హోం మంత్రిత్వ శాఖ
నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించిన అధికారులను న్యూఢిల్లీలో కలిసిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా
చరిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు అభినందనలు తెలిపిన శ్రీ అమిత్ షా
ధైర్యసాహసాలతో ఈ ఆపరేషన్లను విజయవంతం చేసిన వీర జవాన్లను త్వరలో కలిసేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన శ్రీ అమిత్ షా
నక్సలిజం ముప్పు నుంచి భారత్ను విముక్తి చేయడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది: శ్రీ అమిత్ షా
Posted On:
07 JUN 2025 4:32PM by PIB Hyderabad
ఇటీవల నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించిన అధికారులను కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో కలిశారు. ఈ ఆపరేషన్లలో చరిత్రాత్మక విజయం సాధించినందుకు వారిని అభినందించారు. నక్సలిజం ముప్పు నుంచి భారత్ను విముక్తి చేయడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
‘ఎక్స్’ వేదికగా ఆయన ఇలా పేర్కొన్నారు... "ఇటీవల జరిగిన నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించిన అధికారులను కలిశాను. ఈ ఆపరేషన్లలో చరిత్రాత్మక విజయం సాధించిన సందర్భంగా వారిని అభినందించాను. ఈ ఆపరేషన్లను ధైర్యసాహసాలతో విజయవంతం చేసిన సాహసోపేత జవాన్లను కలవడానికి నేను ఆసక్తిగా ఉన్నాను. త్వరలోనే వారిని కలవడానికి ఛత్తీస్గఢ్ వెళతాను. నక్సలిజం ముప్పు నుంచి భారత్ను విముక్తి చేయడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది."
కేంద్ర హోం, సహకార మంత్రి మార్గదర్శకత్వంలో, భద్రతా దళాలు ఛత్తీస్గఢ్లో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ ప్రయత్నాల్లో భాగంగా, ఛత్తీస్గఢ్ పోలీసులు (నారాయణపూర్, దంతేవాడ, కొండగావ్, బీజాపూర్ జిల్లాలకు చెందిన డీఆర్జీ యూనిట్లతో సహా) 18.05.2025 నుంచి 21.05.2025 వరకు అబుజ్మద్లోని మారుమూల ప్రాంతాల్లో ఒక ఆపరేషన్ నిర్వహించారు. 21.05.2025న, బోటర్ గ్రామ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది నక్సల్స్ హతమయ్యారు. మృతుల్లో సీపీఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు బసవరాజు అలియాస్ గగన్న కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్లో పాల్గొన్న అధికారుల్లో ఛత్తీస్గఢ్ డీజీపీ శ్రీ అరుణ్ దేవ్ గౌతమ్, అదనపు డీజీ (యాంటీ-నక్సల్ ఆపరేషన్స్/ఎస్ఐబీ/ఎస్టీఎఫ్) శ్రీ వివేకానంద్, ఐజీ (బస్తర్ రేంజ్) శ్రీ సుందర్రాజ్, సూపరింటెండెంట్ (నారాయణ్పూర్) శ్రీ ప్రభాత్ కుమార్, సూపరింటెండెంట్ (బీజాపూర్) శ్రీ జితేంద్ర యాదవ్, సూపరింటెండెంట్ (నక్సల్ రహిత బస్తర్ జిల్లా) శ్రీ శలభ్ సింగ్లను కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ కుమార్ శర్మ, కేంద్ర హోం శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ శ్రీ తపన్ డేకా సహా పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 2134941)