ఆర్థిక మంత్రిత్వ శాఖ
దిగుబడుల్లో పెరుగుదల, విధానం, సంస్థాగత కార్యక్రమాల ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యం: ఆర్థిక సర్వే
స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా పప్పుధాన్యాల్లో ఆత్మనిర్భరత కార్యక్రమం: ఆర్థిక సర్వే
2023-24 నాటికి 121.75 లక్షల టన్నులకు చేరుకున్న దేశీయ వంట నూనె నిల్వలు: వంట నూనె దిగుమతులపై ఆధారపడటం 2015-16లో 63.2 శాతం నుంచి 2023-24 నాటికి 56.25 శాతానికి తగ్గింది
100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో అమలు కానున్న ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన: 4.19 కోట్ల మంది రైతులకు బీమా, ఆర్థిక సంవత్సరం 23తో పోలిస్తే.. 25లో 32 శాతం పెరుగుదల
प्रविष्टि तिथि:
29 JAN 2026 2:02PM by PIB Hyderabad
రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పంట దిగుబడులను, రాబడిని పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని ఆర్థిక సర్వే 2025-26 పేర్కొంది. ఈ సర్వేను కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఈ రోజు ప్రవేశపెట్టారు.
పెట్టుబడి వనరులు, సాంకేతికత, ఆదాయ తోడ్పాటు, మార్కెట్ ఆధారిత, బీమా తోడ్పాటు ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారు. వీటిలో అనేక ప్రాధాన్య కార్యక్రమాలు.. యుద్ధ ప్రాతిపదికన అమలయ్యాయి.
దేశ వ్యాప్తంగా వరి, గోధుమ, పప్పులు, తృణ ధాన్యాలు (మొక్కజొన్న, బార్లీ), వాణిజ్య పంటలు (పత్తి, జనపనార, చెరకు), పోషకాలతో నిండిన చిరు ధాన్యాలు (శ్రీ అన్న) ఉత్పాదక సామర్థ్యాన్ని, దిగుబడులను పెంపొందించడానికి 2007 నుంచి జాతీయ ఆహార భద్రతా కార్యక్రమం (ఎన్ఎఫ్ఎస్ఎం) అమలవుతోంది. సాగు విస్తీర్ణం పెంపు, ఉత్పాదక విస్తరణ ద్వారా దీనిని చేపడుతున్నారు. ఈ పథకం పేరును ఆర్థిక సంవత్సరం 25లో జాతీయ ఆహార భద్రత, పోషణ కార్యక్రమం (ఎన్ఎఫ్ఎస్ఎన్ఎం)గా మార్చారు.
నూనె గింజల ఉత్పత్తిలో స్వావలంబన సాధించే దిశగా జాతీయ వంట నూనెలు- నూనె గింజలు (ఎన్ఎంఈవో-ఓఎస్) కార్యక్రమం, జాతీయ వంటనూనెలు-ఆయిల్పామ్ (ఎన్ఎంఈవో-ఓపీ) కార్యక్రమం అమలవుతున్నాయి. ఉత్పాదకత విస్తరణ, మెరుగుపరిచిన వంగడాలు, ఉత్తమ వ్యవసాయ పద్ధతులు, ప్రైవేటు రంగ భాగస్వామ్యం, క్లస్టర్ ఆధారిత కార్యక్రమాలు, పంట సేకరణకు హామీ ద్వారా 2030-31 నాటికి దాదాపు 70 మిలియన్ టన్నుల దిగుబడిని సాధించడమే వీటి లక్ష్యం.
ఉత్పాదకతను పెంపొందించడం ద్వారా పప్పు ధాన్యాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు పప్పు ధాన్యాల్లో ఆత్మనిర్భరత కార్యక్రమం 2025 అక్టోబర్ 1న ఆమోదం పొందింది. పప్పు ధాన్యాల్లో స్వావలంబన సాధించడమే దీని లక్ష్యం. ఈ కార్యక్రమాలన్నింటి ద్వారా నూనె గింజలు, పామాయిల్ సాగు, దిగుబడిలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. నూనె గింజలు సాగు విస్తీర్ణం 2014-15, 2024-25 మధ్య కాలంలో 18 శాతానికి పైగా పెరిగింది. అలాగే దిగుబడి దాదాపుగా 55 శాతం, ఉత్పాదకత సుమారుగా 31 శాతం మేర పెరిగాయి.
దేశీయంగా అందుబాటులో ఉన్న వంట నూనె నిల్వలు 2015-16లో 86.30 లక్షల టన్నుల నుంచి 2023-24 నాటికి 121.75 లక్షల టన్నులకు చేరుకున్నాయి. దేశంలో వంట నూనెలకు డిమాండు, వినియోగం పెరిగినప్పటికీ దిగుమతులు 2015-16లో 63.2 శాతం నుంచి 2023-24లో 56.25 శాతానికి తగ్గాయి.
ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన: అందరికీ సంక్షేమాన్ని అందించడమే ధ్యేయంగా 2025 వార్షిక బడ్జెట్టులో పీఎం ధన ధాన్య కృషి యోజన (పీఎం-డీడీకేవై) ద్వారా 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాలను అభివృద్ధి చేస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆరేళ్ల కాల వ్యవధితో ఆర్థిక సంవత్సరం 26 నుంచి 100 జిల్లాల్లో అమలయ్యేలా పీఎండీడీకేవైకు జులై 2025లో ఆమోదం లభించింది.
వ్యవసాయ ఉత్పాదకతను విస్తరించడం, పంటల వైవిద్యీకరణను, సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరించడం, పంచాయతీ, బ్లాకు స్థాయుల్లో గిడ్డంగి సౌకర్యాలను పెంపొందించడం, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం, స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణ లభ్యతను సులభతరం చేయడం ఈ పథకం లక్ష్యాలుగా ఉన్నాయి.
పంట బీమా తోడ్పాటు: ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురయ్యే పంట నష్టం నుంచి రైతులకు రక్షణను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) కల్పిస్తుంది. 2024-25లో 4.19 కోట్ల మంది రైతులకు బీమాను ఈ పథకం అందించింది. 2022-23తో పోలిస్తే ఇది 32 శాతం మేర పెరిగింది. 6.2 కోట్ల హెక్టార్ల భూమికి కవరేజీ లభించింది. గతేడాదితో పోలిస్తే ఇది 20 శాతం అధికం.
భారత జాతీయ ఆదాయంలో ప్రస్తుత ధరల వద్ద వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు దాదాపుగా అయిదో వంతు వాటా ఉందని ఈ సర్వే తేల్చింది. ఉపాధి కల్పనలో వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు సాపేక్షంగా అతిపెద్ద వాటా ఉండటంతో.. దేశ మొత్తం వృద్ధికి కేంద్రంగా ఈ రంగం నిలిచింది. అందుకే సమ్మిళిత వృద్ధికి, ఆహార భద్రతకు హామీ ఇచ్చేందుకు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం చాలా ముఖ్యం.
***
(रिलीज़ आईडी: 2220172)
आगंतुक पटल : 24