ప్రధాన మంత్రి కార్యాలయం
నవ్సారిలో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
प्रविष्टि तिथि:
22 FEB 2024 8:32PM by PIB Hyderabad
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
ప్రజల మన్ననలు పొందిన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, నా పార్లమెంటరీ సహచరుడు, ఈ ప్రాంత ప్రజా ప్రతినిధి, భారతీయ జనతా పార్టీ గుజరాత్ అధ్యక్షుడు సి.ఆర్. పాటిల్, గౌరవ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రియమైన సోదరీ సోదరులారా, మీరంతా ఎలా ఉన్నారు?
గుజరాత్లో ఈ రోజు నేను పాల్గొంటున్న మూడో కార్యక్రమం ఇది. ఈ ఉదయమే అహ్మదాబాద్లో పశుపోషణ, పాడి పరిశ్రమలో నిమగ్నులైన లక్షలాది మందిని కలిసి.. వారితో సంభాషించే అవకాశం నాకు లభించింది. ఆ తర్వాత మెహసానాలోని వాలినాథ్ ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం దక్కింది. ఇప్పుడు నవ్సారిలో అభివృద్ధి వేడుకల్లో మీ అందరితో కలిసి పాల్గొనడం సంతోషాన్నిస్తోంది. భూపేంద్ర భాయ్ చెప్పినట్టు.. ఇంత పెద్ద మొత్తంలో వ్యయంతో ఒకేసారి ఇంత విస్తృతమైన అభివృద్ధి పనులు చేపట్టడం స్వాతంత్ర్యానంతరం బహుశా ఇదే మొదటిసారేమో. ఈ అభివృద్ధి మహోత్సవాల స్ఫూర్తితో.. మీరంతా ఓసారి మొబైల్ ఫోన్లను బయటకు తీసి, టార్చిలైట్ వెలిగించి వికాసోత్సవంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. భారత్ మాతా కీ జై... ఈ ఘట్టాన్ని ఉత్తేజకరంగా మార్చుకుందాం. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! శహభాష్. ఈ రోజు నవ్సారి ఓ వజ్రంలా ప్రకాశిస్తోంది. ఇటీవలే వడోదర, నవ్సారి, భరూచ్, సూరత్ తదితర ప్రాంతాల్లో వస్త్రాలు, విద్యుత్, పట్టణాభివృద్ధి వంటి వేల కోట్ల రూపాయల విలువైన కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాం. మొత్తంగా వీటి విలువ రూ. 40 వేల కోట్లకు పైమాటే. ఈ సందర్భంగా మీ అందరికీ అభినందనలు.
మిత్రులారా,
పార్లమెంటులోనూ, వీధుల్లోనూ దేశవ్యాప్తంగా ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆ చర్చలన్నీ ‘మోదీ గ్యారంటీ’ చుట్టూనే తిరుగుతున్నాయి. మోదీ ఏమి హామీ ఇచ్చినా నెరవేర్చి తీరుతాడని ప్రతి పౌరుడూ గుర్తిస్తున్నాడు. దేశంలోని మిగతా ప్రాంతాలకు బహుశా ఇది కొత్త విషయమేమో... కానీ గుజరాత్ ప్రజలకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. మోదీ మాటంటే హామీలను నెరవేర్చే బాండ్ వంటిదని వారికి తెలుసు. నేను గుజరాత్లో ఉన్నప్పుడు ఎప్పుడూ ‘అయిదు F’ల గురించి చెప్పేవాడిని గుర్తుందా? ‘ఉత్పత్తి నుంచి ఫైబర్ వరకు (ఫాం టు ఫైబర్), ఫైబర్ నుంచి ఫ్యాక్టరీ దాకా, ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్ దిశగా, ఫ్యాషన్తో అంతర్జాతీ స్థాయికి (ఫ్యాషన్ టు ఫారిన్)’ సాగిన ప్రస్థానాన్ని అవి వివరిస్తాయి. అంటే.. రైతు పత్తిని సాగు చేస్తాడు. పత్తి ఫ్యాక్టరీకి వెళుతుంది. ఫ్యాక్టరీలో తయారైన దారాలతో వస్త్రాలు తయారు చేస్తారు. అవి విదేశాలకు ఎగుమతి అవుతాయి.
జౌళి రంగంలో సమగ్రమైన సరఫరా వ్యవస్థను, పూర్తి స్థాయిలో వాణిజ్య కార్యకలాపాలను నెలకొల్పాలన్నది నా లక్ష్యం. అది కచ్చితంగా జరగాలి. అవును కదా? ఆత్మనిర్భర భారత్ను సాకారం చేసుకునేందుకు ఇలాంటి వ్యూహాలను నేడు మనం అమలు చేస్తున్నాం. నవ్సారిలో ప్రారంభించిన పీఎం మిత్ర పార్కు ఈ లక్ష్యం దిశగా కీలక ముందడుగు. వస్త్ర రంగానికి సంబంధించి ఆ తరహాలో దేశంలో మొదటి ఏర్పాటు అది. ఈ కార్యక్రమం జౌళి పరిశ్రమను బలోపేతం చేయడంతోపాటు.. ఎగుమతుల్లో భారత్ వాటాను పెంచుతుంది. ఒక్కసారి ఊహించండి.. సూరత్ వజ్రాలు, నవ్సారి వస్త్రాలు ప్రపంచ ఫ్యాషన్ మార్కెటులో గుజరాత్ ఘనతను చాటుతాయి. గుజరాత్ కీర్తి ప్రపంచవ్యాప్తంగా మార్మోగడాన్ని మనం వినలేమా?
మిత్రులారా,
నిజానికి నేడు సూరత్ సిల్క్ సిటీ తన పరిధిని నవ్సారి వరకు విస్తరించుకుంటోంది. ఈ రంగంలో ప్రపంచంలో అతిపెద్ద ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులతో ఇప్పుడు భారత్ పోటీ పడుతోంది. ఇందుకు గుజరాత్ వస్త్ర పరిశ్రమ విశేష సహకారాన్ని అందిస్తోంది. అనేక సంవత్సరాలుగా సూరత్ వస్త్ర పరిశ్రమ ఒక బలమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఇక్కడ పీఎం మిత్ర పార్కు పూర్తయితే.. ఈ మొత్తం ప్రాంత రూపురేఖలు గణనీయంగా మారిపోతాయి. ఒక్క ఈ పార్కు నిర్మాణం కోసమే రూ. 3000 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. అన్ని వాణిజ్య కార్యకలాపాలకూ తగిన ఏర్పాట్లు ఇక్కడ సిద్ధమవుతాయి. వడకడం, నేత, పత్తి నుంచి గింజలు వేరు చేయడం, వస్త్రోత్పత్తి, జౌళి సాంకేతికత సంబంధిత పదార్థాలు, యంత్రాలు మొదలైనవన్నీ ఇందులో భాగంగా ఉంటాయి. అంటే వేలాది హస్త కళాకారులు, కార్మికులు ఇక్కడ పనిచేసే అవకాశాలు పొందుతారు. అంతే కాకుండా గృహనిర్మాణం, లాజిస్టిక్స్ పార్కు, గిడ్డంగి సౌకర్యాలు, ఆరోగ్య రక్షణ సేవలు, కార్మికుల కోసం శిక్షణ - నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలూ ఉంటాయి. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ పార్కు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని దీన్ని బట్టి తెలుస్తోంది.
మిత్రులారా,
సూరత్ ప్రజల కోసం మరో ముఖ్యమైన ప్రాజెక్టును కూడా ఈ రోజు ప్రారంభించాం. రూ. 800 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న తాపి నది బ్యారేజీకి ఈ రోజు శంకుస్థాపన చేశాం. తాపి నది బ్యారేజీ నిర్మాణం ద్వారా.. మున్ముందు చాలా ఏళ్ల పాటు సూరత్ దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న నీటి సరఫరా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వరదల వంటి ముప్పులను తగ్గించడంలోనూ ఇది సహాయపడుతుంది.
మిత్రులారా,
సామాజిక జీవితంలో, పారిశ్రామిక అభివృద్ధిలో విద్యుత్ ఎంత ముఖ్యమైనదో గుజరాత్కు బాగా తెలుసు. ఇరవై, ఇరవై అయిదేళ్ల కిందట గుజరాత్ దీర్ఘకాలిక విద్యుత్ కోతలను ఎదుర్కొన్నది. ఇప్పుడు 25-30 ఏళ్ల వయస్సున్న వ్యక్తులకు మనం ఎదుర్కొన్న అంధకారం గురించి కనీసం తెలిసి కూడా ఉండకపోవచ్చు. నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. ప్రజలు ముఖ్యంగా సాయంత్రం భోజన సమయాల్లో విద్యుత్ సమస్యను పరిష్కరించాలంటూ నా దగ్గరకు వచ్చేవారు. ఆ రోజులను తలచుకుంటే.. అలాంటి పరిస్థితులు ఉండేవని నమ్మడమూ కష్టమే. ఆ సమయంలో విద్యుదుత్పత్తిలో అనేక సవాళ్లుండేవి. బొగ్గును సుదూర ప్రాంతాల నుంచి లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. గ్యాస్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుకు కూడా దిగుమతులే ఆధారంగా ఉండేవి. నీటి నుంచి విద్యుదుత్పత్తి వ్యయ భారంతో కూడుకుడి ఉండేది. ఈ సంక్షోభాల నడుమ గుజరాత్ అభివృద్ధి అసంభవమేమో అనిపించేది. అయితే, ఈ అడ్డంకులను అధిగమించాలని మోదీ దృఢంగా నిశ్చయించుకున్నాడు. గుజరాత్లో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడం కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడానికి మేం ప్రాధాన్యమిచ్చాం. సౌర, పవన విద్యుత్తులు మా వ్యూహానికి కేంద్ర బిందువులుగా మారాయి. నేడు గుజరాత్ సౌర, పవన వనరుల నుంచి గణనీయమైన విద్యుత్తును పొందుతోంది.
మిత్రులారా,
21వ శతాబ్దపు భారత్కు తగిన విధంగా విద్యుత్తును సరఫరా చేయడంలో మన అణు విద్యుత్ ప్లాంట్ల పాత్ర మరింత విస్తరించనుంది. తాపిలోని కాక్రాపర్ అణు విద్యుత్ ప్లాంటులో రెండు కొత్త రియాక్టర్లను ఈ రోజు ప్రారంభించాం. ‘మేడిన్ ఇండియా’ సాంకేతికతతోనే ఈ రెండు రియాక్టర్లను నిర్మించుకున్నాం. ఈ స్వావలంబనను చాటేలా ఒకసారి గర్వంగా చేతులెత్తి భారత్ మాతా కీ జై అని నినదిద్దాం – భారత్ మాతా కీ జై! ప్రతి రంగంలోనూ ఆత్మనిర్భరత దిశగా భారత్ పయనాన్ని ఇది స్పష్టం చేస్తోంది. ఈ ప్లాంటు నుంచి గుజరాత్ మరింత ఎక్కువగా విద్యుత్ సరఫరాను పొందతుంది. అది దాని పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతమిస్తుంది.
మిత్రులారా,
నవ్సారీ కానివ్వండి, వల్సాద్ కానివ్వండి.. దక్షిణ గుజరాత్ ప్రాంతం ఇప్పుడు ‘నభూతో’ అన్న రీతిలో అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఇక్కడి మౌలిక సదుపాయాల్లో ఎప్పటికప్పుడు ఆధునికీకరణ జరుగుతోంది. ఇక సౌర విద్యుత్తు గురించి మాట్లాడుకుందాం. గుజరాత్నే తీసుకుందాం.. మన గుజరాతీలు ఆర్థిక విషయాలపై చాలా శ్రద్ధ చూపుతారు. అకౌంటింగ్లో వారు సిద్ధహస్తులు. ఇప్పుడు ఎంతో ప్రయోజనకరమైన మరో హామీతో మోదీ మీ ముందుకొచ్చాడు – అదే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం. దాన్నే పీఎం సూర్య ఘర్ అంటున్నాం. పీఎం సూర్య ఘర్ కింద 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నాం. దీంతో ఏసీలు, ఫ్యాన్లు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్ల వంటి ముఖ్యమైన గృహోపకరణాలు నడుస్తాయి. ఇది దాదాపు ప్రతి మధ్యతరగతి కుటుంబానికీ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా బ్యాంకుల నుంచి రుణాలను అందించడం ద్వారా కూడా ఇళ్లపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. అంతే కాదు, మీరు 300 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసి, మిగులును అమ్మదలచుకుంటే.. ప్రభుత్వం ఆ అదనపు విద్యుత్తును మీ నుంచి కొనుగోలు చేస్తుంది. అదనపు ఆదాయ వనరుగా అది ఉపయోగపడుతుంది. ఇది లాభదాయకం కాదా? గుజరాత్లో సౌర విద్యుత్ సరఫరా, సౌర శక్తి వినియోగం, ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్తును అందించడం వంటి ప్రయత్నాలలో ప్రజలంతా భాగస్వాములు కండి. ఇది మోదీ హామీ. అంతేకాకుండా, ముంబయి, సూరత్ వంటి ప్రధాన ఆర్థిక కేంద్రాలను అనుసంధానిస్తూ.. దేశంలో మొదటి బుల్లెట్ రైలు ఈ ప్రాంతం గుండా వెళ్లనుంది.
మిత్రులారా,
నవ్సారి ఇప్పుడు పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే, నవ్సారి సహా మొత్తం దక్షిణ గుజరాత్ ప్రాంతం వ్యవసాయంలో కూడా గణనీయంగా అభివృద్ధి చెందింది. బీజేపీ ప్రభుత్వం ఇక్కడి రైతులకు సౌకర్యాలు కల్పించడం మొదలయ్యాక.. పండ్ల సాగు పద్ధతుల్లో విశేష వృద్ధి నమోదైంది. ఈ ప్రాంతంలోని హాపుస్ మామిడి పండ్లు, వల్సాద్ మామిడి పండ్లు, నవ్సారి చికూలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. నేను ఎక్కడికెళ్ళినా ప్రజలు వాటి గురించి నన్నడుగుతారు. ప్రస్తుత డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రతి దశలోనూ రైతులకు అండగా నిలుస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కూడా నవ్సారి రైతులు రూ.350 కోట్లకు పైగా ప్రయోజనం పొందారు.
మిత్రులారా,
దేశవ్యాప్తంగా పేదలు, రైతులు, యువత, మహిళలను సాధికారులను చేస్తామని మోదీ ప్రతిజ్ఞ చేశాడు. ఇది కేవలం పథకాలను రూపొందించడానికి మాత్రమే పరిమితం కాదు. అర్హులకు ఈ కార్యక్రమాల పూర్తి ప్రయోజనాలను అందించడం కూడా ఇందులో భాగం. దేశంలోని ప్రతి ఇంటి నుంచి లేమిని, పేదరికాన్ని నిర్మూలించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రభుత్వం క్రియాశీలంగా వ్యవహరిస్తూ లబ్ధిదారులను చేరుకుని, వారిని గుర్తిస్తోంది. సంబంధిత పథకాలతో వారిని అనుసంధానిస్తోంది.
మిత్రులారా,
అనేక ఏళ్లుగా కేంద్రంలోనూ గుజరాత్లోనూ కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాలను, తీరప్రాంత గ్రామాలను నిర్లక్ష్యం చేశాయి. అయితే ఇక్కడ గుజరాత్లో ఉమర్గామ్ నుంచి అంబాజీ వరకు మొత్తం గిరిజన ప్రాంతంలో అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు బీజేపీ ప్రభుత్వం అంకితభావంతో పనిచేసింది. కానీ దేశవ్యాప్తంగా అలా జరగలేదు. 2014 వరకు దేశవ్యాప్తంగా 100కు పైగా జిల్లాలు అభివృద్ధికి దూరమై కుంగిపోయాయి. వాటిపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. ఈ జిల్లాల్లో గిరిజనులు ఎక్కువగా ఉండేవారు. గత దశాబ్ద కాలంలో ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం ద్వారా.. గతంలో నిర్లక్ష్యాన్ని ఎదుర్కొన్న ఈ ప్రాంతాలు అభివృద్ధిలో గణనీయమైన పురోగతిని సాధించాయి.
సోదరీ సోదరులారా,
ఇతరుల వాగ్దానాలు విఫలమైన చోట మోదీ హామీ మొదలవుతుంది. మోదీ హామీ వల్లే దేశంలోని అత్యంత పేద వర్గాలకు మొదటిసారి పక్కా ఇంటిపై భరోసా దక్కింది. వారు ఆకలితో పడుకోవాల్సిన అవసరం లేదని, బాధలను భరించాల్సిన పనిలేదని మోదీ హామీ ఇచ్చారు. మోదీ హామీ కారణంగా.. మారుమూల గ్రామాల్లో నివసించే అక్కాచెల్లెళ్లు కూడా తమ ఇళ్లకు విద్యుత్తు, కుళాయి నీరు లభిస్తాయని నమ్మకంగా ఉన్నారు. బీమా, పింఛను పథకాలు తమకు అనుకూలంగా ఉంటాయని పేదలు, రైతులు, దుకాణదారులు, కార్మికులు ఎప్పుడూ ఊహించనుకూడాలేదు. కానీ మోదీ హామీ వల్ల అది నేడు వాస్తవరూపం దాల్చింది. ఓసారి రెండు చేతులూ పైకెత్తి దీనికి అంగీకారం తెలపండి - ఇదంతా మోదీ హామీ వల్లే.
మిత్రులారా,
గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ అనీమియా కీలక సవాలుగా మారింది. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ సమస్యను పరిష్కరించడానికి అనేక చర్యలను అమలు చేశాం. అయితే ఈ వ్యాధిని సమగ్రంగా ఎదుర్కోవడానికి దేశవ్యాప్త ప్రయత్నాలు తప్పనిసరి. అందుకే సికిల్ సెల్ అనీమియా నిర్మూలన కోసం ఓ జాతీయ మిషన్ను మేం ప్రారంభించాం. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ అనీమియా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వికసిత భారత్ సంకల్ప యాత్ర సందర్భంగా లక్షలాది వ్యక్తులకు పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా, ఈ ప్రాంతంలో ఓ వైద్య కళాశాలనూ నిర్మిస్తున్నాం. గతంలో గిరిజనులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వైద్య కళాశాలను స్థాపించడం దాదాపు అసంభవంగా ఉండేది. నేడు అనేక గిరిజన జిల్లాల్లో వైద్య కళాశాలలను నెలకొల్పాం.
మిత్రులారా,
పేదవారైనా, మధ్యతరగతి వారైనా.. గ్రామాల్లో ఉంటున్నా, నగరాల్లో ఉంటున్నా... ప్రతి పౌరుడి జీవన ప్రమాణాలను పెంచడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానానికే భారత్ పరిమితమైంది. ఆర్థికాభివృద్ధిలో వెనుకబడి ఉంటే దేశంలో వనరులు పరిమితమై.. గ్రామాలు, చిన్న పట్టణాల అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. అయితే బీజేపీ ప్రభుత్వ నేతృత్వంలో.. దశాబ్ద కాలంలోనే భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పదో స్థానం నుంచి 5వ స్థానానికి ఎదిగింది. భారతీయుల్లో వ్యయార్హ ఆదాయం మెరుగుపడిందని, తద్వారా వినియోగ వ్యయం పెరిగిందని దీన్ని బట్టి తెలుస్తోంది. పర్యవసానంగా దేశవ్యాప్తంగా చిన్న నగరాల్లోనూ బలమైన అనుసంధాన మౌలిక సదుపాయాలు ఏర్పాటవుతున్నాయి. చిన్న నగరాల నుంచి విమాన ప్రయాణాన్ని ఒకప్పుడు కనీసం ఊహించలేదు. కానీ అదిప్పుడు నిజమైంది. అంతేకాదు, కాంగ్రెస్ పాలనలో నగరాల్లో మురికివాడలు పెరగగా, వాటి స్థానంలో మా ప్రభుత్వం పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తోంది. గత దశాబ్ద కాలంలో మేం పేదల కోసం 4 కోట్లకు పైగా పక్కా ఇళ్ళు నిర్మించాం – ఒక్కసారి ఊహించండి.. 4 కోట్ల ఇళ్ళు!
మిత్రులారా,
నేడు ‘డిజిటల్ ఇండియా’ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఒకప్పుడు కాంగ్రెస్ దాన్ని ఎగతాళి చేసింది. కొత్త అంకుర సంస్థల ఆవిర్భావాన్ని, క్రీడల్లో యువత ప్రాతినిధ్యాన్ని పెంపొందిస్తూ.. ‘డిజిటల్ ఇండియా’ చిన్న నగరాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. గుజరాత్లోని చిన్న పట్టణాల ఎదుగుదలను మనం చూస్తున్నాం. తద్వారా భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించే దిశగా ఒక కొత్త మధ్యతరగతి ఆవిర్భవిస్తోంది.
సోదరీ సోదరులారా,
బీజేపీ ప్రభుత్వం అభివృద్ధికి ఎంత ప్రాధాన్యమిస్తుందో మన వారసత్వాన్నీ అలాగే గౌరవిస్తుంది. మన దేశ చరిత్రలో ఈ ప్రాంతానికి గణనీయమైన చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యముంది. స్వాతంత్ర్య పోరాటమైనా, దేశ నిర్మాణమైనా.. ఈ ప్రాంతం ఎనలేని సహకారాన్ని అందించింది. బంధుప్రీతి, సంతుష్టీకరణ, అవినీతి రాజకీయాలను కమ్మేస్తే.. మన వారసత్వం నిర్లక్ష్యానికి గురవుతుంది. దురదృష్టవశాత్తు దశాబ్దాలుగా కాంగ్రెస్ ఈ అన్యాయాన్ని కొనసాగిస్తూ వచ్చింది. నేడు భారత ఘన వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. మీరు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా.. భారత్ను సందర్శించి, దాని గురించి తెలుసుకోవాలనుకునే ప్రజలు కనిపిస్తారు. కానీ, కాంగ్రెస్ దశాబ్దాలుగా దేశ నిజమైన వారసత్వం గురించి ప్రపంచానికి తెలియకుండా చేసింది. స్వాతంత్ర్య పోరాట సమయంలో మహాత్మాగాంధీ ఉప్పును, ఖాదీని స్వేచ్ఛకు చిహ్నాలుగా మలిచారు. కానీ కాంగ్రెస్ ఖాదీని నిర్లక్ష్యం చేసింది. ఉప్పు సత్యాగ్రహ వారసత్వాన్ని విస్మరించింది. అయితే, దండి వద్ద ఉప్పు సత్యాగ్రహం జరిగిన ప్రదేశంలో దండి స్మారక చిహ్నాన్ని మా ప్రభుత్వం నిర్మించింది. అలాగే సర్దార్ పటేల్ సేవలకు చిహ్నంగా ‘ఏకతా విగ్రహా’న్ని నిర్మించే భాగ్యమూ మా ప్రభుత్వానికి లభించింది. అయినా, ఒక్క కాంగ్రెస్ అగ్ర నాయకుడు కూడా ఈ ప్రదేశాల్లో నివాళి ఘటించలేదు. గుజరాత్ పట్ల ఈ ఉపేక్షా భావాన్ని ఏ గుజరాతీ మర్చిపోలేడు.
మిత్రులారా,
మోదీని కుల ప్రాతిపదికన అవమానించే స్థితికి కాంగ్రెస్ సభ్యులు ఎలా దిగజారిపోయారో మీరు చూశారు. అయితే, 400 సీట్ల మార్కును అధిగమించాలన్న మా దృఢ సంకల్పం వారి వైఖరి వల్ల మరింత బలపడుతుందని వారు గ్రహించలేకపోతున్నారు. వాళ్ళు ఎంతగా బురద జల్లితే.. అంత అద్భుతంగా 370 శక్తిమంతమైన కమలాలు వికసిస్తాయి.
సోదరీ సోదరులారా,
నేడు కాంగ్రెస్ పార్టీకి దేశ భవితను దృష్టిలో ఉంచుకునే ఎజెండా లేదు. దానికి బదులు మోదీపై నిరంతర విమర్శలకు దిగుతోంది. ఒక పార్టీ వారసత్వ రాజకీయాలకు లోబడి ఉంటే.. విస్తృత ప్రజా శ్రేయస్సు కన్నా కుటుంబానికే ప్రాధాన్యమిస్తుందనేందుకు ఇది నిదర్శనం. ఇలాంటి కుటుంబ కేంద్రీకృత ధోరణి యువతలో ఆవిష్కరణలు, ప్రతిభ, ఆకాంక్షలను అణచివేస్తుంది. అలాంటి పార్టీల దృష్టి మొత్తం అదే స్థితిని కొనసాగిస్తూ, కుటుంబ ప్రయోజనాలను కాపాడుకోవడంపైనే ఉంటుంది. ఇదీ నేడు కాంగ్రెస్ ఎదుర్కొంటున్న దుస్థితి. అయితే, బీజేపీ మాత్రం దీనికి భిన్నంగా.. రాబోయే 25 ఏళ్లలో దేశ వికాస దార్శనికతతో ఓ సమగ్ర ప్రణాళికను రూపొందించింది. ఈ 25 ఏళ్ల కాలంలో అభివృద్ధి చెందిన గుజరాత్, అభివృద్ధి చెందిన భారత్ను నిర్మించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం.
మిత్రులారా,
తల్లులూ అక్కాచెల్లెల్లతోపాటు అశేషంగా నేడు ఇక్కడికి తరలివచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆశీస్సులను అందించి, మద్దతును ప్రకటించిన మీ అందరికీ నా మనఃపూర్వక ధన్యవాదాలు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులకు గాను మరోసారి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. నాతో కలిసి గొంతెత్తండి -
‘‘భారత్ మాతా కీ జై!’’
రెండు చేతులు పైకెత్తి ఉత్సాహంగా నినదించండి –
‘‘భారత్ మాతా కీ జై!’’
‘‘భారత్ మాతా కీ జై!’’
‘‘భారత్ మాతా కీ జై!’’
ధన్యవాదాలు!
గమనిక: ప్రధానమంత్రి ప్రసంగానికి ఇది ఇంచుమించు అనువాదం. మౌలిక ప్రసంగం హిందీలో ఉంది.
***
(रिलीज़ आईडी: 2169369)
आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam