లోక్సభ సచివాలయం
బడ్జెట్ సమావేశాల్లో సభ సజావుగా సాగేలా సహకరించాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సభ్యులకు విజ్ఞప్తి చేసిన లోక్సభ స్పీకర్
పథకం ప్రకారం సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దన్న శ్రీ ఓం బిర్లా
లక్నోలో జరిగిన 86వ అఖిల భారత శాసన సభాపతుల సదస్సు (ఏఐపీఓసీ) ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన లోక్సభ స్పీకర్
2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని చేరుకోవడంలో శాసనసభలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయన్న లోక్సభ స్పీకర్
శాసనసభలను మరింత ప్రభావవంతంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్చేందుకు 'జాతీయ శాసన సూచిక' తయారు చేయనున్నట్లు తెలిపిన లోక్సభ స్పీకర్
రాష్ట్ర శాసనసభల్లో ఏడాదికి కనీసం 30 సమావేశాలు జరిగేలా చూడాలన్న లోక్సభ స్పీకర్
సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించే ధోరణిని కాకుండా చర్చ, సంవాద సంప్రదాయాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చిన లోక్సభ స్పీకర్
రాజ్యాంగ సంరక్షకులుగా, ప్రజాస్వామ్య మర్యాదలకు కాపలాదారులుగా శాసన సభాపతులు ఉండాలన్న లోక్సభ స్పీకర్
प्रविष्टि तिथि:
21 JAN 2026 6:45PM by PIB Hyderabad
86వ అఖిల భారత శాసన సభాపతుల సదస్సు (ఏఐపీఓసీ) ముగింపు కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ విధాన్ భవన్లో 2026 జనవరి 19 నుంచి 21 వరకు ఈ సదస్సు జరిగింది.
ఈ సదస్సు చివరి సెషన్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఉపాధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ శాసన మండలి చైర్మన్, ఉత్తరప్రదేశ్ శాసనసభ స్పీకర్ మాట్లాడారు.
ముగింపు కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ మాట్లాడుతూ.. శాసనసభలను మరింత ప్రభావవంతంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా, జవాబుదారీగా మార్చడానికి 'జాతీయ శాసన సూచిక' తయారు చేయనున్నట్లు తెలిపారు. ఇది శాసనసభల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడమే కాకుండా దేశవ్యాప్తంగా చర్చల నాణ్యత, పనితీరును మెరుగుపరుస్తుందని అన్నారు. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు.
ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే సమర్థవంతమైన వేదికలుగా శాసనసభలు మారాలంటే రాష్ట్ర శాసనసభలలో ఏడాదికి కనీసం 30 సమావేశాలు జరిగేలా చూడాలని శ్రీ బిర్లా అన్నారు. సభ ఎంత ఎక్కువ కాలం పనిచేస్తే అంత అర్థవంతమైన, తీవ్రమైన, ఫలితాల ఆధారిత చర్చలు సాధ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు.
పత్రికా సమావేశంలో కూడా లోక్సభ స్పీకర్ మాట్లాడారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో సభా కార్యకలాపాలు సజావుగా నిర్వహించటంపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. సభలో నిరంతరం, పథకం ప్రకారం కలిగించే ఆటంకాలు దేశ ప్రజాస్వామ్యానికి తగవని పేర్కొన్నారు. సభకు అంతరాయం కలిగినప్పుడు అందరికంటే ఎక్కువగా నష్టపోయేది ప్రజలే అని ఆయన అన్నారు. ఆటంక పరిచే సంస్కృతిని కాకుండా చర్చ, సంవాద సంప్రదాయాన్ని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
సభ సజావుగా సాగేలా సహకరించాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అత్యున్నతమన్న ఆయన.. ప్రజల పట్ల జవాబుదారీతనం కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా ప్రతిరోజూ, ప్రతిక్షణం ఉండాలని పేర్కొన్నారు.
శాసన సభాపతులు కేవలం సభా కార్యకలాపాలను నిర్వహించేవారు మాత్రమే కాదని రాజ్యాంగ సంరక్షకులుగా, ప్రజాస్వామ్య మర్యాదలకు కాపలాదారులుగా ఉంటారని లోక్సభ స్పీకర్ వ్యాఖ్యానించారు. సభాపతుల నిష్పాక్షికత, సున్నితత్వం, దృఢత్వం... సభ సాగే దిశను నిర్ణయిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
86వ అఖిల భారత శాసన సభాపతుల సదస్సులో మొత్తం ఆరు ముఖ్యమైన తీర్మానాలకు ఆమోదం లభించింది:
తీర్మానం 1: 2047 నాటికి 'వికసిత్ భారత్' అనే జాతీయ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు కృషి చేయడానికి సభాపతులందరూ సంబంధిత శాసనసభల కార్యకలాపాల నిర్వహణకు పునరంకితం కావాలి.
