రైల్వే మంత్రిత్వ శాఖ
రేపు 100 మంది రైల్వే అధికారులకు 70వ అతి విశిష్ట రైల్ సేవా పురస్కారం-2025,
అత్యుత్తమ పనితీరు కనబరిచిన జోన్లకు 26 షీల్డులను ప్రదానం చేయనున్న శ్రీ అశ్వినీ వైష్ణవ్
प्रविष्टि तिथि:
08 JAN 2026 6:28PM by PIB Hyderabad
సంస్థకు చేసిన విశిష్ట సేవలు, అందించిన అద్భుత సహకారాన్ని గుర్తిస్తూ భారతీయ రైల్వే 100 మంది అంకితభావం గల ఉద్యోగులు, అధికారులను ప్రతిష్టాత్మక 70వ అతి విశిష్ట రైల్ సేవా పురస్కారం-2025తో సత్కరించనుంది. న్యూఢిల్లీలోని ద్వారకలో గల ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ - ఎక్స్పో సెంటర్ (యశోభూమి)లో రేపు ఈ పురస్కార ప్రదానోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
పురస్కారానికి ఎంపికైన రైల్వే సిబ్బందికి కేంద్ర రైల్వేలు, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికతల శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ 70వ అతి విశిష్ట రైల్ సేవా పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రైల్వేలు, జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ వి. సోమన్న... రైల్వేలు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ రవ్నీత్ సింగ్... రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో శ్రీ సతీష్ కుమార్... రైల్వే బోర్డు సభ్యులు, వివిధ రైల్వే జోన్లు, ఉత్పత్తి యూనిట్ల జనరల్ మేనేజర్లు పాల్గొంటారు.
ఆవిష్కరణలు, కార్యాచరణ సామర్థ్యం, భద్రత, రక్షణ, ఆదాయ వృద్ధి, ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయడం, క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన, ఇతర విశిష్ట సేవా రంగాల్లో చేసిన విస్తృత కృషికి గానూ మొత్తం 100 మంది పురస్కార గ్రహీతలు అతి విశిష్ట రైల్ సేవా పురస్కార్–2025 కోసం ఎంపికయ్యారు.
ఆవిష్కరణలు, సామర్థ్యాలను ప్రోత్సహించడం
ఉత్పాదకతను మెరుగుపరచడం, పొదుపు, దిగుమతులకు ప్రత్యామ్నాయం, వనరులను మరింత సమర్థంగా ఉపయోగించడం, తద్వారా భారతీయ రైల్వేల మొత్తం సామర్థ్యాన్ని బలోపేతం చేయడం వంటి కొత్త ఆవిష్కరణలు, ప్రక్రియలు, విధానాలను ప్రవేశపెట్టిన 17 మంది అధికారులు, ఉద్యోగులను సత్కరిస్తారు.
ధైర్యసాహసాలు, నిస్వార్థ సేవను గౌరవించడం
వ్యక్తిగత భద్రతను సైతం లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలను, రైల్వే ఆస్తులను రక్షించడంలో విశేష కృషి చేసి... ప్రజా సేవ పట్ల అసాధారణ ధైర్యం, నిబద్ధత, అంకితభావాన్ని ప్రదర్శించిన 22 మంది రైల్వే ఉద్యోగులు, అధికారులను సత్కరించనున్నారు.
ఆదాయ పెంపు, అప్రమత్తత
రైల్వే ఆదాయాలను పెంచడంతో పాటు టిక్కెట్ లేని ప్రయాణం, దొంగతనాలు, ఇతర దుష్ప్రవర్తనలను సమర్థవంతంగా పరిష్కరించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను బలోపేతం చేయడంలో, ఆదాయాన్ని కాపాడడంలో చేసిన విశేష కృషికి గానూ 14 మంది అధికారులు, సిబ్బందికి కూడా పురస్కారాలను ప్రదానం చేస్తారు.
అత్యుత్తమ కార్యాచరణ, ఆస్తుల రక్షణ
కార్యకలాపాలను మెరుగుపరచడం... భద్రతను, రక్షణను పెంపొందించడం... మెరుగైన నిర్వహణ పద్ధతులను నిర్ధారించడం... రైల్వే ఆస్తుల ఉత్తమ వినియోగాన్ని, భద్రతను ప్రోత్సహించడంలో ఆదర్శప్రాయమైన కృషికి గానూ 19 మంది ఉద్యోగులు, అధికారులు పురస్కారం అందుకుంటారు.
చరిత్రాత్మక ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం
ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులను రికార్డు సమయంలో పూర్తి చేయడం, మౌలిక సదుపాయాల విస్తరణ, సామర్థ్యాలను మెరుగుపరచడం, మెరుగైన కార్యాచరణ పనితీరుకు గణనీయ సహకారం అందించిన 16 మంది అధికారులు, ఉద్యోగులను సత్కరిస్తారు.
ఇతర రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన
భారతీయ రైల్వేల విభిన్న క్రియాశీల రంగాల్లో వృత్తిపరమైన నైపుణ్యం, అంకితభావం, ప్రభావవంతమైన సహకారాలను ప్రతిబింబిస్తూ... నిర్ధిష్ట కేటగిరీలకు అతీతంగా ఆయా రంగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన 10 మంది అధికారులు, ఉద్యోగులను సత్కరిస్తారు.
క్రీడా నైపుణ్యాన్ని సెలబ్రేట్ చేయడం
క్రీడారంగంలో జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు సాధించడం ద్వారా భారతీయ రైల్వేల కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసిన ఇరువురు క్రీడాకారులకూ అతి విశిష్ట రైల్ సేవా పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
వ్యక్తిగత గుర్తింపును మించి
వ్యక్తిగత పురస్కారాలతో పాటుగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రైల్వే జోన్లకు గుర్తిస్తూ 26 షీల్డులను ప్రదానం చేస్తారు.
మహాకుంభ్ వంటి భారీ కార్యక్రమాల సమయంలో సురక్షితమైన, నిరాటంకమైన రైల్వే కార్యకలాపాలను అందించడంలో కీలక పాత్ర పోషించిన సిబ్బంది కూడా పురస్కార గ్రహీతల్లో ఉన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో నిరంతరాయం రైల్వే కార్యకలాపాలను కొనసాగిస్తూ, ప్రజలకు సహాయం అందేలా చూసిన అధికారులు, అలాగే కష్టతరమైన విభాగాల్లో అధునాతన బలాస్ట్ క్లీనింగ్ యంత్రాలను ప్రవేశపెట్టడం ద్వారా ట్రాక్ భద్రత, ప్రయాణ నాణ్యత, దీర్ఘకాలిక నిర్వహణ సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరిచిన వారూ ఈ పురస్కార గ్రహీతల్లో ఉన్నారు.
సురక్షితమైన, మరింత సమర్థమైన, ప్రయాణికుల-కేంద్రితమైన రైల్వే వ్యవస్థను నిర్మించడంలో దాని సిబ్బంది సమష్టి ప్రయత్నాలను గౌరవిస్తూ... వారి అంకితభావం, వృత్తి నైపుణ్యం, ఆదర్శప్రాయమైన సేవలను గుర్తించడంలో భారతీయ రైల్వేల నిబద్ధతను ఈ పురస్కార ప్రదానోత్సవం స్పష్టం చేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2212670)
आगंतुक पटल : 20