ప్రధాన మంత్రి కార్యాలయం
స్వయంసమృద్ధ భారత్: శక్తిమంతమైన, వికసిత భారత్కు పునాది
Posted On:
15 AUG 2025 10:20AM by PIB Hyderabad
దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ- శక్తిమంతమైన, వికసిత భారత్ సాకారం కావడంలో స్వయంసమృద్ధ భారత్ కార్యక్రమం పునాది కాగలదని పేర్కొన్నారు. ఈ మేరకు రక్షణ, సాంకేతిక, ఇంధన, అంతరిక్ష, తయారీ రంగాల్లో మన దేశం ఇప్పటికే పురోగతి సాధించిందని ఆయన ఉటంకించారు. ఈ విధంగా వికసిత భారత్ కీలక పునాదులలో స్వావలంబన ఒకటని ప్రధాని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ను ప్రధానంగా ప్రస్తావిస్తూ- దేశానికి ఎదురయ్యే ముప్పులను నిర్ణయాత్మకంగా తిప్పికొట్టడంలో వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, స్వదేశీ సామర్థ్యం ప్రధానమని ఆయన చెప్పారు. దేశ పటిష్ఠత, గౌరవంతోపాటు 2047నాటికి వికసిత భారత్ దిశగా పయనంలో స్వావలంబన పాత్ర అత్యంత కీలకమని తెలిపారు.
స్వయం సమృద్ధ భారత్: ప్రధాని ప్రసంగంలో కీలకాంశాలు
1. రక్షణ స్వావలంబన-ఆపరేషన్ సిందూర్: దేశ రక్షణ రంగ స్వావలంబనకు ఆపరేషన్ సిందూర్ ఒక నిదర్శనమని ప్రశంసించారు. భారత్ నిర్ణయాత్మకంగా, స్వేచ్ఛగా వ్యవహరించడంలో మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు సహా స్వదేశీ సామర్థ్యం వీలు కల్పిస్తుందన్నారు. జాతీయ భద్రత కోసం దిగుమతి పరాధీనత తగదని అవి స్పష్టం చేశాయని పేర్కొన్నారు.
2. జెట్ ఇంజిన్ తయారీలో స్వావలంబన: భవిష్యత్ రక్షణ సాంకేతిక పరిజ్ఞానం యావత్తూ దేశీయంగానే రూపొందుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ఇందులో భాగంగా స్వావలంబన లక్ష్యంతో దేశంలోనే జెట్ ఇంజిన్లను తయారు చేయాలని భారత యువతకు, ఆవిష్కర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
3. సెమీకండక్టర్లు-ఉన్నత సాంకేతికతలో అగ్రస్థానం: మన దేశం 2025 చివరికల్లా ‘మేడ్ ఇన్ ఇండియా’ సెమీకండక్టర్ చిప్లను ఆవిష్కరిస్తుందని ప్రధాని ప్రకటించారు. కీలక సాంకేతిక రంగాల్లో పెరుగుతున్న భారత్ ప్రాబల్యానికి ఇది సూచిక. అంతర్జాతీయ పోటీతత్వంతో కృత్రిమే మేధ, సైబర్ భద్రత, డీప్-టెక్, ఆపరేటింగ్ వ్యవస్థల పరంగా ఆవిష్కరణలను ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు.
4. అంతరిక్ష రంగంలో స్వేచ్ఛ:
· గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా సాధించిన అద్భుత విజయాలపై హర్షం వ్యక్తం చేస్తూ- సొంత అంతరిక్ష కేంద్రం దిశగా భారత్ ప్రతిష్ఠాత్మక ప్రణాళికనురచిస్తున్నదని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. ఇది స్వదేశీ అంతరిక్ష సామర్థ్య పురోగమనంలో నవశకానికి సంకేతమని ఆయన అభివర్ణించారు.
· మరోవైపు ఉపగ్రహాలు, అన్వేషణ, అత్యాధునిక అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాల రూపకల్పన లక్ష్యంగా 300కుపైగా అంకుర సంస్థలు చురుగ్గా కృషి చేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. అంతరిక్ష శాస్త్రం-అన్వేషణలో భారత్ తనవంతు పాత్ర పోషించడమేగాక అంతర్జాతీయ స్థాయిలో ముందంజ వేసిందని ఆయన చెప్పారు.
