిచిన భద్రతా దళం
· పారిశ్రామిక భద్రతా రంగంలో శూన్యం నుంచి శిఖరాగ్ర స్థాయికి ఎదిగిన సీఐఎస్ఎఫ్
· సీఐఎస్ఎఫ్ నెలకొల్పి 56 ఏళ్లు పూర్తి.. దేశ పారిశ్రామికాభివృద్ధి లక్ష్య సాధనలో కీలకంగా నిలిచిన భద్రతా దళం
· పార్లమెంటు, కీలక జాతీయ సంస్థలు, మౌలిక సదుపాయాల రక్షణలో సామర్థ్యాన్ని నిరూపించుకున్న సీఐఎస్ఎఫ్: ఇకపై ప్రధాన ఓడరేవుల భద్రత బాధ్యత కూడా...
· 2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను నిలపాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ... ఈ లక్ష్య సాధనలో ఉత్ప్రేరకంగా నిలుస్తున్న సీఐఎస్ఎఫ్
· దేశవ్యాప్తంగా 70 విమానాశ్రయాలు అత్యంత కీలకమైన 361 సంస్థలకు రక్షణ కల్పిస్తున్న సీఐఎస్ఎఫ్... డ్రోన్ భద్రతకు సంబంధించి నోడల్ ఏజెన్సీగానూ నియమించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం
· భవిష్యత్తులో హైబ్రిడ్ విధానంలో ప్రైవేటు పారిశ్రామిక సంస్థలకూ హైబ్రిడ్ విధానంలో భద్రతా సేవలను అందించనున్న సీఐఎస్ఎఫ్
· నక్సలిజాన్ని అంతం చేయడంలో సీఐఎప్ఎఫ్ది ముఖ్య పాత్ర
· తిరుపతి నుంచి పశుపతినాథ్ ఆలయం వరకు రెడ్ కారిడార్ కోసం కలలుగన్న నక్సలైట్లను.. 2026 మార్చి 31 నాటికి పూర్తిగా ఓడించనున్న మన భద్రతా దళాలు
· రూ.890 కోట్లతో నిర్మించనున్న మూడు సీఐఎస్ఎఫ్ నివాస సముదాయాలకు (కామ్రూప్, నాసిక్, సీహోర్) శంకుస్థాపన చేసిన కేంద్ర హోం మంత్రి... రెండు నివాస సముదాయాలు (రాజర్హత్, ఢిల్లీ) ప్రారంభం
నాడు పోస్టు చేయడమైనది:
06 MAR 2026 2:45PM by PIB Hyderabad
ఒడిశాలోని ముండలిలో ఈ రోజు నిర్వహించిన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) 57వ ఆవిర్భావ దినోత్సవానికి కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రూ. 890 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మూడు సీఐఎస్ఎఫ్ నివాస సముదాయాలకు (కామరూప్, నాసిక్, సీహోర్) ఈ సందర్భంగా ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే రాజర్హత్, ఢిల్లీలలో నిర్మించిన రెండు నివాస సముదాయాలను ప్రారంభించారు. కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేడు 56 ఏళ్లు పూర్తి చేసుకున్న సీఐఎస్ఎఫ్ పారిశ్రామిక భద్రత రంగంలో శూన్యం నుంచి శిఖరాగ్ర స్థాయికి చేరుకుందనీ.. భద్రతా దళం దీక్షాదక్షతలకూ, పరాక్రమానికీ ఇది నిదర్శనమనీ కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో కొనియాడారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలన్నా, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ను నిలపాలన్నా.. పారిశ్రామికాభివృద్ధి అత్యావశ్యకమని ఆయన పేర్కొన్నారు. అలాగే పారిశ్రామిక వికాసం కోసం ఒక సురక్షిత వాతావరణాన్ని నెలకొల్పడంలో జాతీయ స్థాయి పారిశ్రామిక భద్రతా దళం పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. నెలకొల్పిన లక్ష్యాలను నెరవేర్చడమే కాకుండా.. ప్రతి సవాలు నుంచీ పాఠాలు నేర్చుకుంటూ, గత 56 ఏళ్లుగా సీఐఎస్ఎఫ్ నిరంతరం కాలానుగుణంగా పరిణామం చెందుతూ వచ్చిందని శ్రీ అమిత్ షా అన్నారు. సంప్రదాయాలను కాపాడుకుంటూనే ఆధునికతనూ సీఐఎస్ఎఫ్ అందిపుచ్చుకున్నదని ప్రశంసించారు. భారత చరిత్రలోని విశిష్ట సంప్రదాయాలకు ధైర్యాన్నీ, త్యాగాన్నీ, అంకితభావాన్నీ మేళవించి- అత్యాధునిక ఆయుధాలతో సన్నద్ధమవ్వడం ద్వారా.. ఎలాంటి సవాలునైనా ఎదుర్కొని నిలవగల దృఢ సంకల్పాన్ని సీఐఎస్ఎఫ్ చాటుకున్నదని హోం మంత్రి కొనియాడారు.
కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం లేకుండా దేశ పారిశ్రామిక వికాస లక్ష్యాన్ని సాకారం చేసుకోలేమని శ్రీ అమిత్ షా అన్నారు. సీఐఎస్ఎఫ్ ఎల్లవేళలా దేశానికి ఒక రక్షణ కవచంగా దృఢంగా నిలుస్తుందన్నారు. దేశంలోని అన్ని ఓడరేవుల భద్రతను సీఐఎస్ఎఫ్కు అప్పగించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. రెండు ముఖ్యమైన లక్ష్యాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజల ఎదుట నిలిపారని ఆయన గుర్తుచేశారు. మొదటిది 2047 నాటికి సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను నిలపడంతోపాటు ప్రతి రంగంలోనూ ప్రపంచంలో అగ్రస్థానానికి ఎదగడవం. రెండోది 2027 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దడం. ఈ లక్ష్యాల సాధన దిశగా ఉత్ప్రేరకం వంటి పాత్రను సీఐఎస్ఎఫ్ పోషిస్తోందని శ్రీ అమిత్ షా చెప్పారు.
దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది త్యాగాలు ఎల్లవేళలా కీలక పాత్ర పోషించాయని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా కొనియాడారు. విధి నిర్వహణలో సీఐఎస్ఎఫ్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదన్నారు. ఈ దళం సాధించిన 9 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 2 అత్యుత్తమ బెటాలియన్ ట్రోఫీలు, అంతర్జాతీయ స్థాయిల్లో క్రీడాకారులు సాధించిన పతకాలు... ప్రతి రంగంలోనూ అత్యున్నత ప్రదర్శన కనబరిచేందుకు సీఐఎస్ఎఫ్ ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటుందనడానికి ఇవి నిదర్శనాలని ఆయన పేర్కొన్నారు. గత 56 ఏళ్లలో మొత్తం 13,693 పతకాలను అందుకొని.. శౌర్య పరాక్రమాలనూ, సమర్థతనూ సీఐఎస్ఎఫ్ చాటుకున్నదని శ్రీ అమిత్ షా అభినందించారు.
రూ. 890 కోట్ల విలువైన 5 విభిన్న ప్రాజెక్టులకు నేడిక్కడ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసినట్టు శ్రీ అమిత్ షా చెప్పారు. రాజర్హత్, మైదాన్గర్హిల్లో నివాస సముదాయాల నిర్మాణం పూర్తయిందనీ, ఇవి మన జవాన్లకూ వారి కుటుంబాలకూ మెరుగైన వసతులను కల్పిస్తాయనీ ఆయన పేర్కొన్నారు. అలాగే సీఐఎస్ఎఫ్ వార్షిక పత్రిక ‘సెంటినెల్’ను ఈ సందర్భంగా విడుదల చేసినట్టు ఆయన వెల్లడించారు.
నేడు దేశవ్యాప్తంగా 70 విమానాశ్రయాలతోపాటు 361 అతి ముఖ్యమైన సంస్థలకు సీఐఎస్ఎఫ్ రక్షణ కల్పిస్తోందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి తెలిపారు. అలాగే డ్రోన్ భద్రతకు సంబంధించి కూడా నోడల్ ఏజెన్సీ బాధ్యతను సీఐఎస్ఎఫ్కు అప్పగించినట్టు ఆయన పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో కర్తవ్య భవన్, సేవాతీర్థ్, నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం, నవీ ముంబయి విమానాశ్రయం, లెంగ్పుయ్ విమానాశ్రయం, జవహర్పూర్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు, భాక్రా డ్యామ్ ప్రాజెక్టు వంటి అనేక కీలక ప్రాజెక్టుల భద్రత బాధ్యతలను సీఐఎస్ఎఫ్కు అప్పగించినట్టు ఆయన వెల్లడించారు.
ఓడరేవుల భద్రత బాధ్యతలను స్వీకరించిన అనంతరం.. దేశ సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతంలోని రేవులకు కూడా సీఐఎస్ఎఫ్ రక్షణ కల్పిస్తుందని శ్రీ అమిత్ షా చెప్పారు. హైబ్రిడ్ విధానంలో ఓ నమూనాను రూపొందించి.. ప్రైవేటు పారిశ్రామిక సమూహాలకు కూడా భద్రతను అందించాలని నాలుగేళ్ల కిందటే తాము కోరామనీ, ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో ఆ దిశగా సన్నద్ధంగా ఉన్నామనీ వెల్లడించారు. మున్ముందు ప్రైవేటు పారిశ్రామిక సంస్థలకు కూడా హైబ్రిడ్ విధానంలో భద్రతా సేవలను సీఐఎస్ఎఫ్ అందిస్తుందని శ్రీ అమిత్ షా తెలిపారు.
2026 మార్చి 31 నాటికి దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తం చేయాలన్నది మోదీ ప్రభుత్వ దృఢ సంకల్పమని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో సీఐఎస్ఎఫ్ అందించిన సేవలు ఎంతో విశిష్టమైనవని కొనియాడారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో సీఐఎస్ఎఫ్ తన వంతు పాత్రను సమర్థంగా పోషించిందన్నారు. మార్చి 31 నాటికి దేశం నక్సలిజం నుంచి పూర్తి స్థాయిలో విముక్తి పొందుతుందన్నారు. మన భద్రతా దళాలు పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధిస్తాయనీ, తిరుపతి నుంచి పశుపతినాథ్ వరకు రెడ్ కారిడార్ నిర్మించాలని కలలు గన్న శక్తులు పూర్తిగా ఓడిపోబోతున్నాయనీ హోం మంత్రి స్పష్టం చేశారు. ఇది ప్రధానమంత్రి శ్రీ మోదీ నాయకత్వంలో మన భద్రతా దళాలు సాధించిన అతిపెద్ద విజయమని శ్రీ అమిత్ షా వ్యాఖ్యానించారు. నేడు మనం దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తం చేసే దశకు చేరుకున్నామన్నారు. దేశం మొత్తాన్నీ అభివృద్ధి పథంలో నడిపించి, 2047 నాటికి ‘వికసిత భారత్’ను సాకారం చేయడమే ప్రధానమంత్రి శ్రీ మోదీ లక్ష్యమనీ, ఈ లక్ష్యం సాకారం కావాలంటే అంతర్గత, బహిర్గత భద్రతను కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేశారు. దేశ అంతర్గత, బహిర్గత భద్రతను పటిష్టం చేసుకోవడం లక్ష్యంగా.. సరిహద్దులతోపాటు దేశం లోపలా సమర్థంగా తన వంతు పాత్ర పోషించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని హోం మంత్రి స్పష్టం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2236233)
సందర్శకుల సూచీ సంఖ్య : : 71
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam