ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రభుత్వ అధినేతగా 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి
గుజరాత్ ముఖ్యమంత్రిగా 2021లో చేసిన పదవీ ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రధానమంత్రి
సదా పేదలకు సేవ చేయాలంటూ, ఎన్నడూ లంచం తీసుకోవద్దంటూ
తల్లి ఇచ్చిన ఉపదేశాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
కరవు బారిన పడ్డ రాష్ట్రంగా ఉన్న గుజరాత్ సుపరిపాలన కేంద్రంగా
మార్పు చెందిన తీరును గుర్తుచేసుకున్న ప్రధానమంత్రి
వికసిత్ భారత్ కలను నెరవేర్చడానికి మరింతగా కష్టపడతానంటూ
తన నిబద్ధతను మరోసారి చాటిచెప్పిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2025 10:52AM by PIB Hyderabad
ప్రభుత్వ అధినేతగా సేవలను అందించడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా... దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2001లో ఇదే రోజున గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణాన్ని స్వీకరించినప్పటి నుంచి తన ప్రయాణాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ప్రజల జీవనాన్ని మెరుగుపరచడంతో పాటు దేశ పురోగతికి తన వంతు పాటుపడాలన్నదే తన నిరంతర ప్రయత్నమని ఆయన అన్నారు.
ఎన్నో సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లో గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతను తనకు అప్పగించారని ప్రధానమంత్రి తెలిపారు. ఆ సంవత్సరంలో భయంకర భూకంపం సంభవించడంతో రాష్ట్రం విలవిల్లాడుతోంది. అంతకు ముందు కాలంలో రాష్ట్రం ఒక పెను తుపాను బారిన పడింది. ఆ తర్వాత వరుసగా దుర్భిక్షం, రాజకీయ అస్థిరతలు ఎదురయ్యాయి. ఈ సవాళ్లు ప్రజలకు సేవ చేయాలన్న, కొత్త ఉత్సాహంతోనూ, ఆశతోనూ గుజరాత్ ను పునర్నిర్మించాలన్న తన సంకల్పాన్ని మరింత బలపరిచాయని ఆయన అన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ సమయంలో తల్లి చెప్పిన మాటలు తన మదిలో మెదిలాయని శ్రీ మోదీ అన్నారు. పేదల కోసమే ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉండాలి... ఎట్టి పరిస్థితుల్లోనూ లంచం తీసుకోకూడదు.. అని తన మాతృమూర్తి తనతో చెప్పారని ఆయన అన్నారు. తాను ఏది చేసినా సదుద్దేశంతోనే చేస్తాననీ, సమాజంలో చిట్టచివరి పంక్తిలో నిలబడ్డ వ్యక్తికి కూడా సేవ చేయాలనే భావనే తనకు స్ఫూర్తిని ఇస్తోందనీ చెబుతూ… తాను ఈ మేరకు ప్రజలకు భరోసా ఇచ్చానన్నారు.
గుజరాత్లో తాను అధికారంలో ఉన్న కాలాన్ని ప్రధానమంత్రి గుర్తు చేస్తూ... గుజరాత్ కు పునర్వైభవం రాదని అప్పట్లో ప్రజలు భావించినట్లు తెలిపారు. కరెంటు లేదనీ, నీళ్లు అందడం లేదనీ రైతులు బాధపడేవాళ్లు. వ్యవసాయం సంకటంలో పడిందనీ, పారిశ్రామిక అభివృద్ధి నిలిచిపోయిందనీ నాతో మొరపెట్టుకునేవాళ్లు. అయితే, సమష్టి కృషితో గుజరాత్ సుపరిపాలనకు కేంద్రంగా మారిందని ఆయన అన్నారు. ఒకప్పుడు కరవు గుప్పిట్లో ఉన్న రాష్ట్రం కాస్తా వ్యవసాయ పరంగా అగ్రగామిగా మారిందనీ, వ్యాపారం విస్తరించి తయారీ రంగానికీ, పారిశ్రామికతకూ మార్పు జరిగిందన్నారు. సామాజిక, భౌతిక మౌలిక సదుపాయాల ఊతం లభించిందన్నారు.
2013వ సంవత్సరంలో, పాలనాపరమైన సంక్షోభంతో దేశం సతమతం అవుతున్న కాలంలో... 2014 లోక్ సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబడే బాధ్యతను తనకు అప్పగించారని ప్రధానమంత్రి అన్నారు. దేశ ప్రజలు తన సంకీర్ణానికీ, తన పార్టీకి పూర్తి ఆధిక్యాన్ని ఇచ్చారనీ, తద్వారా ప్రజలు సరికొత్త విశ్వాసానికీ, పాలనకూ అవకాశమిస్తూ...కొత్త యుగానికి నాందీ ప్రస్తావన చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
గత 11 ఏళ్లలో భారత్ అనేక గొప్ప మార్పులను చూసిందని ప్రధానమంత్రి తెలిపారు. 25 కోట్ల కన్నా ఎక్కువ మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం, ప్రపంచంలో ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒక ఆకర్షణీయ కేంద్రంగా మారిందని చెప్పారు. అన్నదాతలూ, మహిళలూ, యువత- సరికొత్త ప్రయత్నాలు, సంస్కరణలతో సాధికారులయ్యారని అన్నారు.
భారత్ను అన్ని రంగాల్లో స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దడమే ప్రజల బలబమైన కోరికగా ఉందని, ‘ఇది స్వదేశీ అని గర్వంగా ప్రకటిద్దాం’ అన్న నినాదంలో ఈ భావనను చూడొచ్చన్నారు.
దేశ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకం, చూపిస్తున్న ఆప్యాయతకు కృతజ్ఞతను తెలుపుతూ, దేశానికి సేవ చేయటం అత్యున్నత గౌరవమని ప్రధానమంత్రి అన్నారు. రాజ్యాంగ విలువల మార్గదర్శకత్వంలో వికసిత్ భారత్ కలను సాకారం చేసేందుకు నిబద్ధతతో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ పోస్టుల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“2001లో ఈ రోజున నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. ఒక ప్రభుత్వాధినేతగా నేను 25వ వసంతంలోకి అడుగుపెడుతున్నాను. భారత ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇన్నేళ్లలో ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు, దేశ పురోగతికి నిరంతరం కృషి చేశాను.”
"రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా పార్టీ గుజరాత్ ముఖ్యమంత్రిగా నాకు బాధ్యతలు అప్పగించింది. ఆ ఏడాది భారీ భూకంపం సంభవించింది. అంతకుముందు సంవత్సరాల్లో పెను తుపాను, కరువు, రాజకీయ అస్థిరత ఏర్పడ్డాయి. ప్రజలకు సేవ చేయాలనే ఆశను, గుజరాత్ ను పునర్నిర్మించాలనే నా సంకల్పాన్ని ఆనాటి సవాళ్లు మరింత బలపరిచాయి.”
"ముఖ్యమంత్రిగా నేను ప్రమాణస్వీకారం చేసినప్పుడు మా తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాను- నీ పని గురించి నాకు అంతగా అవగాహన లేదు, కానీ రెండు విషయాలు గుర్తుంచుకో. మొదటిది, మీరు ఎప్పుడూ పేద ప్రజల కోసం పనిచేయండి. రెండోది, ఎప్పుడూ అవినీతికి పాల్పడకండి. నేను చేసే ప్రతీ పని అత్యుత్తమ సంకల్పంతో, ప్రతి ఒక్కరికీ సేవ చేయాలనే లక్ష్యంతో ప్రేరణ పొందుతానని ప్రజలకు చెప్పాను.”
“ఈ 25 ఏళ్ల ప్రయాణం ఎన్నో అనుభవాలతో కూడినది. చెప్పుకోదగిన పురోగతిని సాధించాం. నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, గుజరాత్ ఎప్పటికీ వృద్ధిలోకి రాదనుకున్నారు. సాధారణ పౌరులు, రైతులు.. విద్యుత్, నీటికొరతపై ఫిర్యాదు చేసేవారు. వ్యవసాయ రంగంలో పురోగతి లేదు. పారిశ్రామిక వృద్ధి స్తంబించింది. మేమంతా సమిష్టిగా కృషి చేసి గుజరాత్ ను సుపరిపాలనకు కేంద్రంగా మార్చాం.”
“కరువు ప్రాంతమైన గుజరాత్ వ్యవసాయంలో అగ్రస్థానంలో నిలిచింది. వాణిజ్యం విస్తరించి, పారిశ్రామిక, తయారీ సామర్థ్యాలు పెరిగాయి. తరచూ విధించే కర్ఫ్యూలు కనుమరుగయ్యాయి. సామాజిక, భౌతిక మౌలిక సదుపాయాలకు ప్రోత్సాహం లభించింది. ఇవన్నీ సాధించేందుకు ప్రజలతో కలిసి పనిచేయటం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది.”
“2014 లోక్ సభ ఎన్నికలకు ప్రధానమంత్రి అభ్యర్థిగా నన్ను 2013లో ప్రకటించారు. ఆ రోజుల్లో దేశం పాలనాపరమైన సంక్షోభంలో ఉంది. అప్పటి యూపీఏ ప్రభుత్వం అవినీతి, కుటుంబపాలన, విధాన పక్షపాతానికి ఉదాహరణగా మారింది. ప్రపంచవ్యాప్తంగా భారత్ బలహీన దేశంగా ఉంది. ఆ సమయంలో దేశ ప్రజలు వివేకంతో ఆలోచించి మా కూటమికి అత్యుత్తమ మెజారిటీని అందించటమే కాక, మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా మా పార్టీకి సంపూర్ణ మెజారిటీని అందించారు”.
“గత 11 ఏళ్లుగా దేశ ప్రజలతో కలిసి అనేక మార్పులు తీసుకువచ్చాం. మనం చేపట్టిన విప్లవాత్మక ప్రయత్నాలు దేశ ప్రజలను.. ముఖ్యంగా మహిళా శక్తిని, యువ శక్తిని, రైతులను సాధికారత దిశగా నడిపించాయి. 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ వెలుగొందుతోంది. ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రతా పథకాలకు ప్రపంచంలోనే అతి పెద్ద నిలయంగా భారత్ అవతరించింది. రైతులు నూతన ఆవిష్కరణలు చేస్తూ, దేశం స్వయం సమృద్ధిని సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ గా నిలిపేందుకు అన్ని రంగాల్లో విస్తృతమైన సంస్కరణలు చేపట్టాం. ఈ సంస్కరణలు 'ఇది స్వదేశీ అని గర్వంగా ప్రకటిద్దాం' అనే పిలుపుని ప్రతిబింబిస్తాయి.”
“మరోసారి దేశ ప్రజలకు, వారు నాపై పెట్టుకున్న నమ్మకం, చూపిన ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మన దేశానికి సేవ చేయడం నాకు అత్యున్నత గౌరవం. ఇది నాకు కృతజ్ఞత, సంకల్పంతో కూడిన కర్తవ్యం. రాజ్యాంగ విలువల ఆధారంగా రాబోయే కాలంలో వికసిత్ భారత్ కలను సాకారం చేసేందుకు నేను మరింతగా కృషి చేస్తాను.”
***
(రిలీజ్ ఐడి: 2176085)
సందర్శకుల సూచీ సంఖ్య : : 34
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Nepali
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam