గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
వికసిత్ భారత్ - రోజ్గార్, ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (వీబీ - జీ రామ్ జీ) బిల్లు-2025కు రాష్ట్రపతి ఆమోదం
చట్టబద్ధమైన ఉపాధి హామీని 125 రోజులకు పెంచనున్న నూతన చట్టం
భవిష్యత్తును నడిపించేవి పంచాయతీలే - ప్రణాళికా అధికారం గ్రామసభ, పంచాయతీలదే
వికసిత్ భారత్@2047 దార్శనికతకు అనుగుణంగా వికసిత్ భారత్-జీ రామ్ జీ చట్టం
प्रविष्टि तिथि:
21 DEC 2025 4:30PM by PIB Hyderabad
గ్రామీణ ఉపాధి విధాన పరివర్తనలో ఒక కీలక మైలురాయిగా నిలిచే వికసిత్ భారత్-రోజ్గార్, ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (వీబీ – జీ రామ్ జీ) బిల్లు-2025కు భారత రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ చట్టం ప్రతి ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ కుటుంబాలకు చట్టబద్ధమైన వేతన ఉపాధి హామీని 125 రోజులకు పెంచుతుంది. సాధికారత, సమ్మిళిత వృద్ధి, అభివృద్ధి కార్యక్రమాల కలయికగా, సంతృప్తి-ఆధారిత డెలివరీని ముందుకు తీసుకెళ్లడానికి ఇది ప్రయత్నిస్తుంది. తద్వారా సంపన్నమైన, సమర్థమైన, స్వయం-సమృద్ధ గ్రామీణ భారత్ కోసం పునాదిని ఈ చట్టం బలోపేతం చేస్తుంది.
ఇటీవలే వికసిత్ భారత్ - రోజ్గార్, ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు-2025ను పార్లమెంటు ఆమోదించింది. ఇది దేశంలో గ్రామీణ ఉపాధి, అభివృద్ధి ప్రణాళికల్లో నిర్ణయాత్మక సంస్కరణను సూచిస్తుంది. ఈ చట్టం జీవనోపాధి భద్రతను మరింత పెంచుతూ, వికసిత్ భారత్ @2047 జాతీయ దార్శనికతకు అనుగుణంగా ఉండే ఆధునిక చట్టాలకు అనుగుణమైన నూతన ప్రణాళికను... మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)-2005 స్థానంలో తెచ్చారు.
సాధికారత, వృద్ధి, సమ్మిళితత్వం, సంతృప్తత సూత్రాల ఆధారంగా రూపొందించిన ఈ చట్టం... గ్రామీణ ఉపాధిని వ్యక్తిగత సంక్షేమం నుంచి సమగ్ర అభివృద్ధికి సాధనంగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఇది గ్రామీణ కుటుంబాలకు ఆదాయ భద్రతను బలోపేతం చేస్తుంది. పాలనను, జవాబుదారీతనాన్ని ఆధునీకరిస్తుంది. వేతన ఉపాధిని మన్నికైన, ఉత్పాదక గ్రామీణ ఆస్తుల సృష్టితో అనుసంధానిస్తుంది. తద్వారా సంపన్నమైన, సమర్థమైన గ్రామీణ భారత్కు ఇది పునాది వేస్తుంది.
చట్టం ముఖ్య లక్షణాలు
మెరుగైన చట్టబద్ధమైన ఉపాధి హామీ
-
నైపుణ్యం లేని కార్మికులుగా పని చేపట్టడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కుటుంబాల్లోని వయోజనులకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రతి గ్రామీణ కుటుంబానికి 125 రోజులకు తక్కువ కాకుండా వేతన ఉపాధి కల్పించుటకు ఈ చట్టం చట్టబద్ధమైన హామీని అందిస్తుంది (సెక్షన్ 5(1)).
-
మునుపటి 100 రోజుల అర్హత కంటే ఈ మెరుగుదల గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి భద్రతను, కచ్చితమైన పని అంచనాను, ఆదాయ స్థిరత్వాన్నీ గణనీయంగా బలోపేతం చేస్తుంది. అదే సమయంలో వారు జాతీయ అభివృద్ధికి మరింత సమర్థంగా, అర్థవంతంగా దోహదపడటానికి వీలు కల్పిస్తుంది.
వ్యవసాయ, గ్రామీణ కార్మికులకు సమతుల్యమైన కేటాయింపు
-
విత్తనాలు విత్తడం, పంటకోత సీజన్ల వంటి కీలక సమయాల్లో సరిపడా వ్యవసాయ కూలీలు అందుబాటులో ఉండేలా చేయడం కోసం ఈ చట్టం రాష్ట్రాలకు ఒక ఆర్థిక సంవత్సరంలో అరవై రోజుల వరకు సమగ్ర విరామ వ్యవధిని ప్రకటించడానికి అధికారం కల్పిస్తుంది (సెక్షన్ 6).
-
125 రోజుల పూర్తి ఉపాధి హామీ విషయంలో ఎలాంటి మార్పు లేకుండా మిగిలిన కాలంలో ఉపాధి కల్పిస్తారు. వ్యవసాయ ఉత్పాదకత, కార్మికుల భద్రత రెండింటికీ మద్దతునిస్తూ రెండింటి మధ్య సమతుల్యతను ఇది నిర్ధారిస్తుంది.
సకాలంలో వేతన చెల్లింపులు
-
ఈ చట్టం ప్రకారం వారానికోసారి లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో సంబంధిత పని పూర్తయిన పదిహేను రోజుల్లోపు వేతనాలు చెల్లించాలి (సెక్షన్ 5(3)). నిర్ణీత వ్యవధికి మించి జాప్యం జరిగితే, షెడ్యూల్ IIలో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఆలస్యం కోసం పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. వేతన భద్రతను బలోపేతం చేయడం, కార్మికులను వేతనాల ఆలస్యం నుంచి రక్షించడం దీని ఉద్దేశం.
ఉత్పాదక గ్రామీణ మౌలిక సదుపాయాలతో ముడిపడిన ఉపాధి
ఈ చట్టం కింద వేతన ఉపాధి నాలుగు ప్రాధాన్య నేపథ్య ప్రాంతాల్లో మన్నికైన ప్రభుత్వ ఆస్తుల సృష్టికి స్పష్టంగా అనుసంధానమై ఉంటుంది (షెడ్యూల్ I తో చదివిన సెక్షన్ 4(2):
1. జల సంరక్షణ, నీటి సంబంధిత పనులు
2. కీలక గ్రామీణ మౌలిక సదుపాయాలు
3. జీవనోపాధి సంబంధిత మౌలిక సదుపాయాలు
4. తీవ్ర వాతావరణ ఘటనలను తగ్గించే పనులు
అన్ని పనుల కోసం బాటమ్-అప్ ప్రక్రియ ద్వారా ప్రణాళికను రూపొందిస్తారు. సృష్టించిన అన్ని ఆస్తులు వికసిత్ భారత్ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల స్టాక్లో సమీకరిస్తారు. ఇది ప్రభుత్వ పెట్టుబడుల సమ్మిళితత్వాన్ని పెంచడం, ఫ్రాగ్మెంటేషన్ వంటి లోపాలను నివారించడం, వివిధ స్థానిక అవసరాల ఆధారంగా కీలక గ్రామీణ మౌలిక సదుపాయాలు కల్పించడం లక్ష్యంగా ఫలితాల ఆధారిత ప్రణాళికను నిర్ధారిస్తుంది.
జాతీయ సమ్మిళితత్వంతో వికేంద్రీకృత ప్రణాళిక
-
అన్ని పనులు వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల (వీజీపీపీల) నుంచి తీసుకుంటారు, వీటిని గ్రామ పంచాయతీ స్థాయిలో భాగస్వామ్య ప్రక్రియల ద్వారా ప్రణాళికను రూపొందించి, గ్రామ సభ ఆమోదం పొందుతారు (సెక్షన్లు 4(1)–4(3)).
-
ఈ ప్రణాళికలను ప్రధానమంత్రి గతి శక్తి సహా ఇతర జాతీయ వేదికలతో డిజిటల్గా, ప్రాదేశికంగా అనుసంధానిస్తారు. వికేంద్రీకృత నిర్ణయాధికారాన్ని నిలుపుకుంటూనే మొత్తం ప్రభుత్వ సమ్మిళితత్వాన్ని ఇది అనుమతిస్తుంది.
-
ఈ సమీకృత ప్రణాళికా విధానం... మంత్రిత్వ శాఖలు, విభాగాలు పనులను మరింత సమర్థంగా ప్రణాళికాయుతంగా అమలు చేయడానికి... ప్రజా వనరులను డూప్లికేట్ చేయడం, వృధా చేయడం నివారించడానికి, సంతృప్తి ఆధారిత ఫలితాల ద్వారా అభివృద్ధిని వేగవంతం చేయడానికి వీలు కల్పిస్తుంది.
సంస్కరించిన ఆర్థిక నిర్మాణం
-
ఈ చట్టం కేంద్ర ప్రాయోజిత పథకంగా అమలు అవుతుంది. ఈ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని నోటిఫై చేసి అమలు చేస్తాయి.
-
ఖర్చు-భాగస్వామ్య విధానంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య 60:40... ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు 90:10... శాసనసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాలకు 100 శాతం కేంద్ర నిధులు ఉపయోగిస్తారు.
-
అంచనా సామర్థ్యం, ఆర్థిక క్రమశిక్షణ, మంచి ప్రణాళికను నిర్ధారిస్తూ... (సెక్షన్లు 4(5), 22(4)) నిబంధనల్లో సూచించిన లక్ష్య పరామితుల ఆధారంగా రాష్ట్రాల వారీగా నార్మేటివ్ కేటాయింపుల ద్వారా నిధులు అందిస్తారు. అదే సమయంలో ఉపాధి, నిరుద్యోగ భృతికి చట్టబద్ధమైన హక్కులను పూర్తిగా పరిరక్షిస్తారు.
పరిపాలనా సామర్థ్యం బలోపేతం
-
పరిపాలనా వ్యయ పరిమితిని 6 శాతం నుంచి 9 శాతానికి పెంచారు. దీని వలన సిబ్బంది నియామకం, శిక్షణ, సాంకేతిక సామర్థ్యం, క్షేత్రస్థాయి మద్దతు మెరుగుపడుతుంది. ఫలితాలను సమర్థంగా అందించగలిగే సంస్థల సామర్థ్యాన్ని ఇది బలోపేతం చేస్తుంది.
వికసిత్ భారత్ @2047 దార్శనికతకు అనుగుణంగా రూపొందించిన వికసిత్ భారత్ - రోజ్గార్, ఆజీవికా మిషన్ (గ్రామీణ్) చట్టం-2025 భారత గ్రామీణ ఉపాధి ప్రణాళికను పునరుద్ధరించడం, బలోపేతం చేయడం దిశగా ఒక నిర్ణయాత్మక అడుగును సూచిస్తుంది. చట్టబద్ధమైన వేతన ఉపాధి హామీని ప్రతి ఆర్థిక సంవత్సరానికి 125 రోజులకు పెంచడం ద్వారా ఈ చట్టం వికేంద్రీకృత, భాగస్వామ్య పాలనను మరింతగా మెరుగుపరుస్తూ ఉపాధిని డిమాండ్ చేసే హక్కునూ బలోపేతం చేస్తుంది. గ్రామీణ ఉపాధి ఆదాయ భద్రతను అందించడమే కాకుండా స్థిరమైన జీవనోపాధి, స్థిరమైన ఆస్తులు, దీర్ఘకాలిక గ్రామీణ శ్రేయస్సుకు దోహదపడుతుందని నిర్ధారించడానికి పారదర్శకత, నార్మేటివ్ నిధులు, జవాబుదారీతనం గల యంత్రాంగాలు, సాంకేతికత ఆధారిత సమగ్రత, సమ్మిళితత్వం-ఆధారిత అభివృద్ధిని ఇది ఏకీకృతం చేస్తుంది.
ఉపాధి హామీ, డిమాండ్ హక్కు
ఈ చట్టం ఉపాధిని డిమాండ్ చేసే హక్కును నీరుగార్చదు. దీనికి విరుద్ధంగా సెక్షన్ 5(1) అర్హత కలిగిన గ్రామీణ కుటుంబాలకు కనీసం 125 రోజుల హామీ వేతన ఉపాధిని అందించాల్సిన స్పష్టమైన చట్టబద్ధమైన బాధ్యతను ప్రభుత్వంపై ఉంచుతుంది. హామీ దినాల విస్తరణ, మరింత బలోపేతమైన జవాబుదారీతనం, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలతో కలిసి ఈ హక్కు అమలు సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
నార్మేటివ్ నిధులు, ఉపాధి కల్పన
నార్మేటివ్ కేటాయింపులకు మారడం... బడ్జెట్, నిధుల ప్రవాహ విధానాలకు సంబంధించినది. ఇది ఉపాధికి చట్టపరమైన హక్కును ప్రభావితం చేయదు. సెక్షన్లు 4(5), 22(4) ఉపాధి లేదా నిరుద్యోగ భృతిని అందించే చట్టబద్ధమైన బాధ్యతను నిలుపుకుంటూనే నియమ-ఆధారిత, అంచనాత్మక కేటాయింపులను నిర్ధారిస్తాయి.
వికేంద్రీకరణ, పంచాయతీల పాత్ర
ఈ చట్టం ప్రణాళిక లేదా అమలును కేంద్రీకరించదు. 16 నుంచి 19 వరకు సెక్షన్లు పంచాయతీల్లో ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ అథారిటీలకు... సంబంధిత స్థాయిల్లో ప్రోగ్రామ్ అధికారులు, జిల్లా అధికారులకు హక్కులు కల్పిస్తాయి. స్థానిక నిర్ణయాధికారాన్ని కాకుండా దృశ్యమానత, సమన్వయం, సమ్మిళితత్వాలను జాతీయ స్థాయిలో సమీకృతం చేస్తుంది.
ఉపాధి, ఆస్తుల సృష్టి
ఈ చట్టం 125 రోజుల మెరుగైన చట్టబద్ధమైన జీవనోపాధి హామీని అందిస్తుంది. అదే సమయంలో ఉత్పాదకత గల, మన్నికైన, వాతావరణ-నిరోధకత ఆస్తులకు ఉపాధి దోహదపడేలా నిర్ధారిస్తుంది. దీర్ఘకాలిక గ్రామీణ వృద్ధి, సమర్థతకు ఇవి మద్దతునిస్తూ... ఉపాధి కల్పన, ఆస్తుల సృష్టిని పరస్పరం బలోపేతం చేసుకునే లక్ష్యాలుగా రూపొందించారు. (సెక్షన్ 4(2), షెడ్యూల్ I).
సాంకేతికత, సమగ్రత
ఈ చట్టం కింద సాంకేతికతను ఒక అడ్డంకిగా కాకుండా, సాధికారత కల్పించే యంత్రాంగంగా తీసుకున్నారు. సెక్షన్ 23, 24 బయోమెట్రిక్ ప్రామాణీకరణ, జియో-ట్యాగింగ్, రియల్-టైమ్ డాష్బోర్డ్ల ద్వారా సాంకేతికత-ఆధారిత పారదర్శకతను అందిస్తాయి. అయితే సెక్షన్ 20 గ్రామసభల ద్వారా సామాజిక పర్యవేక్షణ, పారదర్శకత, సమగ్రతలను నిర్ధారిస్తూ సామాజిక ఆడిట్లను బలోపేతం చేస్తుంది.
నిరుద్యోగ భృతి
ఈ చట్టం గతంలో ఉన్న అనర్హత నిబంధనలను తొలగిస్తుంది. నిరుద్యోగ భృతిని అర్థవంతమైన చట్టబద్ధమైన రక్షణను పునరుద్ధరిస్తుంది. నిర్ణీత వ్యవధిలోపు ఉపాధి కల్పించకపోతే, పదిహేను రోజుల తర్వాత నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది.
ముగింపు
వికసిత్ భారత్ - రోజ్గార్, ఆజీవికా మిషన్ (గ్రామీణ్) చట్టం-2025 ఆమోదం... దేశ గ్రామీణ ఉపాధికి గట్టి హామీని సూచిస్తుంది. చట్టబద్ధమైన ఉపాధిని 125 రోజులకు విస్తరించడం, వికేంద్రీకృత, భాగస్వామ్య ప్రణాళికను పొందుపరచడం, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం, సమ్మిళితత్వం, సంతృప్తి-ఆధారిత అభివృద్ధిని సంస్థాగతీకరించడం ద్వారా ఈ చట్టం గ్రామీణ ఉపాధిని సాధికారత, సమ్మిళిత వృద్ధి, సంపన్నమైన, సమర్థమైన గ్రామీణ భారత్ సృష్టికి వ్యూహాత్మక సాధనంగా నిలుపుతుంది. ఇది వికసిత్ భారత్ @2047 దార్శనికతకు పూర్తిగా అనుగుణంగా ఉంటుంది.
***
(रिलीज़ आईडी: 2207246)
आगंतुक पटल : 62
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Khasi
,
English
,
Urdu
,
हिन्दी
,
Nepali
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam