ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మే 29, 30లలో సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో పర్యటించనున్న ప్రధానమంత్రి

* ‘‘సిక్కింకు 50 సంవత్సరాలు: ఎక్కడైతే ప్రగతి, ప్రయోజనం కలిసి నడుస్తున్నాయో...వృద్ధిని ప్రకృతి పెంచి పోషిస్తోందో’’ శీర్షికన నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని

* పశ్చిమ బెంగాల్‌లో అలీపుర్‌ద్వార్, కూచ్‌ బిహార్ జిల్లాల్లో సిటీ గ్యాస్ పంపిణీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని

* రూ.48,520 కోట్లకు పైగా ఖర్చయ్యే అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు బీహార్‌లోని కర్‌కట్‌లో ప్రారంభోత్సవం, శంకుస్థాపనలతో పాటు జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి

* దాదాపు రూ.20,900 కోట్లు ఖర్చయ్యే అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్ నగర్‌లో
ప్రారంభోత్సవం, శంకుస్థాపనలతో పాటు జాతికి అంకితం చేయనున్న ప్రధాని

Posted On: 28 MAY 2025 10:00AM by PIB Hyderabad

ఈ నెల 29, 30 తేదీల్లో సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్‌లతో పాటు ఉత్తరప్రదేశ్‌లో కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.

మే 29న, ప్రధాని సిక్కింకు వెళ్తారు. అక్కడ ఉదయం సుమారు 11 గంటలకు ‘‘సిక్కింకు 50 సంవత్సరాలు: ఎక్కడైతే ప్రగతి, ప్రయోజనం కలిసి నడుస్తున్నాయో...వృద్ధిని ప్రకృతి పెంచి పోషిస్తోందో’’ శీర్షికన నిర్వహించే ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. సిక్కింలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు, జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఆ తరువాత, ప్రధాని పశ్చిమ బెంగాల్‌కు వెళ్తారు. మధ్యాహ్నం సుమారు 2 గంటల 15 నిమిషాల వేళకు ఆ రాష్ట్రంలోని అలీపుర్ద్వార్, కూచ్ బిహార్ జిల్లాల్లో సిటీ గ్యాస్ పంపిణీ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేస్తారు.

ప్రధానమంత్రి బీహార్‌లో కూడా పర్యటించనున్నారు. సాయంత్రం 5గంటల 45 నిమిషాలకు పాట్నా విమానాశ్రయ నూతన టర్మినల్ భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు.
ఈ నెల 30న, ఉదయం దాదాపు 11 గంటల వేళలో ఆయన బీహార్‌లోని కర్‌కట్‌లో రూ.48,520 కోట్లకు పైగా ఖర్చయ్యే అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయడంతో పాటుగా వాటిని జాతికి అంకితం చేయనున్నారు. అంతేకాక, ఒక జనసభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

దీని తరువాత, ప్రధాని ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తారు. మధ్యాహ్నం సుమారు 2 గంటల 45 నిమిషాల సమయంలో ఆయన, ఆ రాష్ట్రంలోని కాన్పూర్ నగర్‌లో దాదాపు రూ. 20,900 కోట్ల ఖర్చయ్యే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభం చేస్తారు. ఒక జనసభలో ప్రధాని ప్రసంగిస్తారు.

సిక్కింలో ప్రధానమంత్రి

సిక్కిం రాష్ట్రం ఏర్పడి 50 కీర్తివంతమైన సంవత్సరాలు పూర్తి అయిన సందర్భానికి గుర్తుగా ‘‘సిక్కింకు 50 సంవత్సరాలు: ఎక్కడైతే ప్రగతి, ప్రయోజనం కలిసి నడుస్తున్నాయో...వృద్ధిని ప్రకృతి పెంచి పోషిస్తోందో’’ (‘సిక్కిం@50: వేర్ ప్రోగ్రెస్ మీట్స్ పర్పస్ అండ్ నేచర్ నర్చర్స్ గ్రోత్’) శీర్షికన నిర్వహించే  కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొననున్నారు.  ‘‘సునావులో, సమృద్ధ- సమర్థ్ సిక్కిం’’ ఇతివృత్తంతో అనేక కార్యక్రమాలను ఒక సంవత్సరం పొడవునా నిర్వహించేందుకు సిక్కిం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వీటిలో సిక్కిం సాంస్కృతిక సమృద్ధి, సంప్రదాయాలు, ప్రాకృతిక వైభవాలతో పాటు సిక్కిం రాష్ట్ర చరిత్ర సారాన్ని ఉత్సవ తరహా హంగు-ఆర్భాటాలతో జరపనున్నారు.
ప్రధాని సిక్కింలో అనేక అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ ప్రాజెక్టుల్లో- నామ్చీ జిల్లాలో రూ.750 కోట్లకు పైగా ఖర్చయ్యే 500 పడకలు కలిగి ఉండే ఒక నూతన జిల్లా ఆసుపత్రి, గ్యాల్‌షింగ్ జిల్లాలోని పేలింగ్‌లో గల సాంగాచోలింగ్లో ప్రయాణికుల రోప్‌వే, గాంగ్‌టక్ జిల్లాలోని సాంగ్‌ఖోలాలో గల అమృత్ ఉద్యాన్‌లో భారత్ రత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ జీ విగ్రహం వంటివి- ఉన్నాయి.
రాష్ట్ర ఏర్పాటు అనంతరం 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకొని స్మారక నాణేన్ని, సావనీర్ కాయిన్‌‌ను, తపాలా బిళ్లను కూడా ప్రధాని ఆవిష్కరించనున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని

దేశంలో సిటీ గ్యాస్ పంపిణీ (సీజీడీ) నెట్‌వర్క్‌ను విస్తరించే దిశగా తీసుకున్న ఒక ముఖ్య నిర్ణయంలో భాగంగా, పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌ద్వార్, కూచ్ బిహార్ జిల్లాల్లో సీజీడీ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. రూ.1010 కోట్లకు పైగా వ్యయంతో 2.5 లక్షల కన్నా ఎక్కువ ఇళ్లకు, 100 కు పైగా వాణిజ్య సంస్థలకు, పరిశ్రమలకు గొట్టపుమార్గం ద్వారా సహజవాయువు (పీఎన్‌జీ)ని అందించాలన్న లక్ష్యం తో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. దీనికి తోడు, ప్రభుత్వం నిర్ధారించిన కనీస పని కార్యక్రమం (మినిమం వర్క్ ప్రోగ్రాం..ఎండబ్ల్యూపీ) లక్ష్యాలకు అనుగుణంగా ఇంచుమించు 19 కంప్రెస్‌డ్ న్యాచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) స్టేషన్లను ఏర్పాటు చేసి, వాహనాలకు సీఎన్‌జీని అందుబాటులోకి తీసుకురావాలన్నది కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యంలో మరో భాగం. ఇది ఆ ప్రాంతానికి సౌకర్యవంతమైన, విశ్వసనీయమైన, పర్యావరణానుకూలమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఇంధన సరఫరాను అందించడంతోపాటుగా ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించనుంది.    

బీహార్‌లో ప్రధాని

పాట్నాలో నూతనంగా నిర్మించిన ప్యాసింజర్ టర్మినల్‌ను ప్రధాని మే 29న ప్రారంభించనున్నారు. ఈ కొత్త టర్మినల్‌ నిర్మాణానికి సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేశారు. దీనిని ఒక్కొక్క సంవత్సరంలోనూ కోటి మంది ప్రయాణికుల రాకపోకలకు అనువుగా ఉండేటట్లు రూపొందించారు.  రూ.1410 కోట్లకు పైచిలుకు ఖర్చుతో నిర్మించనున్న బిహ్‌టా విమానాశ్రయానికి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. పాట్నాకు సమీపంలో విద్యాబోధన కేంద్రంగా వేగంగా ఎదుగుతున్న బిహ్‌టా‌లో ఐఐటీ పాట్నాతో పాటు ప్రతిపాదిత ఎన్ఐటీ పాట్నా ప్రాంగణం నెలకొన్నాయి.
కర్‌కట్‌లో రూ.48,520 కోట్లకు పైగా ఖర్చుతో చేపట్టే అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మే 30న ప్రారంభోత్సవం, శంకుస్థాపనలతో పాటు జాతికి అంకితం చేయనున్నారు.
రూ.29,930 కోట్ల కన్నా ఎక్కువ వ్యయంతో ఔరంగాబాద్ జిల్లాలో నిర్మించ తలపెట్టిన నబీనగర్ సూపర్ థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టు రెండో దశ కు(దీనిలో ఒక్కొక్కటీ 800 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉండే 3 యూనిట్లు భాగంగా ఉంటాయి) ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఇది ఆ ప్రాంతంలో విద్యుత్తు రంగ మౌలిక సదుపాయాల కల్పనకు ఊతాన్ని అందిస్తుంది. బీహార్‌తో పాటు ఈశాన్య భారతానికి ఇంధన భద్రతను కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇది ఆ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతూ, ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది. అంతేకాక, ఆ ప్రాంతంలో కరెంటును చౌకగా అందిస్తుంది.  

ఆ ప్రాంతంలో రహదారి మౌలిక సదుపాయాల వ్యవస్థకు, సంధానానికి పెద్ద దన్నుగా నిలిచేలా, వివిధ రోడ్డు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. వాటిలో ఎన్‌హెచ్-119ఏ లో భాగమైన పాట్నా-ఆరా-సాసారామ్ సెక్షనును నాలుగు దోవలు కలిగి ఉండేదిగా మలచడం, వారణాసి-రాంచీ-కోల్‌కతా హైవే (ఎన్‌హెచ్-319బీ)తో పాటు రామ్‌నగర్-కచ్చీ దర్గా సెక్షన్ (ఎన్‌హెచ్-119డీ)ని ఆరు దోవలు కలిగి ఉండేవిగా విస్తరించడంతో పాటు బక్సర్, భరౌలీల మధ్య ఒక కొత్త గంగా వంతెనను నిర్మించడం సహా వివిధ రోడ్డు ప్రాజెక్టులు కలిసి ఉన్నాయి. ఈ ప్రాజెక్టులతో రాష్ట్రంలో అంతరాయమంటూ ఎదురవని హై-స్పీడ్ కారిడార్ రూపుదాల్చనుంది. దాంతోపాటే వాణిజ్యానికి, ప్రాంతీయ సంధానానికి ప్రోత్సాహం లభిస్తుంది. సుమారు రూ.5,520 కోట్లు ఖర్చయ్యే ఎన్‌హెచ్-22లోని పాట్నా-గయ-డోభీ సెక్షనును నాలుగు దోవలు కలిగి ఉండేదిగా నిర్మించడానికి సంబంధించిన పనులను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. అంతే కాకుండా, ఎన్‌హెచ్-27లో గోపాల్‌గంజ్ పట్టణంలో నాలుగు దోవలతో కూడి ఉండేదిగా ఎలివేటెడ్ హైవే నిర్మాణ పనులతో పాటు గ్రేడ్ ఇంప్రూవ్‌మెంట్ పనులు సహా మరికొన్ని పనులను కూడా ఆయన ప్రారంభించనున్నారు.

దేశమంతటా రైల్వే మౌలిక సదుపాయాలకు మెరుగులు దిద్దడానికి ప్రధాని తన నిబద్ధతను చాటుకొంటూ, ఇతర ప్రాజెక్టులకు తోడు రూ.1330 కోట్లకు పైగా ఖర్చయిన సోన్ నగర్,మొహమ్మద్ గంజ్‌ల మధ్య మూడో రైలు లైనును జాతికి అంకితం చేయనున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో ప్రధానమంత్రి

ఈ ప్రాంతంలో మౌలికసదుపాయాలకు, సంధానానికి ఊతాన్ని అందించే ఉద్దేశంతో, అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆయన రూ.2,120 కోట్లకు పైగా ఖర్చయ్యే కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా ఉన్న చున్నీగంజ్ మెట్రో స్టేషన్ నుంచి కాన్పూర్ సెంట్రల్ మెట్రో స్టేషన్ సెక్షనును ప్రారంభిస్తారు. దీనిలో 14 ప్రతిపాదిత స్టేషన్లు భాగం అవుతాయి. ఇవి పట్టణానికి ప్రధాన ప్రదేశాలను, వాణిజ్య కూడళ్లను (కమర్షియల్ హబ్స్) మెట్రో నెట్‌వర్కుతో కలుపుతాయి. వీటికి తోడు, ప్రధాని జీటీ రోడ్డులో రహదారి విస్తరణ, సుదృఢీకరణ పనులను కూడా ప్రారంభిస్తారు.

ఆ ప్రాంతంలో విద్యుత్తు ఉత్పాదన సామర్థ్యాన్ని పెంపొందించడానికి, అనేక ప్రాజెక్టులను మొదలుపెడుతున్నారు. ప్రాంతంలో అంతకంతకు పెరిగిపోతున్నఇంధన అవసరాలను తీర్చడానికి గౌతమ్ బుద్ధ్ నగర్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే పారిశ్రామిక అభివృద్ధి ప్రాధికార సంస్థ (వైఈఐడీఏ)లోని సెక్టర్ 28లో 220 కేవీ సబ్‌స్టేషన్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. గ్రేటర్ నోయిడాలో ఇకోటెక్-8, ఇకోటెక్-10లో రూ.320 కోట్ల కన్నా ఎక్కువ వ్యయంతో నిర్మించిన 132 కేవీ సబ్‌స్టేషనును కూడా ఆయన ప్రారంభించనున్నారు.

కాన్పూర్‌లో రూ.8,300 కోట్లకు పైచిలుకు ఖర్చుచేసి నిర్మించిన 660 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉన్న పన్‌కీ థర్మల్ పవర్ ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్టును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దీంతో ఉత్తరప్రదేశ్ ఇంధన సామర్థ్యం పెరుగుతుంది. ఆయన ఘాటంపూర్ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు చెందిన 660 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన మూడు యనిట్లను కూడా ప్రారంభించనున్నారు. వీటి నిర్మాణానికి రూ.9,330 కోట్లు ఖర్చుపెట్టారు. దీంతో విద్యుత్తు సరఫరాలో చెప్పుకోదగిన వృద్ధి చోటుచేసుకోనుంది.

కాన్పూర్‌లోని కల్యాణ్‌పూర్ పన్‌కీ దేవాలయంలో పన్‌కీ రోడ్డులో పన్‌కీ పవర్ హౌస్ రైల్వే క్రాసింగ్‌తో పాటు పన్‌కీ ధామ్ క్రాసింగ్‌పై నిర్మాణం పూర్తి చేసిన రైల్వే ఓవర్‌బ్రిడ్జిని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.  దీనితో బొగ్గు రవాణా, చమురు రవాణాకు మార్గం సుగమమై  పన్‌కీ థర్మల్ పవర్ ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్టుకు చెందిన ఆధునిక వస్తురవాణా వ్యవస్థకు దన్ను లభించడమే కాక, స్థానికులకు రాక, పోకలలో ప్రస్తుతం ఎదురవుతున్న రద్దీ సమస్య నివారణకు కూడా ఇది దోహదపడుతుంది.

కాన్పూర్‌లోని బింగ్‌వాన్‌లో రూ.290 కోట్లకు పైగా వ్యయంతో నిర్మాణం పూర్తి చేసిన 40 ఎంఎల్‌డీ (రోజుకు మిలియన్ లీటర్ల) సామర్థ్యం కలిగిన టెర్షియరీ ట్రీట్‌మెంట్ ప్లాంటును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ ప్లాంటుతో ఆ ప్రాంతంలో శుద్ధి చేసిన మురుగు నీటి పునర్వినియోగానికి వీలు చిక్కుతుంది. ఫలితంగా ఆ ప్రాంతంలో జల సంరక్షణకు, వనరుల నిరంతర నిర్వహణకు ప్రోత్సాహం లభిస్తుంది.

ఆ ప్రాంతంలో రహదారి సంబంధ మౌలిక సదుపాయాల కల్పనకు దన్నుగా నిలిచే ఉద్దేశంతో, కాన్పూర్ నగర్ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గౌరియా పాలీ మార్గ్‌ను విస్తరించడంతో పాటు పటిష్ఠంగా మార్చేందుకు ఉద్దేశించిన పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఆయన కాన్పూర్ నగర్ జిల్లాలో డిఫెన్స్ నోడ్‌లో అంతర్భాగం అయిన ప్రయాగ్‌రాజ్ హైవే పై నర్‌వాల్ రోడ్డు (ఏహెచ్-1)ని కాన్పూర్ డిఫెన్స్ నోడ్ (లేన్ 4)తో కలపడానికి ఉద్దేశించిన రహదారి విస్తరణ, పటిష్ఠీకరణ పనులకు కూడా శంకుస్థాపన చేస్తారు. దీంతో డిఫెన్స్ కారిడార్‌కు సంధానం చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడనుంది.

ప్రధానమంత్రి ఈ సందర్భంగా ‘పీఎమ్ ఆయుష్మాన్ వయ్ వందన యోజన’, ‘జాతీయ ఉపాధి మిషన్’, ‘పీఎమ్ సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’ల లబ్ధిదారులకు ధ్రువపత్రాలను, చెక్కులను కూడా పంపిణీ చేయనున్నారు.


(Release ID: 2132126)