ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
గుజరాత్లోని జాతీయ రహదారి-56లో ఉన్న ధమసియా-బిటాడ, మోవి, నాసర్పురా-మలోథా విభాగాలను నాలుగు వరుసల రహదారులుగా విస్తరించేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం.. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ. 4,583.64 కోట్ల నిధుల
నాడు పోస్టు చేయడమైనది:
14 FEB 2026 1:02PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గుజరాత్లో 107.67 కిలోమీటర్ల మేర 4 వరుసల రహదారి నిర్మాణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. రూ. 4,583.64 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా ధమాసియా-బిటాడా, మోవి (47.46 కి.మీ), నాసర్పూర్-మలోథా (60.21 కి.మీ) సెక్షన్లను హెచ్ఏఎం విధానంలో నిర్మించనున్నారు.
రాజస్థాన్లోని ఈ రహదారి నింబాహెరా వద్ద ప్రారంభమై, గుజరాత్లోని దాహోద్, మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాల గుండా తిరిగి గుజరాత్లోని ఛోటా ఉదయ్పూర్ జిల్లాలో ప్రవేశించి, వాపి సమీపంలోఎన్హెచ్-48తో కలిసే జంక్షన్ వద్ద ముగుస్తుంది.
నర్మదా ఆకాంక్షిత జిల్లా నుంచి ఆమోదించిన ఈ ప్రాజెక్టులు వెళతాయి. ఇవి దాహోద్, ఛోటా ఉదయ్పూర్, తాపి, భరూచ్లోని గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచటం ద్వారా ఆ ప్రాంత ఆర్థిక వృద్ధికి, అభివృద్ధికి తోడ్పడతాయి. ఈ ప్రాజెక్టు జాతీయ పర్యాటక కేంద్రమైన ఐక్యతా విగ్రహానికి అనుసంధానతను పెంచుతుంది. ఎన్హెచ్-56 నుంచి సుమారు 11 కిలోమీటర్ల దూరంలోని కెవాడియా గ్రామంలో ఈ విగ్రహం ఉంది.
గంటకు 100 కిమీ వేగానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు డిజైన్ రూపొందించారు. దీనివల్ల సగటు వేగం గంటకు 70కి.మీ పెరగటంతో సమయం 40% మేర ఆదా అవుతుంది. దీంతో 2.5 గంటల ప్రయాణం కేవలం 1.5 గంటల్లోనే పూర్తవుతుంది.
107.67 కి.మీ మేర ఆమోదించిన ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 19.38 లక్షల పనిదినాల ప్రత్యక్ష ఉపాధి, 22.82 లక్షల పనిదినాల పరోక్ష ఉపాధి లభిస్తుంది. అంతేకాక, ప్రతిపాదిత కారిడార్ పరిసర ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరగటం వల్ల అదనపు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ద్వారా రద్దీ అయిన ఎన్హెచ్-56 (175 కి.మీ)లోని జంబుగామ్ (బోడెలి)-మలోథా సెక్షన్ను నాలుగు వరసల రహదారిగా విస్తరించే పనులను నాలుగు ప్యాకేజీలుగా చేపట్టింది. జంబుగామ్ (బోడెలి) నుంచి ధమసియా, మోవి నుండి నాసర్పూర్ వరకు గల మార్గాల్లో నవంబర్ 2025లో నిర్మాణ పనులు ప్రారంభం కాగా, రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ ప్యాకేజీలు పూర్తయిన తర్వాత, బోడెలి నుంచి మలోథా వరకు నిరంతరాయమైన 4-వరుసల అనుసంధానం ఏర్పడుతుంది. ఇది ఎన్హెచ్-56లో ట్రాఫిక్ రద్దీని తగ్గించటమే కాక, ఎన్హెచ్-53, ఎన్హెచ్-48, ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే (ఎన్ఈ-4)లతో కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుంది.
ఎన్హెచ్-56లోని ధమసియా-బిటాడా, మోవి (47.46 కి.మీ), నాసర్పూర్-మలోథా (60.21 కి.మీ) విభాగాల ప్రాజెక్ట్ మార్గరేఖా చిత్రం

(రిలీజ్ ఐడి: 2228223)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3