ప్రధాన మంత్రి కార్యాలయం
నమీబియా పార్లమెంటులో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
09 JUL 2025 10:43PM by PIB Hyderabad
నమీబియా జాతీయ అసెంబ్లీ స్పీకర్ గౌరవ సారా కుగోంగెల్వా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. నమీబియా నుంచి వచ్చిన ఈ ప్రత్యేక ఆహ్వానంతో ప్రధానమంత్రి పర్యటన మరింత ఫలప్రదమైంది.
పార్లమెంటును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ.. ప్రజాస్వామ్య మాత, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ తరపున.... గౌరవ పార్లమెంటు సభ్యులకు, నమీబియా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను, స్వాతంత్య్రం కోసం చేసిన ఉమ్మడి పోరాటాలను గుర్తు చేసుకుంటూ.. నమీబియా జాతిపిత డాక్టర్ సామ్ నుజోమాకు ప్రధానమంత్రి నివాళులర్పించారు. ఇరు దేశాల జాతిపితలు ప్రోత్సహించిన ప్రజాస్వామ్య విలువలు, సూత్రాలు రెండు దేశాల్లో పురోగతికి మార్గదర్శనం చేస్తూనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో నమీబియా ప్రభుత్వం, ప్రజల పాత్రను ఆయన ప్రశంసించారు.
ఆ దేశ అత్యున్నత జాతీయ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా నమీబియా ప్రజలకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఇది భారత్-నమీబియా ప్రజాస్వామ్యాల విజయానికి లభించిన గౌరవమని అని ఆయన పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అండగా.. అభివృద్ధి చెందుతున్న దేశాల గళాన్ని ప్రపంచానికి వినిపించడమే కాకుండా, వారి ఆశలు, ఆకాంక్షలను పూర్తిగా నెరవేర్చేందుకు ఇరు దేశాలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జీ20కి అధ్యక్షత వహించిన సమయంలో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం కల్పించినట్లుగానే, భారత్ ఎల్లప్పుడూ ఆఫ్రికా పురోగతి కోసం కృషి చేస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత్ తన అభివృద్ధి అనుభవాన్ని నమీబియాతో పాటు ఇతర ఆఫ్రికా దేశాలతో పంచుకునే అదృష్టం పొందిందన్నారు. సామర్థ్యాలను పెంపొందించడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, స్థానిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఆఫ్రికా ఎజెండా 2063కి మద్దతునివ్వడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
తనకు లభించిన గౌరవం పట్ల స్పీకర్కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఇరుదేశాల ప్రజల మధ్య అనుసంధానత పెరగాలనీ, తద్వారా రెండు ప్రజాస్వామ్యాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన పిలుపునిచ్చారు. "మనం పోరాడి సాధించిన స్వేచ్ఛను మాత్రమే కాకుండా, మనం ఐక్యంగా నిర్మించుకునే భవిష్యత్తును కూడా మన పిల్లలు వారసత్వంగా పొందాలి" అని చెబుతూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
***
(Release ID: 2143619)
Visitor Counter : 4
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam