ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాల పరిధిలో మూడు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం... భారతీయ రైల్వే వ్యవస్థలో దాదాపు 307 కిలోమీటర్ల అదనపు లైన్లు
ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ. 9,072 కోట్లు... 2030-31 నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం
నాడు పోస్టు చేయడమైనది:
24 FEB 2026 3:25PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ.. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన 3 ప్రాజెక్టులకు నేడు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ. 9,072 కోట్లు. ఈ ప్రాజెక్టులు:
-
గోండియా – జబల్పూర్ డబ్లింగ్
-
పునరఖ్ - కియుల్ మూడో, నాలుగో వరుస
-
గమ్హారియా - చండిల్ మూడో, నాలుగో వరుస
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాల పరిధిలో ఉన్న ఈ 3 ప్రాజెక్టులతో.. భారతీయ రైల్వే వ్యవస్థ దాదాపు మరో 307 కిలోమీటర్ల మేర పెరగనుంది.
ప్రతిపాదిత మల్టీట్రాకింగ్ ప్రాజెక్టు ద్వారా దాదాపు 98 లక్షల జనాభా ఉన్న దాదాపు 5,407 గ్రామాలకు రవాణా సదుపాయం మెరుగవుతుంది.
పెరిగిన రైల్వే లైన్ల సామర్థ్యం వల్ల ప్రయాణ వేగం గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా భారతీయ రైల్వేల నిర్వహణ సామర్థ్యం, సేవల విశ్వసనీయత మెరుగుపడతాయి. ఈ మల్టీట్రాకింగ్ ప్రతిపాదనలు రైల్వే కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే కాకుండా, రద్దీని కూడా తగ్గిస్తాయి. ఈ ప్రాంత సమగ్రాభివృద్ధి ద్వారా ప్రజలను ‘ఆత్మనిర్భరు’లుగా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవ భారత దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. వారి ఉపాధి/ స్వయం ఉపాధి అవకాశాలను ఇవి మెరుగుపరుస్తాయి.
సమగ్ర ప్రణాళిక, భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల ద్వారా.. బహు విధ రవాణా సదుపాయాలనూ, లాజిస్టిక్ సామర్థ్యాన్నీ పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి గతి శక్తి జాతీయ బృహత్ప్రణాళిక ఆధారంగా ఈ ప్రాజెక్టులను రూపొందించారు. ఇవి ప్రజలు, వస్తుసేవల రవాణాలో అంతరాయం లేకుండా మార్గం సుగమం చేస్తాయి.
ఈ సామర్థ్యాభివృద్ధి ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే.. దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు రైల్వే రవాణా మెరుగుపడుతుంది. వాటిలో కచ్నార్ శివాలయం (జబల్పూర్), కన్హా జాతీయోద్యానవనం (బాలాఘాట్), గంగుల్పారా డ్యామ్, జలపాతం, పెంచ్ జాతీయోద్యానవనం, ధువాంధర్ జలపాతం, బర్గి డ్యామ్, గోంజీ-సోంజీ ఆలయం, చండిల్ డ్యామ్, దాల్మా కొండ శిఖరం, హెసాకోచా జలపాతం, రైజామా ఘాటి, దాల్మా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మొదలైనవి ఉన్నాయి.
బొగ్గు, ఉక్కు, ఇనుప ఖనిజం, సిమెంటు, బ్యాలస్ట్ - కంకర రాళ్లు, ఫ్లై యాష్, ఎరువులు, సున్నపురాయి, మాంగనీసు, డోలమైట్, ఆహార ధాన్యాలు, పెట్రోలియం - చమురు - లూబ్రికెంట్లు (పీవోఎల్) వంటి సరుకుల రవాణాకు ఈ ప్రాజెక్టులు అత్యంత కీలకమైన మార్గాలు. సామర్థ్యాన్ని పెంచేలా చేపడుతున్న ఈ ప్రాజెక్టుల వల్ల ఏటా 52 మిలియన్ టన్నుల సరకు రవాణా అదనంగా జరుగుతుంది.
రైల్వేలు పర్యావరణ అనుకూలమైన, తక్కువ ఇంధన వినియోగంతో ఎక్కువ దూరం నడిచే రవాణా సాధనాలు కావడంతో.. వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికీ, దేశ రవాణా వ్యయాన్ని తగ్గించడానికీ ఈ ప్రాజెక్టులు సహాయపడతాయి. దీనివల్ల చమురు దిగుమతులు (6 కోట్ల లీటర్లు) తగ్గుతాయి. కర్బనోద్గారాలు (30 కోట్ల కిలోలు) తగ్గుతాయి. ఇది కోటి చెట్లను పెంచడంతో సమానం.
****
(రిలీజ్ ఐడి: 2232239)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam