ఆయుష్
2025 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరో మైలురాయిగా మాత్రమే పరిగణించలేం, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ఉద్యమానికి ఇదొక ప్రతీక: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ ప్రతాప్ రావు జాధవ్
ప్రధాని నేతృత్వంలో లక్షలాది యోగ సాధకులతో విశాఖపట్నంలో చారిత్రాత్మక 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం
Posted On:
12 JUN 2025 5:09PM by PIB Hyderabad
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ(ఐడీవై) సన్నాహక కార్యక్రమాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ వేదికగా నిర్వహించింది. 2025 ఐడీవైకి సంబంధించి, జూన్ 21న ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగే భారీ జాతీయ కార్యక్రమానికి ప్రారంభసూచకంగా ఈ అధికారిక కార్యక్రమం జరిగింది.
కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)... ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ జాధవ్, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచాతో కలిసి మీడియా ప్రతినిధులనుద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
సమావేశంలో ప్రసంగించిన ఆయుష్ మంత్రి శ్రీ ప్రతాప్ రావు జాధవ్, గత దశాబ్దంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సాధించిన అద్భుతమైన ప్రగతిని వివరించారు. "మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతతో ఇచ్చిన పిలుపుకు స్పందించిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ, జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తిస్తూ 2014లో తీర్మానాన్ని ఆమోదించింది. ఆ నిర్ణయంతో, భారతదేశ సంప్రదాయ విజ్ఞాన మూలాలు గల యోగా, ప్రపంచ ఆరోగ్య సంక్షేమ ఉద్యమానికి దారిదీపంగా మారింది." అని మంత్రి అన్నారు.
2015 నుంచే ప్రపంచవ్యాప్తంగా ఐడీవైని గొప్ప ఉత్సాహంతో జరుపుకోవడం ప్రారంభమైందని మంత్రి తెలిపారు. "న్యూఢిల్లీలో రికార్డు సృష్టించిన తొలి కార్యక్రమం నుంచి మైసూరు, న్యూయార్క్, శ్రీనగర్లలో జరిగిన వేడుకల వరకు, ఐడీవై ప్రతి సంచిక, ఆరోగ్యం, శాంతి అనే ఉమ్మడి ఆశయం గల భిన్న సంస్కృతుల ప్రజలను ఏకం చేసింది" అని పేర్కొన్నారు.
ఈ యేటి వేడుకల ప్రాముఖ్యాన్ని గురించి చెబుతూ, “11వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కేవలం ఒక వార్షిక స్మారక కార్యక్రమం కాదు - సమాజంలోని అన్ని వర్గాలకూ యోగాని చేరువ చేసేందుకు వీలుగా మనం సమష్టిగా చేపట్టే కృషిని మరింతగా పెంచాలన్న సూచనను అందించే సందర్భం” అని మంత్రి అన్నారు. ‘ఒకే పుడమి, ఒకే ఆరోగ్య లక్ష్యం దిశగా యోగా’ అనే ఇతివృత్తం, భారతదేశం జి-20 అధ్యక్షత సమయంలో ప్రతిపాదించిన ప్రపంచ ఆరోగ్య దృక్పథంతో సరిపోలుతుందని, ‘సర్వే సంతు నిరామయ’ - “అందరికీ వ్యాధుల నుంచి విముక్తి లభించాలి” అన్న భారతీయ ఆదర్శ సూత్రాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నం వేదికగా, కామన్ యోగా ప్రోటోకాల్ (సీవైపీ) పేరిట ప్రధానమంత్రి నేతృత్వంలో జూన్ 21న జరిగే జాతీయ కార్యక్రమంలో అయిదు లక్షల మంది పాల్గొంటారని మంత్రి వెల్లడించారు. అదే సమయంలో, దేశంలోని ఒక లక్ష ప్రాంతాల్లో ‘యోగా సంగం’ పేరిట యోగా కార్యక్రమాలు జరుగుతాయని... ఏకకాలంలో, భారీ సంఖ్యలో ప్రజలు పాలుపంచుకునే అత్యద్భుత యోగా వేడుకగా ఇది చరిత్ర సృష్టిస్తుందని మంత్రి చెప్పారు. క్రమం తప్పకుండా యోగాను ఆచరించే 10 లక్షల సాధకులను తయారుచేయాలన్న ఉద్దేశంతో ‘యోగా ఆంధ్ర’ ఉద్యమాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడి కృషిని ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
2025 ఐడీవైలో భాగంగా 100 రోజుల పాటు జరిగే పది ప్రత్యేక కార్యక్రమాల గురించి చెబుతూ, ఇవి సమాజంలోని భిన్న వర్గాలకు సులువుగా చేరువయ్యేందుకు రూపొందాయని, సుఖ జీవనం కోసం యోగాను చేపట్టేందుకు ప్రజలును ప్రోత్సాహిస్తాయని చెప్పారు. కార్యక్రమాల్లో భాగమైన ‘యోగా సమావేశ్’ సార్వజనీనతకు ప్రాముఖ్యం ఇస్తే, ‘యోగా బంధం’ కార్యక్రమం అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్యాలకి ప్రాముఖ్యాన్నిస్తుందని, ఈ కార్యక్రమాలన్నీ యోగాను సాధారణ ప్రజలకు చేరువ చేసేందుకు ఉద్దేశించిన ప్రభుత్వ దార్శనిక పథకాలేనని మంత్రి చెప్పారు.
ప్రధాన కార్యక్రమానికి ముందస్తుగా ఢిల్లీ, భువనేశ్వర్, నాసిక్, పుదుచ్చేరిలలో వరుసగా 100 రోజులు, 75 రోజులు, 50 రోజులు, 25 రోజుల ‘కౌంట్డౌన్’ కార్యక్రమాల శ్రేణికి లభించిన అనూహ్యమైన స్పందనను ప్రస్తావిస్తూ, ఇవి ప్రధాన కార్యక్రమానికి బలమైన ఊపును అందించాయని సంతోషం వ్యక్తం చేశారు.
“యోగా కేవలం భంగిమలు, శ్వాస క్రియలకు మాత్రమే పరిమితమైనది కాదు – అది ఒక జీవన విధానం. లక్షలాది మంది యోగాను వారి రోజువారీ దినచర్యలో భాగం చేసకుని, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాలను గడిపేందుకు, తద్వారా ప్రశాంతమైన సమాజాన్ని తీర్చిదిద్దేందుకు ఐడీవైని ఒక మైలురాయి కార్యక్రమంగా నిర్వహించాలని తలపెట్టాం, ఈ దిశగా మీ మద్దతును కోరుతున్నాం” అని శ్రీ జాధవ్ మీడియాకు విజ్ఞప్తి చేశారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా ప్రపంచ దేశాల భాగస్వామ్యం గురించిన విశేషాలను పంచుకుంటూ, 2025 ఐడీవై సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా 60కి పైగా దేశాలు ఇప్పటికే తత్సంబంధిత కార్యకలాపాలను ప్రారంభించాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా గల యోగా ఔత్సాహికులు ‘ఒకే పుడమి, ఒకే ఆరోగ్య లక్ష్యం దిశగా యోగా’ అనే ఇతివృత్తం, పది ప్రత్యేక ఈవెంట్లతో అనుసంధానమైన కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తున్నారని, ఇది ఈ ఉద్యమం సిసలైన అంతర్జాతీయ స్వభావాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు.
సమావేశంలో పాల్గొన్న ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఐడీవై కో-ఆర్డినేషన్) శ్రీ పి.ఎన్. రంజిత్ కుమార్, ఐడీవై 2025 ఆశయాలు, విస్తృతి, వ్యూహాల గురించి సమగ్రంగా వివరించారు. ఐడీవై ఉద్యమం దశాబ్ద ప్రయాణం గురించి చెబుతూ 10 ప్రత్యేక కార్యక్రమాల వివరాలను కూడా అందించారు. విస్తృతమైన, సమగ్ర భాగస్వామ్యాన్ని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, పౌర సమాజం, అంతర్జాతీయ భాగస్వాములతో ఏర్పరుచుకుంటున్న సహకార భాగస్వామ్యాల గురించి తెలియజేశారు.
డిజిటల్ సాధనాలు, క్షేత్రస్థాయి సమీకరణలు, ప్రపంచ భాగస్వామ్యాలను ఉపయోగించి ‘ఒకే పుడమి, ఒకే ఆరోగ్య లక్ష్యం దిశగా యోగా’ అనే సందేశాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ విస్తృతంగా ప్రచారం చేస్తున్న తీరు గురించిన ప్రదర్శనతో కార్యక్రమం ముగిసింది. 2025 ఐడీవై కేవలం ఒక జాతీయ వేడుకగా మాత్రమే కాక, ప్రపంచ ఆరోగ్య పరిరక్షణ వేడుకగా పరివర్తన చెందుతున్న తీరును ఈ సమావేశం స్పష్టం చేసింది.
****
(Release ID: 2136217)