ప్రధాన మంత్రి కార్యాలయం
‘సెమీకాన్ ఇండియా 2025’ను న్యూఢిల్లీలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్ను ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి.. భారత్పై ప్రపంచానికి నమ్మకముంది..
భారత్తో కలిసి సెమీకండక్టర్ రంగ భవితను తీర్చిదిద్దడానికి ప్రపంచం సిద్ధంగా ఉంది
‘చిప్స్ అంటే అవి డిజిటల్ వజ్రాలు’
‘కాగితాలతో చేసే పని ఎంత తగ్గితే, వేఫర్ల పనిని అంత త్వరగా మొదలు పెట్టొచ్చు’
‘భారత్లో తయారు చేసే అత్యంత చిన్న చిప్ త్వరలోనే ప్రపంచంలో అత్యంత పెద్ద మార్పునకు దిశా నిర్దేశం చేస్తుంది’
‘‘భారత్లో రూపురేఖలు తీర్చింది.. భారత్లో తయారు చేసింది... ప్రపంచం నమ్మేది’’ అని
ప్రపంచం చెప్పుకొనే రోజు ఎంతో దూరంలో లేదు: ప్రధానమంత్రి
Posted On:
02 SEP 2025 11:58AM by PIB Hyderabad
‘సెమీకాన్ ఇండియా- 2025’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమిలో ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని దేశ సెమీకండక్టర్ అనుబంధ విస్తారిత వ్యవస్థకు ఉత్ప్రేరకంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ఆహూతులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ... దేశ విదేశాల నుంచి సెమీకండక్టర్ పరిశ్రమల ముఖ్య కార్యనిర్వహణాధికారులు, వారి సహచరులు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రముఖ అతిథులు, అంకుర సంస్థలతో అనుబంధం ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువ విద్యార్థులకు కూడా ఆయన స్వాగతం పలికారు.
జపాన్, చైనాల్లో తన పర్యటన ముగించుకొని నిన్న రాత్రి భారత్కు వచ్చినట్లు శ్రీ మోదీ తెలిపారు. ఈ రోజు యశోభూమిలో ఆహూతుల మధ్యకు వచ్చానన్నారు. ఈ హాలు ఆకాంక్షలతో, ఆత్మవిశ్వాసంతో కిక్కిరిసిపోయిందని ఆయన అభివర్ణించారు. సాంకేతికత అంటే తనకున్న మక్కువ ఎల్లప్పుడూ సహజమైందీ, అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. ఇటీవల తాను జపాన్లో పర్యటించిన సందర్భంలో ఆ దేశ ప్రధాని, శ్రీ షిగేరు ఇషిబాతో పాటు టోక్యో ఎలక్ట్రాన్ ఫ్యాక్టరీకి వెళ్లినట్లు తెలిపారు. ఆ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఇవాళ మీ అందరి మధ్యా ఉన్నారని శ్రీ మోదీ వెల్లడించారు. సాంకేతికత పట్ల ఉన్న అభిరుచే ఇలాంటి సమావేశాలకు తనను తరచూ హాజరయ్యేట్లు చేస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ రోజు ఆహూతుల మధ్యకు రావడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని అన్నారు.
ప్రపంచం నలు మూలల నుంచి 40-50 దేశాలకు చెందిన సెమీకండక్టర్ రంగ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపిన శ్రీ మోదీ.. భారత్కు చెందిన నవకల్పన, యువ శక్తి కూడా ఈ సభాస్థలికి తరలివచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ అద్వితీయ కలయిక ఒక సూటి సందేశాన్ని అందిస్తోందని, ‘‘భారత్ను ప్రపంచం నమ్ముతోంది, భారత్పై ప్రపంచానికి భరోసా ఉంది, భారత్తో కలిసి సెమీకండక్టర్ రంగ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ప్రపంచం తయారుగా ఉందనేదే’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ‘సెమీకాన్ ఇండియా’కు హాజరవుతున్న ప్రముఖ అతిథులందరికీ ఆయన స్వాగతం పలుకుతూ, వారంతా అభివృద్ధి చెందిన స్వయంసమృద్ధ దేశాన్ని ఆవిష్కరించే దిశగా ఇండియా చేస్తున్న ప్రయాణంలో ముఖ్య భాగస్వాములేనన్నారు.
ఇటీవలే ప్రకటించిన ఈ ఏడాది మొదటి మూడు నెలల జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) అంకెల గురించి ప్రధానమంత్రి సూచనప్రాయంగా ప్రస్తావిస్తూ, ‘‘మరోసారి, భారత్ ప్రతి ఒక్క ఆశనీ, ప్రతి ఒక్క అంచనాతో పాటు ప్రతి జోస్యాన్ని కూడా తోసిరాజంది’’ అన్నారు. ఆర్థిక స్వప్రయోజనాలు ఆలంబనగా ఉంటున్న ఆందోళనలతోను, సవాళ్లతోను ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు సతమతం అవుతుంటే, భారత్ 7.8 శాతం వృద్ధి రేటును సాధించిందని తెలిపారు. ఈ అభివృద్ధి .. తయారీ, సేవలు, వ్యవసాయంతో పాటు నిర్మాణం.. ఇలా అన్ని రంగాల్లోను కనిపిస్తోందని, ప్రతి చోటా ఉత్సాహం ఉరకలేస్తోందని ఆయన ఉద్ఘాటించారు. భారత్ వృద్ధి జోరు వివిధ పరిశ్రమల్లోను, దేశంలో ప్రతి ఒక్కరిలోను సరికొత్త శక్తిని నింపుతోందని ఆయన కితాబిచ్చారు. ఈ వృద్ధి వేగం భారత్ను త్వరలోనే ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే బాటలో మరింత వేగంగా ముందుకు తీసుకువెళుతున్నదని ఆయన అన్నారు.
సెమీకండక్టర్ల జగతిలో తరచూ ఓ మాట వినిపిస్తుంది. అది..‘చమురు నల్ల బంగారం అయితే, చిప్స్... డిజిటల్ యుగపు వజ్రాలు’ అనేదేనని ప్రధానమంత్రి తెలిపారు. చమురు ఇది వరకటి శతాబ్దానికి రూపురేఖలను కల్పించింది. మరి అప్పట్లో ప్రపంచ భాగ్యాన్ని చమురు బావులే నిర్ధారించాయన్నారు. ఈ బావుల నుంచి ఎంత పెట్రోలియాన్ని వెలికి తీశారన్న అంశంపైనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎత్తుపల్లాలు ఆధారపడ్డాయన్నారు. ఏమైనా, 21వ శతాబ్దంలో శక్తి అంతా కూడా చిన్న చిప్లో కేంద్రీకృతం అయిందని స్పష్టం చేశారు. ఆకారంలో చిన్నదే అయినప్పటికీ ఈ చిప్లలో ప్రపంచ ప్రగతిని వేగవంతం చేసే శక్తి దాగి ఉందని ఆయన అన్నారు. ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్టు ఇప్పటికే 600 బిలియన్ డాలర్ స్థాయికి ఎగబాకిందని శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావిస్తూ... రాబోయే సంవత్సరాల్లో ఇది ఒక ట్రిలియన్ డాలర్ స్థాయిని అందుకొంటుందన్న అంచనా ఉందన్నారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ ముందుకు దూసుకుపోతున్న తీరును చూస్తుంటే, ఈ ఒక ట్రిలియన్ డాలర్ మార్కెట్టులో ఇండియా ఒక ప్రధాన వాటాను చేజిక్కించుకోగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
భారత్ వేగవంతంగా ముందంజ వేస్తున్న తీరును చెప్పాలని ఉందంటూ సెమీకాన్ ఇండియా కార్యక్రమాన్ని 2021లో మొదలుపెట్టిన సంగతిని గుర్తుకు తెచ్చారు. 2023 కల్లా భారత్లో మొట్టమొదటి సెమీకండక్టర్ ప్లాంటుకు ఆమోదం తెలిపారని, 2024లో మరిన్ని ప్లాంట్లకు అనుమతులు ఇచ్చారని, ఈ ఏడాది అదనంగా అయిదు ప్రాజెక్టులకు మార్గం సుగమం చేశారని వివరించారు. మొత్తం పది సెమీకండక్టర్ ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం పురోగమిస్తున్నాయని, వీటిలో మొత్తం 18 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ సొమ్ము.. అంటే రూ.1.5 లక్షల కోట్లకు మించి.. పెట్టుబడి పెట్టినట్లు ఆయన వెల్లడించారు. ఇది భారత్ పట్ల ప్రపంచంలో అంతకంతకు పెరుగుతున్న విశ్వాసాన్ని సూచిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
సెమీకండక్టర్ రంగంలో వేగానికే అగ్రతాంబూలం అని శ్రీ మోదీ చెబుతూ, ‘‘ఫైల్ దశ నుంచి ఫ్యాక్టరీ దశకు చేరుకోవడానికి పట్టే సమయంతో పాటు కాగితాలకు సంబంధించిన పనులు ఎంత తక్కువగా ఉంటే, వేఫర్ పనులను అంత త్వరగా మొదలుపెట్టొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. ఇదే దృష్టికోణంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. అన్ని అనుమతులను ఒకేసారి ఇచ్చేందుకు జాతీయ వ్యవస్థ (నేషనల్ సింగిల్ విండో సిస్టమ్)ను అమల్లోకి తీసుకువచ్చారు. దీంతో కేంద్ర, రాష్ట్రాల ఆమోదాలన్నింటినీ ఒకే వేదికను ఉపయోగించి ఇవ్వడానికి వీలుంటుందనీ, ఫలితంగా, పెట్టుబడిదారులకు దొంతర్లకు దొంతర్లుగా ఉండే పత్రాలను సమర్పించాల్సిన అవసరం ఉండదని కూడా ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా సెమీకండక్టర్ పార్కులను ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపాయాల నమూనాలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారనీ, ఇది భూమి, విద్యుత్తు సరఫరా, ఓడరేవు, విమానాశ్రయ సంధానంతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరుల సదుపాయాలను అందిస్తుందని ఆయన వివరించారు. ఈ రకమైన మౌలిక సదుపాయాలకు ప్రోత్సాహకాలు జతకూడితే, అప్పుడు పారిశ్రామిక వృద్ధి తప్పక చోటు చేసుకొంటుందని వ్యాఖ్యానించారు. పీఎల్ఐ ప్రోత్సాహకాల ద్వారా గాని, లేదా డిజైన్తో ముడిపెట్టిన గ్రాంట్ల ద్వారా గానీ భారత్ తొలి నుంచి చివరి వరకూ సామర్థ్యాలను అందిస్తోందనీ, ఈ కారణంగానే పెట్టుబడులు తరలివస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత్ పరోక్ష కార్యకలాపాలను నిర్వహించడానికి మించి ముందుకెళుతూ ఫుల్ స్టాక్ సెమీకండక్టర్ దేశంగా మారే దిశగా దూసుకుపోతోందని శ్రీ మోదీ అన్నారు. భారతదేశ అత్యంత చిన్న చిప్.. ప్రపంచంలో అత్యంత పెద్దదైన మార్పునకు చోదకశక్తి అయ్యే రోజు ఇంతో దూరంలో లేదని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘మా ప్రయాణం ఆలస్యంగా మొదలైంది.. అయితే మమ్మల్నిక ఏదీ ఆపజాలదు’’ అని ప్రధానమంత్రి ప్రకటించారు. సీజీ పవర్ పైలట్ ప్లాంటు కార్యకలాపాలు 4-5 రోజుల కిందటే.. ఆగస్టు 28న.. ఆరంభమయ్యాయని తెలిపారు. కేన్స్ లో పైలట్ ప్లాంటు కూడా మొదలవడానికి సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. మైక్రోన్, టాటా సంస్థలు నిర్మించే టెస్ట్ చిప్స్ ఉత్పాదన కూడా మొదలైందన్నారు. వాణిజ్య సరళి చిప్స్ ఉత్పత్తి ఈ సంవత్సరంలో మొదలవుతుందని ప్రధానమంత్రి అంటూ, ఇది సెమీకండక్టర్ రంగంలో భారత్ సత్వర ప్రగతిని చాటిచెబుతోందన్నారు.
సెమీకండక్టర్ రంగంలో భారత్ విజయగాథ ఏ ఒక్క విభాగానికో లేదా ఏ ఒక్క టెక్నాలజీకో పరిమితం కాదని శ్రీ మోదీ స్పష్టం చేశారు. దేశం ఒక సంపూర్ణ అనుబంధ విస్తారిత వ్యవస్థను నిర్మిస్తోందని ఆయన అన్నారు. ఈ అనుబంధ విస్తారిత వ్యవస్థలో దేశంలోని రూపకల్పన, తయారీ, ప్యాకేజింగుతో పాటు ఉన్నత సాంకేతికతతో కూడిన ఉపకరణాలు.. ఇవన్నీ కలిసి ఉన్నాయని ఆయన తెలిపారు. సెమీకండక్టర్ మిషన్ కేవలం ఒక ఫ్యాబ్ను ఏర్పాటు చేయడానికో లేదా ఒక చిప్ను ఉత్పత్తి చేయడానికో పరిమితం కాదు. దీనికి బదులు ఒక పటిష్ఠ సెమీకండక్టర్ అనుబంధ విస్తారిత వ్యవస్థనే భారత్ రూపొందిస్తోంది... ఇది దేశాన్ని స్వావలంబన దిశగా, ప్రపంచవ్యాప్తంగా పోటీపడేదిగా తీర్చిదిద్దనుందని ప్రధానమంత్రి వివరించారు.
భారత సెమీకండక్టర్ మిషన్లో మరో కీలకమైన అంశాన్ని శ్రీ మోదీ ప్రస్తావిస్తూ, ఈ రంగంలో ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో పాటు భారత్ దూసుకెళ్తుందని అన్నారు. స్వదేశంలో తయారైన చిప్ల ద్వారా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు సాధికారత కల్పించడంపై భారత్ దృష్టి సారించిందని పేర్కొన్నారు. నోయిడా, బెంగళూరులో అభివృద్ధి చేస్తున్న డిజైన్ సెంటర్లు ప్రపంచంలోనే అత్యంత అధునాతన చిప్ల తయారీపై పని చేస్తున్నాయని, అవి బిలియన్ల కొద్దీ ట్రాన్సిస్టర్లను నిల్వ చేయగల సామర్థ్యం కలవని ప్రధానమంత్రి వెల్లడించారు. ఈ చిప్స్ 21వ శతాబ్దంలోని కొత్త సాంకేతికతకు శక్తినిస్తాయని స్పష్టం చేశారు. ప్రపంచ సెమీకండక్టర్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై మాట్లాడుతూ.. వాటిని అధిగమించడానికి భారత్ మెరుగ్గా పనిచేస్తోందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. నగరాల్లో ఎత్తయిన భవనాలు, ఆకట్టుకునే అద్భుతమైన సదుపాయాలు ఉన్నా, వాటి పునాది బలం ఉక్కు మీద ఆధారపడి ఉంటుందనీ, అదేవిధంగా, భారత డిజిటల్ వసతుల పునాది ముఖ్యమైన ఖనిజాలపై ఆధారపడి ఉంటుందనీ అన్నారు. జాతీయ కీలక ఖనిజ మిషన్పై భారత్ పనిచేస్తోందని, దేశీయంగా అరుదైన ఖనిజాల అవసరాన్ని తీర్చేందుకు ప్రయత్నిస్తున్నామని శ్రీ మోదీ తెలిపారు.
సెమీకండక్టర్ రంగం అభివృద్ధిలో అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తోందని, ప్రపంచంలోని సెమీకండక్టర్ డిజైన్లలో 20 శాతం ప్రతిభ భారతదేశానిదేనని, ఈ రంగానికి అవసరమైన అతిపెద్ద మానవ వనరుల కేంద్రంగా దేశ యువత నిలుస్తున్నదనీ చెప్పారు. యువ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, అంకురసంస్థలు ఈ క్రతువులో భాగమయ్యేందుకు ముందుకు రావాలని శ్రీ మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వం వారికి తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, చిప్స్-టు-స్టార్టప్ ప్రోగ్రామ్ ప్రత్యేకించి వారికోసమే రూపొందించినట్లు చెప్పారు. డిజైన్ ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని సమర్థంగా లక్ష్యాలను చేరుకునేందుకు పునర్ వ్యవస్థీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ రంగంలో భారతీయ మేధో సంపత్తి (ఐపీ)ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇటీవల ప్రారంభించిన జాతీయ పరిశోధనా నిధి కూడా వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా ఈ ప్రయత్నానికి తోడ్పడుతుందని వెల్లడించారు. అనేక రాష్ట్రాలు సెమీకండక్టర్ క్రతువులో చురుగ్గా పాల్గొంటున్నాయని, వాటిలో చాలా రాష్ట్రాలు ఈ రంగానికి ప్రత్యేక విధానాలు రూపొందించాయని తెలిపారు. ఈ రాష్ట్రాలు ప్రత్యేక మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. అన్ని రాష్ట్రాలు పరస్పరం పోటీ పడుతూ, సెమీకండక్టర్ విస్తారిత వ్యవస్థను అభివృద్ధి చేయాలని, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించాలని పిలుపునిచ్చారు.
"సంస్కరణ, సాధన, మార్పులను అనుసరించి భారత్ ఈ స్థాయికి చేరుకుంది. త్వరలో భావితరానికి కొత్త తరహా సంస్కరణలను తీసుకొస్తాం" అని ప్రధానమంత్రి తెలిపారు. భారత సెమీ కండక్టర్ మిషన్ తదుపరి దశపై ప్రస్తుతం పని జరుగుతోందని చెప్పారు. పెట్టుబడిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వారిని మనస్ఫూర్తిగా స్వాగతించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. "డిజైన్ పూర్తయింది. మాస్క్ సిద్ధంగా ఉంది. పెద్ద ఎత్తున ఖచ్చితత్వంతో అమలు, పంపిణీ చేయాల్సిన సమయం వచ్చేసింది" అని అన్నారు. భారత్ చేపడుతున్న విధానాలు తాత్కాలికం కాదు, దీర్ఘకాలిక నిబద్ధతతో కూడినవని, అవి ప్రతి పెట్టుబడిదారుడి అవసరాలు తీరుస్తాయని హామీ ఇచ్చారు.‘‘డిజైన్డ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ట్రస్టెడ్ బై ద వరల్డ్ అని ప్రపంచం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు" అని ప్రధానమంత్రి అన్నారు. భారత్ చేసే ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని, ప్రతి ప్రయత్నం ఆవిష్కరణలతో కూడినదై ఉండాలని, ఈ ప్రయాణం ఎటువంటి లోపాలు లేకుండా, అత్యుత్తమ పనితీరుతో కొనసాగాలని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు శ్రీ అశ్వినీ వైష్ణవ్, శ్రీ జితిన్ ప్రసాద, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా, ఒడిశా సీఎం శ్రీ మోహన్ చరణ్ మాఝీ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
నేపథ్యం
సెమీకాన్ ఇండియా-2025 సెప్టెంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనుంది. ఇది దేశంలో బలమైన, ప్రతికూలతలను అధిగమించే సామర్థ్యం గల, సుస్థిరమైన సెమీకండక్టర్ విస్తారిత వ్యవస్థపై దృష్టి సారిస్తుంది. సెమీకాన్ ఇండియా ప్రోగ్రాం పురోగతి, సెమీకండక్టర్ ఫ్యాబ్, అధునాతన ప్యాకేజింగ్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలను సిద్ధం చేయటం, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆర్ అండ్ డి, ఏఐ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, పెట్టుబడులకు అవకాశాలు, రాష్ట్ర విధాన అమలు తదితర అంశాలపై సమావేశాలను నిర్వహిస్తుంది. అదనంగా, ఈ కార్యక్రమంలో డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ (డీఎల్ఐ) పథకం కింద ఉన్న కార్యక్రమాలు, స్టార్టప్ వృద్ధి, అంతర్జాతీయ సహకారం, సెమీకండక్టర్ రంగంలో భారత భవిష్యత్తు ప్రణాళిక వంటి అంశాలను హైలైట్ చేస్తుంది.
20,750 మందికి పైగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో 48కి పైగా దేశాల నుంచి 2,500 మందికి పైగా ప్రతినిధులు, 50 మందికి పైగా అంతర్జాతీయ నేతలు సహా 150 మందికి పైగా వక్తలు, 350 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటారు. ఇందులో 6 దేశాల రౌండ్ టేబుల్ చర్చలు, దేశాల పెవిలియన్లు, మానవ వనరుల అభివృద్ధి, స్టార్టప్ల కోసం ప్రత్యేక పెవిలియన్లు కూడా ఉంటాయి.
***
MJPS/SR
(Release ID: 2163167)
Visitor Counter : 4
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam