వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
మోసపూరిత నమూనాలపై భాగస్వామ్య సంస్థలతో కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి సమావేశం
ఆహారం, ఔషధాలు, రవాణా, సౌందర్య సాధనాలు, రిటైల్, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీల భాగస్వామ్యం
Posted On:
26 MAY 2025 1:59PM by PIB Hyderabad
మోసపూరిత నమూనాల (డార్క్ ప్యాటర్న్)కు సంబంధించి వినియోగదారుల ఆందోళనలపై మే 28న న్యూఢిల్లీలో నిర్వహించనున్న ఉన్నత స్థాయి భాగస్వామ్య సమావేశంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ - కొత్త, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ప్రసంగిస్తారు. సమస్య పరిష్కారం కోసం మరింత ప్రభావవంతమైన మార్గాలపైనా ఈ సమావేశంలో చర్చించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆహారం, ప్రయాణం, సౌందర్య సాధనాలు, ఔషధాలు, రిటైల్, దుస్తులు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో సేవలందిస్తున్న అన్ని ప్రధాన ఇ-కామర్స్ వేదికలు ఈ సమావేశంలో పాల్గొంటాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, 1ఎంజీ.కామ్, యాపిల్, బిగ్బాస్కెట్, మీషో, మెటా, మేక్ మై ట్రిప్, పేటీఎం, ఓలా, రిలయన్స్ రిటైల్ లిమిటెడ్, స్విగ్గీ, జొమాటో, యాత్ర, ఉబర్, టాటా, ఈజ్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్, ఇండియామార్ట్, ఇండిగో ఎయిర్లైన్స్, జిగో, జస్ట్ డయల్, మెడికా బజార్, నెట్మెడ్స్, ఓఎన్డీసీ, థామస్ కుక్, వాట్సాప్ వంటి ముఖ్య సంస్థలు ఇందులో సమావేశంలో పాల్గొంటాయి. వినియోగదారుల హక్కులను ముందుకు తీసుకెళ్లడంతోపాటు పారదర్శకమైన, విశ్వసనీయమైన మార్కెటును తీర్చిదిద్దడంలో పరిశ్రమల భాగస్వామ్యం కీలకమని వినియోగదారుల వ్యవహారాల శాఖ భావిస్తోందనడానికి ఈ సమావేశ భాగస్వాముల జాబితా నిదర్శనం.
కీలక పారిశ్రామిక సంస్థలతోపాటు స్వచ్ఛంద వినియోగదారుల సంస్థలు (వీసీవోలు), ప్రముఖ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు (ఎన్ఎల్యూ) కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. వారి ఆలోచనలు, పరిశోధన, నియంత్రణ దృక్పథాలు బలమైన, ఆచరణయోగ్యమైన పరిష్కారాలను అందించడంలో విలువైన మార్గాలను అందిస్తాయి.
వినియోగదారుల హక్కులను పరిరక్షించడం, న్యాయబద్ధమైన వాణిజ్య విధానాలను ప్రోత్సహించడంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిధిలోని వినియోగదారుల వ్యవహారాల విభాగం అచంచలమైన నిబద్ధతతో పనిచేస్తోంది. మోసపూరిత నమూనాల (వినియోగదారులను తప్పుదోవ పట్టించడం, లేదా వారికి కొనే ఉద్దేశం లేని వస్తువులను కొనేలా న్యాయవిరుద్ధంగా ప్రేరేపించే మోసపూరిత యూజర్ ఇంటర్ఫేస్ నమూనా)తో న్యాయవిరుద్ధమైన వాణిజ్య పద్ధతులను అరికట్టే దిశగా ఈ విభాగం క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఇలాంటి చర్యలు వినియోగదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. న్యాయబద్ధమైన మార్కెట్ గతిని దారి మళ్లిస్తాయి, డిజిటల్ వాణిజ్య సమగ్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయి.
మోసపూరిత నమూనాలను అరికట్టేందుకు ఈ విభాగం అనేక చర్యలు తీసుకుంది. భాగస్వాములందరినీ విస్తృతంగా సంప్రదించిన అనంతరం 2023 నవంబర్ 30న ఈ విభాగం మోసపూరిత నమూనాలను నివారించేందుకు సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ద్వారా ఇ-కామర్స్లో 13 ముఖ్యమైన మోసపూరిత నమూనాలను గుర్తించింది. కొనాలని హడావుడి చేసేలా తప్పుడు ప్రకటనలు, వినియోగదారుడికి తెలియకుండా వస్తువుల జాబితాలో ఇతర వసూళ్లను జోడించడం (బాస్కెట్ స్నీకింగ్), న్యూనతను కలిగించే మాటలు (కన్ఫమ్ షేమింగ్), బలవంతపెట్టే చర్యలు, అయిష్టంగానైనా వినియోగదారుడి సభ్యత్వాన్ని కొనసాగించే వ్యూహాలు (సబ్స్క్రిప్షన్ ట్రాప్), ఇంటర్ఫేస్ ద్వారా వినియోగదారులను ప్రేరేపించడం, తక్కువ ధరలంటూ ప్రచారంతో ఆకట్టుకుని తీరా ఎక్కువ ధరలకు విక్రయించడం, మొదట్లో ఒకధర చూపెట్టి.. అనంతరం అదనపు చార్జీలు (డ్రిప్ ప్రైసింగ్), మభ్యపెట్టే ప్రకటనలు, చిరాకు తెప్పించడం, తికమకపెట్టే ప్రశ్నలు, సాస్ (సాఫ్ట్ వేర్ యాజ్ ఎ సర్వీస్) బిల్లింగ్, తప్పుడు మాల్వేర్లు.
ఐఐటీ (బీహెచ్యూ) సహకారంతో 2023 అక్టోబర్ 26న ప్రారంభించిన మోసపూరిత నమూనాల నిరోధక హ్యాకథాన్ ఈ విభాగం చేపట్టిన నిర్దేశక కార్యక్రమాల్లో ఒకటి. దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ ఆవిష్కరణల పోటీ సాంకేతిక మార్గాలను రూపొందించేందుకు ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర విశ్వవిద్యాలయాల విద్యార్థులు, వ్యక్తులను ఆహ్వానించింది. మోసపూరిత నమూనాలను గుర్తించి, అరికట్టేందుకు యాప్లు, బ్రౌజర్ ఎక్స్టెన్షన్లు, ఏఐ సాధనాల వంటి పరిష్కారాలను రూపొందించే దిశగా వారిని ప్రోత్సహిస్తోంది. హ్యాకథాన్ ఫలితాల ఆధారంగా ఐఐటీ (బీహెచ్యూ) సహకారంతో మూడు శక్తిమంతమైన వినియోగదారు రక్షణ యాప్లను రూపొందించింది. 2024లో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వీటిని ప్రారంభించారు.
మోసపూరిత పద్ధతులను గుర్తించి, నివారించడం కోసం సంబంధిత విభాగం విస్తృతంగా వినియోగదారుల అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. అంతేకాకుండా ఇ-కామర్స్ వేదికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఇ-కామర్స్ లో వినియోగదారుల రక్షణ కోసం సమగ్ర, సమ్మిళిత విధానాన్ని రూపొందించడం కోసం ఇ-కామర్స్ వేదికలు, విధాన నిర్దేశక మేధో సంస్థలు, వినియోగదారుల సంస్థలతో నిరంతరం చర్చిస్తోంది.
వినియోగదారుల రక్షణ, సులభతర వాణిజ్యం వేర్వేరు కావని, అవి పరస్పరం పూరకమైన లక్ష్యాలని వినియోగదారుల వ్యవహారాల విభాగం విశ్వసిస్తోంది. వ్యాపారాలకు సమాన అవకాశాలను ప్రోత్సహిస్తూ.. నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా నిర్వహణలో ఈ విభాగం అనుసరిస్తున్న పురోగామి, భాగస్వామ్య విధానాలకు ఈ సమావేశం నిదర్శనం.
ఇలాంటి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా... వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యమిచ్చే, డిజిటల్ మార్కెట్లను నిష్పాక్షికంగా, పారదర్శకంగా, జవాబుదారీగా నిర్వహించేలా భవిష్యత్ విధానాలను సాధించే దిశగా వినియోగదారుల వ్యవహారాల విభాగం ముందుకు వెళుతున్నది.
***
(Release ID: 2131334)