|
ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీలో ‘భారత్ టెక్స్-2024’ను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
26 FEB 2024 4:01PM by PIB Hyderabad
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ పీయూష్ గోయల్, శ్రీ దర్శన జర్దోష్, వివిధ దేశాల రాయబారులు, సీనియర్ దౌత్యవేత్తలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, ఫ్యాషన్-వస్త్ర ప్రపంచ సహచరులు, యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, నేత కార్మికులు-చేతివృత్తులవారు, ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా! భారత్ మండపంలో నిర్వహిస్తున్న ‘భారత్ టెక్స్’ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు! ఇవాళ్టి ఈ కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దేశంలోని రెండు అతిపెద్ద ప్రదర్శన కేంద్రాలైన ‘భారత్ మండపం’, ‘యశోభూమి’ ఏకకాలంలో దీనికి ఆతిథ్యం ఇస్తుండటమే ఆ ప్రత్యేకత. ఇందులో 3,000 మందికిపైగా ఉత్పత్తిదారులు, 100 దేశాల నుంచి దాదాపు 3,000 మంది కొనుగోలుదారులు సహా 40,000 మందికిపైగా వాణిజ్య సందర్శకులు పాలుపంచుకోవడం విశేషం. నేటి ఈ కార్యక్రమం వస్త్ర పరిశ్రమావరణ వ్యవస్థలోని యావత్ భాగస్వాములను ఒక వేదికపై నిలపడం ముదావహం.
మిత్రులారా!
ఈ కార్యక్రమం కేవలం వస్త్ర ప్రదర్శనకు పరిమితం కాదు... ఇంకా అనేక కీలకాంశాలు దీనితో ముడిపడి ఉన్నాయి. ఈ ఘనతర భారత చరిత్రను నేటి ప్రతిభతో పెనవేసే సూత్రమే భారత్ టెక్స్. సాంకేతికత-సంప్రదాయాల సమ్మేళనమేగాక శైలి, సుస్థిరత, నైపుణ్యం, స్థాయులను ఒక్కటిగా అనుసంధానించేదే భారత్ టెక్స్! ఒక మగ్గం అనేక దారపు పోగులతో వస్త్రానికి రూపమిచ్చే రీతిలో జాతీయ, అంతర్జాతీయ వర్ణవైవిధ్యాల కలనేతగా భారత్ టెక్స్ను అభివర్ణించవచ్చు. అలాగే నా దృష్టిలో భారతీయ ఆలోచనల వైవిధ్యానికి మాత్రమేగాక వాటిని ఒకే దారంతో బంధించే సాంస్కృతిక ఐక్యతకూ ఈ ప్రదేశం ఒక వేదికైంది. కాశ్మీర్లోని కానిహామా గ్రామ ‘కానీ’ శాలువాలు.. ఉత్తరప్రదేశ్లోని చికంకారీ, జర్దోసీ, బనారసి పట్టు.. గుజరాత్లోని పటోలా, కచ్ ఎంబ్రాయిడరీ... తమిళనాడులోని కాంచీవరం.. ఒడిశాలోని సంబల్పురి, మహారాష్ట్రలోని పైథానీ వంటి వస్త్ర సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవి. భారత వస్త్ర తయారీ రంగ పురోగమనాన్ని కళ్లకు కట్టే ఈ ప్రదర్శనను నేనిప్పుడే చూస్తున్నాను. భారత వస్త్ర రంగం చరిత్ర, సామర్థ్యాల వైభవాన్ని ఇది మన ఎదుట ఆవిష్కరిస్తుంది.
మిత్రులారా!
నేటి ఈ ప్రదర్శనకు హాజరైన వస్త్రోత్పత్తి వ్యవస్థలోని వివిధ విభాగాల భాగస్వాములు భారత వస్త్ర రంగాన్ని చక్కగా అర్థం చేసుకోగలరు. మా ఆకాంక్షలు-సవాళ్లకూ మీరు సుపరిచితులే. పెద్ద సంఖ్యలో ఇక్కడున్న మా నేత, చేతివృత్తుల సహచరులంతా ఈ ఉత్పత్తి వ్యవస్థతో క్షేత్రస్థాయి నుంచి సంధానితులే. వీరిలో అనేకమంది తరతరాల నుంచీ అనుభవం ఉన్నవారే! మరో 25 ఏళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపొందాలని సంకల్పించిన సంగతి మీకందరికీ తెలిసిందే. పేదలు, యువతరం, రైతులు, మహిళలే ఈ ‘వికసిత భారత్’ మూలస్తంభాలు. భారత్ వస్త్ర రంగం ఈ నాలుగు స్తంభాలతో అనుసంధానితం కాబట్టి, భారత్ టెక్స్ వంటి కార్యక్రమాలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటాయి.
మిత్రులారా!
‘వికసిత భారత్’ స్వప్న సాకారంలో వస్త్ర రంగ సహకారం పెంచేందుకు మేం విస్తృతంగా కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా సంప్రదాయం, సాంకేతికత, ప్రతిభ, శిక్షణలపై దృష్టి సారించాం. నేటి ఫ్యాషన్ డిమాండ్లకు తగినట్లు సంప్రదాయ పద్ధతుల ఆధునికీకరణతోపాటు డిజైన్ల పునర్నవీకరణకూ ప్రాధాన్యమిస్తున్నాం. ఈ మేరకు ‘5 ఎఫ్’ సూత్రంతో వస్త్రోత్పత్తి వ్యవస్థలోని అంశాలన్నటినీ పరస్పరం అనుసంధానిస్తున్నాం. ‘భారత్ టెక్స్’ కొనసాగినన్ని రోజులూ 50 మంది నిపుణులు మీకు ‘5 ఎఫ్’ గురించి పలుమార్లు వివరించడం ద్వారా మిమ్మల్ని ఆ సూత్రానికి సుపరిచితులను చేస్తారు. అంతేకాదు... మీరు ప్రదర్శనశాలకు వెళ్లినా ఆ ‘5 ఎఫ్’లు మీకు సదా కనిపిస్తూనే ఉంటాయి. అంటే- ఫార్మ్ (పొలం), ఫైబర్ (దారం), ఫాబ్రిక్ (వస్త్రం), ఫ్యాషన్ (రూపం), ఫారిన్ (విదేశాలు) అనే ‘5ఎఫ్’లు ఏదో ఒక విధంగా మీకు దర్శనమిస్తాయి. ఈ సూత్రం ప్రాతిపదికగా రైతులు, నేత కార్మికులు, ‘ఎంఎస్ఎంఈ’లు సహా ఎగుమతిదారులను మేం అనుక్షణం ప్రోత్సహిస్తున్నాం. ముఖ్యంగా ‘ఎంఎస్ఎంఈ’ల కోసం పలు కీలక చర్యలు తీసుకున్నాం. పెట్టుబడి, టర్నోవర్ పరంగా వాటి నిర్వచనాన్ని సవరించాం. దీనివల్ల ఆ పరిశ్రమల పరిమాణం పెరిగినా వాటికి ప్రభుత్వ పథకాల ప్రయోజనం లభిస్తుంది. అలాగే చేతివృత్తుల వారికి, మార్కెట్కు మధ్య దూరం తగ్గించడంతోపాటు ప్రత్యక్ష అమ్మకాలు, ప్రదర్శనలు, ఆన్లైన్ వేదికల వంటి సదుపాయాలు పెంచాం.
మిత్రులారా!
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ‘పీఎం మిత్ర’ (ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ రీజియన్ అండ్ అపారల్) పేరిట త్వరలో 7 పార్కులు ఏర్పాటవుతాయి. మీలాంటి సహ భాగస్వాములకు ఈ ప్రణాళిక ఎంత కీలక అవకాశాలను అందుబాటులోకి తెస్తుందో మీరు ఊహించవచ్చు. వస్త్రోత్పత్తితో ముడిపడిన యావత్ వ్యవస్థను ఒకేచోట తీర్చదిద్దడమే దీని పరమార్థం. ఇక్కడ తక్షణ ఉత్పత్తి సౌకర్యాలతో ఆధునిక, సమీకృత, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు లభిస్తాయి. దీనివల్ల కార్యకలాపాల స్థాయి పెరగడమేగాక రవాణా వ్యయం కూడా కలిసివస్తుంది.
మిత్రులారా!
జౌళి-దుస్తుల రంగం దేశవ్యాప్తంగా అనేక మందికి ఉపాధి కల్పిస్తుందన్న వాస్తవం మీకందరికీ తెలిసిందే. పొలం నుంచి ‘ఎంఎస్ఎంఈ’లు... ఎగుమతుల దాకా ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గణనీయ భాగంతోపాటు మహిళలు కూడా ఈ రంగంలో భాగస్వాములే. దుస్తులు తయారీలోగల ప్రతి 10 మందిలో ఏడుగురు మహిళలు కాగా, చేనేత రంగంలో ఈ నిష్పత్తి మరింత అధికంగా ఉంటుంది. జౌళితోపాటు ఖాదీ రంగం కూడా మా దేశంలోని మహిళలకు సాధికారతనిచ్చింది. గడచిన 10 సంవత్సరాల్లో మా కృషి ఫలితంగా ఖాదీ రంగం అటు ప్రగతి, ఇటు ఉపాధి రెండింటికీ మార్గంగా మారిందని నేను ఘంటాపథంగా చెప్పగలను. అంటే- గ్రామాల్లో లక్షలాది ఉద్యోగాల సృష్టికి ఖాదీ దోహదం చేస్తోంది. అదేవిధంగా గత దశాబ్దంలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించింది. ఇదే కాలంలో దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి మా వస్త్ర రంగానికి గణనీయ ప్రయోజనం చేకూర్చింది.
మిత్రులారా!
ప్రపంచంలో పత్తి, జనుము, పట్టు ఉత్పత్తి చేసే ప్రధాన దేశాల్లో నేడు భారత్ ఒకటిగా మారింది. రైతులు లక్షలాదిగా కార్యకలాపాల్లో నిమగ్నం కాగా, ప్రభుత్వం వారికి విశేష మద్దతునిస్తూ లక్షలాది క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తోంది. ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ‘కస్తూరి కాటన్’ సాగు భారత్కు తనదైన గుర్తింపును సృష్టించే దిశగా కీలక ముందడుగు వేస్తోంది. మరోవైపు జనుము పండించే రైతులతోపాటు వాటితో వస్తు తయారీలోగల కార్మికుల కోసం కూడా మేం కృషి చేస్తున్నాం. అలాగే పట్టు రంగం పురోగమనం దిశగా నిరంతరం కొత్త కార్యక్రమాలు చేపడుతున్నాం. ముఖ్యంగా ‘గ్రేడ్ 4ఎ’ పట్టు ఉత్పత్తిలో స్వావలంబన సాధన దిశగా కృషిని ముమ్మరం చేశాం. సంప్రదాయ రంగాలు సహా భారత్ మరింత ప్రగతి సాధించాల్సిన రంగాలనూ మేం ప్రోత్సహిస్తున్నాం. ఉదాహరణకు సాంకేతిక వస్త్ర రంగంలో మేం వేగంగా ముందంజ వేస్తున్నాం. ఈ వస్త్ర విభాగం ఎంత విస్తృతమైనదో అందరికీ తెలిసిందే కాబట్టి, ఈ రంగంలో మా సామర్థ్యం పెంచేందుకు ‘నేషనల్ టెక్నికల్ టెక్స్ టైల్స్ మిషన్’ను ప్రారంభించాం. ఇందుకోసం దేశీయంగానే యంత్రాలు-పరికరాలను ఆవిష్కరించాలని ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో తగు మార్గదర్శకాలు కూడా జారీచేశాం. సాంకేతిక వస్త్ర విభాగంలో అంకుర సంస్థలకు అవకాశాలు మెండుగా ఉన్నందున, దీనిపైనా మార్గదర్శకాలు రూపొందించాం.
మిత్రులారా!
నేటి ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణలకే కాకుండా విశిష్టత, ప్రామాణికతలకూ డిమాండ్ అపారం. అందుకు తగిన అవకాశాలు కూడా తగినంతగా అందుబాటులో ఉన్నాయి. హస్తకళా డిజైన్ లేదా వస్త్రాల అంశం ప్రస్తావనకు వచ్చినపుడల్లా ఇతరుల తయారీకన్నా మన కళాకారుల ఉత్పత్తులు కొంత భిన్నమనే భావన చాలా సందర్భాల్లో ప్రస్ఫుటం అవుతూంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పరస్పరం భిన్నంగా కనిపించాలని ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో అటువంటి కళకు డిమాండ్ కూడా ఇనుమడిస్తుంది. అందువల్ల, ఇప్పుడు ఉత్పత్తి పరిమాణం పెరుగుదలతోపాటు ఈ రంగంలో దేశీయ నైపుణ్యం అవసరాన్ని కూడా మేం స్పష్టం చేస్తున్నాం. తదనుగుణంగా ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ’ (నిఫ్ట్) నెట్వర్క్ దేశంలోని 19 సంస్థలకు విస్తరించింది. వాటి పరిసర ప్రాంతాల నేత కార్మికులు, చేతివృత్తుల వారిని కూడా వాటితో సంధానిస్తున్నాం. సరికొత్త పోకడలు, సాంకేతికతలపై వారికి అవగాహన పెంచేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య వికాసం లక్ష్యంగా ‘సమర్థ్ యోజన’ కార్యక్రమం అమలు చేస్తున్నాం. దీనికింద ఇప్పటిదాకా 2.5 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా, వారిలో అధికశాతం మహిళలే. అంతేగాక వీరిలో 1.75 లక్షల మందికిపైగా వివిధ పరిశ్రమలలో నియమితులయ్యారు.
మిత్రులారా!
గడచిన దశాబ్దంలో “స్థానికం కోసం నినాదం” పేరిట మేం మరో కొత్త కోణాన్ని జోడించాం. దీనికితోడు ఇవాళ దేశవ్యాప్తంగా ఈ నినాదం “స్థానికం నుంచి ప్రపంచం వైపు” ఉద్యమంగా మారింది. చిన్న చేతివృత్తులవారు, కళాకారులు, కుటీర పరిశ్రమలకు జాతీయ స్థాయి ప్రకటనలకు, మార్కెటింగ్కు తగిన ఆర్థిక స్తోమత లేదన్న వాస్తవం మీకు తెలిసిందే. అందుకే, మీరు వారి కోసం ప్రకటనలిచ్చినా, ఇవ్వకపోయినా మోదీ ఆ పని చేస్తాడు. ఎవరి హామీ లభించని వారికి మోదీయే హామీగా నిలుస్తాడు. అందుకే, ఇలాంటి నా సహచరుల కోసం దేశవ్యాప్త ప్రదర్శనలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
మిత్రులారా!
ఈ రంగం వృద్ధిపై సుస్థిర, ప్రభావశీల విధానాల రూపకల్పనలో ప్రభుత్వ కృషి సానుకూల ప్రభావం చూపడం స్పష్టంగా కనిపిస్తుంది. దేశీయ వస్త్ర మార్కెట్ విలువ 2014లో రూ.7 లక్షల కోట్లకన్నా తక్కువ కాగా, నేడు రూ.12 లక్షల కోట్లు దాటింది. గడచిన పదేళ్లలో దేశవ్యాప్తంగా నూలు, వస్త్ర, దుస్తుల ఉత్పత్తి 25 శాతం పెరుగుదల నమోదైంది. ఈ రంగంలో నాణ్యత నియంత్రణకూ ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తుండటంతో 2014 నుంచి రూపొందిన దాదాపు 380 ‘బీఐఎస్’ ప్రమాణాలు ఇప్పుడు అమలులో ఉన్నాయి. ప్రభుత్వం ఇన్ని విధాలుగా కృషి చేస్తున్నందు వల్ల ఈ రంగంలో విదేశీ పెట్టుబడులు 2014కు ముందు పదేళ్లతో పోలిస్తే నిరంతరం పెరుగుతూ గత పదేళ్లలో దాదాపు రెట్టింపయ్యాయి.
మిత్రులారా!
భారత జౌళి రంగం శక్తిసామర్థ్యాలేమిటో మేం తెలుసుకున్నాం... కాబట్టే, దీనిపై నాకెన్నో ఆశావహ అంచనాలున్నాయి. వారేం సాధించగలరో కోవిడ్ సమయంలో నిరూపించారు. ముఖ్యంగా ‘పీపీఈ కిట్లు’, ‘మాస్కుల’ కొరతతో ప్రపంచమంతా సతమతం అవుతున్న సమయంలో భారత జౌళి రంగం ముందంజ వేసింది. తదనుగుణంగా యావత్ వస్త్రోత్పత్తి వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రభుత్వం, వస్త్ర రంగం పరస్పర సహకారంతో కృషి చేశాయి. తద్వారా రికార్డు సమయంలో దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా తగిన పరిమాణంలో మాస్కులు, పీపీఈ కిట్లు సరఫరా అయ్యాయి. కాబట్టే, భారత్ను ప్రపంచానికి వస్త్ర ఎగుమతి కూడలిగా మార్చాలనే మా లక్ష్యాన్ని వీలైనంత త్వరగా సాధించగలమని నేను విశ్వసిస్తున్నాను. ఈ దిశగా మీకు ఎలాంటి చేయూత అవసరమైనా ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉంటుంది. ఇది నిజంగా ప్రశంసార్హమే అయినా, మీ సంఘాలు చెల్లాచెదరుగా ఉన్నాయని నేనిప్పటికీ భావిస్తున్నాను. వాటిని పూర్తిస్థాయిలో ఏకతాటిపైకి తేగల మార్గమేమిటి? లేదంటే ఏదో ఒకరంగం ప్రతినిధులు వచ్చి, తమ సమస్యలు ఏకరవు పెట్టి, ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకుని పారిపోతారు. అటుపైన మరొక రంగం... పూర్తి విరుద్ధమైన రీతిలో మరో రకమైన డిమాండ్తోనూ వస్తుంది. కాబట్టి, అటువంటి విరుద్ధాంశాలు మీ వైపు నుంచి ఉంటే, ఆ పరిస్థితి ఏదో ఒకదానికి తోడ్పడుతూ, మరొకదాన్ని కష్టనష్టాల్లోకి నెడుతుంది. అందుకే మీరంతా ఏకమై సమస్యలను ముందుకు తెచ్చి, అన్ని విషయాలనూ సమగ్రంగా చర్చించుకుని ముందడుగు వేయవచ్చు. అందుకే మిమ్మల్ని ఈ దిశగా ప్రోత్సహించాలని నేను భావిస్తున్నాను.
మిత్రులారా!
రెండో అంశం ప్రపంచంలో వస్తున్న మార్పులు... అయితే, ఈ మార్పులు ఎలాంటివైనా మనం శతాబ్దాల నుంచీ ముందంజలో ఉన్నాం. ఉదాహరణకు॥ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆహారం సహా సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ, సమగ్ర జీవనశైలిలో ప్రాథమిక అంశాలకు తిరిగి మళ్లుతోంది. దుస్తుల విషయంలోనూ ఇదే ధోరణి వైపు ప్రపంచ ప్రజానీకం మొగ్గు చూపుతోంది. వారిప్పుడు దుస్తులు ధరించే ముందు ఒకటికి 50 సార్లు ఆలోచిస్తారు. రసాయన ఆధారిత రంగుల ప్రభావమేమిటో, సహజ వర్ణాలతో రూపొందిన దుస్తులు లభిస్తాయో లేదో తెలుసుకోవాలని భావిస్తున్నారు. రంగులతో నిమిత్తం లేకుండా పత్తి, నూలు తయారు చేయవచ్చో లేదో వారు తెలుసుకుంటున్నారు. ప్రపంచం ఇలా విభిన్న డిమాండ్లు, మార్కెట్లతో కూడినదైనప్పుడు మనం చేయాల్సిందేమిటి? వాస్తవానికి భారత్ సాక్షాత్తూ ఓ పెద్ద విపణి... ప్రజలు దుస్తుల కొలతలను కాస్త మార్చుకుంటున్నా మార్కెట్ పరిమాణం ఇంకా భారీగానే ఉంది. దుస్తుల కొలతలు రెండుమూడు అంగుళాలు తగ్గించుకోవచ్చు... కాబట్టే, దేశం వెలుపలికి చూడాలన్న కోరిక ఉండదు. మన దేశంలోనే ఇంత పెద్ద విపణి ఉన్నపుడు మనకింకా కావాల్సిందేముంది? అన్న ధోరణి కనిపిస్తోంది. కానీ, ఈ రోజు ప్రదర్శనలో అన్నిటినీ కూలంకషంగా పరిశీలించి, ఆ భావన నుంచి విముక్తం కావాలని మిమ్మల్ని కోరుతున్నాను.
ఆఫ్రికా మార్కెట్కు ఎలాంటి వస్త్రాలు అవసరమో, అక్కడి ప్రజలు ఎటువంటి వర్ణ సమ్మేళనం కోరుకుంటున్నారో, ఏ సైజులు ఇష్టపడతారో మీలో ఎవరైనా.. ఎప్పుడైనా అధ్యయనం చేశారా? “మేం అలాంటిదేదీ చెయ్యం.. అక్కడి నుంచి ఆర్డర్ వచ్చింది.. దాని ప్రకారం తయారు చేశాం.. అంతే”నంటారా? నాకు తెలిసినంత వరకూ ఆఫ్రికా ప్రజలు కొంచెం వదులుగా ఉండే దుస్తులను ఇష్టపడతారు. కానీ, మన విషయంలో వదులు లేదా బిగుతు అన్నది వినియోగదారు కొలతలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి, మనం వాడే ‘కుర్తాలు’ వారి అభిరుచికి తగినవి కావు. ఈ వాస్తవాన్ని గ్రహించిన సురేంద్రనగర్ వాస్తవ్యుడైన ఒక చేనేత కళాకారుడు ఇలా విభిన్నంగా యోచించి, ఆఫ్రికాను దృష్టిలో పెట్టుకుని కాస్త వదులుగా దుస్తులు రూపొందించాడు. అలాగే రంగులను కూడా అక్కడి వినియోగదారుల అభిరుచి ప్రకారం ఎంచుకున్నాడు. అంతేగాక ఈ రకం దుస్తులను మధ్యలో ఎక్కువగా కుట్టే అవసరం ఉండదు. ఆఫ్రికా మార్కెట్లలో ఈ వస్త్రాలకు విశేష ప్రాచుర్యం లభించిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఈ తరహా దుస్తులను మనం వాడే వాటికి భిన్నంగా ఒకేవైపు కుడితే సరిపోతుంది.. కాబట్టి, ఇలాంటి అంశాలను కొంచెం లోతుగా శోధించాలని నా సలహా!
ఈ ప్రదర్శనలో నేనొక విషయం గమనించాను... ఐరోపాతోపాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన జిప్సీ సమాజం ధరించే దుస్తులు మన కొండ ప్రాంతాలు లేదా రాజస్థాన్, గుజరాత్ సరిహద్దులలోని ప్రజల దుస్తుల తరహాలో సహజ వర్ణాలతో తయారు చేసినవిగా ఉంటాయి. వాటి రంగుల ఎంపిక కూడా ఒకే విధంగా ఉంటుంది. మరి... జిప్సీ ప్రజల అవసరాలకు తగినట్లు దుస్తుల తయారీతో ఆ పెద్ద మార్కెట్లను సద్వినియోగం చేసుకోవడానికి మీలో ఎవరైనా.. ఎప్పుడైనా ప్రయత్నించారా? ఈ దిశగా మనం ఆలోచించాలి.. ప్రపంచానికి ఇదే అవసరమని ఎలాంటి ఫీజు లేకుండా మీకు ఈ సలహా ఇస్తున్నాను. ప్రస్తుతం ఇక్కడి భారీ ప్రదర్శనలో రసాయన పరిశ్రమ ప్రాతినిధ్యం లేకపోవడం నేను గమనించాను. అయితే, రసాయన పరిశ్రమతో నిమిత్తం లేకుండా ఏదైనా వస్త్రాన్ని మనం మార్కెట్లోకి తీసుకెళ్లగలమా? మీ వస్త్రోత్పత్తి వ్యవస్థలో ఆ పరిశ్రమకూ స్థానమిచ్చి ఉంటే బాగుండేదని నా భావన. ఇక సహజ రంగుల సరఫరాలో పోటీ ఉండాలి.. కూరగాయల నుంచి తయారుచేసే రంగుల సరఫరాదారులు ఎవరైనా ఉన్నారా? దీన్ని మనం ప్రపంచ విపణిలో ప్రవేశపెడదాం. ముఖ్యంగా మన ఖాదీ వస్త్రాలకు ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఆక్రమించగల సామర్థ్యం ఉంది. కానీ, ఈ వస్త్రాన్ని మనం స్వాతంత్ర్య ఉద్యమానికి లేదా ఎన్నికల వేళ రాజకీయ నాయకులు ధరించే దుస్తులకు పరిమితం చేశాం. అయితే, దీనికి సంబంధించి నేనొక సాహసం చేశాను.. ఇలా ఎందుకు అంటున్నానంటే- నేను నివసించిన సమాజం, కార్యక్రమ నిర్వహణ వేదిక అలాంటివి కాబట్టే ఇదొక సాహసం!
ఈ మేరకు 2003 అక్టోబరు 2న పోర్బందర్లో ఫ్యాషన్ ప్రదర్శన నిర్వహించాం. మన దేశంలో ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తే, కనీసం ఓ అయిదారుగురు నల్ల జెండాలతో నిరసన తెలపడం నేటికీ మనం చూస్తుంటాం. ఈ నేపథ్యంలో 2003నాటి పరిస్థితి ఎలాంటిదై ఉంటుందో మీరు ఊహించవచ్చు. రాజకీయ నాయకులతో ముడిపడిన ఖాదీతో అక్టోబరు 2 నాటికి విభిన్న డిజైన్లతో వస్త్రాలు రూపొందించాలని అప్పట్లో గుజరాత్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వారిని కోరాను. సామాన్యుల వస్త్రధారణలో మార్పు తేవాలన్నది నా లక్ష్యమని కూడా వివరించాను. అటుపైన గాంధీజీ, వినోబాజీతో కలిసి స్వాతంత్ర్య్య ఉద్యమంలో పనిచేసిన గాంధీవాదులందరినీ కాస్త ప్రయత్నంతో ఆహ్వానించాను. ఫ్యాషన్ ప్రదర్శనలో “వైష్ణవ్ జన్ తో తేనే కహియే” గీతాన్ని వినిపిస్తూ, ఆధునిక ఖాదీ దుస్తులతో బాలలు పాల్గొనేలా చేశాం. అప్పుడు నా పక్కనే ఆసీనులైన వినోబాజీ సహచరుడు భావ్జీ (ఇప్పుడు కీర్తిశేషులు)- “ఖాదీ గురించి మేమెన్నడూ ఇలా ఆలోచించ లేదు. ఖాదీకి ప్రాచుర్యం కల్పించే నిజమైన మార్గం ఇదే” అన్నారు. ఇలాంటి వినూత్న ప్రయోగాల ఫలితంగా ఖాదీ నేడు ఏ స్థాయికి చేరిందో మీరు గమనించారా? అయితే, ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తం కాకపోయినా, దేశమంతటా వేగంగా విస్తరిస్తోంది. మిత్రులారా... మనం దృష్టి సారించాల్సిన ఉదాహరణలు ఇలాంటివెన్నో ఉన్నాయి. వస్త్ర చరిత్రలో అంతర్జాతీయంగా భారత్ ముద్ర శక్తిమంతమైనది. మనం ఢాకా మస్లిన్ గురించి ఒకప్పుడు చర్చించుకునే వాళ్లం. మొత్తం వస్త్రాన్ని ఒక ఉంగరంలో దూర్చగలిగేలా తయారుచేసే నైపుణ్యం దాని ప్రత్యేకత. ఆ కథలనే ఇప్పటికీ వల్లె వేసుకుంటూ ఉండిపోదామా? వస్త్ర సాంకేతిక పరిజ్ఞాన సంబంధిత యంత్ర తయారీ దిశగా పరిశోధించలేమా? మన ఐఐటీలు, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులతోపాటు ఎందరో అనుభవజ్ఞులైన నిపుణులు ఇలాంటివెన్నో చేయగలరు.
మీ ముందున్న వజ్రాల పరిశ్రమ ఇందుకు సరైన ఉదాహరణ. ఈ రంగంలో ఉన్నవారి అవసరాలకు తగినట్లుగా ప్రతి యంత్రాన్ని రూపొందించారు. ఈ పరిశ్రమలో వజ్రాల కటింగ్, పాలిషింగ్ పనులు భారత్ తయారీ యంత్రాలతోనే సాగుతున్నాయి. వస్త్ర రంగంలోనూ ఉద్యమ తరహాలో మనం ఆ విధంగా చేయలేమా? ఈ దిశగా మీరొక పోటీ నిర్వహించండి... తక్కువ విద్యుత్తు వినియోగంతో ఎక్కువ ఉత్పత్తి సహా వివిధ రకాల వస్తు తయారీకి అనువైన సరికొత్త యంత్రాన్ని రూపొందించిన వారికి అద్భుతమైన సత్కారం చేయండి. మనకిది సాధ్యంకాదా!
కాబట్టి, మిత్రులారా... ఏదైనా సరికొత్తగా ఆలోచించండి... ఇందులో భాగంగా ఆఫ్రికా దేశాల్లో మన మార్కెట్ విస్తరణకు తగిన వస్త్ర రకాలపై సమగ్ర పరిశోధన, అధ్యయనం, నివేదికల రూపకల్పన అంశాన్ని పరిశీలిద్దాం. ఐరోపా దేశాలకు ఏ రకమైన వస్త్రాలు అవసరం? ఆరోగ్య స్పృహ గలవారికి ఎలాంటి దుస్తులు కావాలి? అలాంటి వస్త్రవిశేషాలను మనమే ఎందుకు సృష్టించకూడదు? మనం ఎన్నడైనా ప్రపంచం కోసం ఒక బ్రాండ్ను సృష్టించామా? ముఖ్యంగా వైద్య వృత్తి, ఆస్పత్రులు, ఆపరేషన్ థియేటర్లు తదితరాలతో ముడిపడిన వారికి అవసరమైన వస్త్రాల మాటేమిటి? ఒకసారి వాడి, వదిలివేసే అలాంటి వస్త్రాలకు విస్తృత మార్కెట్ ఉంది కదా? ఎంత పెద్ద ఆపరేషన్ అయినా రోగికి ఏ మాత్రం అసౌకర్యం కలిగించని భారత్ తయారీ దుస్తుల అంతర్జాతీయ బ్రాండ్ను మనం ఎప్పుడైనా సృష్టించామా? అసలు అలాంటిది మనకు సాధ్యమా? మిత్రులారా... ఇలా ప్రపంచ స్థాయిలో ఆలోచించండి. మన దేశంలో ఈ రంగం విస్తృతి అపారం... లక్షలాది ప్రజల ఉపాధి దీనితోనే ముడిపడి ఉంది. కాబట్టి, ప్రపంచ ఫ్యాషన్లను అనుకరించడం కాకుండా ప్రపంచాన్నే మన ఫ్యాషన్తో నడిపిద్దాం రండి! ఫ్యాషన్ ప్రపంచంలో మనకు విశేషానుభం ఉంది... అదేమీ మనకు కొత్త కాదు... మీరు కోణార్క్ లోని సూర్య దేవాలయాన్ని ఒకసారి సందర్శించండి. వందల ఏళ్ల కిందట చెక్కిన అక్కడి విగ్రహాల వస్త్రాలంకరణను గమనించండి... నేటి ఆధునిక యుగంలోనూ అవి అధునాతనంగా కనిపిస్తాయి. అవి శతాబ్దాల కిందటే సృజనాత్మక శిల్పులు ‘రాతిమీద నేసిన’ అద్భుత వస్త్ర విశేషాలు!
ఇవాళ మన ఇంటి ఆడపిల్లలు చేతిలో పర్సులు పట్టుకుని తిరగడం ఒక అందమైన ఫ్యాషన్లా కనిపిస్తుంది. కానీ, శతాబ్దాల కిందట మలచిన కోణార్క్ శిల్పాల్లో మీరు దీన్ని గమనించవచ్చు. వివిధ ప్రాంతాల్లో తలపాగాలు వివిధ రకాలుగా ఎందుకున్నాయి? మన దేశంలో ఒకప్పుడు మహిళలు పాదం అంగుళం మేర కూడా కనిపించని వస్త్ర ధారణనే ఇష్టపడేవారు. అయితే, నేలమీది నుంచి 6-8 అంగుళాల ఎత్తు వరకూ శరీరం కనిపించేలా దుస్తులు ధరించే వృత్తులలోనూ కొందరుండేవారు. ఇదంతా చూస్తే- మన దేశంలోనూ ఫ్యాషన్ విస్తృతంగా ఉండేదని మనకు అర్థమవుతుంది. పశుపోషణ రంగంలో వాడే దుస్తులను ఒకసారి గమనించండి... మన దేశంలో వస్త్రధారణ ఆయా వృత్తులకు అనుగుణంగా ఉండేదని మనకు అవగతం అవుతుంది. అలాగే ఎడారి ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి బూట్లు ఎలా ఉంటాయి? పొలాల్లో శ్రమించే లేదా పర్వత ప్రాంతాల్లో నివసించే వారి పాదరక్షలు ఎలా ఉంటాయి? శతాబ్దాల నాటి ఈ డిజైన్లు మీరు భారత్లో నేటికీ విస్తృతంగా చూడవచ్చు. కానీ, అంతటి విశాల దృష్టి, సునిశిత ఆలోచన దృక్పథం మనలో కనిపించడం లేదు.
అయితే, మిత్రులారా!
ఇందులో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు... ఎందుకంటే- ప్రతిదాన్నీ ధ్వంసం చేయడంలో మనం నిపుణులం. కాబట్టి, సాధ్యమైనంత వరకూ జన జీవనంలో జోక్యాన్ని ప్రభుత్వం మానుకోవాలన్నది నా ఆకాంక్ష. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో ప్రభుత్వం వేలు పెట్టడాన్ని నేను ఎన్నటికీ అంగీకరించను. జన జీవనంలో నిత్యం, అడుగడుగునా ప్రభుత్వ పాత్ర ఎందుకుండాలి? కాబట్టి, ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండే సమాజాన్ని సృష్టిద్దాం. అయితే, పేదలకు చేయూత కావాల్సినపుడు ప్రభుత్వం అక్కడుండటం తప్పనిసరి. పేద బాలుడి విద్యా, వైద్య అవసరాలను ప్రభుత్వమే తీర్చాలి. కానీ, మిగిలిన అంశాలన్నిటా ప్రభుత్వ జోక్యాన్ని నేను పదేళ్లుగా వ్యతిరేకిస్తూనే ఉన్నాను... మరో ఐదేళ్లు కూడా కచ్చితంగా దీనికి కట్టుబడి ఉంటాను.
నేనిప్పుడు ఎన్నికల దృష్టితో మాట్లాడటం లేదు మిత్రులారా... ప్రభుత్వం ఒక ఉత్ప్రేరకంగా మాత్రమే ఉండాలన్నది ఇక్కడ నా అభిప్రాయం. మీ కలల సాకారంలో అవరోధాలను తొలగించడం దాని బాధ్యత.. మేమున్నది అందుకే కాబట్టి, అదే తీరున పనిచేస్తాం. ఇదంతా అలా ఉంచి- సాహసంతో.. సరికొత్త దృక్పథంతో ముందడుగు వేయండి... యావత్ ప్రపంచంపై దృష్టి నిలపండి.. దేశంలో వస్తు విక్రయం వీలు కాకపోతే తడబడకండి... లోగడ రూ.100 కోట్ల విలువైన వస్తువులు అమ్మితే, ఇప్పుడు రూ.200 కోట్లకు పెరగాలనే ఉచ్చులో చిక్కుకోవద్దు. గతంలో ఎగుమతులను వర్తమానంతో పోల్చి చూడండి... ఇంతకుముందు 100 దేశాలకు ఎగుమతి అయితే, ఇప్పుడు 150 దేశాలకు మన ఉత్పత్తులు వెళ్తున్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా 200 నగరాల స్థాయి నుంచి ఇవాళ 500 నగరాల స్థాయికి పెరిగాయని గుర్తుంచుకోండి. లోగడ ప్రపంచవ్యాప్తంగా ఒకే ప్రత్యేక మార్కెట్కు వెళ్లే పరిస్థితి ఉండగా, ఇప్పుడు మనం 6 కొత్త మార్కెట్లలో ఉనికిని దృఢంగా చాటుకుంటున్నాం. ఇదెలా సాధ్యమైందో ఒకసారి యోచించండి.. మీ ఎగుమతుల వల్ల దేశానికి దుస్తులు కరవైపోతాయన్న చింత వద్దు... ఇక్కడి ప్రజలకు దుస్తుల కొరతేమీ రాదని గ్రహించండి.
అనేకానేక ధన్యవాదాలు...
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి స్వేచ్ఛానువాదం మాత్రమే.
***
(रिलीज़ आईडी: 2173534)
|