ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ప్రపంచ వ్యవసాయ ఆహార విలువ శ్రేణిలో భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తూ విజయవంతంగా ముగిసిన వరల్డ్ ఫుడ్ ఇండియా 2025
భారతదేశ అతిపెద్ద ఆహార, వ్యవసాయ సదస్సుకు 95 వేలమందికి పైగా హాజరు
భారతదేశ ఆహార విలువ వ్యవస్థల విస్తరణకు చేతులు కలిపిన విదేశీ ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు
ప్రపంచ కొనుగోలుదారుల నుంచి ఆసక్తితో పాటు నాణ్యతకు,
భద్రతకు విధానపరమైన ప్రోత్సాహంతో సముద్ర ఉత్పత్తుల పరిశ్రమకు ఊపు
విధాన, పారిశ్రామిక చర్చల్లో సుస్థిరత, పోషణ, నూతన తరం ఆహారాలపైనే దృష్టి
Posted On:
29 SEP 2025 9:55AM by PIB Hyderabad
భారత ఆహార శుద్ధి పరిశ్రమల (ఫుడ్ ప్రాసెసింగ్) రంగం ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తూ, ఢిల్లీ ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో నాలుగు రోజులపాటు జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 సదస్సు నేటితో ముగిసింది. రష్యా ఉప ప్రధానమంత్రి శ్రీ దిమిత్రి పాత్రుషెవ్, కేంద్ర మంత్రులు శ్రీ చిరాగ్ పాశ్వాన్, శ్రీ ప్రతాపరావు జాదవ్, ఫుడ్ ప్రాసెసింగ్, రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ రవనీత్ సింగ్ సమక్షంలో ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ సదస్సు ఆహారం, వ్యవసాయ పరిశ్రమల భవిష్యత్తుపై చర్చించడానికి ప్రపంచ నాయకులు, విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలను ఒకచోట చేర్చింది.
ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోదీ తమ ప్రారంభోపన్యాసంలో, భారతదేశ వ్యవసాయ వైవిధ్యం, పెరుగుతున్న మధ్యతరగతి డిమాండ్, 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం, మెగా ఫుడ్ పార్కులు వంటి ప్రభుత్వ కార్యక్రమాలను పేర్కొంటూ విశ్వసనీయ ప్రపంచ ఆహార సరఫరాదారుగా భారత్ పాత్రను ప్రముఖంగా వివరించారు. ప్రధానమంత్రి ఈ సందర్భంగా, పీఎంఎఫ్ఎమ్ఈ పథకం కింద రూ. 2,518 కోట్ల విలువైన మైక్రో ప్రాజెక్టుల కోసం 26,000 మంది లబ్ధిదారులకు క్రెడిట్ రుణ ఆధారిత సబ్సిడీలను కూడా విడుదల చేశారు. క్షేత్ర స్థాయి పారిశ్రామికవేత్తలకు సాధికారిత కల్పించాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఇది సూచిస్తుంది.
వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 సదస్సు సందర్భంగా భారత ఆహార శుద్ధి పరిశ్రమల రంగంలో రూ. 1,02,000 కోట్లకు పైగా విలువైన అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇవి ఈ రంగంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద పెట్టుబడి ఒప్పందాలలో ప్రధానమైనవి. ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రముఖ శాస్త్రీయ, పరిశోధనా సంస్థలైన నిఫ్టెమ్-టి, నిఫ్టెమ్-కెతో కూడా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా సాంకేతికత బదిలీ, ఫుడ్ ఫోర్టిఫికేషన్, న్యూట్రాస్యూటికల్స్, స్టార్టప్, ఇంక్యుబేషన్ వంటి రంగాలలో భాగస్వామ్యాలకు మద్దతు లభించింది.
కేంద్ర మంత్రులు శ్రీ నితిన్ గడ్కరీ, శ్రీ చిరాగ్ పాశ్వాన్ సహ అధ్యక్షతన జరిగిన సీఈఓల రౌండ్టేబుల్ సమావేశానికి, ప్రముఖ భారతీయ, బహుళజాతి కంపెనీలకు చెందిన 100 మందికి పైగా సీఈఓలు హాజరయ్యారు. ఈ సమావేశంలో సుస్థిరమైన పెట్టుబడులు, బయోడిగ్రేడబుల్ ప్యాకేజింగ్, వ్యర్థాల వినియోగం, బ్లూ ఎకానమీ సామర్థ్యం, లాజిస్టిక్స్, రవాణా రంగంలో సంస్కరణల ద్వారా ఖర్చులను తగ్గించి పోటీతత్వాన్ని పెంపొందించడం వంటి అంశాలను ప్రధానంగా చర్చించారు.
ప్రభుత్వాల స్థాయిలో జరిగిన వరస సమావేశాలు భారతదేశ అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేశాయి. రష్యా, శ్రీలంక, మొరాకో, మాల్దీవులు, పోర్చుగల్, న్యూజిలాండ్, జింబాబ్వే, ఉగాండా, ఎస్వటిని, కోట్ డి ఐవోయిర్, కువైట్ ప్రతినిధి బృందాలు భారత ప్రతినిధులతో సమావేశమై వ్యవసాయ, ఆహార శుద్ధి రంగాలలో సహకార విస్తరణకు గల మార్గాలను అన్వేషించాయి. ఈ చర్చలు ప్రపంచ వ్యవసాయ ఆహార విలువ వ్యవస్థల్లో భారతదేశాన్ని ఒక విశ్వసనీయ భాగస్వామిగా నిలబెట్టాయి.
వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 సాంకేతిక అజెండా కూడా అంతే పటిష్టంగా ఉంది. ఇందులో భాగస్వామ్య రాష్ట్రాలు, ప్రాధాన్యతా రాష్ట్రాలు, మంత్రిత్వ శాఖలు, అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమల సంఘాల ద్వారా నలభైకి పైగా సమావేశాలు జరిగాయి. వీటిలో పెంపుడు జంతువుల ఆహారం, న్యూట్రాస్యూటికల్స్, మొక్కల ఆధారిత ఆహారాలు, ఆల్కహాలిక్ పానీయాలు, ప్రత్యేక ఆహార పదార్థాల రంగాలలో అవకాశాలను చర్చించారు. మూడో గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్లో రిస్క్ మేనేజ్మెంట్కు డిజిటల్ సాధనాలు, తదుపరి తరం నియంత్రణ నైపుణ్యాలు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా ఆహార భద్రత, ఊబకాయం సమస్య పరిష్కారానికి పోషకాహార ఆధారిత వ్యూహాలపై విస్తృత చర్చలు జరిగాయి.
నాలుగు రోజుల పాటు జరిగిన సదస్సులో పరిశ్రమలు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 10,500కు పైగా బీ2బీసమావేశాలు, 261 జీ2జీ సమావేశాలు, 18,000కుపైగా కొనుగోలు, అమ్మకందార్ల (రివర్స్ బయ్యర్–సెల్లర్) సమావేశాలు జరిగాయి. 95వేలమందికి పైగా హాజరుకావడం ఈ సదస్సు ప్రాధాన్యతను, దానిపై ప్రజల ఆసక్తిని చాటింది.
వరల్డ్ ఫుడ్ ఇండియాకు సమాంతరంగా, 24వ ఇండియా ఇంటర్నేషనల్ సీఫుడ్ ప్రదర్శనను కేంద్ర మంత్రి శ్రీ చిరాగ్ పాస్వాన్ సెప్టెంబర్ 25న ప్రగతి మైదాన్లో ప్రారంభించారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ నిర్వహించిన ఈ ప్రదర్శనలో భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యాన్ని వెలికితీయడంపై దృష్టి సారిస్తూ, ఉపన్యాసాలు, రౌండ్టేబుల్ సమావేశాలు, సాంకేతిక సదస్సులు, కొనుగోలు, అమ్మకందార్ల సమావేశాన్ని నిర్వహించారు.
ఆహార శుద్ధి, ఆవిష్కరణ, సుస్థిరమైన పద్ధతులకు ప్రపంచ కేంద్రంగా భారతదేశం ఆవిర్భవిస్తోందని వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 మరోసారి ధృవీకరించింది. రికార్డు స్థాయిలో పెట్టుబడులు, బలపడిన అంతర్జాతీయ భాగస్వామ్యాలు, వ్యవసాయ ఆహార విలువ వ్యవస్థల్లో భారత్ ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యానికి బలమైన అనుసంధానంతో, ఈ రంగంలో భవిష్యత్ వృద్ధికి, అంతర్జాతీయ సహకారానికి ఈ సదస్సు పటిష్టమైన పునాది వేసింది.
***
(Release ID: 2172924)
Visitor Counter : 18