ఆర్థిక మంత్రిత్వ శాఖ
బడ్జెట్లో బయోఫార్మా శక్తిని (విజ్ఞానం, సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా ఆరోగ్య సంరక్షణ అభివృద్ధి కోసం వ్యూహం) ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
ప్రస్తుతం ఉన్న అనుబంధ ఆరోగ్య నిపుణుల (ఏహెచ్పీ) సంస్థలను ఆధునికీకరించడంతో పాటు రాబోయే 5 ఏళ్లలో 1,00,000 మంది కొత్త ఏహెచ్పీలను తయారుచేయనున్నట్లు వెల్లడి
వృద్ధాప్య సంరక్షణ, ఇతర అనుబంధ సంరక్షణ సేవల కోసం ఒక పటిష్ఠమైన వ్యవస్థ ఏర్పాటు
దీనికోసం రాబోయే సంవత్సారాల్లో 1.5 లక్షల మంది సంరక్షకులకు శిక్షణ
ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో ఐదు ప్రాంతీయ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయడంలో
రాష్ట్రాలకు మద్దతు ఇవ్వనున్న బయోఫార్మా శక్తి
కొత్తగా మరో 3 అఖిల భారత ఆయుర్వేద సంస్థల ఏర్పాటు
ఆయుష్ ఔషధ కేంద్రాలు, ఔషధ టెస్టింగ్ ప్రయోగశాలల ఆధునికీకరణ
ప్రపంచ సంప్రదాయ వైద్య కేంద్రంగా జామ్నగర్లోని డబ్ల్యూహెచ్ఓ అభివృద్ధి
ప్రాంతీయ అత్యున్నత సంస్థలుగా రాంచీ, తేజ్పూర్లోని జాతీయ మానసిక ఆరోగ్య సంస్థల అభివృద్ధి
జిల్లా ఆసుపత్రుల అత్యవసర చికిత్స సామర్థ్యాన్ని 50 శాతం పెంచేలా అత్యవసర, ట్రామా కేర్ కేంద్రాల ఏర్పాటు
నాడు పోస్టు చేయడమైనది:
01 FEB 2026 1:03PM by PIB Hyderabad
నేడు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. ‘3 కర్తవ్యాలు… (1) ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, దానిని కొనసాగించడం (2) ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, వారి సామర్థ్యాన్ని పెంపొందించడం (3) ప్రతి కుటుంబం, వర్గం, ప్రాంతం, రంగానికి వనరులు అందుబాటులో ఉండేలా చూడటం’ నుంచి ప్రభుత్వం ప్రేరణ పొందినట్లు బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆర్థిక మంత్రి తెలిపారు. కేంద్ర బడ్జెట్లోని ఈ మూడు కర్తవ్యాలలో ఆరోగ్యం ఒక ముఖ్యమైన అంశంగా ఉంది.
భారత్ను ప్రపంచ బయోఫార్మా తయారీ కేంద్రంగా మార్చేందుకు రాబోయే 5 ఏళ్లలో రూ. 10,000 కోట్ల వ్యయంతో బయోఫార్మా శక్తిని (స్ట్రాటజీ ఫర్ హెల్త్కేర్ అడ్వాన్స్మెంట్ త్రూ నాలెడ్జ్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ - విజ్ఞానం, సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా ఆరోగ్య సంరక్షణ అభివృద్ధి కోసం వ్యూహం) బడ్జెట్లో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది బయోలాజిక్స్, బయోసిమిలర్స్ల దేశీయ ఉత్పత్తి కోసం అవసరమైన వ్యవస్థను తయారుచేస్తుంది.

యువత కోసం నైపుణ్యం కలిగిన ఉద్యోగాలకు సంబంధించిన కొత్త తరహా అవకాశాలను సృష్టించడం కోసం ఆరోగ్య రంగంతో సహా పలు రంగాలలో చర్యలను తీసుకోనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. అవి:
1) అనుబంధ ఆరోగ్య నిపుణుల (ఏహెచ్పీ- అల్లైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్) కోసం ప్రస్తుతం ఉన్న సంస్థలను అప్గ్రేడ్ చేయనున్నారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో కొత్త ఏహెచ్పీ సంస్థలను ఏర్పాటు చేస్తారు. ఇది ఆప్టోమెట్రీ, రేడియాలజీ, అనస్థీషియా, ఓటీ సాంకేతికత, అప్లైడ్ సైకాలజీ, ప్రవర్తనకు సంబంధించిన ఆరోగ్యంతో సహా ఎంపిక చేసిన 10 విభాగాలు దీని పరిధిలోకి రానున్నాయి. రాబోయే 5 ఏళ్లలో 1,00,000 మంది కొత్త ఏహెచ్పీలను కొత్తగా తయారుచేయనున్నారు.
2) వృద్ధాప్య సంరక్షణ, అనుబంధ సంరక్షణ సేవలకు వర్తించేలా ఒక పటిష్ఠమైన సంరక్షణ వ్యవస్థను తయారుచేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రధాన సంరక్షణతో పాటు ఆరోగ్య సంరక్షణ, యోగా, మెడికల్ - సహాయక పరికరాల నిర్వహణ వంటి అనుబంధ నైపుణ్యాలను మిళితం చేస్తూ బహుళ నైపుణ్యం కలిగిన సంరక్షకులకు శిక్షణ ఇచ్చేందుకు వివిధ రకాల ఎన్ఎస్క్యూఎఫ్ ఆమోదిత కార్యక్రమాలను అభివృద్ధి చేయనున్నారు. దీనితో పాటు రాబోయే సంవత్సరంలో 1.5 లక్షల మంది సంరక్షకులకు శిక్షణ ఇవ్వనున్నారు.
3) భారత్ను ఆరోగ్య సంరక్షణ పర్యాటక సేవల కేంద్రంగా ప్రోత్సహించడానికి ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో ఐదు ప్రాంతీయ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలకు మద్దతు ఇచ్చే పథకాన్ని కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించింది. ఈ కేంద్రాలు.. వైద్య, విద్యా, పరిశోధనా సదుపాయాలను మిళితం చేసే సమీకృత ఆరోగ్య సంరక్షణ సముదాయాలుగా పనిచేస్తాయి. వీటిలో ఆయుష్ కేంద్రాలు, మెడికల్ వ్యాల్యూ టూరిజం ఫెసిలిటేషన్ కేంద్రాలు, డయాగ్నోస్టిక్స్, చికిత్సానంతర సంరక్షణ, పునరావాసం కోసం మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఈ కేంద్రాలు వైద్యులు, ఏహెచ్పీలు సహా ఆరోగ్య నిపుణుల కోసం విభిన్న ఉద్యోగ అవకాశాలను అందిస్తాయి.

ప్రాచీన భారతీయ యోగాను ప్రధానమంత్రి ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లినప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. యోగాకు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గౌరవం లభిస్తోందని ఆమె అన్నారు. కోవిడ్ తరువాతికాలంలో ఆయుర్వేదం కూడా ప్రపంచ స్థాయి ఆమోదం, గుర్తింపును పొందిందని వ్యాఖ్యానించారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి ఈ కింది చర్యలను బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది:
(i) 3 కొత్త అఖిల భారత ఆయుర్వేద సంస్థలను ఏర్పాటు చేయడం (ii) ఉన్నత ప్రమాణాలతో కూడిన ధ్రువీకరణ వ్యవస్థ కోసం, మరింత నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందుబాటులోకి తెచ్చేందుకు ఆయుష్ ఔషధ కేంద్రాలు, ఔషధ టెస్టింగ్ ప్రయోగశాలలను అప్గ్రేడ్ చేయడం (iii) సాంప్రదాయ వైద్యంపై ఆధారభూతమైన పరిశోధన, శిక్షణ, అవగాహనను పెంపొందించడానికి జామ్నగర్లో ఉన్న డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రాన్ని అభివృద్ధి చేయడం.
ఉత్తర భారతంలో మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం జాతీయ స్థాయి సంస్థలు లేకపోవడాన్ని ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. నిమ్ హాన్స్-2 ఏర్పాటు, రాంచీ - తేజ్పూర్లోని జాతీయ మానసిక ఆరోగ్య సంస్థలను ప్రాంతీయ అత్యున్నత సంస్థలుగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. అత్యవసర, ట్రామా కేర్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా ఆసుపత్రుల అత్యవసర చికిత్స సామర్థ్యాన్ని 50 శాతం పెంచి బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 2221529)
సందర్శకుల సూచీ సంఖ్య : : 122
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Urdu
,
Malayalam
,
Gujarati
,
Bengali
,
Bengali-TR
,
English
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada