ప్రధాన మంత్రి కార్యాలయం
బీహార్ ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన’ లబ్ధిదారులతో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి పథకాలన్నీ మహిళల సంక్షేమం, వారి సాధికారతకేనని
స్పష్టం చేసిన ప్రధానమంత్రి
సమాజంలో సకారాత్మక మార్పును తీసుకురావడంలో ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలపై మహిళలు
తమ స్ఫూర్తిదాయక కథలను పంచుకోవాలంటూ ప్రధానమంత్రి పిలుపు
Posted On:
26 SEP 2025 2:49PM by PIB Hyderabad
బీహార్కు చెందిన ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన లబ్ధిదారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య మాధ్యమంలో మాట్లాడారు.
తమ ప్రాంతంలో మార్పును తీసుకువచ్చినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి శ్రీ నీతీశ్ కుమార్కు బీహార్లోని పశ్చిమ చంపారణ్ జిల్లాకు చెందిన గిరిజన మహిళ శ్రీమతి రంజీతా కాజీ మనసారా కృతజ్ఞతలు తెలిపారు. ఆమె జీవికా స్వయంసహాయ బృందం సభ్యురాలు. తాముంటున్న అటవీ ప్రాంతంలో ఒకప్పుడు కనీస సదుపాయాలు కూడా లేవనీ, అదే ప్రాంతంలో ఇప్పుడు విద్య, నీళ్లు, కరెంటు, పారిశుధ్యం, రోడ్లు సమకూరినట్లు ఆమె ప్రస్తావించారు. పంచాయతీ రాజ్ సంస్థల్లోనూ, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం పెరిగేట్లు రిజర్వేషనును అమల్లోకి తీసుకురావడం సహా మహిళా కేంద్రీకృత కార్యక్రమాల్ని చేపట్టినందుకు బీహార్ ముఖ్యమంత్రికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. యూనిఫారాలు, సైకిళ్ల పథకాలను ఆమె ప్రశంసించారు. బాలికలు స్కూలు యూనిఫారాలను ధరించి సైకిళ్లను నడపడాన్ని చూస్తే తనకు సంతోషంగా ఉంటుందని ఆమె చెప్పారు.
ఉజ్వల యోజనను అమలు చేస్తున్నందుకు ప్రధానమంత్రిని రంజీత అనే మహిళ కొనియాడారు. ఈ పథకంలో మహిళలకు తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్లు అందాయి. ఈ పథకం రావడంతో, వారు పొగబారే వంటిళ్లలో కాలం గడపనక్కరలేకుండా పోయింది. వారి ఆరోగ్యం కూడా బాగుపడింది. అలాగే గృహనిర్మాణ పథకం కూడా మేలైందేననీ, ఈ పథకం కారణంగా ప్రస్తుతం తాను ఓ పక్కా ఇంట్లో ఉంటున్నానన్నారు.
పింఛన్లను రూ.400 నుంచి రూ.1,100కు పెంచడంతో పాటు 125 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇటీవల తీసుకున్న నిర్ణయాలను ఆమె అభినందించారు. ఈ నిర్ణయాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేవేనన్నారు. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనలో భాగంగా, మొదట అందజేసే రూ.10,000 డబ్బుతో జొన్న, సజ్జ పంట కోసం ఒక పంప్ సెట్టును కొనాలనుకుంటున్నట్లు చెప్పారు. ఆ తరువాత రూ.2 లక్షలతో పిండి తయారీ వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి పెట్టుబడిగా పెట్టాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. దేశవాళీ ధాన్యాలను ప్రోత్సహించాలన్నదే తన ధ్యేయమన్నారు.
