రక్షణ మంత్రిత్వ శాఖ
భారత గడ్డమీద జరిగే ఏ దాడిని అయినా యుద్ధ చర్యగానే పరిగణిస్తామంటూ ఉగ్రవాదం పట్ల భారత వైఖరిని ప్రధానమంత్రి పునర్నిర్వచించారు: శ్రీనగర్లో సైనికులతో రక్షణ మంత్రి
పాకిస్తాన్ బాధ్యతారహిత అణ్వస్త్ర బెదిరింపులు ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే భారత సంకల్పాన్ని నిరోధించలేవు: శ్రీ రాజ్నాథ్ సింగ్
పాక్ అణ్వాయుధాలను ఐఏఈఏ పర్యవేక్షించాలని పిలుపు
"భారత్ శాంతికి ప్రాధాన్యం ఇస్తుంది... కానీ తన సార్వభౌమాధికారంపై జరిగే ఏ దాడికైనా గట్టిగా ప్రతిస్పందిస్తుంది"
"ఉగ్రవాదానికి మద్దతు కొనసాగిస్తే పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది...
భారత వ్యతిరేక.. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇవ్వడం వెంటనే ఆపేయాలి"
"ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగలేవు.. ఉగ్రవాదం, పీఓకే అంశాలపైనే పాకిస్తాన్తో చర్చలు"
Posted On:
15 MAY 2025 3:32PM by PIB Hyderabad
"భారత గడ్డపై జరిగే ఏ దాడినైనా యుద్ధ చర్యగానే పరిగణిస్తామని స్పష్టం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇప్పుడు ఉగ్రవాద వ్యతిరేక వైఖరిని పునర్నిర్వచించారు" అని ఈరోజు శ్రీనగర్లోని బాదామి బాగ్ కంటోన్మెంట్లో భారత సైనికులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. భారత్ ప్రాధాన్యం ఎల్లప్పుడూ శాంతికేననీ, యుద్ధానికి ఎప్పుడూ భారత్ మద్దతునివ్వలేదని, అయితే తమ సార్వభౌమాధికారంపై జరిగే దాడికి గట్టిగా ప్రతిస్పందించడం అవసరమని రక్షణ మంత్రి ఉద్ఘాటించారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు కొనసాగిస్తుంటే అది భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఉగ్రవాదంపై భారతదేశ చరిత్రలో తీసుకున్న అతిపెద్ద చర్య ఆపరేషన్ సిందూర్ అని పేర్కొన్న రక్షణ మంత్రి... ఉగ్రవాద ముప్పును తొలగించడానికి ఎంతవరకైనా వెళ్లడం పట్ల దేశం నిబద్ధతకు ఇది నిదర్శనమని అభివర్ణించారు. “అవసరమైన రక్షణ చర్యలు చేపట్టడమే కాకుండా, అవసరమైనప్పుడల్లా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో భారత్ ప్రదర్శించిన నిబద్ధతే ఆపరేషన్ సిందూర్. ప్రతి ఉగ్రవాద స్థావరాన్ని చేరుకుని నాశనం చేయడం ప్రతి సైనికుడి కల. ఉగ్రవాదులు మతం ఆధారంగా భారతీయులను చంపారు. వారి చర్యల వల్లే మనం వారిని చంపాం. వారిని నిర్మూలించడమే మన ధర్మం. మన సైనిక దళాలు వారి కోపానికి సరైన దిశానిర్దేశం చేశాయి.. అసమానమైన ధైర్యసాహసాలు ప్రదర్శించి పహల్గామ్ ఘటనకు విచక్షణతో ప్రతీకారం తీర్చుకున్నాయి” అని శ్రీ రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
పాకిస్తాన్లో దాక్కున్న ఉగ్రవాద సంస్థలు, వాటి యజమానులకు ఏ ప్రదేశమూ వారి కోసం సురక్షితం కాదనే స్పష్టమైన సందేశాన్ని ఆపరేషన్ సిందూర్ ద్వారా తెలియజెప్పామని రక్షణ మంత్రి పేర్కొన్నారు. "మన దళాలు తమ లక్ష్యం సరైనది, కచ్చితమైనదనీ, నష్టాన్ని లెక్కించే పని మాత్రం శత్రువులకు వదిలేశామని ప్రపంచానికి చూపించాయి" అని ఆయన వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులకు భారత్ భయపడదనే వాస్తవం నుంచి ఉగ్రవాద నిర్మూలన పట్ల అచంచలమైన భారత సంకల్పాన్ని అంచనా వేయవచ్చని శ్రీ రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అణుబాంబుల పేరుతో ఇస్లామాబాద్ ఎంత బాధ్యతారహితంగా భారతదేశాన్ని బెదిరించినదీ ప్రపంచం చాలాసార్లు చూసిందని ఆయన పేర్కొన్నారు. "ఇంత బాధ్యతారహితమైన, మోసపూరిత దేశం చేతుల్లో అణ్వాయుధాలు సురక్షితమేనా? అనే ప్రశ్నను నేను ప్రపంచం ముందు ఉంచుతున్నాను. పాకిస్తాన్లోని అణ్వాయుధాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) తన పర్యవేక్షణలోకి తీసుకోవాలి" అని ఆయన సూచించారు.
పహల్గామ్ ఘటన ద్వారా భారత సామాజిక ఐక్యతను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరిగిందన్న రక్షణ మంత్రి, మన సాయుధ దళాలు ప్రత్యర్థి ప్రధాన స్థావరాలను నాశనం చేసి ప్రతీకారం తీర్చుకున్నాయని తెలిపారు. దాదాపు 21 ఏళ్ల క్రితం అప్పటి ప్రధానమంత్రి దివంగత అటల్ బిహారీ వాజ్పేయి సమక్షంలో పాకిస్తాన్.. ఇకమీదట తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించమని తమ గడ్డమీదే ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారతదేశాన్ని పాకిస్తాన్ మోసం చేస్తూనే ఉందని, భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పించడం మాని, భారత్కు వ్యతిరేకంగా వారి భూభాగాన్ని ఉపయోగించే అవకాశం ఇవ్వకూడదని రక్షణ మంత్రి సూచించారు.
భారత్ పేద దేశాలకు సహాయం చేయడానికి ఐఎమ్ఎఫ్కు నిధులు అందించే దేశాల సరసన చేరితే, పాకిస్తాన్ మాత్రం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) నుంచి రుణం కోరే స్థితికి చేరిందని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు.
సరిహద్దు ఆవల నుంచి ఎటువంటి అనవసరమైన చర్యలు ఉండకూడదన్నదే ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహనకు ఆధారమని శ్రీ రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగలేవని, ఒకవేళ చర్చలు జరిగితే ఉగ్రవాదం, పీఓకేల గురించి మాత్రమే చర్చ ఉంటుందనే ప్రధానమంత్రి మోదీ అభిప్రాయాన్ని ఆయన పునరుద్ఘాటించారు.
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన అమాయక పౌరులకు, ఆపరేషన్ సిందూర్ సమయంలో మాతృభూమి సేవలో అత్యున్నత త్యాగం చేసి అమరులైన సైనికులకు రక్షణ మంత్రి నివాళులర్పించారు. గాయపడిన సైనికుల ధైర్యాన్ని ప్రశంసించిన ఆయన, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సరిహద్దు వెంబడి ఉన్న పాకిస్తాన్ సైనిక స్థావరాలు, బంకర్లను ధ్వంసం చేసి, శత్రువులకు ధైర్యంగా స్పష్టమైన సందేశాన్ని పంపిన సైనికులకు శ్రీ రాజ్నాథ్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. "మన సైనికులను చూసి మేం గర్వపడుతున్నాం... అన్న మన దేశ ప్రజల సందేశాన్ని అందించేందుకు ఇక్కడికి వచ్చాను" అని ఆయన తెలిపారు.
సాయుధ దళాల శౌర్యం, అంకితభావాన్ని ప్రశంసించిన రక్షణ మంత్రి, సైనికులను అధునాతన ఆయుధాలు, వేదికలు అలాగే ఆధునిక మౌలిక సదుపాయాలతో సన్నద్ధం చేయడం కొనసాగించే విషయంలో ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. "మా ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా మన సైనిక బలగాలను సన్నద్ధంగా ఉంచుతుంది. ఆధునిక రైఫిల్స్, క్షిపణి రక్షణ కవచాలు, డ్రోన్లు వంటి అనేక కొత్త తరం పరికరాలు భారత్లోనే వేగంగా తయారవుతున్నాయి. ఎల్ఓసి, ఎల్ఏసి వెంట గతంలో ఎన్నడూ లేని విధంగా మౌలికసదుపాయాల అభివృద్ధి జరిగింది. దేశ సేవ పట్ల అంకితభావం, సంసిద్ధతతో పోరాడుతున్న మన సైనికులకు సేవ చేయడానికి నిరంతరం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది" అని ఆయన తెలిపారు.
ప్రతి అడుగులోనూ, ప్రతి పరిస్థితిలోనూ సాయుధ దళాలకు ప్రభుత్వంతో పాటు దేశ ప్రజలంతా అండగా ఉంటారని శ్రీ రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. సైన్యం సహకారంతో భారత్ త్వరలోనే ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తుందని, తద్వారా మన దేశ సార్వభౌమత్వాన్ని ఎవరూ చెడుగా చూసే సాహసం చేయరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సింగ్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో పాటు భారత సైన్యంలోని ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 2128940)
Read this release in:
Malayalam
,
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil