ప్రధాన మంత్రి కార్యాలయం
ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
20 JUN 2025 7:48PM by PIB Hyderabad
జైజగన్నాథ్!
జై బాబా లింగరాజ్ !
నా ప్రియమైన ఒడిశా ప్రజలకు శుభాకాంక్షలు, జోహార్!
ఒడిశా గవర్నర్ శ్రీ హరిబాబు, ప్రజాదరణ పొందిన మన ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఘీ, నా కేంద్ర మంత్రివర్గ సహచరులు శ్రీ జువాల్ ఓరం, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీ అశ్వినీ వైష్ణవ్, ఒడిశా ఉప ముఖ్యమంత్రులు శ్రీ కనక్ వర్ధన్ సింగ్ దేవ్, శ్రీమతి ప్రవతి పరీడా, రాష్ట్ర మంత్రులూ, పార్లమెంటు సభ్యు లూ, శాసనసభ సభ్యులూ, ఇంకా నా ఒడిశా సోదరసోదరీమణులారా!
ఈరోజు, జూన్ 20, చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ఒడిశాలో మొదటి బీజేపీ ప్రభుత్వం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ వార్షికోత్సవం కేవలం ఒక ప్రభుత్వానిది కాదు. ఇది సుపరిపాలనకు వార్షికోత్సవం. ఇది ప్రజల సేవకు, ప్రజల నమ్మకానికి అంకితమయిన సంవత్సరం. ఒడిశాలోని కోట్లాదిమంది ఓటర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలకు ఇది ఒక గుర్తించదగిన సంవత్సరం. ఒడిశా ప్రజలకు, మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి శ్రీ మోహన్ మాఝీ, ఆయన బృందానికి కూడా నా శుభాకాంక్షలు. మీరంతా ప్రశంసనీయమైన కృషితో ఒడిశా అభివృద్ధికి కొత్త ఊపునిచ్చారు.
మిత్రులారా,
ఒడిశా కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు. ఒడిశా భారత వారసత్వంలో ఒక దివ్య తార. వందల సంవత్సరాలుగా ఒడిశా భారత నాగరికతను, సంస్కృతిని సుసంపన్నం చేసింది. అందుకే నేడు, 'వికాస్' (అభివృద్ధి), 'విరాసత్' (వారసత్వం) మంత్రం భారత పురోగతికి పునాదిగా మారిన వేళ, ఒడిశా పాత్ర మరింత గొప్పదిగా మారింది. గత సంవత్సరంలో, ఒడిశా నిజంగా 'వికాస్ భీ, విరాసత్ భీ' అంటే అభివృద్ధి, వారసత్వం రెండూ- అనే ఈ మంత్రాన్ని స్వీకరించి వేగంగా ముందుకు సాగింది.
మిత్రులారా,
ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సమయంలో, మీరంతా జగన్నాథ రథయాత్ర సన్నాహాల్లో నిమగ్నమై ఉండటం ఒక ఆహ్లాదకరమైన యాదృచ్ఛికం. మహాప్రభువు మనకు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు. ఆయన మనకు స్ఫూర్తినిచ్చే మూలం కూడా. ఆయన ఆశీస్సులతో, శ్రీమందిరానికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారమయ్యాయి. లక్షలాది భక్తుల ఆకాంక్షలను గౌరవించినందుకు ముఖ్యమంత్రి మోహన్ కు, ఆయన ప్రభుత్వానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను.. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, శ్రీమందిరం నాలుగు ద్వారాలు తెరుచుకున్నాయి. శ్రీమందిరం లోని రత్న భండార్ (ఆభరణాల గది) ను కూడా తెరిచారు. నేను స్పష్టం చేయదలుచుకున్నది ఏమిటంటే — ఇది రాజకీయ లాభం లేదా విజయానికి సంబంధించిన విషయం కాదు. ఇది కోట్లాది మంది భక్తుల ప్రగాఢ విశ్వాసాన్ని గౌరవించే చర్య.
మిత్రులారా,
కేవలం రెండు రోజుల క్రితం, నేను జీ7 సదస్సు కోసం కెనడాలో ఉన్నప్పుడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాకు ఫోన్ చేశారు. ఆయన మాట్లాడుతూ, "మీరు ఇప్పటికే కెనడాలో ఉన్నారు కాబట్టి, వాషింగ్టన్కు వచ్చి వెళ్లవచ్చు కదా? మనం కలిసి భోజనం చేస్తూ మాట్లాడుకుందాం" అని నన్ను ఆప్యాయంగా ఆహ్వానించారు. నేను అమెరికా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపి, "మీ ఆహ్వానానికి ధన్యవాదాలు, కానీ మహాప్రభువు పుణ్యభూమికి వెళ్లడం నాకు అత్యవసరం" అని చెప్పాను. అలా నేను ఆయన ఆహ్వానాన్ని గౌరవపూర్వకంగా తిరస్కరించాను. మీ ప్రేమ, మహాప్రభువుపై భక్తి నన్ను ఈ పవిత్ర భూమికి తీసుకువచ్చాయి.
సోదరసోదరీమణులారా,
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దశాబ్దాల పాటు, దేశం కాంగ్రెస్ నమూనాను చూసింది. కాంగ్రెస్ నమూనా సుపరిపాలనను అందించలేదు. ప్రజల జీవితాలను సులభతరం చేయలేదు. తీవ్రమైన అవినీతితో పాటు అభివృద్ధి ప్రాజెక్టులను ఆలస్యం చేయడం, నిలిపివేయడం, అడ్డుకోవడం కాంగ్రెస్ అభివృద్ధి నమూనాకు ప్రత్యేక లక్షణాలుగా మారాయి. కానీ ఇప్పుడు, గత కొన్ని సంవత్సరాలుగా దేశం బీజేపీ అభివృద్ధి నమూనాను చూస్తోంది. గత దశాబ్దంలో, బీజేపీ మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో కేవలం ప్రభుత్వ మార్పు మాత్రమే కాదు... అది సామాజిక, ఆర్థిక మార్పు దిశగా కూడా కొత్త శకానికి నాంది పలికింది. తూర్పు భారతదేశంలోని ఉదాహరణలతో దీన్ని వివరిస్తాను. అస్సాం ఉదాహరణను తీసుకోండి. పదేళ్ల క్రితం, అస్సాం పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. అస్థిరత, వేర్పాటువాదం, హింస విపరీతంగా ఉండేవి. కానీ నేడు, అస్సాం అభివృద్ధిలో కొత్త మార్గంలో దూసుకుపోతోంది. దశాబ్దాలుగా కొనసాగిన విద్రోహ కార్యకలాపాలు ముగిశాయి. అనేక రంగాలలో, అస్సాం ఇప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తోంది. అదేవిధంగా, నేను మరొక రాష్ట్రం గురించి చెప్పదలుచుకున్నాను. అది త్రిపుర. దశాబ్దాల వామపక్ష పాలన తర్వాత, ప్రజలు బీజేపీకి మొదటిసారి అవకాశం ఇచ్చారు. త్రిపుర కూడా అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉండేది. మౌలిక సదుపాయాలు దారుణంగా ఉండేవి. ప్రజల గొంతులు ప్రభుత్వ యంత్రాంగానికి వినిపించేవి కావు. ప్రజలంతా హింస, అవినీతితో ఇబ్బంది పడుతుండేవారు. కానీ బీజేపీకి సేవ చేసే అవకాశం లభించినప్పటి నుంచి త్రిపుర ఇప్పుడు శాంతి, పురోగతికి ప్రతీకగా మారుతోంది.
మిత్రులారా,
మన ఒడిశా కూడా దశాబ్దాలుగా అనేక సమస్యలతో సతమతమవుతూ వచ్చింది. పేదలు, రైతులకు న్యాయబద్ధమైన వాటా లభించలేదు. అవినీతి, జాప్యం ప్రబలంగా ఉండేవి. ఒడిశాలో మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగా ఉండేవి. ఒడిశాలోని అనేక ప్రాంతాలు అభివృద్ధి పరుగులో నిరంతరం వెనుకబడి పోయాయి. ఈ సవాళ్లు ఒడిశా దురదృష్టకర వాస్తవంలో ఒక భాగంగా మారాయి. ఈ సవాళ్లను అధిగమించడానికి గత ఒక్క సంవత్సరంలోనే బీజేపీ ప్రభుత్వం పూర్తి శక్తితో నిబద్ధతతో పనిచేసింది.