ఇలాంటి సహాయక చర్యలు మహిళల బతుకుదెరువుకు ఊతాన్నిచ్చి వారు లక్షాధికారి అక్కచెల్లెళ్లుగా మారడానికి తోడ్పడతాయని రంజీతా తేల్చిచెప్పారు. తమ ప్రాంత మహిళలు నవరాత్రితో పాటే ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనను కూడా ఒక పండగలా చేసుకుంటున్నారని ఆమె తెలిపారు. పశ్చిమ చంపారణ్లో అక్కాచెల్లెళ్లందరి పక్షాన నేతలిద్దరికీ వారు అందిస్తున్న నిరంతర మద్దతుకు గాను ఆమె హృదయపూర్వక ధన్యవాదాలనూ, ఆత్మీయ అభినందనలనూ తెలియజేశారు.
భోజ్పుర్ జిల్లాకు చెందిన మరో లబ్ధిదారు శ్రీమతి రీతా దేవి ఆరా పట్టణ మహిళలందరి తరఫున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి శ్రీ నీతీశ్ కుమార్కు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. 2015లో స్వయంసహాయ బృందంలో చేరడంతో మొదలైన తన సాధికారత ప్రయాణాన్ని ఆమె తెలియజేశారు. అప్పట్లో ‘భయ్యా పహల్’ లో భాగంగా తాను రూ.5,000 అందుకున్నానన్నారు. ఆ డబ్బుతో, ఆమె నాలుగు మేకలను కొనడంతో జీవనోపాధికి బాటను వేసుకున్నట్లు చెప్పారు. మేకల పెంపకం ద్వారా సంపాదించిన డబ్బును ఉపయోగించి 50 కోళ్లను కొని, కోడిగుడ్లను అమ్మే వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఒక్కొక్క గుడ్డును 15 రూపాయల ధరను ఖరారు చేశానన్నారు. కోడిపిల్లలు పెద్దవిగా అవడానికి వాటిని ఒక చేపల తొట్టిలో ఉంచి అందులోకి వెలుగు పడే ఏర్పాటు చేసి ఒక కొత్త ఆలోచన చేసినట్లు ఆమె వివరించారు. ఈ క్రమంలో తమ కుటుంబం ఆర్థిక స్థితి చెప్పుకోదగిన స్థాయిలో మెరుగుపడిందన్నారు.
రీతాదేవి ఇప్పుడు తాను ఒక లక్షాధికారి సోదరిగానే కాకుండా డ్రోన్ సోదరిగా కూడా ఎదిగినట్లు సంతోషంతో చెబుతూ, తాను ఎంతగా వృద్ధిలోకి వచ్చిందో చాటారు. పల్లెల్లోని వారికీ, ఇతర ప్రాంతాల నివాసులకూ కూడా ఎంతో సంతోషాన్నీ, పనీపాటులనూ అందించే ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన’ను ప్రారంభించినందుకు ప్రధానమంత్రికీ, ముఖ్యమంత్రికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.
జిల్లా అంతటా మహిళలు వివిధ వాణిజ్య కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. కొందరు పశువుల పెంపకాన్నీ, మరికొందరు మేకల పెంపకాన్నీ, మరికొంతమంది గాజుల దుకాణాలనూ చేపట్టారు. రీతా తనకు ముందుగా అందిన రూ.10వేల వాయిదా మొత్తంతో, చలికాలంలో కోడిగుడ్ల గిరాకీ పెరిగే కారణంగా ఆ అవసరాన్ని తీర్చడానికి గాను 100 కోళ్లను కొన్నారు. తరువాత ఇచ్చే రూ.1 లక్షల సాయంతో ఆమె తన సొంత కోళ్ల ఫారాన్ని ఏర్పాటు చేశారు. వ్యాపారాన్ని పెంచుకోవడానికి అవసరమైన యంత్రాలను కూడా అమర్చుకున్నారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన సహా ఇతర ప్రభుత్వ పథకాలు ఎంత ఉపయోగంగా ఉన్నదీ ఆమె తెలియజేశారు. ఇదివరకు వర్షాకాలంలో తన కచ్చా ఇంట్లో వాననీళ్లు కారుతూ ఇబ్బంది పడేవాళ్లమనీ, ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలయ్యాక తమకు పక్కా ఇల్లు అమరిందనీ ఆమె చెప్పారు. స్వచ్ఛ్ భారత్ మిషన్లో భాగంగా టాయిలెట్లను నిర్మించడంతో మార్పు చోటుచేసుకుందనీ, మహిళలు కాలకృత్యాలను తీర్చుకోవడానికి ఇక పొలాల వైపునకు వెళ్లనక్కరలేదన్నారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో టాయిలెట్ సౌకర్యం ఉందని ఆమె చెప్పారు. నల్-జల్ పథకం రావడంతో, పల్లెవాసులు పరిశుభ్రమైన తాగునీటికి నోచునకున్నారనీ, వారి ఆరోగ్యం బాగుపడిందన్నారు.
ఉజ్వల యోజనతో తనకు గ్యాస్ కనెక్షన్ లభించిందని రీతాదేవి తెలిపారు. ఇక తాను సాంప్రదాయక పొయ్యిపై వండడం మానేశాననీ, ఆ పొయ్యి నుంచి వచ్చే పొగను భరించడం కష్టమన్నారు. ఇప్పుడిక ఎంచక్కా హాయిగా గ్యాస్ పొయ్యి మీద వండుకోగలుగుతున్నానని ఆమె చెప్పారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు పథకాన్ని కూడా ఆమె ప్రశంసించారు. ఈ కార్డు చేతిలోకి రావడంతో, రూ.5 లక్షల వరకు వైద్య చికిత్స.. పైసా అయినా ఖర్చుపెట్టకుండానే.. ఉచితంగా లభిస్తుందన్నారు. 125 యూనిట్ల వరకు కరెంటు ఎలాంటి రుసుమూ కట్టనవసరం లేకుండా ఉచితంగా అందుతుండడం ఒకప్పుడు మసక చీకట్లో మగ్గుతూ ఉండే ఇళ్లలోకి వెలుగును తీసుకొచ్చిందనీ, పిల్లలు ఎలాంటి దిగులూ పడకుండా చదువుకోగలుగుతున్నారనీ ఆమె చెప్పారు.
ప్రభుత్వ పథకాల ద్వారా మహిళలు ప్రయోజనాన్ని పొందినప్పుడు, వారి పిల్లలకు కూడా ప్రయోజనం కలుగుతుందని ఆమె స్పష్టం చేశారు. గతంలో మహిళలు చదువు కోసం చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేదనీ, కానీ ఇప్పుడు వారి పిల్లలకు సైకిళ్ళు, పాఠశాల యూనిఫాంలూ అందుతున్నాయన్నారు. తానూ సైకిల్, యూనిఫాం అందుకున్నట్లు గుర్తుచేసుకున్న రీటా.. దాని వల్ల తాను గర్వంగా పాఠశాలకు వెళ్లగలిగానన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలన్నింటి కోసం ఆమె ఇరువురు నేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా స్పందిస్తూ.. పథకాలను, వాటి ప్రయోజనాలను స్పష్టంగా, వేగంగా వివరించిన రీటాదేవిని ప్రశంసించారు. ఆమె విద్యా నేపథ్యం గురించి ప్రధానమంత్రి అడగగా.. జీవికా గ్రూపులో చేరిన తర్వాతే తన చదువు ప్రారంభించానని రీటా బదులిచ్చారు. తాను ఇంతకుముందు మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఏదీ పూర్తి చేయలేదనీ.. కానీ ఇప్పుడు గ్రామీణాభివృద్ధిలో ఎంఏ చదువుతున్నానని రీటా తెలిపారు. జిల్లాలోని అందరు దీదీల తరపున కృతజ్ఞతలు, ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఆమె తన ప్రసంగాన్ని ముగించారు.
గయా జిల్లాలోని బోధ్ గయా మండలం జికాటియా గ్రామంలో నివసించే నూర్జహాన్ ఖాతూన్ స్థానిక గులాబ్ జీ వికాస్ స్వయం సహాయక బృందం అధ్యక్షురాలు. జిల్లాలోని మహిళలందరి తరపున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్లకు ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద మహిళలకు మొదటి విడతగా రూ. 10,000 అందించడం పట్ల ఆమె ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రకటన ఇంటింటా, గ్రామగ్రామాల్లో ఉత్సాహానికీ, చర్చకూ దారితీసిందని, మహిళలు తమకు కావలసిన జీవనోపాధిని ప్లాన్ చేసుకుంటున్నారని ఆమె ఉత్సాహంగా తెలిపారు.
ప్రస్తుత టైలరింగ్ దుకాణ విస్తరణలో భాగంగా ఈ రూ. 10,000 ఖర్చు చేసి దుస్తులను ప్రదర్శించేందుకు, విక్రయించేందుకు వీలుగా ఉండే ఒక పెద్ద కౌంటర్ను తయారుచేయిస్తానని నూర్జహాన్ తెలిపారు. గతంలో గ్రామం వెలుపల పనిచేసిన, నైపుణ్యం గల దర్జీ అయిన తన భర్తతో కలిసి ఆమె ఇప్పుడు దుకాణాన్ని నడుపుతున్నారు. ఇప్పటికే పది మందికి ఉపాధి కల్పించారు. తనకు రూ. 2 లక్షల సహాయం అందితే తన వ్యాపారాన్ని మరింత విస్తరించి, అదనపు యంత్రాలను కొనుగోలు చేయాలని, మరో పది మంది వ్యక్తులకు ఉపాధి కల్పించాలని యోచిస్తున్నట్లు ఆమె తెలిపారు.
మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి నిరంతరం చేస్తున్న ప్రయత్నాలను ఆమె ప్రశంసించారు. 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం ప్రభావాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇది ఆమె ఇంటికి వచ్చే కరెంటు బిల్లును పూర్తిగా తొలగించిందన్నారు. దీని ద్వారా పొదుపు చేసిన డబ్బును ఇప్పుడు తన పిల్లల ట్యూషన్ ఫీజులకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. గతంలో అధిక బిల్లుల కారణంగా విద్యుత్ కనెక్షన్లను రద్దు చేసుకున్న నిరుపేద మహిళల ఇళ్ళు కూడా ఇప్పుడు కరెంటు వెలుగులతో నిండాయని, వారి పిల్లలు ఆ విద్యుత్ వెలుగుల కింద చదువుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
గతంలోని సవాళ్లను గుర్తుచేసుకుంటూ.. స్వయం సహాయక బృందంలో చేరడానికి మహిళలు చాలా అరుదుగా ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారని, కుటుంబ సభ్యుల నుంచి ప్రతిఘటన ఎదుర్కొనేవారని నూర్జహాన్ గుర్తుచేసుకున్నారు. కొందరు గృహ హింసను కూడా ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రస్తుత కుటుంబాలు మహిళలను బయటకు వచ్చి ఆదాయం లభించే పని చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాయని ఆమె అన్నారు. ఉపాధి, శిక్షణ కార్యకలాపాల కోసం బయటకు వెళ్ళినప్పుడు ఆమె కుటుంబం ఆనందిస్తోందని చెప్పారు. మాస్టర్ టైలర్ అయిన తన భర్త సహాయంతో ఇతరులకు శిక్షణ ఇవ్వాలనే కోరికను నూర్జహాన్ వ్యక్తం చేశారు.
గతంలో తన భర్తే ఇంటికి ఏకైక ఆధారం అనుకున్నామనీ, ఇప్పుడు ఆయనే తనను ఇంటికి "లఖ్పతి" అని గర్వంగా పిలుస్తున్నాడని ఆమె సంతోషంగా చెప్పారు. పేదరికం, పూరి గుడిసె స్థాయి నుంచి ఎదిగి.. ఇప్పుడు మంచి ఇంట్లో నివసిస్తున్నామని తెలిపిన ఆమె.. గయా జిల్లాలోని మహిళలందరి తరపున ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆమె వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. నూర్జహాన్ ఖాతూన్ స్పష్టత, హృదయపూర్వక వివరణను ప్రశంసించారు. వివిధ గ్రామాలను సందర్శించి, అక్కడ 50–100 మంది మహిళలను సమీకరించి తన అనుభవాలను పంచుకోవడం కోసం వారంలో ఒక రోజు కేటాయించాలని నూర్జహాన్ను కోరారు. ఆమె కథ ఇతరులకు శక్తిమంతమైన ప్రేరణగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. నూర్జహాన్ను హృదయపూర్వకంగా అభినందిస్తూ.. ఆమె కృషికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
భవానీపూర్ నివాసి, ముస్కాన్ స్వయం సహాయక బృంద కార్యదర్శి శ్రీమతి పుతుల్ దేవి మాట్లాడుతూ పూర్నియా జిల్లా ప్రజల తరపున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద రూ. 10,000 అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం తాను లడ్డూ మొదలైన మిఠాయిలు అమ్మే దుకాణాన్ని నడుపుతున్నాననీ.. ఇప్పుడు టిక్రీ, బాలుషాహి, జలేబీ, బర్ఫీలను కూడా విక్రయిస్తూ దుకాణాన్ని విస్తరించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. కష్టపడి పనిచేసి రూ.2 లక్షల ఆర్థిక సహాయానికీ అర్హత సాధించాలనే తన దృఢ సంకల్పాన్ని ఆమె ప్రకటించారు. ఇది వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి, అదనపు సిబ్బందిని నియమించుకోవడానికి తనకు సహాయపడుతుందన్నారు.
కొత్తగా ప్రారంభించిన జీవికా బ్యాంకు ప్రయోజనాలనూ పుతుల్ దేవి ప్రధానంగా ప్రస్తావించారు. దీని నుంచి తక్కువ వడ్డీకే రుణాలు పొందడం ద్వారా తన ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు. స్వదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించాలన్న ప్రధానమంత్రి పిలుపును అనుసరిస్తూ దేశ బలానికి తోడ్పడటం గర్వంగా ఉందని పుతుల్ దేవి తెలిపారు. తన అత్తగారి పింఛను రూ. 400 నుంచి రూ. 1,100కి పెరిగిందనీ, 125 యూనిట్ల వరకు కరెంటు వినియోగం ఉచితంగా అందించడం పట్ల ఆమె తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇది డబ్బు ఆదా చేయడానికి, తన పిల్లల విద్యలో పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుందని ఆమె సంతోషంగా తెలిపారు. పూర్నియాలోని అన్ని కుటుంబాలకు ఆనందం, శ్రేయస్సును తెచ్చిన పథకాలను ప్రవేశపెట్టినందుకు ఆమె ఇరువురు నేతలకూ కృతజ్ఞతలు తెలిపారు.
ఆమె వ్యాఖ్యలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందిస్తూ.. వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు ఆమె కుటుంబం నుంచి గానీ.. సమాజం నుంచి గానీ మొదట్లో ఏవైనా సవాళ్లను ఎదుర్కొన్నారా అని అడిగారు. చాలా మంది తన ప్రయత్నాలను ఎగతాళి చేశారనీ.. అయినప్పటికీ దృఢ సంకల్పంతో లడ్డూలు, బటాషా తయారీతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించానని పుతుల్ దేవి బదులిచ్చారు. జీవికలో చేరిన తర్వాత ఇల్లు కట్టుకోవడానికి, కతిహార్లో ప్రభుత్వ ప్రాయోజిత బీ.టెక్ డిగ్రీ చదువుతున్న తన బిడ్డను చదివించడానికి ఆమె రుణం తీసుకున్నారు.
ఆమె జలేబీ గురించి మాట్లాడటాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మిఠాయి ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉండేదని ప్రధానమంత్రి నవ్వుతూ అన్నారు. ఆమెను హృదయపూర్వకంగా అభినందించిన ప్రధానమంత్రి.. ఆమె స్ఫూర్తిదాయకమైన కథకు ధన్యవాదాలు తెలిపారు.
***
(Release ID: 2171956)
Visitor Counter : 10