ప్రధాన మంత్రి కార్యాలయం
సైప్రస్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ
Posted On:
16 JUN 2025 3:15PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షులు శ్రీ నికోస్ క్రిస్టోడౌలిడెస్తో అధికారిక చర్చలు నిర్వహించారు. అధ్యక్ష భవనం వద్దకు చేరుకున్న ప్రధానమంత్రికి సైప్రస్ అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్ సంప్రదాబద్ధంగా స్వాగతం పలికారు. నిన్న ప్రధానమంత్రి సైప్రస్ చేరుకున్నపుడు కూడా అధ్యక్షుడు శ్రీ క్రిస్టోడౌలిడెస్ విమానాశ్రయంలో ప్రధానమంత్రిని సాదరంగా స్వాగతించారు. ఇది ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం, శాశ్వత స్నేహాన్నీ ప్రతిబింబిస్తుంది.
భారత్-సైప్రస్ సంబంధాలకు ఆధారమైన ఉమ్మడి విలువలను ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. ఇరు దేశాలు వారి సార్వభౌమత్వాన్నీ, ప్రాదేశిక సమగ్రతనూ పరస్పరం గౌరవిస్తున్నట్లు తెలిపారు. 2025, ఏప్రిల్ నెలలో పహల్గామ్లో జరిగిన అనాగరిక ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించడంతో పాటు.. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు సంఘీభావం ప్రకటించిన సైప్రస్కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇరు దేశాల బలమైన నిబద్ధతను ఇది స్పష్టం చేస్తుంది. సైప్రస్ ఐక్యతకు.. యూఎన్ భద్రతా మండలి తీర్మానాలు, అంతర్జాతీయ చట్టాలు, ఈయూ అక్విస్ విషయంలో సైప్రస్ ఇబ్బందులను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు భారత్ మద్దతుగా నిలుస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
వాణిజ్యం, పెట్టుబడి, శాస్త్రీయ పరిశోధన, సాంస్కృతిక సహకారం, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు సహా ద్వైపాక్షిక సంబంధాల పరంగా వివిధ అంశాల్లో కొనసాగుతున్న సహకారాన్ని ఇరువురు నాయకులు సమీక్షించారు. ఫిన్టెక్, అంకురసంస్థలు, రక్షణ రంగం, కనెక్టివిటీ, ఆవిష్కరణ, డిజిటలైజేషన్, ఏఐ, రవాణా వంటి రంగాలకూ సహకారాన్ని విస్తరించే మార్గాలను అన్వేషించారు. వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి అయిదేళ్ల ప్రణాళిక రూపకల్పనకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఉగ్రవాదం, మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా వంటి సమస్యలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకునే యంత్రాంగం ఏర్పాటుతో పాటు, సైబర్.. సముద్ర భద్రతా వ్యవస్థల ఏర్పాటుకు కూడా అంగీకరించారు. ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యానికి కచ్చితమైన రూపాన్ని ఇచ్చేందుకు గానూ 2025, జనవరి నెలలో సంతకాలు చేసిన ద్వైపాక్షిక రక్షణ సహకార కార్యక్రమాన్ని ఇరువురు నేతలు ప్రశంసించారు. ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించడం కోసం భారత్-గ్రీస్-సైప్రస్ (ఐసీజీ) వాణిజ్య-పెట్టుబడి మండలి ఏర్పాటును వారు స్వాగతించారు. వాణిజ్యం, పర్యాటకం, విజ్ఞానం, ఆవిష్కరణల్లో సంబంధాలను బలోపేతం చేయడం కోసం విమాన కనెక్టివిటీని పెంచడం గురించి కూడా ఇరువురు నేతలు చర్చించారు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ [ఐఎమ్ఈసీ] ఈ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సులకు దోహదం చేస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణతో సహా ప్రపంచ పాలనా సంస్థల బహుపాక్షికత, సంస్కరణల పట్ల ఇరువురు నేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. సంస్కరించిన యూఎన్ఎస్సీలో భారత శాశ్వత సభ్యత్వానికి సైప్రస్ తరపున మద్దతును పునరుద్ఘాటించిన అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమాసియా, ఐరోపాలో కొనసాగుతున్న ఘర్షణలు సహా పలు ప్రపంచ సమస్యలపై వారు అభిప్రాయాలను పంచుకున్నారు.
భారత్ ను సందర్శించాల్సిందిగా అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్ను ప్రధానమంత్రి ఆహ్వానించారు. ఈ పర్యటన సందర్భంగా నికోసియా విశ్వవిద్యాలయంలో ఇండియా స్టడీస్ ఐసీసీఆర్ చెయిర్ ఏర్పాటు కోసం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. సమావేశం అనంతరం భారత్-సైప్రస్ భాగస్వామ్యంపై సంయుక్త ప్రకటన జారీ చేశారు. [Link]
***
(Release ID: 2136748)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam