ప్రధాన మంత్రి కార్యాలయం
అస్సాంలోని దరంగ్లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
14 SEP 2025 4:01PM by PIB Hyderabad
భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై! అస్సాం ప్రజల ఆదరణ పొందిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ సర్బానంద సోనోవాల్ గారు, అస్సాం ప్రభుత్వంలోని అందరు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, వర్షం కురుస్తూనే ఉన్నప్పటికీ మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన సోదరీసోదరులకు నమస్కారం.
రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో ఈ చరిత్రాత్మక రోజున దరంగ్ ప్రజలకు.. అస్సాం ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. అభినందనలూ తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
ఆపరేషన్ సిందూర్ తర్వాత నేను నిన్ననే మొదటిసారి అస్సాంకు వచ్చాను. మన కామాఖ్య దేవి ఆశీస్సులతో ఆపరేషన్ సిందూర్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. అందుకే ఈ రోజు మన కామాఖ్య దేవి కొలువైన పవిత్ర భూమికి రావడం చాలా దివ్యమైన అనుభవంగా అనిపిస్తుంది. ఈ ఆనందానికి తోడుగా ఇక్కడ ఈరోజునే జన్మాష్టమి పండుగనూ జరుపుకుంటున్నారు. ఈ పవిత్ర జన్మాష్టమి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎర్రకోట నుంచి నేను చెప్పినట్లుగా మంగళ్దోయ్ ప్రాంతం సంస్కృతి.. ఘనమైన చరిత్ర.. భవిష్యత్తు పట్ల ఆశల పవిత్ర సంగమం. ఈ ప్రాంతం అస్సాం గుర్తింపు కోసం కేంద్ర బిందువు కూడా. నేను ఈ ప్రేరణలను గుర్తు చేసుకున్నాను.. శ్రీకృష్ణుడిని స్మరించాను.. భవిష్యత్ భద్రతా విధానంలో సుదర్శన చక్ర దార్శనికతనూ నేను ప్రజల ముందు ఉంచాను.
మిత్రులారా,
ధైర్యసాహసాలకు నెలవైన ఇక్కడి ప్రజలను కలిసే భాగ్యం నాకు లభించడం నా అదృష్టం.
సోదరీసోదరులారా..
కొద్ది రోజుల కిందటే మనం భారతరత్న సుధాకాంత భూపేన్ హజారికా గారి జయంతిని జరుపుకున్నాం. నిన్న ఆయన గౌరవార్థం నిర్వహించిన ఒక గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశమూ నాకు లభించింది. అస్సాంకు చెందిన ఎందరో మహనీయులు, మన పూర్వీకులు కలలుగన్న దార్శనికత సాకారం కోసం నేడు బీజేపీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నిజాయితీగా కృషి చేస్తోంది.
సోదరీసోదరులారా..
నేను నిన్న రాత్రి భూపేన్ దా గారి శతజయంతి కార్యక్రమంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు నాతో ఒక విషయం చెప్పారు. ఈ రోజు ఉదయమే ఆయన నాకు ఒక వీడియోనూ చూపించారు. ఆ వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసిన ప్రకటనను నాకు చూపించారు. భరతమాత ముద్దుబిడ్డ.. అస్సాం రాష్ట్రానికి గర్వకారణం అయిన భూపేన్ దా హజారికా గారికి భారత ప్రభుత్వం భారతరత్న ప్రదానం చేసిన రోజునే.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక ప్రకటన చేశారు. ఆ సమయంలో నేను దానిని గమనించలేదు. ఈ రోజే నేను దానిని చూశాను. “"మోదీ నృత్యకారులకు... గాయకులకూ భారతరత్న ఇస్తున్నారు." అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నారు.
మిత్రులారా,
1962లో చైనాతో యుద్ధం తరువాత పండిట్ నెహ్రూ మాట్లాడిన మాటలతో ఈశాన్య ప్రాంత ప్రజలకు చేసిన గాయాలు ఇంకా మానలేదు. ప్రస్తుత తరం కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ గాయాలపై ఉప్పు జల్లుతున్నారు. సాధారణంగా నన్ను ఎంత తిట్టినా.. నేను శివ భక్తుడిని అయినందువల్ల ఆ విషాన్ని మింగేస్తున్నాను. కానీ మరొకరు సిగ్గు లేకుండా అవమానిస్తూ ఉంటే.. నేను మౌనంగా ఉండలేను. భూపేన్ దా గారికి భారతరత్నను ప్రదానం చేయాలనే నా నిర్ణయం సరైనదా కాదా మీరే నాకు చెప్పండి? మీ శక్తినంతా కలిపి బిగ్గరగా చెప్పండి.. అది సరైనదా కాదా? భూపేన్ దాకు భారతరత్నను ప్రదానం చేయాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎగతాళి చేయడం సరైనదేనా? అస్సాం ముద్దుబిడ్డ, భారత్కు చెందిన ఒక మహనీయుడిని కాంగ్రెస్ ఈ విధంగా అవమానించడం ఎంతో బాధను కలిగిస్తోంది.
మిత్రులారా,
కాంగ్రెస్ మొత్తం వ్యవస్థ ఇప్పుడు మళ్ళీ నా గురించి విమర్శలు చేస్తూ, "మోదీ మళ్ళీ ఏడుపు ప్రారంభించాడు" అని చెబుతుందని నాకు బాగా తెలుసు. కానీ నా విషయంలో ప్రజలే నా దేవుళ్ళు.. మరి నా మనసులోని మాట నా దేవుని ముందు బయటకు రాకపోతే, అది మరెక్కడ నుంచి వస్తుంది? వారే నా యజమానులు, వారే నా పూజ్యులు.. వారే నన్ను నియంత్రించే రిమోట్ కంట్రోల్. నాకు వేరే రిమోట్ కంట్రోల్ లేదు. ఈ దేశంలోని 140 కోట్ల మంది పౌరులే నన్ను నియంత్రించే రిమోట్ కంట్రోల్. కానీ ఆ పార్టీ నేతలకు ఎంత అహంకారం అంటే.. "నామ్దార్" (రాజవంశం) వ్యక్తి "కామ్దార్" (కార్మికుడు)ని కొట్టినప్పుడు ఆ "కామ్దార్" బాధతో కేకలు వేస్తే వారు అతనిని మరింత హింసించారు. పైగా "నీకు ఏడ్చే హక్కు లేదు, ఒక "కామ్దార్" అయి ఉండి "నామ్దార్" ముందు ఎలా ఏడుస్తావు?" అని బెదిరించారు. అలాంటి అహంకారం ప్రజా జీవితానికి సరిపోదు. అస్సాం ప్రజలు, దేశ ప్రజలు, సంగీత ప్రియులు, కళా ప్రియులు, భారత ఆత్మకు తమను తాము అంకితం చేసుకునే వారు.. ““మీరు భూపేన్ దాను ఎందుకు అవమానించారు?” అని కాంగ్రెస్ను ప్రశ్నించాలి.
సోదరీసోదరులారా..
అస్సాం సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడం, సంరక్షించడం, అస్సాం మరింత వేగంగా అభివృద్ధి సాధించేలా కృషి చేయడం ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ప్రాధాన్యం. ఒక సోదరుడు ఒక పెయింటింగ్ తీసుకువచ్చాడు.. నేను దానిని చూస్తున్నాను.. బహుశా అతను దానిని నాకు ఇవ్వాలనుకుంటున్నారు. ఎస్పీజీ సిబ్బంది దానిని తీసుకురావాలని నేను అభ్యర్థిస్తున్నాను. అతనికి నా అభ్యర్థన ఏమిటంటే.. దయచేసి మీ పేరు, చిరునామాను దాని వెనక రాయండి. నేను కచ్చితంగా మీకు లేఖ రాస్తాను. మీరు నా తల్లి చిత్రాన్ని చక్కగా గీశారు. అస్సాం నుంచి పొందిన ఈ ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను. 'గమోసా'తో నిలబడిన యువకుడినీ నేను చూస్తున్నాను. దయచేసి దానినీ తీసుకురండి. నాకు ఇది జన్మాష్టమి రోజున పవిత్రమైన ప్రసాదం లాంటిది. అస్సాంకు చెందిన ఎవరో పేద తల్లి ఈ 'గమోసా'ను నేసి ఉండాలి. సోదరా.. ఈ కానుక తెచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నేను చాలా కృతజ్ఞుడను. దయచేసి దానిని వారికి ఇవ్వండి. నేను దానిని తీసుకుంటాను. అది కచ్చితంగా నాకు ఎంతో విలువైనది. మరొకటి కూడా ఉంది. బహుశా అతను దానిని హిమంత (ముఖ్యమంత్రి)కి ఇవ్వాలనుకుంటున్నాడని అనుకుంటున్నాను. దయచేసి దానిని కూడా తీసుకురండి. అది సరైన స్థలానికి చేరుకుంటుంది. సోదరా.. ఈ ఆప్యాయతకు ధన్యవాదాలు. చూడండీ.. చిన్న పిల్లలు కూడా వారు గీసిన బొమ్మలు తెచ్చారు. దయచేసి వాటినీ తీసుకురండి. ప్రజలు చాలా ప్రేమను కురిపిస్తున్నారు. ఈ చిన్న పిల్లలు కూడా! ఇంతకంటే గొప్ప అదృష్టం ఇంకేముంటుంది? ధన్యవాదాలు,.. నా మిత్రులందరికీ ధన్యవాదాలు. మీరిద్దరు అన్నదమ్ములా? కాదా? ఓహో మీరిద్దరూ నల్ల టీ-షర్టులే ధరించారు. మిత్రులారా.. చాలా ధన్యవాదాలు.
మిత్రులారా,
ఈ రోజు ప్రభుత్వం, ప్రజల ఉమ్మడి ప్రయత్నాలతో అస్సాం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగానూ సంచలనాలు సృష్టిస్తోంది. ఈ కూతురు కూడా నా కోసం ఏదో తెచ్చింది. దయచేసి దానినీ తీసుకురండి. ఎవరూ ఏ కూతురినీ నిరాశపరచకూడదు. ధన్యవాదాలు. మీరు మీ పేరును దాని వెనక రాశారా? మీరు మీ పేరును దాని వెనక రాసి ఉంటే, దయచేసి మీ చిరునామా కూడా రాయండి. నేను మీకు లేఖ రాస్తాను.
మిత్రులారా,
నేడు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండగా.. అస్సాం కూడా దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా మారింది. ఒకప్పుడు అస్సాం అభివృద్ధిలో వెనకబడి, దేశంలోని మిగిలిన ప్రాంతాలతో సమానంగా ముందుకు సాగలేకపోయింది. కానీ నేడు అస్సాం దాదాపు 13 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతోంది. మిత్రమా చాలా ధన్యవాదాలు...
మిత్రులారా,
13 శాతం వృద్ధి రేటు! ఇది చాలా పెద్ద విజయం. ఇది మీ విజయం. ఈ రోజు మీరు సాధించిన ఈ విజయం కోసం చప్పట్లు కొట్టండి. సాధారణంగా మీరు నా కోసం చాలా చప్పట్లు కొడతారు.. కానీ ఈ రోజు మీ కృషి, శ్రమ కోసం నేను చప్పట్లు కొట్టాలనుకుంటున్నాను. ఈ విజయం అస్సాం ప్రజల అంకితభావం.. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ఉమ్మడి కృషి ఫలితం. అస్సాం ప్రజలు ఈ భాగస్వామ్యాన్ని నిరంతరం బలోపేతం చేస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. అందుకే, హిమంత గారు, అతని బృందం ప్రతి ఎన్నికల్లోనూ అఖండ మద్దతును పొందుతూనే ఉన్నారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లోనూ అస్సాం మాకు చరిత్రాత్మక విజయాన్ని అందించింది. మీ ఆశీర్వాదం మాతో ఉంది.
మిత్రులారా,
భారత అభివృద్ధి ఇంజిన్గా అస్సాంను మార్చాలనే లక్ష్యంతో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోంది. నేటి కార్యక్రమం కూడా ఈ నిబద్ధతలో ఒక భాగం. కొద్దిసేపటి కిందట దాదాపు 6,500 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించుకున్నాం. మా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అస్సాంను అగ్రశ్రేణి కనెక్టివిటీ గల రాష్ట్రాల్లో ఒకటిగా.. అగ్రశ్రేణి ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టులు ఆ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. దరంగ్ వైద్య కళాశాల, ఆసుపత్రి, హైవేలు, రింగ్ రోడ్…. మీ కోసం మీ అందరికీ అభినందనలు.
మిత్రులారా,
నేడు దేశం మొత్తం ఐక్యంగా 'వికసిత్ భారత్' సాధన దిశగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా యువ మిత్రులారా.. 'వికసిత్ భారత్' ఒక కల... ఒక సంకల్పం. ఈ సంకల్పాన్ని నెరవేర్చడంలో ఈశాన్య ప్రాంతం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. మీ పట్ల, ఈశాన్య ప్రాంతం పట్ల నాకు అభిమానం, ప్రేమ, గౌరవం ఉండడం వల్ల నేను ఇలా చెప్పడం లేదు. దీని వెనక బలమైన కారణాలు ఉండడం వల్లే నేను ఇలా చెబుతున్నాను. స్వాతంత్య్రం తర్వాత పశ్చిమ, దక్షిణ భారతంలో పెద్ద నగరాలు, పెద్ద ఆర్థిక వ్యవస్థలు, పెద్ద పరిశ్రమలు అన్నీ అభివృద్ధి చెందాయి. ఈ సమయంలో భారీ జనాభా కలిగిన తూర్పు భారతంలోని విస్తారమైన ప్రాంతం అభివృద్ధి రేసులో వెనకబడింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈ పరిస్థితిని మారుస్తోంది. ఇప్పటికే 21వ శతాబ్దంలో 25 సంవత్సరాలు గడిచిపోయాయి. కాంగ్రెస్ యుగం నుంచి మనం వింటూనే ఉన్నాం.. "21వ శతాబ్దం వస్తోంది, 21వ శతాబ్దం వస్తోంది" అని. సరే ఈ శతాబ్దంలో నాల్గో వంతు సమయం ఇప్పటికే గడిచిపోయింది. ఇప్పుడు ఈ 21వ శతాబ్దం తదుపరి దశ తూర్పు, ఈశాన్య రాష్ట్రాలదే. ఇప్పుడు మీ సమయం వచ్చింది. ఇది అస్సాం సమయం.. ఈశాన్య ప్రాంత సమయం. నా చిన్నారి మిత్రులారా.. ఇప్పుడు సమయం మీ చేతుల్లోనే ఉంది. ఓహో,, ఇదిగో మరొక పిల్లాడు ఏదో తీసుకువస్తున్నాడు. సోదరా.. దయచేసి దాన్ని తీసుకోండి. ప్రజలకు నా బలహీనత తెలుసు… వారు నా తల్లి చిత్రాలను తీసుకువచ్చినప్పుడు నా హృదయం వాటిని వెంటనే తీసుకోవాలని కోరుకుంటుంది. వారు నాతో ఉండేవాళ్లే.. దానిని వారికి ఇవ్వండి. వెనక మీ పేరు, చిరునామా రాయండి. నేను దానిని తీసుకుని మీకు లేఖ రాస్తాను. దయచేసి దానిని అతని నుంచి తీసుకొని ఎస్పీజీ సిబ్బందికి అందించండి.
మిత్రులారా,
ఏ ప్రాంతమైనా వేగంగా అభివృద్ధి చెందాలంటే వేగవంతమైన కనెక్టివిటీ చాలా అవసరం. అందుకే మా ప్రభుత్వం ఈశాన్య ప్రాంతంలో కనెక్టివిటీపై ప్రధానంగా దృష్టి సారించింది. రోడ్లు, రైల్వేలు, వాయుమార్గాల ద్వారా ప్రాంతాల వారీ కనెక్టివిటీనీ, 5జీ ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్ ద్వారా డిజిటల్ కనెక్టివిటీని అభివృద్ధి చేసి మీ జీవితాలకు సౌలభ్యాన్ని అందిస్తూ.. మీ రోజువారీ జీవితాలను, వ్యాపార నిర్వహణను సులభతరం చేసింది. ఈ కనెక్టివిటీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేసింది.. పర్యాటకాన్ని విస్తరించింది.. స్థానిక యువతకు కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించింది.
మిత్రులారా,
ఈ భారీ కనెక్టివిటీ ప్రచారం వల్ల అస్సాం ఎంతో ప్రయోజనం పొందింది. నేను మీకు ఒక ఉదాహరణ చెబుతాను. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆరు దశాబ్దాలు ఢిల్లీలో కాంగ్రెస్ పాలనే ఉంది.. దశాబ్దాలుగా అస్సాంలోనూ కాంగ్రెస్ పాలనే ఉంది. కానీ కాంగ్రెస్ 60-65 సంవత్సరాల్లో బ్రహ్మపుత్రపై కేవలం మూడు వంతెనలు మాత్రమే నిర్మించింది. ఆరు దశాబ్దాల్లో కేవలం మూడు వంతెనలు! అప్పుడు మీకు సేవ చేసే అవకాశం మీరు మాకు ఇచ్చారు. కేవలం ఒక దశాబ్దంలోనే మా ప్రభుత్వం ఆరు ప్రధాన వంతెనలను నిర్మించింది. ఆరు ప్రధాన వంతెనలు! ఇప్పుడు చెప్పండి, ఇంత పని పూర్తయినప్పుడు మీరు సంతోషంగా ఉండరా? మీరు మాకు మీ ఆశీస్సులు ఇవ్వరా? మీరు మీ ప్రేమను మాపై కురిపించరా? మీరు సంతోషంగా ఉన్నారా, లేదా? నేను ఇంకా ఎక్కువ పని చేయాలనుకుంటున్నాను. మీ ఆశీస్సులు అందిస్తూ ఉండండి. ఈ రోజు, కురువా–నారెంగి వంతెనకు పునాది వేశాం. ఈ వంతెనతో గౌహతి-దరంగ్ మధ్య దూరం కొద్ది నిమిషాలకు తగ్గిపోతుంది. ఇది సాధారణ ప్రజల సమయాన్ని, డబ్బునూ ఆదా చేస్తుంది.. రవాణాను చౌకగా చేస్తుంది.. ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది.. ట్రాఫిక్ సమస్యలను తగ్గిస్తుంది. ఫలితంగా వస్తువుల ధరలూ తగ్గుతాయి.
మిత్రులారా,
కొత్త రింగ్ రోడ్డు కూడా మీకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. దీని నిర్మాణం పూర్తయితే ఎగువ అస్సాం వైపు వెళ్లే వాహనాలు ఇకపై నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం ఉండదు. ఈ రింగ్ రోడ్డు 5 జాతీయ రహదారులు, 2 రాష్ట్ర రహదారులు, 1 విమానాశ్రయం, 3 రైల్వే స్టేషన్లు, 1 ఇన్ల్యాండ్ వాటర్ టెర్మినల్ను కలుపుతుంది. మరో మాటలో చెప్పాలంటే.. అస్సాంలో మొదటిసారిగా ఎలాంటి ఇబ్బందిలేని బహుముఖ కనెక్టివిటీ కోసం పూర్తిస్థాయి నెట్వర్క్ ఏర్పాటు కానుంది. ఇది బీజేపీ డబుల్-ఇంజన్ ప్రభుత్వ అభివృద్ధి నమూనా.
మిత్రులారా,
ఈ రోజు కోసం మాత్రమే కాకుండా.. రాబోయే 25-50 సంవత్సరాల అవసరాల కోసం మనం దేశాన్ని సిద్ధం చేస్తున్నాం. 2047లో భారత్ 100 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే సమయానికి మనం 'వికసిత్ భారత్'గా దేశాన్ని అభివృద్ధి చేయాలి. మీ కోసం, మీ పిల్లల కోసం, మన యువత ఉజ్వల భవిత కోసం మనం దీన్ని చేయాలి. ఈ దిశగా పురోగమిస్తున్న క్రమంలో జీఎస్టీలో తదుపరి తరం సంస్కరణలు ఉంటాయని నేను ఎర్రకోట నుంచి ప్రకటించాను. ఈ రోజు నేను ఈ శుభవార్తతో మీ మధ్యకు వచ్చాను. సరిగ్గా నేటి నుంచి 9 రోజుల తర్వాత.. నవరాత్రి మొదటి రోజునే జీఎస్టీ రేట్లు గణనీయంగా తగ్గుతాయి. ఇది అస్సాంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి కుటుంబానికీ ప్రయోజనం చేకూరుస్తుంది. అనేక రోజువారీ వినియోగ వస్తువులు చౌకగా మారుతాయి. మేం సిమెంటుపై పన్ను తగ్గించాం.. కాబట్టి ఇల్లు కట్టుకునే వారికి తక్కువ ఖర్చు అవుతుంది. క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాల కోసం గల అనేక ఖరీదైన మందులు చౌకగా మారతాయి. బీమా మరింత సరసమైనదిగా మారుతుంది. మోటార్ సైకిళ్ళు, కొత్త కార్లు కొనాలనుకునే యువత వాటిని తక్కువ ధరలకే పొందుతారు. ఈ రోజుల్లో మీరు 60,000 రూపాయలు, 80,000 రూపాయలు, 1 లక్ష రూపాయల డిస్కౌంట్లతో ఆటోమొబైల్ కంపెనీల ప్రకటనలను చూస్తూ ఉంటారు. వారు దాదాపు ప్రతిరోజూ ప్రకటనలు చేస్తున్నారు. దీని అర్థం ఈ నిర్ణయంతో మాతృమూర్తులు, సోదరీమణులు, యువత, రైతులు, దుకాణదారులూ అందరికీ ప్రయోజనం చేకూరుతుంది. ఈ నిర్ణయం మీ పండుగలకు మరింత సంతోషాన్ని జోడిస్తుంది.
మిత్రులారా,
కానీ ఈ పండుగల సమయంలో మీరంతా ఒక విషయం గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పవచ్చా? నేను చెప్పాలా? మీరు వింటారా? మీరంతా చేతులు పైకెత్తి నాకు చెప్పండి.. నేను చెప్పాలా? మీరు దానిని పాటిస్తారా? సోదరా దయచేసి కూర్చోండి.. ధన్యవాదాలు. అతన్ని ఇబ్బంది పెట్టవద్దు. అతను శారీరకంగా అనారోగ్యంతో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. దయచేసి అతన్ని నెట్టవద్దు. మేం అతని నుంచి దానిని తీసుకుంటాం. కెమెరామెన్.. దయచేసి అతని లేఖను తీసుకోండి. సోదరా చింతించకు, కూర్చో. అతన్ని అసౌకర్యానికి గురి చేయవద్దు. సోదరా.. నేను మీకు నమస్కరిస్తున్నాను. దయచేసి అతన్ని ఇబ్బంది పెట్టవద్దు. ఇది నాకు సరైనది కాదు. మీరు ఇంత బాధలో కూడా ఇక్కడికి వచ్చినందుకు నేను మీకు కృతజ్ఞుడను.
మిత్రులారా,
ఇప్పుడు మళ్ళీ మీ చేతులు పైకెత్తి నాకు చెప్పండి.. నేను చెప్పేది మీరు పాటిస్తారా? ఇలా కాదు, అందరి చేతులు పైకి ఉండాలి! మీరు పాటిస్తారా? నాకు హామీ ఇవ్వండి. మిత్రులారా దీనిని పాటించండి, మన దేశం ముందుకు సాగుతుంది. నేను ఇది నా కోసం కాదు.. దేశం కోసం అడుగుతున్నాను. నేను మీ పిల్లల ఉజ్వల భవిత కోసం అడుగుతున్నాను. నేను మీకు చెబుతున్నాను.. ఇప్పటి నుంచి మీరు ఏ వస్తువు కొన్నా అది స్వదేశీ వస్తువై ఉంటుందని మీరు నాకు హామీ ఇవ్వండి. మీరు స్వదేశీని కొంటారా? మీరు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు కొంటారా? స్వదేశీకి నేను ఇచ్చే నిర్వచనం చాలా సులభం. కంపెనీ ఏ దేశం నుంచి వచ్చినా.. దానికి ఏ విదేశీ పేరు ఉన్నా.. అది భారత్లో తయారైతే అది స్వదేశీ అవుతుంది. డబ్బు ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచి అయినా రావచ్చు.. కానీ నా దేశ యువత చెమట చిందించినదై ఉండాలి. ప్రతి మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి భారత మట్టి సువాసనను కలిగి ఉండాలి. మీరు అలాంటి వస్తువులను కొంటారా? మీ చేతులు పైకెత్తి స్వదేశీ ఉత్పత్తులనే కొంటామని చెప్పండి. మీరు ఎవరికైనా కానుకలు ఇవ్వవలసి వస్తే, అది స్వదేశీ వస్తువై ఉంటుందా? దుకాణదారులంతా దయచేసి మీ దుకాణంలో ఒక బోర్డు పెట్టాలని నేను అభ్యర్థిస్తున్నాను. మీరు చేస్తారా? మీ గ్రామంలోని ప్రతి దుకాణంలో బోర్డు పెట్టండి.. "ఇది స్వదేశీ అని గర్వంగా చెప్పండి."
స్వదేశీ శక్తి ఏమిటో నేను మీకు చెప్తాను. దాదాపు 50 సంవత్సరాల కిందట నేను కొంతకాలం కన్యాకుమారిలో ఉన్నాను. నేను ఎల్లప్పుడూ నాతో ఒక 'గమోసా' ఉంచుకుంటాను. నా బ్యాగులో ఎప్పుడూ మూడు లేదా నాలుగు 'గమోసా'లు ఉంటాయి. నేను కన్యాకుమారిలో నా భుజంపై 'గమోసా'తో తిరుగుతున్నాను. కొంతమంది దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పలకరించారు. వారు "నువ్వు అస్సాం నుంచి వచ్చావా?" అని అడిగారు. "లేదు, నేను గుజరాత్ నుంచి వచ్చాను" అని చెప్పాను. "కానీ మేం 'గమోసా'ను చూశాం, అందుకే మీరు అస్సాం నుంచి వచ్చారని మేం అనుకున్నాం." అని వారు నాతో అన్నారు. అది నేలకున్న శక్తి, స్వదేశీ శక్తి. నాకు అక్కడ గుర్తింపు లేదు, కానీ ఆ రోజు నేను 'గమోసా' ధరించినందున అస్సాం ప్రజలు నాపై ప్రేమను చూపించారు. మిత్రులారా, ఇది మన సంప్రదాయాల శక్తి. అందుకే నాకు వాగ్దానం చేయమని అడుగుతున్నాను. మనం స్వదేశీనే కొనుగోలు చేద్దాం. మనం స్థానికతకు అనుకూలంగా గళం వినిపిద్దాం. స్థానిక ఉత్పత్తుల కోసం మన సమష్టి ప్రయత్నాలు మన దేశాన్ని బలోపేతం చేస్తాయి.
మిత్రులారా,
గత 11 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా అపారమైన అభివృద్ధి జరిగిన మరో రంగం ఆరోగ్య సంరక్షణ. గతంలో ఆసుపత్రులు ప్రధానంగా పెద్ద నగరాల్లోనే ఉండేవి.. అక్కడ చికిత్స చాలా ఖరీదైనది. మన ప్రభుత్వం ఎయిమ్స్, వైద్య కళాశాలల నెట్వర్క్ను దేశంలోని ప్రతి మూలకూ విస్తరించింది. దయచేసి కూర్చోండి సోదరా... నా ప్రసంగాన్ని కొనసాగిస్తాను. దయచేసి కూర్చోండి... దయచేసి అతన్ని ఇబ్బంది పెట్టకండి. కెమెరామెన్.. అతని నుంచి లేఖ తీసుకోండి. మీరు నా దివ్యాంగులైన సోదరులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మిత్రమా.. ధన్యవాదాలు. ఇక్కడ అస్సాంలో క్యాన్సర్ ఆసుపత్రుల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గత 11 సంవత్సరాల్లో దేశంలోని వైద్య కళాశాలల సంఖ్య రెట్టింపయ్యింది. అంటే స్వాతంత్య్రం తర్వాత 60-65 సంవత్సరాల్లో నిర్మించినన్ని వైద్య కళాశాలలు కేవలం 11 ఏళ్లలోనే మేం నిర్మించాం. ఒక్కసారి ఆలోచించండి.. వారికి 60-70 సంవత్సరాలు పట్టింది. మేం కేవలం 10-11 సంవత్సరాల్లో చేసాం. నా మిత్రులారా! అస్సాంలో కూడా 2014కి ముందు కేవలం 6 వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు దరంగ్లోని కొత్త వైద్య కళాశాలతో.. 24 వైద్య కళాశాలలు ఉన్నాయి. ఒక వైద్య కళాశాల నిర్మించినప్పుడు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందుబాటులోకి రావడమే కాకుండా.. అనేక మంది యువతకు వైద్యులయ్యే అవకాశం కూడా లభిస్తుందని మీ అందరికీ తెలుసు. గతంలో మన యువత చాలా మంది వైద్య సీట్ల కొరత కారణంగా వైద్యులు కాలేకపోయారు. గత 11 సంవత్సరాల్లో, వైద్య సీట్ల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువైంది. ఇది మాత్రమే కాదు.. మేం మరో లక్ష్యాన్నీ నిర్దేశించుకున్నాం. రాబోయే 4-5 సంవత్సరాల్లో 1 లక్ష కొత్త వైద్య సీట్లను జోడించబోతున్నాం. అంటే 1 లక్ష మంది కొత్త వైద్యులు తయారవుతారు.
మిత్రులారా,
మా పనితీరు ఇలా ఉంటుంది. 3 కోట్ల మందిని "లక్పతీ దీదీలు"గా మార్చడం కోసం కృషి చేస్తున్నట్లుగానే.. 1 లక్ష మంది కొత్త వైద్యులను తయారుచేసేందుకూ మేం కృషి చేస్తున్నాం.
మిత్రులారా,
అస్సాం దేశభక్తుల భూమి. విదేశీ దండయాత్రల నుంచి దేశాన్ని రక్షించడంలో.. స్వాతంత్య్ర పోరాట త్యాగాల్లో అస్సాం పాత్ర కీలకం. పత్రుఘాట్ రైతుల సత్యాగ్రహాన్ని ఎవరు మరచిపోగలరు? ఆ చరిత్రాత్మక ప్రదేశం ఇక్కడికి ఎంతో దూరంలో లేదు. ఈ రోజు నేను ఈ త్యాగాల పవిత్ర భూమిపై నిలబడి ఉన్నప్పుడు.. కాంగ్రెస్ మరో దుష్ప్రవర్తన గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. తన స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ ఎల్లప్పుడూ భారత వ్యతిరేక శక్తులకు, అలాంటి భావజాలాలకూ అండగా నిలుస్తుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో మనం దీనిని మరోసారి చూశాం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఉగ్రవాదం కారణంగా దేశమంతా రక్తపాతం ఉండేది.. అయినా కాంగ్రెస్ మౌనంగా చూస్తూనే ఉంది. నేడు మన సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహిస్తోంది.. పాకిస్తాన్లోని ప్రతి మూల నుంచి ఉగ్రవాద సూత్రధారులను నిర్మూలిస్తోంది. కానీ మన సైన్యంతో నిలబడటానికి బదులుగా.. కాంగ్రెస్ పాకిస్తాన్ సైన్యం వైపు ఉంది. మన సైనికులకు మద్దతు ఇవ్వడానికి బదులుగా.. కాంగ్రెస్ నాయకులు ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న వారి ఎజెండాను ప్రోత్సహిస్తున్నారు. పాకిస్తాన్ అబద్ధాలు కాంగ్రెస్ ఎజెండాగా మారుతాయి. అందుకే, మీరు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి.
మిత్రులారా,
తన ఓటు బ్యాంకును కాపాడుకోవడమే కాంగ్రెస్కు అత్యంత ప్రాధాన్యం. కాంగ్రెస్ ఎప్పుడూ జాతి ప్రయోజనాలను పట్టించుకోదు. నేడు కాంగ్రెస్ దేశ వ్యతిరేక శక్తులకు, చొరబాటుదారులకు పెద్ద రక్షకుడిగా మారింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చొరబాట్లను ప్రోత్సహించింది. నేడు ఆ చొరబాటుదారులు భారత్లో శాశ్వతంగా స్థిరపడి దేశ భవిష్యత్తును నిర్ణయించాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. ఒకప్పుడు, అక్రమ చొరబాటుల నుంచి అస్సాం గుర్తింపును రక్షించడానికి మంగళ్దోయ్ ఒక భారీ ఉద్యమాన్ని నిర్వహించింది. కానీ మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వం దాని కోసం మిమ్మల్ని శిక్షించింది. వారు మీపై ప్రతీకారం తీర్చుకున్నారు. కాంగ్రెస్ ఇక్కడి భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడానికి అనుమతించింది. మన ప్రార్థనా స్థలాలను, మన రైతుల, గిరిజన ప్రజల భూములనూ లాక్కున్నారు. బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితులను సరిదిద్దుతోంది. అక్రమ ఆక్రమణలు తొలగిస్తున్నారు. హిమంత గారి నాయకత్వంలో అస్సాంలోని లక్షలాది బిఘాల భూమిని చొరబాటుదారుల నుంచి విముక్తి చేశారు. దరంగ్ జిల్లాలో అనేక భూములను ఆక్రమణల నుంచి తొలగించారు. గరుఖుతి ప్రాంతంలో కూడా.. కాంగ్రెస్ హయాంలో ఆక్రమణలు జరిగాయి. ఆ భూమిని ఇప్పుడు తిరిగి స్వాధీనం చేసుకుని రైతుల కోసం గరుఖుతి వ్యవసాయ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. అక్కడి యువత ఇప్పుడు "వ్యవసాయ సైనికులు"గా పనిచేస్తున్నారు. ఆవాలు, మొక్కజొన్న, మినుములు, నువ్వులు, గుమ్మడికాయల నుంచి ప్రతి పంట అక్కడ సాగవుతోంది. మరో మాటలో చెప్పాలంటే.. ఒకప్పుడు చొరబాటుదారుల నియంత్రణలో ఉన్న భూమి నేడు అస్సాంలో వ్యవసాయ అభివృద్ధికి నూతన కేంద్రంగా మారింది.
మిత్రులారా,
చొరబాటుదారులు దేశ వనరులను ఆక్రమించుకోవడానికి బీజేపీ ప్రభుత్వం అనుమతించదు. భారత రైతులు, యువత, గిరిజన ప్రజల హక్కులను ఎవరూ లాక్కోలేరు. ఈ చొరబాటుదారులు మన తల్లులు, సోదరీమణులు, కుమార్తెలపై దారుణాలకు పాల్పడతారు.. దానినీ మేం అనుమతించం. సరిహద్దు ప్రాంతాల జనాభాను మార్చడానికి చొరబాటుదారుల ద్వారా కుట్రలు జరుగుతున్నాయి. ఇది జాతీయ భద్రతకు పెను ముప్పు. అందుకే దేశంలో ఇప్పుడు జన గణన మిషన్ ప్రారంభిస్తున్నాం. చొరబాటుదారుల నుంచి దేశాన్ని రక్షించడం, దేశానికి చొరబాటుదారుల నుంచి మిముక్తి కలిగించడం బీజేపీ లక్ష్యం. ఆ రాజకీయ నాయకులకు నేను చెప్పేదేమిటంటే.. మీరు సవాలు చేస్తూ రంగంలోకి దిగితే, నేను ఆ సవాలును మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. రాసిపెట్టుకోండి.. చొరబాటుదారులను రక్షించడానికి మీరు ఎంత శక్తిని ఉపయోగిస్తారో, ఆ చొరబాటుదారులను తిప్పి పంపేందుకు మేం ఎంతగా కృషి చేస్తామో చూద్దాం. పోటీ జరగనివ్వండి. చొరబాటుదారులను రక్షించడానికి వచ్చిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదు. నా మాటలను గమనించండి.. ఈ దేశం వారిని క్షమించదు.
మిత్రులారా,
అస్సాం వారసత్వాన్ని కాపాడటానికి.. అస్సాం అభివృద్ధిని వేగవంతం చేయడానికి మనం కలిసి పనిచేయాలి. అస్సాం, ఈశాన్య ప్రాంతాలను 'వికసిత్ భారత్' ప్రయాణం కోసం వృద్ధి ఇంజిన్గా మార్చాలి. ఈ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభ సందర్భంగా మీ అందరికీ విజయం లభించాలని కోరుకుంటున్నాను. నాతో పాటు మీరంతా చెప్పండి: భారత్ మాతా కీ జై. రెండు చేతులూ పైకెత్తి.. పూర్తి శక్తితో మీ స్వరం వినిపించండి.. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. చాలా ధన్యవాదాలు.
***
(Release ID: 2166983)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam