రాష్ట్రపతి సచివాలయం
ఐఎన్ఎస్ వాగ్షీర్ జలాంతర్గామిలో ప్రయాణించిన భారత రాష్ట్రపతి
‘‘వాగ్షీర్ సిబ్బంది ప్రదర్శించిన క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఉత్సాహాన్ని చూస్తుంటే.. మన జలాంతర్గాములు, భారత నౌకాదళం ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి, అన్ని పరిస్థితుల్లోనూ యుద్ధానికి సిద్ధం’’ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నాడు పోస్టు చేయడమైనది:
28 DEC 2025 4:53PM by PIB Hyderabad
పశ్చిమ సముద్ర తీరంలో ఐఎన్ఎస్ వాగ్షీర్ జలాంతర్గామిలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రయాణించారు. ఈ పర్యటనలో నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి రాష్ట్రపతి వెంట ఉన్నారు. నేడు (డిసెంబర్ 28, 2025) కర్ణాటకలోని కార్వార్ నౌకాశ్రయం వద్ద ఆమె ఈ జలాంతర్గామిలోకి ప్రవేశించారు. సుమారు రెండు గంటలకు పైగా సాగిన ఈ సముద్రయానంలో జలాంతర్గామి సిబ్బందితో ముచ్చటించి, కార్యకలాపాలు, యుద్ధ విన్యాసాల ప్రదర్శనలను రాష్ట్రపతి స్వయంగా వీక్షించారు.

రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత జలాంతర్గామిలో ప్రయాణించిన రెండో రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్మునే.

దేశీయంగా తయారైన 'కల్వరి' తరగతి జలాంతర్గామిలో రాష్ట్రపతి ప్రయాణించడం ఇదే మొదటిసారి. సాయుధ దళాల సుప్రీం కమాండర్ హోదాలో రాష్ట్రపతి మన సైన్యం క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తున్నదీ స్వయంగా పరిశీలిస్తూ, వారితో నిరంతరం మమేకమవుతున్నారనేందుకు ఈ ప్రయాణం ఒక నిదర్శనం. అంతకుముందు నవంబర్ 2024లో స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్లో భారత నౌకాదళం నిర్వహించిన యుద్ధ విన్యాసాలను రాష్ట్రపతి స్వయంగా వీక్షించారు.

అనంతరం సందర్శకుల పుస్తకంలో రాష్ట్రపతి తన భావాలను వ్యక్తం చేశారు. ‘‘ఐఎన్ఎస్ వాగ్షీర్లో మన నౌకాదళ అధికారులు, నావికులతో ప్రయాణించడం, నీటిలోపల గడపడం నాకు నిజంగా చాలా ప్రత్యేకమైన అనుభవం. ఐఎన్ఎస్ వాగ్షీర్ ద్వారా నిర్వహించిన అనేక ప్రయోగాత్మక కాల్పులు, సవాలుతో కూడిన కార్యకలాపాలు ‘‘వీరత వర్చస్వ విజయ’’ అన్నట్లుగా సిబ్బంది చూపిన అసాధారణ సంసిద్ధత, అంకితభావాన్ని చాటిచెబుతున్నాయి. వాగ్షీర్ సిబ్బంది క్రమశిక్షణ, విశ్వాసం, ఉత్సాహాన్ని ప్రత్యక్షంగా చూస్తుంటే.. మన జలాంతర్గాములు, భారత నౌకాదళం ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి, అన్ని పరిస్థితుల్లోనూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని నాకు అర్థమైంది’’ అని పేర్కొన్నారు.

***
(రిలీజ్ ఐడి: 2209287)
సందర్శకుల సూచీ సంఖ్య : : 91