పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ఇంధనం, సముద్ర వాణిజ్య సామర్థ్యంతో ముడిపడిన భారత వృద్ధి: శ్రీ హర్దీప్ సింగ్ పూరి
Posted On:
29 OCT 2025 2:06PM by PIB Hyderabad
ఇండియా మారీటైమ్ వీక్ 2025లో భాగంగా ముంబయిలో నిర్వహించిన ‘రీవైటలైజింగ్ ఇండియాస్ మారీటైమ్ మ్యాన్యుఫాక్చరింగ్ కాన్ఫరెన్స్’’లో పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ప్రసంగించారు. దేశాభివృద్ధికి ప్రధానాధారాలుగా ఉన్న ఇంధన, షిప్పింగ్ రంగాల పురోగతితో భారతీయ ఆర్థిక వృద్ధి అనుసంధానమై ఉందని ఆయన అన్నారు.
ప్రస్తుతం సుమారుగా 4.3 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని మంత్రి అన్నారు. దీనిలో దాదాపు సగం.. ఎగుమతులు, దిగుమతులు, విదేశీ చెల్లింపుల వంటి బాహ్యరంగాల నుంచే వస్తోంది. ఇది భారతీయ ఆర్థిక ప్రగతికి వాణిజ్యం, నౌకా రవాణా ఎంత ముఖ్యమైనవో తెలియజేస్తుంది.
ఇంధన రంగం గురించి మాట్లాడుతూ.. భారత్లో నాలుగున్నరేళ్ల కిందట రోజుకి 5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు వినియోగం ఉంటే.. ఇప్పుడు అది 5.6 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుందని శ్రీ పూరీ అన్నారు. ప్రస్తుత వృద్ది రేటు ప్రకారం.. త్వరలోనే ఇది రోజుకు 6 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుంటుంది. వచ్చే రెండు దశాబ్దాల్లో అంతర్జాతీయంగా పెరిగే విద్యుత్తు డిమాండ్లో 30 శాతాన్ని భారత్ తీరుస్తుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా వేసిందని వెల్లడించారు. ఇది గతంలో 25 శాతంగా ఉండేది. ఇలా పెరుగుతున్న ఇంధన డిమాండ్.. చమురు, గ్యాస్, ఇతర ఇంధన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా రవాణా చేయడానికి నౌకల అవసరాన్ని భారత్కు సహజంగానే పెంచుతుందని వెల్లడించారు.
2024-25లో దాదాపు 300 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకుందని, 65 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర ఎగుమతి చేసిందని మంత్రి వెల్లడించారు. పరిమాణం పరంగా దేశ వాణిజ్యంలో 28 శాతం వాటా ఉన్న చమురు, గ్యాస్ రంగం.. ఓడరేవుల ద్వారా ఎగుమతి, దిగుమతుల జరిగే అతి పెద్ద సరుకుగా నిలిచింది. ప్రస్తుతం ముడి చమురు అవసరాల్లో 88 శాతాన్ని, గ్యాస్ అవసరాల్లో 51 శాతాన్ని దిగుమతుల ద్వారానే భారత్ తీర్చుకుంటోందని.. ఇది దేశ ఇంధన భద్రతకు నౌకా రంగం ఎంత ప్రధానమైనదో వివరిస్తుందన్నారు.
మొత్తం దిగుమతి బిల్లుల్లో సరకు రవాణా ఖర్చులు గణనీయమైన వాటా కలిగి ఉన్నాయని మంత్రి వివరించారు. అమెరికా నుంచి ముడి చమురు రవాణా చేసేందుకు బ్యారెల్కు 5 డాలర్ల చొప్పున, మధ్యప్రాచ్యం నుంచి 1.2 డాలర్ల చొప్పున చమురు మార్కెటింగ్ కంపెనీలు చెల్లిస్తున్నాయి. గడచిన ఐదేళ్లలో.. ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ లాంటి భారత ప్రభుత్వ రంగ సంస్థలు నౌకా రవాణాకు సుమారుగా 8 బిలియన్ డాలర్లను ఖర్చు చేశాయి. ఈ మొత్తాన్ని భారత్లోనే కొత్త ట్యాంకర్లను నిర్మించుకోవడానికి ఉపయోగించవచ్చు.
దేశ వాణిజ్యంలో భారత్లో నమోదైన లేదా భారతీయ సంస్థలకు చెందిన నౌకల ద్వారా 20 శాతం మాత్రమే సరకు రవాణా జరుగుతోందని శ్రీ పూరి అన్నారు. ఇది నౌకా యాజమాన్యాన్ని, తయారీ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో భారత్కు సవాలును, అవకాశాన్ని రెండింటినీ అందిస్తోందని తెలియజేశారు. భారతీయ నౌకలకు.. దీర్ఘకాలిక రవాణా అవకాశాలను అందించేందుకు ప్రభుత్వ రంగం సంస్థల నుంచి కార్గో డిమాండును సమీకరించడం, నౌకా యాజమాన్యం, లీజు (ఎస్వోఎల్) విధానాన్ని ముందుకు తీసుకెళ్లడం, నౌకల కొనుగోలుకు తక్కువ వడ్డీకే రుణాలు అందించేందుకు సముద్ర వాణిజ్యాభివృద్ధి నిధిని ఏర్పాటు చేయడం, ఎల్ఎన్జీ, ఈథేన్, ప్రొడక్టు ట్యాంకర్లకు మద్దతు అందేలా.. నౌకా నిర్మాణ ఆర్థిక సాయం విధానం 2.0ను అమలు చేయడం తదితర చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
గడచిన పదకొండేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత సముద్ర వాణిజ్య రంగం ప్రధాన మార్పులకు గురయిందని మంత్రి అన్నారు. ఓడరేవు సామర్థ్యం 2014లో ఏడాదికి 872 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి ప్రస్తుతం 1,681 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంది. అదే సమయంలో సరకు రవాణా పరిమాణం 581 మిలియన్ టన్నుల నుంచి 855 మిలియన్ టన్నులకు చేరుకుంది. అలాగే నౌక ఓడరేవుకు వచ్చినప్పటి నుంచి తిరిగి బయలు దేరే సమయం 48 శాతం, ఎలాంటి కార్యకలాపాలు లేకుండా నిలిపి ఉంచే సమయం 29 శాతం మేర తగ్గాయని ఆయన వెల్లడించారు. పోర్టులను ఆధునికీకరించడానికి, తీర ప్రాంతాలను అనుసంధానించడానికి రూ.5.5 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను సాగర్ మాల కార్యక్రమం ద్వారా చేపడుతున్నారు.
కొచ్చిన్ షిప్యార్డ్, మజ్గావ్ డాక్, జీఆర్ఎస్ఈ కోల్కతా, హెచ్ఎస్ఎల్ విశాఖపట్నం లాంటి నౌకా నిర్మాణ కేంద్రాలు, గోవా, గుజరాత్లోని ప్రైవేటు యార్డులు అంతర్జాతీయ స్థాయి నౌకలను నిర్మిస్తున్నాయని ఆయన తెలిపారు. ఎల్ఎన్జీ, ఈథేన్ క్యారియర్స్ నిర్మాణానికి అవసరమైన అంతర్జాతీయ సాంకేతికతను దేశీయ నౌకా నిర్మాణ కేంద్రాల్లోకి తీసుకొచ్చేందుకు ఎల్ అండ్ టీ, దేవూ సంస్థలతో కొచ్చిన్ షిప్యార్డు భాగస్వామ్యాలు, మిత్సుయ్ ఓఎస్కే లైన్స్తో సహకారాలు తోడ్పడుతున్నాయి.
మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని కొనసాగించడానికి నౌకా నిర్మాణ రంగంలో దీర్ఘకాల ప్రణాళిక, స్థిరమైన ఆర్డర్లు అవసరమని మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఆరేళ్ల పాటు.. అనేక అంతర్జాతీయ షిప్యార్డులు బుక్ అయి ఉండటం వల్ల భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు, నౌకలను నిర్మించేందుకు ప్రోత్సహించాలి.
భవిష్యత్తులో సముద్ర వాణిజ్య రంగంలో సుమారుగా రూ.8 ట్రిలియన్ల పెట్టుబడులు వస్తాయని, 2047 నాటికి 1.5 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భారత పోర్టులను ఐరోపా, మధ్య ఆసియా, ఆఫ్రికాలతో అనుసంధానించి.. భారత్-మధ్య ప్రాచ్యం-తూర్పు ఐరోపా ఆర్థిక కారిడార్, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ లాంటి కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయ వాణిజ్య మార్గాలను రూపొందించడంలో దేశం కీలకపాత్ర పోషిస్తోందని వివరించారు.
తన ప్రసంగాన్ని ముగిస్తూ.. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో మహాసముద్రాలను అడ్డంకులుగా కాకుండా.. వృద్ధి, సంక్షేమానికి మార్గాలుగా భారత్ పరిగణిస్తోందని శ్రీ పూరి అన్నారు. దేశం పోర్టులను ఆధునికీకరిస్తోంది. అనేక నౌకలను నిర్మిస్తోంది. హరిత రవాణాను ప్రోత్సహిస్తోంది. యువతకు ఉద్యోగాలు కల్పిస్తోంది. అభివృద్ధి చెందిన, స్వావలంబన సాధించిన భారత్ను సాధించడంలో సముద్ర రవాణా రంగాన్ని కీలకంగా మార్చేందుకు అంతర్జాతీయ భాగస్వాములతో కలసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలియజేశారు.
***
(Release ID: 2184256)
Visitor Counter : 9