తీర్మానం 2: అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించటం ద్వారా రాష్ట్ర శాసనసభల్లో ఏడాదికి కనీసం ముప్పై (30) సమావేశాలు నిర్వహించాలి. ప్రజాస్వామ్య సంస్థలు ప్రజలకు జవాబుదారీగా ఉండేలా చూసుకునేందుకు శాసన పనుల కోసం అందుబాటులో ఉన్న సమయం, వనరులను నిర్మాణాత్మకంగా, సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.
తీర్మానం 3: ప్రజలు, శాసనసభలకు మధ్య సమర్థవంతమైన అనుసంధానాన్ని ఏర్పరచడానికి, అర్థవంతమైన భాగస్వామ్య పరిపాలనను నిర్ధారించేందుకు శాసన పనులను సులభతరం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరంతరం బలోపేతం చేయాలి.
తీర్మానం 4: దేశానికి ఉన్న ప్రజాస్వామ్య సంప్రదాయాలు, విలువలు మరింత లోతుగా, బలంగా మారేలా చూసేందుకు భాగస్వామ్య పరిపాలనకు సంబంధించిన అన్ని సంస్థలకు ఆదర్శప్రాయమైన నాయకత్వాన్ని ఇక ముందు కూడా అందించాలి.
తీర్మానం 5: శాసనసభల్లో జరిగే చర్చలు, సంవాదాలలో ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా పాల్గొనేలా చూసేందుకు డిజిటల్ సాంకేతికత వినియోగంలో పార్లమెంట్- శాసనసభ సభ్యుల సామర్థ్యాన్ని పెంపొందించడం, పరిశోధన - విశ్లేషణాత్మక మద్దతును ఇక ముందు కూడా నిరంతరం కొనసాగించాలి.
తీర్మానం 6: బహిరంగ ప్రయోజనాల దృష్ట్యా గరిష్ఠ జవాబుదారీతనంతో కూడిన ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించడానికి, నిర్ణీత ప్రమాణాల ఆధారంగా శాసన సభల పనితీరును నిష్పాక్షికంగా అంచనా వేయటంతో పాటు సరిపోల్చేందుకు ఒక 'జాతీయ శాసన సూచిక'ను రూపొందించాలి.
లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా సమక్షంలో జరిగిన ఈ మూడు రోజుల సదస్సుకు సంబంధించిన ప్లీనరీ సెషన్లలో మూడు ప్రధానాంశాలపై చర్చించారు:
* పారదర్శకమైన, సమర్థవంతమైన, ప్రజా కేంద్రిత శాసన ప్రక్రియల కోసం సాంకేతికతను ఉపయోగించటం.
* పనితీరును మెరుగుపరచడానికి, ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేసేందుకు చట్ట సభల ప్రతినిధుల సామర్థ్యాన్ని పెంపొందించడం
* ప్రజల పట్ల శాసనసభల జవాబుదారీతనం.
ఈ సదస్సులో దేశంలోని 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 36 మంది శాసనసభాపతులు పాల్గొన్నారు. భాగస్వామ్యం పరంగా 86వ ఏఐపీఓసీ ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సదస్సుగా నిలిచింది.
అఖిల భారత శాసన సభాపతుల సదస్సు వంటి వేదికలు ప్రజాస్వామ్య సంస్థల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తాయని, పరస్పర సమన్వయాన్ని బలోపేతం చేస్తాయని, పాలనను మరింత ప్రభావవంతంగా చేయడంలో సహాయపడతాయని లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా పేర్కొన్నారు.
సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ శాసనసభ- శాసనమండలి, లోక్సభ - రాజ్యసభ కార్యాలయాలతో పాటు పాల్గొన్న సభాపతులు, ప్రతినిధులందరికీ లోక్సభ స్పీకర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
భారతీయ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్ఠంగా, జవాబుదారీగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్చే దిశగా 86వ అఖిల భారత శాసన సభాపతుల సదస్సు (ఏఐపీఓసీ) ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది.
***
(रिलीज़ आईडी: 2217112)
आगंतुक पटल : 3