ప్రధాన మంత్రి కార్యాలయం
‘సంవిధాన్ హత్యా దివస్’ సందర్భంగా ప్రజాస్వామ్య రక్షకులకు ప్రధానమంత్రి నివాళులు
* మన ప్రజాస్వామ్య వ్యవస్థ స్వరూపాన్ని సంరక్షించడానికి ఉన్న ప్రాధాన్యాన్ని
ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం పునరుద్ఘాటించింది: ప్రధానమంత్రి
Posted On:
25 JUN 2025 9:32AM by PIB Hyderabad
దేశంలో ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి)ని విధించిన ఘట్టానికి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, దేశ చరిత్రలో చిమ్మచీకటి కమ్ముకొన్న అధ్యాయాల్లో ఒకటి కొనసాగిన కాలంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో ఎదురొడ్డి నిలిచిన అసంఖ్యాక భారతీయులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక నివాళులు అర్పించారు.
రాజ్యాంగ విలువలపై తీవ్ర దాడి జరగడాన్ని ప్రధానమంత్రి గుర్తు చేస్తూ, జూన్ 25ను ‘సంవిధాన్ హత్యా దివస్’ (రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజు)గా మనం పాటించుకొంటున్నామన్నారు. ఇది ఒక ఎలాంటి రోజంటే- ఆనాడు ప్రాథమిక హక్కులను నిలిపేశారు, పత్రికా స్వేచ్ఛను అంతం చేశారు, ఎంతో మంది రాజకీయ నేతలను, సామాజిక కార్యకర్తలను, విద్యార్థులతో పాటు సామాన్య పౌరులను జైళ్లలోకి నెట్టివేశారు.
మన రాజ్యాంగ సిద్ధాంతాలను పటిష్ఠపరచుకోవడంతో పాటు ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) దార్శనికతను సాకారం చేసుకోవడానికి మనం కలిసికట్టుగా పనిచేయాలన్న అంశానికి కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన నిబద్ధతను మరోసారి చాటారు.
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం పాఠాన్ని నేర్చుకోవలసిన అనుభవం, ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థ స్వరూపాన్ని సంరక్షించుకొనేందుకున్న ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటించింది అని కూడా ప్రధానమంత్రి అన్నారు.
అత్యవసర పరిస్థితి కాలం నాటి చీకటి రోజుల పీడకలలు ఇప్పటికీ ఇంకా తమను వెన్నాడుతున్న వ్యక్తులు గాని లేదా ఆ కాలంలో యాతనలకు గురైన కుటుంబాల సభ్యులు గాని తమ జ్ఞాపకాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాల్సిందిగా శ్రీ మోదీ పిలుపునిచ్చారు. ఇలా చేస్తే 1975 నుంచి 1977 మధ్య కాలపు సిగ్గుచేటైన కాలాన్ని గురించి మన దేశ యువతలో అవగాహనను కలిగించవచ్చని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పొందుపరిచిన అనేక సందేశాల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘భారత్ ప్రజాస్వామ్య చరిత్రలో చిమ్మ చీకటి కమ్ముకొన్న ఓ అధ్యయమైన అత్యవసర పరిస్థితిని అమలు చేసిన తరువాత, ఈ రోజుతో యాభై సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ రోజును ‘సంవిధాన్ హత్యా దివస్ ’ (రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజు)గా భారత్ ప్రజలు పాటిస్తున్నారు. భారత రాజ్యాంగంలో ఉల్లేఖించుకొన్న విలువలను పక్కన పెట్టేసిందీ.. ప్రాథమిక హక్కులను నిలిపేసిందీ.. పత్రికా స్వేచ్ఛను అంతం చేసిందీ.. అనేకమంది రాజకీయ నేతలను, సామాజిక కార్యకర్తలను, విద్యార్థులతో పాటు సామాన్య పౌరులను కూడా జైళ్లలోకి నెట్టేసిందీ.. ఇవన్నీ జరిగిన రోజు ఇదే. ఆ కాలంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బందీని చేసేసిందా అని అనిపించింది! #SamvidhanHatyaDiwas’’
‘‘మన రాజ్యాంగ స్ఫూర్తిని ఏ విధంగా ఉల్లంఘించారో, పార్లమెంటు వాణిని ఎలా అణచివేశారో, న్యాయస్థానాలను నియంత్రణలో పెట్టుకొనేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరిగాయో దేశంలోని ప్రతి ఒక్కరూ ఎప్పటికీ మరచిపోలేరు. 42వ సవరణ అప్పటి పాలకుల వంచనకు, కపటానికి ఒక ప్రధాన ఉదాహరణ. పేదలను, పీడితులను, తాడితులను తమ ముఖ్య లక్ష్యాలుగా ఎంచుకొన్నారు. వారి ఆత్మగౌరవాన్ని అవమానించడం కూడా దీనిలో ఓ భాగంగా ఉంది. #SamvidhanHatyaDiwas’’
‘‘అత్యవసర స్థితికి ఎదురొడ్డి నిలిచి పోరాడిన ప్రతి ఒక్క వ్యక్తికి మనం నమస్కరిద్దాం. వీరు దేశం నలుమూలల్లో వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు, ప్రతి రంగం నుంచి కదిలి ముందుకు వచ్చిన వారు, వివిధ ఆలోచనావిధానాలు కలిగి ఉన్న వారు.. వీరందరూ భుజం భుజం కలిపి పనిచేశారు.. వీరందరిదీ ఒకే ధ్యేయం.. అది, భారతదేశ ప్రజాస్వామిక యవనికను కాపాడడం.. మన స్వాతంత్య్ర సమర యోధులు తమ జీవితాలను అంకితం చేసిన ఆదర్శాలను పరిరక్షించడం. వారి సామూహిక సంఘర్షణే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంతో పాటు కొత్తగా ఎన్నికలను నిర్వహించేటట్లుగా చేసింది.. ఆ ఎన్నికల్లో వారు ఘోర పరాజయం పాలయ్యారు. #SamvidhanHatyaDiwas’’
‘‘మన రాజ్యాంగ సిద్ధాంతాలను బలపరచాలన్న నిబద్ధతతో పాటు ‘వికసిత్ భారత్’ సాధన దిశగా పయనించాలన్న మన ఆశయాన్ని సాధించుకోవడానికి మనమంతా కలిసికట్టుగా కృషిచేద్దామని కూడా మరోసారి చాటిచెబుదాం. పేదలు, అణగారిన వర్గాల కలలను పండించడంతో పాటు నూతన ప్రగతి శిఖరాలను అధిరోహించాలని నేను కోరుకుంటున్నాను. #SamvidhanHatyaDiwas’’
‘‘ఎమర్జెన్సీని విధించినప్పుడు, ఆర్ఎస్ఎస్ యువ ప్రచారక్లలో నేనూ ఒకరుగా ఉన్నాను. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం నాకు అనేక విషయాలను నేర్పించింది. మన ప్రజాస్వామ్య వ్యవస్థ స్వరూపాన్ని సంరక్షించుకోవడానికి ఉన్న ప్రాధాన్యాన్ని ఆ ఉద్యమం పునరుద్ఘాటించింది. అదే కాలంలో, రాజకీయ రంగంలో ఉన్న వారి వద్ద నుంచి ఎన్నో అంశాలను నేర్చుకొనే అవకాశం నాకు లభించింది. కొన్ని అనుభవాలను పుస్తక రూపంలో బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ (BlueKraft Digital Foundation) తీసుకువచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ పుస్తకానికి ముందుమాటను శ్రీ హెచ్.డి. దేవె గౌడ గారు రాశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన దిగ్గజాల్లో ఆయనా ఒకరు.
@BlueKraft
@H_D_Devegowda
#SamvidhanHatyaDiwas’’
‘‘ఎమర్జెన్సీ అమలైన కాలంలో నా జీవన యాత్రను ‘ద ఎమర్జెన్సీ డైరీస్’ వివరిస్తుంది. అది ఆ కాలంలోని అనేక జ్ఞాపకాలను మళ్లీ ఓసారి గుర్తుకు తెచ్చింది.
అత్యవసర పరిస్థితి కాలం నాటి చీకటి రోజుల పీడకలలు ఇప్పటికీ ఇంకా తమను వెన్నాడుతున్న వ్యక్తులు గాని లేదా ఆ కాలంలో యాతనలకు గురైన కుటుంబాల సభ్యులు గాని తమ జ్ఞాపకాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాల్సిందిగా వారికి నేను పిలుపునిస్తున్నాను. ఈ పనిని చేయడం వల్ల 1975 నుంచి 1977 మధ్య కాలపు సిగ్గుచేటైన కాలాన్ని గురించి మన దేశ యువతలో అవగాహనను ఏర్పడుతుంది.
#SamvidhanHatyaDiwas’’
(Release ID: 2139473)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Nepali
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam