1. పౌరులంతా ఈసీఐనెట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని, యాప్లోని ‘సూచనను సమర్పించండి’ ట్యాబ్ను ఉపయోగించి యాప్ను మెరుగుపరచడానికి తమ సూచనలను అందించాలని భారత ఎన్నికల సంఘం పౌరులను ఆహ్వానిస్తోంది. పౌరులు ఈ నెల 10 వరకు తమ సూచనలను అందించవచ్చు.
2. కొత్త ఈసీఐనెట్ యాప్ ట్రయల్ వెర్షన్ మెరుగైన ఓటరు సేవలను, పోలింగ్ శాతం ట్రెండ్లను వేగంగా అందుబాటులోకి తీసుకురావడాన్ని, అలాగే పోలింగ్ ముగిసిన 72 గంటల్లోపు ఇండెక్స్ కార్డులను ప్రచురించడాన్ని సుసాధ్యం చేస్తాయి. గతంలో ఈ ప్రక్రియకు చాలా వారాలు లేదా నెలలు పట్టేది. ఈ యాప్ను 2025లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో విజయవంతంగా పరీక్షించారు.
3. సీఈఓలు, డీఈఓలు, ఈఆర్ఓలు, పరిశీలకులు, క్షేత్రస్థాయి అధికారుల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఈ ప్లాట్ఫామ్ను నిరంతరం మెరుగుపరుస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు దీనిని అప్డేట్ చేస్తున్నారు. వినియోగదారుల సూచనల ఆధారంగా దీనిని వినియోగదారులకు అనుకూలంగా మరింత మార్చడానికి ఈ ప్లాట్ఫామ్ను నవీకరిస్తున్నారు. ఈ ఈసీఐనెట్ ప్లాట్ఫామ్ ఈ నెలలో అధికారికంగా ప్రారంభం కానుంది.
4. ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేష్ కుమార్ నాయకత్వంలో... ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషిలతో కలిసి కమిషన్ చేపట్టిన ప్రధాన కార్యక్రమాల్లో ఈసీఐనెట్ ఒకటి. 2025, మే 4వ తేదీన దీనిని ప్రకటించిన తర్వాత ఈసీఐనెట్ యాప్ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.
5. ఈసీఐనెట్ యాప్ పౌరుల కోసం రూపొందించిన ఒక ఏకీకృత యాప్. ఇది గతంలో ఉన్న ఓటర్ హెల్ప్లైన్ యాప్ (వీహెచ్ఏ), సీవిజిల్, సాక్షమ్, పోలింగ్ ట్రెండ్స్ (ఓటర్ టర్నవుట్ యాప్), నో యువర్ క్యాండిడేట్ (కేవైసీ) యాప్ వంటి 40 వేర్వేరు ఎన్నికల సంబంధిత అప్లికేషన్లు/వెబ్సైట్లను ఒకే ఇంటర్ఫేస్లోకి అనుసంధానిస్తుంది. ఈ యాప్ను గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ రెండింటి నుంచీ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
***