సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026: భారతదేశపు అగ్రశ్రేణి ఏఐ ఆవిష్కరణల కార్యస్థలిగా ఆవిర్భవించిన ఎంఐబీ పెవిలియన్
ఏఐ గేమింగ్ ల్యాబ్స్ నుంచి ఏజెంటిక్ న్యూస్రూమ్ల వరకు... 'వేవ్స్' సదస్సులో
వాస్తవ ప్రాపంచిక ఏఐ వినియోగాన్ని చాటిచెప్పిన అడోబ్, భారత్జెన్, కుకు ఎఫ్ఎం
వేవ్స్ క్రియేటర్స్ కార్నర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నారద ముని ఏర్పాటు, ఏఐ థియేటర్, భారత్జెన్ బూత్
నాడు పోస్టు చేయడమైనది:
17 FEB 2026 7:20PM by PIB Hyderabad
వేవ్స్ క్రియేటర్స్ కార్నర్ను కేవలం ఒక ప్రదర్శనశాలగా మాత్రమే కాకుండా పూర్తిస్థాయిలో పనిచేసే ఒక ప్రత్యక్ష ఆవిష్కరణల కార్యస్థలిగా రూపొందించారు. ఏవీజీసీ-ఎక్స్ఆర్ (యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ) రంగాల్లో కృత్రిమ మేధ తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులను ప్రత్యక్షంగా ప్రదర్శించడమే దీని ప్రధాన ఉద్దేశం. సందర్శకులు ఇక్కడి సాంకేతికతతో స్వయంగా మమేకమై సరికొత్త అనుభూతిని పొందేలా ఈ విభాగాన్ని తీర్చిదిద్దారు.
ఈ విభాగం 'వేవ్స్' సదస్సుకు వ్యూహాత్మక పొడిగింపుగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇందులోని కీలక విభాగాలైన వేవ్ ఎక్స్ , వేవ్స్ బజార్, 'క్రియేట్ ఇన్ ఇండియా' ఛాలెంజ్లకు ఇది ఒక వేదికగా నిలుస్తోంది. ఇందులో 'వేవ్ ఎక్స్' అంకురాలు తమ వినూత్న ప్రదర్శనలు, ప్రత్యక్ష ఏఐ అప్లికేషన్ల ద్వారా ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
అభివృద్ధి చెందుతున్న కొత్త ఆవిష్కర్తలతో పాటు అడోబ్, నెట్ఫ్లిక్స్, సోనీ, కలెక్టివ్, ఇన్షార్ట్స్, కుకు ఎఫ్ఎం, విస్లింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ వంటి ప్రముఖ అంతర్జాతీయ, భారతీయ సంస్థలు అత్యంత ఆధునిక ఏఐ సాధనాలను, విప్లవాత్మక మీడియా సాంకేతికతలను ఈ వేదికపై ప్రదర్శించనున్నాయి.
ముఖ్యమైన ఆకర్షణలు-
ఏఐ గేమింగ్ ల్యాబ్:
సందర్శకులు నేడు ఇక్కడ కృత్రిమ మేధ ఆధారిత గేమ్ అభివృద్ధిని ప్రత్యక్షంగా వీక్షించారు. ఒక ఆలోచన పుట్టినప్పటి నుంచి ఆడేందుకు వీలైన ఒక ప్రోటోటైప్ రూపొందే వరకు జరిగే ప్రక్రియను వారు స్వయంగా చూశారు. అలాగే ఈ ఇంటరాక్టివ్ గేమింగ్ ల్యాబ్ వాతావరణంలో ఏఐ ద్వారా తయారు చేసిన వీడియో గేమ్స్ను ఆడారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ఏఐ గేమింగ్ ల్యాబ్ ప్రత్యక్ష ప్రదర్శనలు, చర్చా కార్యక్రమాలను కొనసాగిస్తుంది.
ఏఐ కంటెంట్ క్రియేషన్ ల్యాబ్ (అడోబ్ సౌజన్యంతో):
ఈ లైవ్ స్టూడియో వేదికపై ఏఐ ఆధారిత చలనచిత్ర నిర్మాణ ప్రక్రియను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. ఇక్కడ కేవలం ఒక చిన్న ప్రాంప్ట్ ద్వారా స్ర్కిప్టులు, దృశ్యాలు, సినిమా సన్నివేశాలు నిజ సమయంలో ఎలా రూపొందుతాయో వివరించారు. ఇది డిజిటల్ స్టోరీటెల్లింగ్ విధానాన్ని సరికొత్తగా మారుస్తోంది. రాబోయే రోజుల్లో కూడా ఈ ల్యాబ్ సందర్శకుల కోసం ఏఐ ఆధారిత సృజనాత్మక ప్రక్రియలను ప్రదర్శిస్తూనే ఉంటుంది.
ఏఐ ఆధారిత న్యూస్రూమ్:
ఏడబ్ల్యూఎస్, భారత్జెన్, ఇండియా టుడే, కాలసేతు అంకురాల సహకారంతో రూపొందించిన ఈ న్యూస్రూమ్ సౌకర్యం.. మీడియా కార్యకలాపాలను ఏఐ ఏజెంట్లు ఏ విధంగా సులభతరం చేస్తాయో ప్రదర్శించింది. ఆటోమేటెడ్ కంటెంట్ జనరేషన్ నుంచి వాయిస్ కమాండ్ ఆధారిత ఎడిటోరియల్ మేనేజ్మెంట్ వరకు వార్తా సంస్థల భవిష్యత్తును ఏఐ ఎలా మార్చబోతోందో ఇక్కడ వివరించారు. సదస్సు ముగిసే వరకు అందుబాటులో ఉండనున్న ఈ ప్రదర్శన.. రాబోయే రోజుల్లో కూడా తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది.
నారద ముని ఇంటరాక్టివ్
పురాణాల్లోని వార్తాహరుని స్ఫూర్తితో రూపొందించిన ఈ 'ఇమ్మర్సివ్ ఇన్స్టాలేషన్'.. ఏఐ ఆధారిత 'లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్' మన ప్రశ్నలను ఎలా విశ్లేషించి సహజమైన సంభాషణలుగా మారుస్తాయో ప్రదర్శించింది. ఇంటరాక్టివ్ ఇంటెలిజెన్స్కు ఉన్న శక్తిని చాటిచెప్పే ఈ విభాగం.. సందర్శకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించింది. ఈ ప్రదర్శన రాబోయే రోజుల్లో కూడా సందర్శకులను పలకరిస్తూనే ఉంటుంది.
ఏఐ థియేటర్:
ఇది ఒక ప్రత్యేకమైన సినిమా వేదిక. ఇక్కడ ఎన్ఎఫ్డీసీ, ఎల్టీఐమైండ్ట్రీ, అడోబ్ సంస్థలు సంయుక్తంగా ఎంపిక చేసిన దాదాపు 150 ఏఐ ఆధారిత చిత్రాలను ప్రదర్శించాయి. సినిమా నిర్మాణంలో కృత్రిమ మేధ తీసుకొస్తున్న కళాత్మక, సాంకేతిక మార్పులను సందర్శకులు ఇక్కడ వీక్షించొచ్చు. పెవిలియన్లో ఈ ప్రదర్శనలు రాబోయే కొద్ది రోజులు కొనసాగుతాయి.
యువర్ స్టోరీ వేదిక:
ఏఐ రంగంలోని నిపుణులు, పారిశ్రామికవేత్తలతో నేడు ఇక్కడ ముఖాముఖి చర్చలు జరిగాయి. 'యువర్ స్టోరీ' వ్యవస్థాపకురాలు శ్రద్ధా శర్మ ఈ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, ఏఐ సమ్మేళనంపై ఈ చర్చలు సాగాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ వేదిక మరిన్ని చర్చా కార్యక్రమాలకు వేదిక కానుంది.
ఎంఐబీ పెవిలియన్లోని విశేషాలు:
చలనచిత్ర నిర్మాణం, బ్రాడ్కాస్టింగ్, భాషా సాంకేతికతలు, విద్య, డిజిటల్ స్టోరీటెల్లింగ్ రంగాల్లో అత్యాధునిక ఏఐ అప్లికేషన్లను ప్రదర్శిస్తున్న అంతర్జాతీయ, భారతీయ అగ్రశ్రేణి సంస్థలు ఈ ఎంఐబీ పెవిలియన్లో కొలువుదీరాయి.
-
అడోబ్: ఇండియా ఫిల్మ్ ప్రాజెక్ట్ వంటి భాగస్వామ్యాల ద్వారా ఏఐ ఆధారిత సినిమా నిర్మాణాన్ని వేగవంతం చేస్తోంది. ఇక్కడ ఏఐ రూపొందించిన చిత్రాలు, 'ఏఐ-ఫస్ట్' క్రియేటివ్ వర్క్ఫ్లోలను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తున్నారు.
-
భారత్జెన్: మల్టీమోడల్ ఆర్ఏజీ సాంకేతికతను ప్రదర్శిస్తోంది. దీని ద్వారా వీడియో, ఆడియోలలోని ఉపయోగించని సమాచారాన్ని సులభంగా వెతకగలిగే ఇంటరాక్టివ్ సమాచారంగా మార్చొచ్చు.
-
సోనీ రీసెర్చ్ ఇండియా: టీవీ, ఓటీటీ వేదికల కోసం ఏఐ ఆధారిత అనువాదం, డబ్బింగ్, ముఖం- స్వరాన్ని వయస్సుకు అనుగుణంగా మార్చటం, యాక్సెసిబిలిటీ పరిష్కారాలను ప్రదర్శిస్తోంది.
-
సర్వం: వాయిస్ క్లోనింగ్, లైవ్ స్పీచ్-టు-టెక్స్ట్, రియల్ టైమ్ లాంగ్వేజ్ ఏఐ సాధనాల ద్వారా బహుభాషా ఏఐ సంభాషణలను సాధ్యం చేస్తోంది.
-
అమెజాన్ వెబ్ సర్వీసెస్: 'ఏజెంటిక్ ఏఐ అసిస్టెడ్ న్యూస్రూమ్'ను ప్రదర్శిస్తోంది. దీని ద్వారా బ్రాడ్కాస్ట్ ప్రొడక్షన్, హైపర్-లోకల్ వార్తా పంపిణీని హస్త ప్రమేయం లేకుండా పూర్తిగా ఏఐతో నిర్వహించొచ్చు.
-
విస్లింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్: కనీస హార్డ్వేర్ సహాయంతో పనిచేసే 'మార్కర్-లెస్ మోషన్ క్యాప్చర్' విధానాలను ప్రదర్శిస్తోంది.
-
గ్యాలరీ 5 (కలెక్టివ్ ఆర్టిస్ట్స్ నెట్వర్క్): భారీ స్థాయి పౌరాణిక, థియేట్రికల్ ప్రాజెక్ట్లకు ఉపయోగపడే 'ఏఐ-నేటివ్' సినిమాటిక్ ప్రొడక్షన్ ప్లాట్ఫామ్లను పరిచయం చేస్తోంది.
-
కుకు ఎఫ్ఎం: భారతదేశపు మొట్టమొదటి 'ఏఐ-ఆధారిత మైక్రోడ్రామా'లను ఆవిష్కరిస్తోంది. ఇది సామాన్య ప్రజల డిజిటల్ కథా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది.
-
ప్రిస్మిక్స్: కథాధారిత కంటెంట్ సృష్టి కోసం జనరేటివ్ ఏఐని, వీఎఫ్ఎక్స్, సాంప్రదాయ మీడియాతో అనుసంధానం చేస్తోంది.
-
ఇన్షార్ట్స్: ఏఐ ఆధారిత వార్తల సారాంశాన్ని, యూజర్ల అభిరుచులకు తగ్గట్టుగా వ్యక్తిగతీకరించిన వార్తా పంపిణీని ప్రదర్శిస్తోంది.
-
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ): ఇమ్మర్సివ్ ప్రొడక్షన్ వాతావరణంలో ఏఐ ఆధారిత సృజనాత్మక విద్యను సరికొత్తగా నిర్వచిస్తోంది.
ఏఐ ఇమ్మర్సివ్ థియేటర్:
270-డిగ్రీల ప్రొజెక్షన్, ఏఐ ఆధారిత సినిమాటిక్ అనుభవాలతో కూడిన ఈ వేదిక నేటి కథా గమనాన్ని, ప్రేక్షకుల భాగస్వామ్యాన్ని సరికొత్తగా ఆవిష్కరించింది. జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్డీసీ), వేవ్స్ బజార్, ఎల్టీఎం భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ ఏఐ సినిమా ప్రదర్శన.. కథా మాధ్యమంగా ఏఐని వాడుతున్న వర్ధమాన సినీ నిర్మాతల నైపుణ్యాలను వెలుగులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన ఏఐ లఘు చిత్రాల సమాహారం 'కథావతార్'తో పాటు భారతదేశపు మొట్టమొదటి 'సినిమ్ఏఐ హ్యాకథాన్' ఫైనలిస్టుల చిత్రాలను కూడా ప్రదర్శించారు.
భారత్ మండపంలోని 'వేవ్స్ క్రియేటర్స్ కార్నర్'లో జరిగిన ఈ ప్రదర్శనలు.. ఏఐ ఆధారిత సినిమా ఆవిష్కరణలలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలిపాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ ఇమ్మర్సివ్ చిత్ర ప్రదర్శనలు కొనసాగుతాయి. తద్వారా అత్యాధునిక ఏఐ సాంకేతికతతో కూడిన కథా ప్రపంచాన్ని అనుభూతి చెందే అవకాశం సందర్శకులకు ఉంటుంది.
అడోబ్ ఆధ్వర్యంలోని కంటెంట్ క్రియేషన్ ల్యాబ్:
నేటి క్రియేటర్ల అవసరాలకు అనుగుణంగా అత్యధునిక సాంకేతికతలతో కూడిన 'ఏఐ-ఆధారిత వీడియో క్రియేషన్ వర్క్ఫ్లో'లను ఈ ల్యాబ్ ప్రదర్శించింది. టెక్స్ట్ ప్రాంప్ట్లు, చిత్రాలు, ఆడియో ఇన్పుట్లు, జనరేటివ్ ఏఐ సాధనాల ద్వారా ఒక ఆలోచనను అత్యుత్తమ నాణ్యత గల వీడియోగా ఎలా మార్చొచ్చో ఇక్కడ ప్రత్యక్షంగా వివరించారు.
సందర్శకులు ఇక్కడ వీడియో, ఆడియో, చిత్రాలకు సంబంధించిన పూర్తిస్థాయి ఏఐ వర్క్ఫ్లోలను అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఇందులో టెక్స్ట్-టు-వీడియో, ఇమేజ్-టు-వీడియో స్టోరీటెల్లింగ్, జనరేటివ్ ఎడిటింగ్, వేగవంతమైన కంటెంట్ మార్పులు వంటివి ముఖ్యమైనవి. సంక్లిష్టమైన ప్రొడక్షన్ ప్రక్రియలను ఏఐ ఎలా సులభతరం చేస్తుందో, ఎడిటింగ్ను ఎలా ఆటోమేట్ చేస్తుందో, ఒక ఆలోచనను తుది అవుట్పుట్గా మార్చడంలో ఎంతటి వేగాన్ని అందిస్తుందో ఈ ప్రదర్శన చాటిచెప్పింది. మొత్తంగా మల్టీమీడియా కంటెంట్ సృష్టిని మరింత వేగంగా, స్మార్ట్గా, భారీ స్థాయిలో చేపట్టడానికి వీలుగా ఏఐ ఒక శక్తిమంతమైన సాధనమని ఈ ల్యాబ్ నిరూపించింది.
మీడియా వేదిక:
ఈ రోజు 'యువర్ స్టోరీ' వ్యవస్థాపకురాలు శ్రద్ధా శర్మ ప్రముఖ అంకుర సంస్థల వ్యవస్థాపకులు, మేధావులతో ముఖాముఖి చర్చలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నీ 'వేవ్స్ ఓటీటీ' ప్లాట్ఫామ్లో ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. దీనివల్ల సదస్సు విశేషాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రజా విధానాలు, ప్లాట్ఫాం వ్యవస్థలు, సార్వభౌమ ఏఐ సామర్థ్యాలు, డిజిటల్ దృఢత్వం వంటి అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ, కోగో వంటి సంస్థలకు చెందిన నిపుణులు.. కుకు ఎఫ్ఎం, గ్యారేజ్ ల్యాబ్స్, ఒరాకిల్ వంటి సంస్థల ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. అంకుర ప్రదర్శనలు, వ్యవస్థాపకుల పిచ్లు, ఆరోగ్య రంగం, సామాజిక సవాళ్ల పరిష్కారంలో ఏఐ పాత్ర.. ప్రాంతీయ కంటెంట్ వంటి అంశాలపై జరిగిన చర్చలు భారతదేశంలో ఆవిష్కరణల ప్రభావాన్ని చాటిచెప్పాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ మీడియా వేదిక మరిన్ని ముఖాముఖి కార్యక్రమాలు, ప్రత్యక్ష ప్రసారాల ద్వారా సదస్సు విశేషాలను అందిస్తూనే ఉంటుంది.
ప్యానెల్ చర్చలు, మాస్టర్ తరగతులు:
భారత్ మండపంలోని పెవిలియన్ ఈ రోజు మీడియా, వినోద (ఎంఅండ్ఈ) రంగంలో ఏఐ తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులపై జరిగిన పలు ప్యానెల్ చర్చలు, మాస్టర్క్లాస్లకు సాక్ష్యంగా నిలిచింది. 'వేవ్స్ క్రియేటర్స్ కార్నర్'లో జరిగిన ఈ చర్చలు అత్యున్నత స్థాయి విజ్ఞాన వేదికలుగా నిలిచాయి. ఇది పరిశ్రమ దిగ్గజాలు, వెంచర్ క్యాపిటలిస్టులు, సాంకేతిక నిపుణులు, క్రియేటర్లు, విధాన నిర్ణేతలను ఒకచోట చేర్చింది.
ఈ సెషన్లలో భాగంగా గేమింగ్, సినిమా, న్యూస్రూమ్ ఆటోమేషన్, ఇంటరాక్టివ్ మీడియా, ఆదాయ నమూనాలు, నైతిక ఏఐ ఫ్రేమ్వర్క్ల భవిష్యత్తుపై లోతైన చర్చలు జరిగాయి. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు శేఖర్ కపూర్ నిర్వహించిన మాస్టర్ తరగతులు, అంకుర వ్యవస్థాపకుల రౌండ్ టేబుల్ సమావేశాలు, అంతర్జాతీయ సాంకేతిక సంస్థల 'టెక్నాలజీ డీప్-డైవ్' సెషన్లు నేటి కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఈ సెషన్లు కేవలం సిద్ధాంతపరమైన చర్చలకే పరిమితం కాకుండా ప్రత్యక్ష ప్రదర్శనలు, వాస్తవ ప్రపంచ ఉదాహరణలు, ముఖాముఖి ప్రశ్నలతో కూడిన ప్రశ్నలు- సమాధానాల ప్రాతిపదికన సాగాయి. ఏఐ-ఆధారిత మీడియా తక్షణ వినియోగం, పెట్టుబడి అవకాశాలు, మీడియా & వినోద రంగంపై ఇది చూపే దీర్ఘకాలిక ప్రభావంపై ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు స్పష్టమైన అవగాహనను పొందారు.
మీడియా రంగంలో ఏఐ పోషిస్తున్న విప్లవాత్మక పాత్రపై మరింత లోతైన అవగాహన కల్పిస్తూ 'వేవ్స్' పెవిలియన్లో ఈ ప్యానెల్ చర్చలు, మాస్టర్ తరగతులు రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతాయి.
***
(రిలీజ్ ఐడి: 2229565)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5