5. కాలుష్యరహిత పునరుత్పాదక ఇంధనం:
· ఇంధన స్వేచ్ఛను ప్రముఖంగా ప్రస్తావిస్తూ- యువతరం ఉజ్వల భవిత, రైతు సంక్షేమం లక్ష్యంగా అవిరళ కృషి చేస్తామని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు.
· ప్రపంచం ఒకవైపు పెరుగుతున్న భూతాపం గురించి చర్చిస్తుండగా, మరోవైపు 2030కల్లా 50 కాలుష్యరహిత ఇంధన ఉత్పాదక సామర్థ్యం సాధించాలని భారత్ కృతనిశ్చయం పూనిందని గుర్తుచేశారు. అయితే, 2025కే ఆ లక్ష్యాన్ని చేరుకున్నామని, ఈ దిశగా ప్రజల నిబద్ధతకు ధన్యవాదాలు చెబుతున్నానని వ్యాఖ్యానించారు.
· సౌర, అణు, జల, హైడ్రోజన్ ఇంధన సామర్థ్యం సాధనలో దేశం ముందడుగు వేసిందని, ఇంధన స్వేచ్ఛ దిశగా పురోగమనాన్ని ఇది సూచిస్తున్నదని పేర్కొన్నారు.
· ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో అణు విద్యుదుత్పాదన విస్తరణపై దేశం దృష్టి సారించిందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 కొత్త అణు రియాక్టర్లు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య శతాబ్ది వేడుకల వేళకు ఈ సామర్థ్యాన్ని 10 రెట్లు పెంచాలని లక్ష్యనిర్దేశం చేసుకున్నట్లు తెలిపారు. ఇంధన స్వావలంబన బలోపేతానికి, సుస్థిర వృద్ధికి ప్రభుత్వ మద్దతు మరింతగా ఉంటుందని ప్రకటించారు.
6. జాతీయ కీలక ఖనిజ కార్యక్రమం: ఇంధన, పారిశ్రామిక, రక్షణ రంగాలకు అవసరమైన వనరుల సముపార్జన కోసం 1,200 ప్రదేశాల్లో అన్వేషణ లక్ష్యంగా జాతీయ కీలక ఖనిజ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఈ ఖనిజాల నియంత్రణ మన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని బలోపేతం చేస్తుందని ఆయన చెప్పారు. మన పారిశ్రామిక, రక్షణ రంగాల స్వావలంబనకు ఇది దోహదం చేస్తుందని స్పష్టం చేశారు.
7. జాతీయ సముద్రగర్భ అన్వేషణ కార్యక్రమం: భారత్ తన ప్రాదేశిక సముద్రగర్భ ఇంధన వనరులను సద్వినియోగం చేసుకుంటుంది. తద్వారా ఇంధన స్వావలంబన ఇనుమడించి, దిగుమతి పరాధీనత గణనీయంగా తగ్గుతుంది.
8. వ్యవసాయ స్వావలంబన-ఎరువులు: రైతుల సాధికారత, జాతీయ ఆహార భద్రతకు భరోసా లక్ష్యంగా దేశీయంగానే ఎరువుల ఉత్పత్తి అత్యావశ్యకమని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. ఎరువుల కోసం దిగుమతులపై ఆధారపడటం తగ్గితే మన వ్యవసాయ రంగం స్వేచ్ఛగా పురోగమిస్తుందన్నారు. దీంతో రైతు సంక్షేమానికే కాకుండా దేశ ఆర్థిక సార్వభౌమత్వ బలోపేతానికీ హామీ ఉంటుందన్నారు.
9. డిజిటల్ సార్వభౌమాధికారం-దేశీయ వేదికలు: పూర్తి భారతీయ సామాజిక మాధ్యమ వేదికలు, డిజిటల్ మౌలిక సదుపాయాలను రూపొందించాలని ప్రధానమంత్రి యువతకు పిలుపునిచ్చారు. అలాగే కమ్యూనికేషన్, డేటా, సాంకేతికావరణ వ్యవస్థలు సురక్షితంగా, స్వతంత్రంగా ఉండేవిధంగా చూడాలన్నారు. దేశం తన డిజిటల్ స్వయంప్రతిపత్తిని బలోపేతం చేసుకోవడం అత్యవసరమని స్పష్టం చేశారు.
10. ఔషధాలు-ఆవిష్కరణల స్వావలంబన: “ప్రపంచ ఔషధ సరఫరాదారు”గా భారత్ తన సామర్థ్యాన్ని చాటుకున్నదని ప్రధానమంత్రి మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. పరిశోధన-ఆవిష్కరణల రంగంలో మరింత పెట్టుబడులు తక్షణావసరమని స్పష్టం చేశారు. “మానవాళి సంక్షేమం కోసం అత్యుత్తమ, అత్యంత చౌక మందులను అందిస్తున్నది మనం కాక మరెవరు?” అని వ్యాఖ్యానించారు.
· దేశీయ ఔషధ ఆవిష్కరణలలో ఇనుమడిస్తున్న భారత్సామర్థ్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. కొత్త మందులు, టీకాలు, ప్రాణరక్షక చికిత్స విధానాలు పూర్తిగా దేశంలోనే రూపొందించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.
· కోవిడ్-19 భారత్ ప్రతిస్పందనలో భాగంగా ప్రపంచ మానవాళి రక్షణకు స్వదేశీ టీకాలతోపాటు ‘కో-విన్’ వంటి వేదికలను రూపొందించామని ప్రధాని గుర్తుచేశారు. ఈ ఆవిష్కరణ స్ఫూర్తిని దేశం మరింత విస్తృతం చేయాలని ఆయన కోరారు.
· భారత్ సొంత ఆరోగ్య సంరక్షణ అవసరాలు తీర్చుకుంటూ ప్రపంచ శ్రేయస్సుకు దోహదం చేస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు. వైద్య రంగంలో స్వావలంబన, ఆవిష్కరణల కూడలిగా తననుతాను నిరూపించుకున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త మందులు, వైద్య సాంకేతిక పరిజ్ఞానాలకు పేటెంట్లు పొందాల్సిందిగా పరిశోధకులు-పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
11. స్వదేశీకి అండదండలు: “స్థానికత కోసం నినాదం” కార్యక్రమం కింద స్వదేశీ వస్తు వినియోగానికి ప్రాధాన్యమివ్వాలని ప్రధానమంత్రి మోదీ పౌరులకు, దుకాణదారులకు సూచించారు. అయితే, ఇది బల ప్రయోగంతో కాకుండా స్వీయ ప్రతిష్ఠ, సామర్థ్యాల ప్రాతిపదికన సాగాలని స్పష్టం చేశారు. స్వావలంబన పెంపు, వ్యవస్థాపనకు మద్దతు సహా దేశ ఆర్థిక-పారిశ్రామిక పునాదిని బలోపేతం చేయడం కోసం ‘స్వదేశీ’ బోర్డుల ఏర్పాటు ద్వారా ప్రచారం చేపట్టాలని దుకాణదారులను కోరారు.
12. మిషన్ సుదర్శన్ చక్ర: సంప్రదాయానికి గౌరవం, రక్షణ బలోపేతం... శత్రు చొరబాట్లను తిప్పికొట్టడం, భారత్ దాడి సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా “మిషన్ సుదర్శన్ చక్ర”ను ప్రారంభించినట్లు ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు.
ఆధునిక రక్షణ రంగ ఆవిష్కరణలకు మార్గనిర్దేశంలో భారత్ తన సమున్నత, సుసంపన్న సాంస్కృతిక-ఐతిహాసిక వారసత్వం నుంచి ప్రేరణ పొందిన తీరును ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందులో భాగంగా పురాణ పురుషుడైన శ్రీ కృష్ణుని సుదర్శన చక్రం స్ఫూర్తిగా రూపొందించిన రక్షణ వ్యవస్థను ఉటంకించారు. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిపై భారత్ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. దీనివల్ల ఎలాంటి ముప్పు తలెత్తినా శరవేగంగా, గురితప్పకుండా శక్తిమంతంగా ప్రతిస్పందించగల భరోసా లభిస్తుందన్నారు.
(Release ID: 2156771)
|