మిత్రులారా,
ఇక్కడ పనిచేస్తున్న డబుల్-ఇంజిన్ అభివృద్ధి నమూనా దాని ప్రయోజనాలను స్పష్టంగా చూపుతోంది. నేడు కూడా, వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన ఈ డబుల్ ఇంజిన్ ముద్రను కలిగి ఉన్నాయి. డబుల్ ఇంజిన్ ఒడిశా ప్రజలకు రెట్టింపు ప్రయోజనాలను అందించింది. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఒడిశాలోని కోట్లాది పేద కుటుంబాలు చాలా కాలంగా ఆయుష్మాన్ భారత్ పథకం ప్రయోజనాలకు దూరంగా ఉన్న విషయం మీకు తెలుసు. నేడు ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన, గోపబంధు జన్ ఆరోగ్య యోజన రెండూ కలిసి నడుస్తున్నాయి. దీని ఫలితంగా, ఒడిశాలో సుమారు 3 కోట్ల మంది ప్రజలకు ఇప్పుడు ఉచిత వైద్య చికిత్సకు హామీ లభించింది. ఒడిశాలోని ఆసుపత్రులలో మాత్రమే కాదు... ఒడిశా నుంచి ఎవరైనా మరో రాష్ట్రంలో పని చేయడానికి వెళ్ళినా, అవసరమైనప్పుడు వారికి అక్కడ కూడా ఉచిత వైద్య చికిత్స లభిస్తోంది. నేను గమనించిన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను గుజరాత్లో పుట్టాను. సూరత్లో మీకు అడుగడుగునా ఒడిశా వ్యక్తులు తగులుతారు. అంత మంది ఒడియా ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. ఇప్పుడు, సూరత్లో నివసిస్తున్న ఒడియా సోదర సోదరీమణులు కూడా ఈ పథకం నుంచి నుండి ప్రయోజనం పొందుతారు. ఇప్పటివరకు, ఒడిశా నుంచి రెండు లక్షల మంది ప్రజలు ఈ పథకం కింద చికిత్స పొందారు. వారిలో చాలా మంది దేశవ్యాప్తంగా డజనుకు పైగా రాష్ట్రాలలో ఉచిత వైద్య సేవలను పొందారు. సంవత్సరం కిందట ఇంత మంది ప్రజలకు ఇటువంటి సౌకర్యం ఊహించనిది. ఈ డబుల్-ఇంజిన్ నమూనాకు ధన్యవాదాలు. మనం ఊహించిన దానికంటే గొప్పదాన్ని సాధించాం. ఒక సువర్ణావకాశం మరింత ప్రత్యేకంగా మారింది.
ఇక్కడ ఒడిశాలో, 70 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు 23 లక్షల మందికి పైగా ఉన్నారు. పీఎం వయ వందన యోజన ద్వారా, వారికి ఇప్పుడు 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది. అంటే, సాధారణ కుటుంబాల అతి పెద్ద ఆందోళనల్లో ఒకదానికి మన ప్రభుత్వం పరిష్కారం చూపింది. అదేవిధంగా, ఇంతకు ముందు, ఒడిశాలోని రైతులకు పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పూర్తి ప్రయోజనాలు లభించలేదు. ఇప్పుడు, ఒడిశాలోని రైతులు కేంద్ర, రాష్ట్ర పథకాలు రెండింటి నుంచీ ద్వంద్వ ప్రయోజనాలను పొందుతున్నారు. వరి ధాన్యానికి కనీస మద్దతు ధరను పెంచుతామని మనం ఇచ్చిన హామీ లక్షలాది వరి రైతులకు కూడా ప్రయోజనం చేకూర్చింది.
మిత్రులారా,
గతంలో అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల పూర్తి ప్రయోజనాలు ఒడిశాకు చేరలేదు. కానీ ఇప్పుడు ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రెండింటి ప్రయోజనాలను పొందుతున్నారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో మనం తల్లులకు, సోదరీమణులకు, రైతులకు, యువతకు ఇచ్చిన హామీలు క్షేత్ర స్థాయిలో వేగంగా అమలు జరుగుతున్నాయి.
మిత్రులారా,
మన ప్రభుత్వ అతి పెద్ద విజయాలలో ఒకటి బలహీన వర్గాల సాధికారత. ఒడిశాలో, జనాభాలో పెద్ద భాగం మన గిరిజన వర్గాలకు చెందినవారు. దురదృష్టవశాత్తు, ఈ వర్గాలను గతంలో నిరంతరం నిర్లక్ష్యం చేశారు. వారు వెనుకబాటుతనం, పేదరికం, వంచనకు గురయ్యారు. దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన పార్టీ గిరిజన జనాభాను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఒక సాధనంగా ఉపయోగించింది. వారు గిరిజన వర్గాలకు అభివృద్ధిని గానీ, భాగస్వామ్యాన్ని గానీ ఇవ్వలేదు. బదులుగా, వారు దేశంలోని విస్తారమైన ప్రాంతాలను నక్సలిజం, హింస, అణచివేత అగ్నిగుండంలోకి నెట్టారు.
మిత్రులారా,
2014 ముందు పరిస్థితి ఎలా ఉందంటే, దేశంలోని 125కు పైగా గిరిజన ప్రాబల్య జిల్లాలు నక్సల్స్ హింసాత్మక చర్యల పట్టులో ఉండేవి. గిరిజన ప్రాంతాలు "రెడ్ కారిడార్" అనే ముద్రతో అపఖ్యాతి పాలయ్యాయి. ఈ జిల్లాల్లో చాలా వాటిని కేవలం "వెనుకబడినవి"గా ప్రకటించి, ప్రభుత్వాలు వాటి బాధ్యత నుంచి తప్పుకున్నాయి.
సోదరసోదరీమణులారా,
ఇటీవలి సంవత్సరాలలో, గిరిజన వర్గాలను హింసాత్మక వాతావరణం నుంచి బయటకు తీసుకువచ్చి, వారిని అభివృద్ధి పధంలోకి నడిపించడానికి మేం కృషి చేశాం. బీజేపీ ప్రభుత్వం ఒకవైపు హింసను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ, మరోవైపు గిరిజన ప్రాంతాలలో అభివృద్ధిని తీసుకువచ్చింది. దీని ఫలితంగా, నేడు దేశం మొత్తం మీద నక్సల్స్ హింస కేవలం 20 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. చర్యలు తీసుకుంటున్న వేగాన్ని బట్టి చూస్తే, అతి త్వరలో మన గిరిజన సోదర,సోదరీమణులు హింస నుంచి పూర్తిగా విముక్తి పొందుతారు. దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. ఇది మోదీ హామీ.
మిత్రులారా,
మన గిరిజన సోదరసోదరీమణుల కలలను నెరవేర్చడం, వారికి కొత్త అవకాశాలను కల్పించడం, వారి జీవితాల్లోని కష్టాలను తగ్గించడం మన ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతలు. అందుకే, గిరిజన అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రెండు ప్రధాన జాతీయ పథకాలు మొదటిసారిగా ప్రారంభమయ్యాయి. ఈ రెండు పథకాలపై లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నాం. మొదటి పథకం బిర్సా ముండా పేరు మీదుగా ప్రారంభించిన 'ధర్తి ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్'. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 60,000కు పైగా గిరిజన గ్రామాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఒడిశాలో కూడా గిరిజన కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తున్నారు. రోడ్లు వేస్తున్నారు. విద్యుత్ ను, స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు. ఒడిశాలోని 11 జిల్లాల్లో 40 రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా నిర్మిస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది.
మిత్రులారా,
రెండో పథకం పీఎం-జన్ మన్ యోజన. ఈ పథకానికి స్ఫూర్తి ఒడిశా గడ్డ నుంచే వచ్చింది. దేశానికి మొదటి గిరిజన మహిళా రాష్ట్రపతి, ఒడిశా ముద్దుబిడ్డ, గౌరవ ద్రౌపది ముర్ము ఈ పథకాన్ని రూపొందించడంలో మనకు మార్గనిర్దేశం చేశారు. ఈ పథకం కింద, అత్యంత బలహీనమైన గిరిజన వర్గాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారి అనేక చిన్న గిరిజన ఆవాసాలలో, వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
మిత్రులారా,
ఒడిశాలో పెద్ద సంఖ్యలో మత్స్యకారులు నివసిస్తున్నారు. వారి కోసం కూడా, మొదటిసారిగా ఒక పెద్ద దేశవ్యాప్త పథకం- పీఎం మత్స్య సంపద యోజన అమలు జరుగుతోంది. మొట్టమొదటిసారిగా, మత్స్యకారులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు అందుబాటులోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది ఒడిశాలోని తీరప్రాంత మత్స్యకార సమాజాలకు, యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.
మిత్రులారా,
21వ శతాబ్దపు భారతదేశ అభివృద్ధికి తూర్పు భారతదేశం వేగాన్ని అందిస్తోంది. ఇది పూర్వోదయ- తూర్పు ప్రాంత ఆవిర్భావ శకం. ఈ స్ఫూర్తితో, ఒడిశాతో పాటు దేశంలోని తూర్పు ప్రాంతం మొత్తం అభివృద్ధికి మేము అంకితమయ్యాం. ఒక సంవత్సరం కిందట ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఈ లక్ష్యాన్ని మరింత వేగవంతం చేసింది. పరదీప్ నుంచి ఝార్సుగూడ వరకు పారిశ్రామిక ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. ఇది ఒడిశా ఖనిజ, ఓడరేవు ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్డు, రైలు విమాన మార్గాల కనెక్టివిటీ కోసం వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది. పరదీప్లో మెగా డ్యూయల్-ఫీడ్ క్రాకర్, డౌన్స్ట్రీమ్ యూనిట్ల స్థాపన కావచ్చు. చండిఖోల్లో క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ సౌకర్యం కావచ్చు. లేదా గోపాల్పూర్లో ఎల్ఎన్జీ టెర్మినల్ నిర్మాణం కావచ్చు - ఇవన్నీ ఒడిశాను ఒక ప్రధాన పారిశ్రామిక రాష్ట్రంగా నిలుపుతాయి. పెట్రోలియం, పెట్రోకెమికల్స్, వస్త్రాలు, ప్లాస్టిక్లకు సంబంధించిన పరిశ్రమలు ఇక్కడ గణనీయమైన ప్రోత్సాహాన్ని పొందుతాయి. ఇది చిన్న, మధ్య తరహా పరిశ్రమల విస్తృత వ్యవస్థను సృష్టిస్తుంది. యువతకు లక్షలాది కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. ఇటీవలి సంవత్సరాలలో, ఒడిశాలో ఒక్క పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగంలో సుమారు 1.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఒడిశా భారతదేశ పెట్రోకెమికల్ కేంద్రంగా మారడానికి శరవేగంగా పురోగమిస్తోంది.
మిత్రులారా,
పెద్ద లక్ష్యాలను సాధించడానికి మనం ఇంకా చాలా దూరం చూడాలి. మనకు దూరదృష్టి కావాలి. ఇక్కడ మన బీజేపీ ప్రభుత్వం కేవలం ఒక సంవత్సరం విజయాలను జరుపుకోవడానికి లేదా ఐదేళ్ల వ్యవధికి మాత్రమే ఆలోచించడానికి పరిమితం కాబోదు.. ఇది రాబోయే దశాబ్దాల పాటు ఒడిశా అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక ప్రణాళికపై పనిచేస్తోంది. రాష్ట్రం ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే 2036 సంవత్సరం కోసం ఒడిశా ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే 2047 నాటికి కూడా ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం ఒక దార్శనికతను కలిగి ఉంది. నేను ఒడిశా విజన్ 2036ని సమీక్షిస్తున్నాను. అందులో కొన్ని చాలా ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలు ఉన్నాయి. ఒడిశా యువత ప్రతిభ, కష్టపడే తత్వంతో మీరు ప్రతి ఒక్క లక్ష్యాన్ని సాధిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. అందరం కలిసి ఒడిశాను అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్తాం. ఈ వాగ్దానంతో, మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మరోసారి అందరికీ నా ఆత్మీయ శుభాకాంక్షలు!
జై జగన్నాథ్!
జై జగన్నాథ్!
జై జగన్నాథ్!
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సుమారు తెలుగు అనువాదం.
***
(Release ID: 2139070)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam