ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో పలు ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
05 OCT 2023 10:54PM by PIB Hyderabad
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కేబినెట్ సహచరులు, మధ్యప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వేదికపై ఉన్న ఇతర ప్రముఖులు, మమ్మల్ని ఆశీర్వదించటానికి పెద్దఎత్తున తరలివచ్చిన మహిళలు, పెద్దలారా!
మాతా నర్మదా పుణ్యభూమికి నా ప్రణామాలు సమర్పిస్తూ, ఇవాళ నేను జబల్పూర్ కొత్త రూపాన్ని చూస్తున్నాను. జబల్పూర్లోని ఉత్సాహం, 'మహాకౌశల్'లోని ఆనందం, ఉద్వేగాన్ని నేను చూస్తున్నాను. మహాకౌశల్ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని ఈ ఉత్సాహం, ఈ ఆసక్తి ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఉత్సాహం మధ్య ఇవాళ యావత్ దేశం ధైర్యవంతురాలైన రాణి దుర్గావతి 500వ జయంతిని జరుపుకుంటోంది. రాణి దుర్గావతి గౌరవ యాత్ర ముగింపు సందర్భంగా, ఆమె జయంతిని జాతీయస్థాయిలో నిర్వహించాలని నేను పిలుపునిచ్చాను. మనమంతా ఒక పవిత్రమైన కార్యనిర్వహణకు, పూర్వీకుల రుణాన్ని తీర్చుకోవటానికే ఇక్కడకు వచ్చాం. కాసేపటి కిందటే మనం ఇక్కడ రాణి దుర్గావతి భవ్య స్మారక మందిరానికి భూమి పూజ చేశాం. ఆ స్మారక మందిరం ఎలా నిర్మిస్తారని నేను ఆలోచిస్తున్నాను. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మ్యాప్ ద్వారా శివరాజ్, నాకు వివరించారు. ఇది పూర్తయిన తర్వాత భారతదేశంలోని ప్రతి తల్లి, యువతీయువకులు ఈ ప్రాంతాన్ని దర్శించాలని కోరుకుంటారని నేను విశ్వసిస్తున్నాను. ఇది ఒక పుణ్యక్షేత్రంగా మారుతుంది. రాణి దుర్గావతి జీవితం మనందరికీ సర్వజన సంక్షేమాన్ని బోధిస్తుంది. మన మాతృభూమి కోసం ఏదైనా చేయాలనే ధైర్యాన్నిస్తుంది. గిరిజన సమాజానికి, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి, 140 కోట్ల దేశ ప్రజలకు రాణి దుర్గావతి జయంతి సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏ దేశానికైనా రాణి దుర్గావతి లాంటి నాయకురాలు ఉండి ఉంటే, ఆమెకు ఆ దేశం, ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించి ఉండేది. స్వాతంత్ర్యం వచ్చాక మన దేశంలోనూ అలా జరగాల్సింది కానీ, గొప్ప వ్యక్తిత్వాలను విస్మరించారు. అద్భుతమైన, జ్ఞానవంతులైన.. త్యాగానికి, పట్టుదలకు నిదర్శనమైన గొప్ప వ్యక్తులను, వీరులను, వీరవనితలను మర్చిపోయారు.
నా కుటుంబ సభ్యులారా,
ఇవాళ రూ.12 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగాయి. జల, గ్యాస్ పైప్ లైన్లు, 4 వరుసల రహదారి వ్యవస్థ వంటివి లక్షలాది మంది ప్రజల జీవితాల్లో మార్పును తీసుకువస్తాయి. దీనివల్ల రైతులకు తప్పకుండా లాభం చేకూరుతుంది. కొత్త ఫ్యాక్టరీలు, సంస్థల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
నా కుటుంబ సభ్యులారా,
మా అక్కాచెల్లెళ్లకు పొగ రహిత వంటశాలలను అందించటమే బీజేపీ ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాల్లో ముఖ్యమైనది. ఓ పరిశోధన ప్రకారం, ఒక తల్లి.. పొగ వచ్చే స్టవ్, కట్టెలు లేదా బొగ్గు మండించి వంట చేసేప్పుడు ప్రతి 24 గంటలకు ఆమె శరీరం ఎదుర్కొనే పొగ, 400 సిగరెట్ల పొగకు సమానమని తేలింది. నా తల్లులు, అక్కాచెల్లెళ్లు ఈ సమస్య నుంచి బయటపడాలా, వద్దా? మీ శక్తి మేరకు బదులివ్వండి. ఇది మన తల్లులు, అక్కాచెల్లెళ్లకు సంబంధించిన విషయం. వంటశాలలోని పొగ నుంచి మన ఆడబిడ్డలు విముక్తి పొందాలా లేదా? ఈ సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగానే పరిష్కరించి ఉండాల్సింది. కానీ పరిష్కరించలేదు. మన తల్లులు, అక్కాచెల్లెళ్ల గురించి, వారి ఆరోగ్యం, సంక్షేమం గురించి పట్టించుకోలేదు.
సోదరీసోదరులారా,
అందుకే మేం ఒక భారీ కార్యక్రమాన్ని ప్రారంభించి, కోట్లాది మంది పేద మహిళలకు ఉచిత ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు అందించాం. గతంలో గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఎంపీ ఇంటికి వెళ్లాల్సి వచ్చేంది. మీకు తెలుసు, రక్షాబంధన్ సందర్భంగా ఒక సోదరుడు, తన సోదరికి బహుమతి ఇస్తారు. ఈ ఏడాది రక్షాబంధన్ సందర్భంగా సోదరిణిలకు మా ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించింది. దీంతో ఉజ్వల లబ్ధిదారులకు రూ.400కే సిలిండర్ అందుతుంది. మరికొన్ని రోజుల్లో దుర్గాపూజ, నవరాత్రి, దసరా, దీపావళి పండుగలు ప్రారంభమవుతాయి. నిన్న మోదీ ప్రభుత్వం ఉజ్వల సిలిండర్ ధరను మరో రూ.100కు తగ్గించింది. అంటే కొద్ది రోజుల్లోనే ఉజ్వల లబ్ధిదారులకు సిలిండర్ ధర రూ.500 తగ్గింది. ప్రస్తుతం పథకం కింద లబ్ధి పొందుతున్న పేద తల్లులు, అక్కాచెల్లెళ్లు, కుమార్తెలకు గ్యాస్ సిలిండర్ కేవలం రూ.600కే లభిస్తుంది. బీజేపీ ప్రభుత్వం సిలిండర్లకే పరిమితం కాకుండా, పైపులైన్ల ద్వారా వంటశాలలకు చౌకగా గ్యాస్ సరఫరా చేసేందుకు, పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా మధ్యప్రదేశ్ లోని లక్షలాది కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి.
నా కుటుంబ సభ్యులారా,
కళాశాల విద్యార్థులకు, మన యువ మిత్రులకు, యువతీ, యువకులకు ఇవాళ కొన్ని పాత సంఘటనలను గుర్తు చేయాలనుకుంటున్నాను. 2014 నాటి కొన్ని సంఘటనల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు 20-22 ఏళ్ల వయసున్నవారు ఆ సమయంలో 8, 10, 12 ఏళ్ల వయసులో ఉండి ఉంటారు. కాబట్టి, వారికి ఆ విషయాలు తెలియకపోవచ్చు. మోదీ ప్రభుత్వం రాకముందు పరిస్థితి ఎలా ఉండేదో వారికి తెలియకపోవచ్చు. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వేల కోట్ల రూపాయల కుంభకోణాల గురించి వార్తాపత్రికల్లో హెడ్ లైన్లు వచ్చేవి. పేదలకు ఖర్చు చేయాల్సిన డబ్బు కాంగ్రెస్ నాయకుల ఖజానాలో చేరేవి. ఇప్పటి యువత ఆన్లైన్ తరానికి చెందినవారు కాబట్టి, దీనికి సంబంధించిన అంశాలను గూగుల్లో వెతకమని చెబుతాను. 2013-14 నాటి వార్తా పత్రికల శీర్షికలను ఒకసారి చదవండి. దేశ పరిస్థితి ఎలా ఉండేదో తెలుస్తుంది.
సోదరీసోదరులారా,
2014 తర్వాత దేశానికి సేవ చేసే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతి వ్యవస్థను మార్చటానికి మేం కృషి చేశాం. అవినీతిలోనూ పరిశుభ్రతా ఉద్యమాన్ని మొదలుపెట్టాం. దాదాపు 11 కోట్ల నకిలీ పేర్లను తొలగించేందుకు సాంకేతికతను ఉపయోగించాం. ఈ సంఖ్యను మీరు గుర్తుంచుకోగలరా? జవాబివ్వండి? ఈ లెక్క మీకు గుర్తుంటుందా? ప్రభుత్వ రికార్డుల నుంచి మేం 11 కోట్ల నకిలీ పేర్లను తొలగించాం. ఎన్ని? ఎన్ని అని చెప్పాను? గట్టిగా చెప్పండి. 11 కోట్లు! ఈ 11 కోట్ల పేర్లు ఎవరివి? అసలు పుట్టని వ్యక్తుల పేర్లు! కానీ ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఖజానాను కొల్లగొట్టటానికి ఒక మార్గం ఏర్పడింది. కాంగ్రెస్ ఈ తప్పుడు, నకిలీ పేర్లకు పత్రాలను సృష్టించింది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ల మొత్తం జనాభా కంటే ఈ 11 కోట్ల సంఖ్య ఎక్కువ. నిజమైన పేద ప్రజల హక్కులను హరించి, ఈ 11 కోట్ల నకిలీ పేర్లతో ఖజానాను దోచుకున్నారు. 2014లో అధికారంలోకి వచ్చాక మోదీ ప్రభుత్వం వీటన్నింటిని తొలగించింది. మోదీ వచ్చి అంతా తొలగించి, వారికి వెళ్లాల్సిన భాగం, కమీషన్ ఆపినందున ఆ వ్యక్తులు కోపంగా ఉన్నారు. పేదల డబ్బును దోచుకోవటానికి నేను అనుమతించను. కాంగ్రెస్ నాయకుల ఖజానాలు నిండటానికి ఒప్పుకోను. మేం సృష్టించిన త్రిశక్తి జన్ధన్-ఆధార్-మొబైల్ ద్వారా కాంగ్రెస్ హయాంలోని అవినీతి వ్యవస్థ నాశనమైంది. ఈ త్రి-శక్తి కారణంగా రూ.2.5 లక్షల కోట్లకు పైగా సొమ్ము చోరీకి గురికాకుండా ఆపగలిగాం. తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్న, చోరీకి గురయ్యే రూ.2.5 లక్షల కోట్లకు పైగా డబ్బుని ఆదా చేసే పనిని మోదీ చేశారు. నేను ఎంత చెప్పాను? 2.5 లక్షల కోట్లు! పేదవారి డబ్బు ఇవాళ పేదవారి సంక్షేమానికి ఉపయోగిస్తున్నాం. కేవలం రూ.600లకే ఉజ్వల సిలిండర్లను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తోంది. కోట్లాది కుటుంబాలకు ఉచిత రేషన్ అందించేందుకు ఖర్చుచేసే రూ.3 కోట్లను ఖజానా నుంచి అందిస్తున్నాం. ఏ ఒక్క పేద బిడ్డ కూడా రాత్రిపూట ఆకలితో నిద్రించకూడదు. పేదల ఇళ్లల్లో వంట ఆగిపోకూడదు. ఆయుష్మాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 5 కోట్ల కుటుంబాలు ఉచిత వైద్యం పొందాయి. ఆయుష్మాన్ ఆరోగ్య కార్డుల కోసం ప్రభుత్వం రూ.70 వేల కోట్లు ఖర్చు చేసింది. రైతులకు యూరియా చౌకగా అందాలి. ప్రపంచ మార్కెట్లో బస్తా యూరియా ధర రూ.3,000 ఉంటే, మోదీ దాన్ని రూ.300 కంటే తక్కువకే అందిస్తున్నారు. నా దేశ రైతులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం ఖజానా నుంచి రూ.8 లక్షల కోట్లు ఖర్చు చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.2.5 లక్షల కోట్లు జమ అవుతున్నాయి. పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు అందించేందుకు మన ప్రభుత్వం రూ.4 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఈ రోజు మీరు కూడా చూశారు. ఇండోర్లో ఆధునిక సాంకేతికతతో నిర్మించిన 1000 బహుళ అంతస్తుల పక్కా ఇళ్లను పేద కుటుంబాలకు అందించాను.
నా కుటుంబ సభ్యులారా,
ఈ నిధులన్నీ కలిపితే ఎంత మొత్తం అవుతుందో తెలుసా? దానికి ఎన్ని సున్నాలుంటాయో ఊహించగలరా? కాంగ్రెస్ నాయకులు కనీసం లెక్కించలేరు. 2014కు ముందు, ఈ సున్నాలను కుంభకోణాల ద్వారా పోగేసిన డబ్బును లెక్కించటానికి మాత్రమే వాడేవారు. ఇప్పుడు ఊహించండి. "ఢిల్లీ నుంచి ఒక రూపాయి పంపితే, లబ్ధిదారుడికి 15 పైసలు మాత్రమే చేరుతుంది. 85 పైసలు మధ్యలోనే ఎవరో దొంగిలిస్తారు. వారు ఒక రూపాయి పంపితే, లబ్ధిదారుడికి కేవలం 15 పైసలు మాత్రమే చేరేది" అని కాంగ్రెస్ ప్రధానమంత్రి ఒకరు అనేవారు. మనం ఇప్పుడు లెక్కించినంత డబ్బు పేదలకు పంపించి ఉంటే కాంగ్రెస్ పాలనలో ఎంత దోపిడీకి గురయ్యేదో మీరు ఊహించవచ్చు. కానీ, ఆ మొత్తాన్ని ఈరోజు పేదల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
నా కుటుంబ సభ్యులారా,
ఇది నా మధ్యప్రదేశ్కు ముఖ్యమైన కాలం. ఇవాళ నేను సాక్షాత్తు మాతా నర్మదా నది తీరాన నిలబడి ఈ విషయం చెబుతున్నాను. మధ్యప్రదేశ్ మొత్తానికి, మధ్యప్రదేశ్లోని యువతకు మాతా నర్మదా సమక్షంలో నేను ఈ మాట చెబుతున్నాను. ఎందుకంటే నేను కూడా మాతా నర్మదా ఒడిలోనే జన్మించాను. మాతా నర్మదా నది ఒడ్డున ఇవాళ నేను ఈ విషయం చెబుతున్నాను. యువతీ యువకులారా, నా మాటలు గుర్తు పెట్టుకోండి. మధ్యప్రదేశ్ ఈరోజున కీలకమైన ఘట్టంలో ఉంది. అభివృద్ధికి ఆటంకం కలిగితే, అభివృద్ధి వేగం తగ్గితే, అది అన్నింటినీ నాశనం చేస్తుంది. ఇలాంటి అభివృద్ధి మళ్లీ 20-25 సంవత్సరాల తర్వాత కూడా జరగదు. అందువల్ల, ఈ అభివృద్ధి వేగాన్ని ఆగిపోయేలా లేదా నిలిచపోయేలా చేయకూడదు. ఈ 25 సంవత్సరాలు మీకు అత్యంత కీలకమైనవి. ప్రస్తుతం 25 ఏళ్ల లోపు ఉన్నవారు కొత్తగా, అభివృద్ధి చెందుతున్న మధ్యప్రదేశ్ను మాత్రమే చూశారు. రాబోయే 25 ఏళ్లలో వారి పిల్లలు ఎదిగేసరికి, వారు ఒక అభివృద్ధి చెందిన, సుసంపన్నమైన, గౌరవ, మర్యాదలతో కూడిన మధ్యప్రదేశ్ను చూస్తారు. అందుకోసం ఇవాళ మరింత కష్టపడి పనిచేయడం అవసరం. సరైన నిర్ణయం తీసుకోవాలి. గడిచిన సంవత్సరాల్లో వ్యవసాయ ఎగుమతుల విషయంలో మధ్యప్రదేశ్ను బీజేపీ ప్రభుత్వం అగ్రస్థానానికి చేర్చింది. ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధిలోనూ మధ్యప్రదేశ్ నంబర్ వన్ కావాలి. భారత్లో ఏళ్లుగా రక్షణ వస్తువుల ఉత్పత్తి, రక్షణ ఎగుమతులు ఎంతో పెరిగాయి. ఇందుకు జబల్పూర్ కూడా దోహదపడుతోంది. మధ్యప్రదేశ్లో ఒక్క జబల్పూర్లోనే రక్షణ సంబంధిత వస్తువులను తయారుచేసే 4 కర్మాగారాలున్నాయి. ఈ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తమ సైన్యానికి 'మేడ్ ఇన్ ఇండియా' ఆయుధాలను అందిస్తోంది. ప్రపంచంలో కూడా భారత రక్షణ వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది. దీనివల్ల మధ్యప్రదేశ్కు కూడా మేలు జరగనుంది. స్థానికులకు వేలాది ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి.
నా కుటుంబ సభ్యులారా,
నేడు భారతదేశ ఆత్మవిశ్వాసం నూతన శిఖరాలకు చేరుకుంది. ఆటస్థలం నుంచి పంట పంటపొలాల వరకు భారత జెండా రెపరెపలాడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ అద్భుతమైన ప్రదర్శను మనం చూస్తున్నాం. దేశంలోని యువత ఇది భారత యువతర కాలం అని భావిస్తోంది. యువతకు ఇటువంటి అవకాశాలున్నప్పుడు, అభివృద్ధి చెందిన భారత్ను నిర్మించాలనే ఉత్సాహం పెరుగుతుంది. అందుకే జీ20 వంటి గొప్ప ప్రపంచ కార్యక్రమాలను భారత్ గర్వంగా నిర్వహించగలుగుతోంది. మరే ఇతర దేశం చేరుకోలేని ప్రదేశానికి భారత చంద్రయాన్ చేరుకుంది. ‘వోకల్ ఫర్ లోకల్’ అనే మంత్రం నలుమూలలకూ వినిపిస్తోంది. దేశం ఒకవైపు చంద్రయాన్ను అంతరిక్షంలోకి పంపింది. మరోవైపు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఢిల్లీలోని ఓ ఖాదీ దుకాణంలో ఒక్క రోజులోనే రూ.1.5 కోట్లకు పైగా విలువైన ఉత్పత్తులు అమ్ముడయ్యాయి. ఇదే దేశ బలం. ఈ స్వదేశీ స్ఫూర్తితో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న భావన పెరుగుతోంది. ఈ ప్రయత్నంలో దేశ యువత, పుత్రులు, కుమార్తెలు పగ్గాలు చేపట్టారు. అందుకే స్టార్టప్ల ప్రపంచంలో దేశ యువత అద్భుతాలు సృష్టిస్తోంది. అందుకే పరిశుభ్రంగా మారేందుకు భారత్ శక్తిమంతమైన ప్రతిజ్ఞ తీసుకుంటుంది. అక్టోబర్ 1న దేశవ్యాప్తంగా ప్రారంభించిన స్వచ్ఛతా ఉద్యమంలో 9 లక్షలకు పైగా ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఉద్యమంలో దేశంలోని 9 కోట్లకు పైగా ప్రజలు పాల్గొన్నారు. వారు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి, చీపుర్లు పట్టి దేశంలోని రహదారులు, పార్కులను శుభ్రం చేశారు. మధ్యప్రదేశ్ ప్రజలు, యువత ఇంకా అద్భుతాలు చేశారు. పరిశుభ్రత విషయంలో మధ్యప్రదేశ్ అత్యధిక స్కోరు సాధించి, దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. మనం ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి. రాబోయే 5 ఏళ్లలో వీలైనన్ని ఎక్కువ రంగాల్లో మధ్యప్రదేశ్ను ప్రథమ స్థానంలో నిలబెట్టాలి.
నా కుటుంబ సభ్యులారా,
స్వప్రయోజనాల్లో నిమగ్నమైన రాజకీయ పార్టీలను మనం సులభంగా గుర్తించవచ్చు. ప్రపంచమంతా ఇవాళ భారత్ సాధించిన విజయాల గురించి మాట్లాడుతోంది. కానీ, అన్నీ కోల్పోయి, అధికారం తప్ప ఏమీ చూడని ఈ రాజకీయ పార్టీలు బీజేపీని తిట్టే క్రమంలో భారతదేశాన్ని దూషించే స్థాయికి దిగజారాయి. యావత్ ప్రపంచం డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రశంసిస్తోంది. కానీ డిజిటల్ ఇండియా గురించి వీళ్లంతా మనల్ని ఎలా అపహాస్యం చేశారో మీకు గుర్తుండే ఉంటుంది. ప్రపంచంలోనే ప్రభావవంతమైన కరోనా వ్యాక్సిన్ ను భారత్ తయారుచేసింది. వీళ్లంతా దానిపైన కూడా ప్రశ్నలు లేవనెత్తారు. టీకా ఆధారంగా 'వ్యాక్సిన్ వార్' పేరుతో కొత్త సినిమా వచ్చిందని ఇప్పుడే నాకు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తెలిసేలా మన దేశంలో చిత్రీకరించిన ఈ సినిమా, భారత శాస్త్రవేత్తలు చేసిన అద్భుతమైన కృషి, కోట్లాది మంది దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన అంశంపై 'వ్యాక్సిన్ వార్' ను రూపొందించారు.
సోదరీ, సోదరులారా,
భారత సైన్యం చెప్పే విషయాలను, సైన్యం శౌర్యాన్ని కూడా ఈ వ్యక్తులు ప్రశ్నిస్తున్నారు. దేశ శత్రువులు, ఉగ్రవాదుల మాటలు నిజమని నమ్మే వీళ్లు.. నా దేశ ఆర్మీ, సైనికుల మాటలను విశ్వసించటం లేదు. భారత్కు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యావత్ దేశం అమృత్ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవటం మీరు చూశారు. ఇది కేవలం బీజేపీ కార్యక్రమం కాదు. దేశ కార్యక్రమం. ప్రతి భారతీయుడికి స్వాతంత్య్రం ఒక పండుగ. కానీ ఈ వ్యక్తులు ఆజాదీ కా అమృత్ కాల్ను కూడా పరిహస్యం చేస్తున్నారు. భవిష్యత్ తరాల కోసం దేశం నలుమూలలా అమృత్ సరోవర్లను నిర్మిస్తున్నాం. జల సంరక్షణకు పెద్దఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈ వ్యక్తులకు ఈ పని పట్ల కూడా విముఖత ఉంది.
నా కుటుంబ సభ్యులారా,
స్వాతంత్య్రానంతరం దేశంలో ఇన్నేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన పార్టీ గిరిజన సమాజానికి కనీస గౌరవాన్ని అందించలేదు. స్వాతంత్య్ర పోరాటం నుంచి సాంస్కృతిక వారసత్వ సంపద వరకు మన గిరిజన సమాజ పాత్ర కీలకం. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన సమాజాల్లో గోండ్ ఒకటి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఎంతో కాలం అధికారంలో ఉన్నవారు గిరిజన సమాజం చేసిన సేవలకు జాతీయ గుర్తింపు ఎందుకు ఇవ్వలేదు? బీజేపీ కోసం దేశం ఎందుకు ఎదురుచూడాల్సి వచ్చింది? మన గిరిజన యువకులకు ఈ విషయం తప్పకుండా తెలియాలి. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం గిరిజన సమాజం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను, ప్రత్యేక బడ్జెట్ను ఏర్పాటు చేసింది. గత 9 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్ను ఎన్నో రెట్లు పెంచింది. దేశానికి తొలి గిరిజన మహిళా అధ్యక్షురాలిని అందించే అవకాశం బీజేపీకి దక్కింది. భగవాన్ బిర్సా ముండా జయంతిని గిరిజన గౌరవ దినోత్సవంగా బీజేపీ ప్రకటించింది. దేశంలోనే అత్యంత ఆధునిక రైల్వేస్టేషన్లలో ఒకదానికి రాణి కమలాపతి పేరు పెట్టారు. పతల్పానీ స్టేషన్ను ఇప్పుడు జననాయక్ తంత్యా భిల్ స్టేషన్గా పిలుస్తున్నారు. గోండు సమాజానికి స్ఫూర్తిప్రదాతైన రాణీ దుర్గావతి పేరు మీద ఇంతటి అద్భుతమైన, ఆధునిక స్మారక చిహ్నాన్ని నిర్మిస్తున్నారు. గోండు సంస్కృతి, చరిత్ర, కళను కూడా ఈ మ్యూజియం ప్రదర్శిస్తుంది. రాబోయే తరాలకు గోండు సంప్రదాయం గురించి తెలిసేలా చేయటమే మా ప్రయత్నం. అంతర్జాతీయ నేతలను కలిసినప్పుడు వారికి నేను గోండు చిత్రాలను బహుమతిగా ఇస్తారు. ఈ అద్భుతమైన గోండు కళను వారు పొగిడినప్పుడు నా హృదయం ఎంతో గర్వంతో నిండిపోతుంది.
మిత్రులారా,
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దశాబ్దాల పాటు దేశంలో అధికారంలో ఉన్న పార్టీ కేవలం ఒకే ఒక్క పని చేసింది. అది కుటుంబాన్ని ఆరాధించటం. ఆ కుటుంబాన్ని పూజించటం తప్ప వాళ్లు దేశాన్ని పట్టించుకోలేదు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కేవలం ఒక కుటుంబం మాత్రమే కాదు. దేశాభివృద్ధిని ఒక కుటుంబమే సాధించలేదు. ఇది మా ప్రభుత్వం. అందరినీ గౌరవిస్తుంది. అందరి సంరక్షణను చూసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్కు సంబంధించిన స్థలాలను మహూతో సహా 'పంచతీర్థ్'గా బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని వారాల క్రితం, సాగర్లో సంత్ రవిదాస్ జీ స్మారక స్థలానికి భూమిపూజ చేసే అవకాశం లభించింది. ఇది సామాజిక సామరస్యం, వారసత్వం పట్ల బీజేపీ ప్రభుత్వ ప్రాధాన్యతను తెలియజేస్తుంది.
మిత్రులారా,
కుటుంబ పాలన, అవినీతిని పోషించిన పార్టీలు గిరిజన సమాజ వనరులను దోచుకున్నాయి. 2014 కంటే ముందు, 8-10 అటవీ ఉత్పత్తులకు మాత్రమే ఎంఎస్పీ అందించేవారు. మిగిలిన అటవీ ఉత్పత్తులను దళారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేయటంతో గిరిజనులకు ఏమీ మిగిలేది కాదు. ఈ పరిస్థితిని మేము మార్చాము. ఇవాళ సుమారు 90 అటవీ ఉత్పత్తులను ఎంఎస్పీ పరిధిలోకి తీసుకువచ్చాం.
మిత్రులారా,
మన గిరిజన రైతులు, సన్నకారు రైతులు పండించే కోడో కుట్కీ వంటి చిరుధాన్యాలకు గతంలో పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. జీ20 సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖ నాయకులు ఢిల్లీకి వచ్చారని మీకు తెలుసు. అధిక సంఖ్యలో నేతలు హాజరయ్యారు. కోడో కుట్కీతో చేసిన వంటకాలను వారికి రుచి చూపించాం. 'శ్రీ అన్న' రూపంలో కోడో కుట్కీని దేశ, విదేశాల్లోని మార్కెట్లకు చేర్చాలని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటోంది. గిరిజన, సన్నకారు రైతులకు గరిష్ఠ ప్రయోజనాలను అందించేందుకు మా ఈ ప్రయత్నం.
నా కుటుంబ సభ్యులారా,
వెనుకబడిన వర్గాలకు ప్రాముఖ్యత కల్పించటం బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి. పేదల ఆరోగ్యానికి, మహిళల సౌకర్యానికి సురక్షిత తాగునీటిని పైపుల ద్వారా సరఫరా చేయటం ముఖ్యమైనది. ఇవాళ ఇక్కడ సుమారు 1,600 గ్రామాలకు నీటి సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేశాం. మహిళల ఆరోగ్యం ఎల్లప్పుడూ దేశానికి ప్రాధాన్యతగా ఉండాలి. గతంలో ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేశారు. నారీశక్తి వందన్ అధినియం ద్వారా లోక్సభ, అసెంబ్లీలో మహిళలకు హక్కులను కల్పించే పని బీజేపీ చేసింది.
మిత్రులారా,
గ్రామ సామాజిక-ఆర్థిక జీవితానికి మా విశ్వకర్మ మిత్రులు గొప్ప తోడ్పాటును అందిస్తున్నారు. వారిని శక్తిమంతం చేయటం ఒక ప్రాధాన్యతగా ఉండాల్సింది. రూ.13 వేల కోట్ల విలువైన పీఎం విశ్వకర్మ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే తీసుకొచ్చాం.
నా కుటుంబ సభ్యులారా,
బీజేపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. అవినీతి, బంధుప్రీతి కోసం కొందరు వ్యక్తులు రకరకాల ఎత్తుగడలను వేస్తున్నారు. అయితే, అభివృద్ధి పథంలో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటుందని మోదీ హామీ ఇస్తున్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ సంకల్పాన్ని మహాకౌశల్, మధ్యప్రదేశ్ రాష్ట్రం మరింత బలపరుస్తాయని నేను విశ్వసిస్తున్నాను. మరోసారి వీర వనిత రాణీ దుర్గావతికి నా వందనాలు. మమ్మల్ని ఆశీర్వదించటానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను రాణీ దుర్గావతి అని చెప్తాను. మీరు అమర్ రహే, అమర్ రహే! అని చెప్పాలి. రాణీ దుర్గావతి - అమర్ రహే, అమర్ రహే. ఈ నినాదం మధ్యప్రదేశ్ అంతా ప్రతిధ్వనించాలి.
రాణీ దుర్గావతి - అమర్ రహే, అమర్ రహే.
రాణీ దుర్గావతి - అమర్ రహే
***
(रिलीज़ आईडी: 2200046)
आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam