ప్రధాన మంత్రి కార్యాలయం
ఏబీపీ వార్తాసంస్థ ఇండియా@2047: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
విజయవంతంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్, బ్రిటన్
వర్తక వాణిజ్యాలకు శక్తిమంతమైన కేంద్రంగా మారుతున్న భారత్
దేశం కన్నా ఏదీ మిన్న కాదు... దశాబ్దకాలంగా భారత్ విధానమిదే
నేడు భారత్ను చూస్తే ప్రజాస్వామ్యంపట్ల పూర్తి భరోసా
జీడీపీ కేంద్రీకృత విధానం నుంచి స్థూల ప్రజా సాధికారత (జీఈపీ) దిశగా భారత్ పయనం
సంప్రదాయం, సాంకేతికత.. సంయుక్తంగా ఎలా పురోగమించగలవో ప్రపంచానికి చాటుతున్న భారత్
స్వావలంబన ఎల్లప్పుడూ మన ఆర్థిక మూలాల్లో భాగం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటన
Posted On:
06 MAY 2025 10:10PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఏబీపీ నెట్ వర్క్ నిర్వహించిన ఇండియా @2047 సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో భారత్ మండపంలో ఉదయం నుంచి సందడి నెలకొన్నదన్నారు. ఈ సదస్సును గొప్ప వైవిధ్యంతో తీర్చిదిద్దినట్లు సదస్సు నిర్వాహకులకు తాను చెప్పినట్లు గుర్తుచేశారు. ఈ కార్యక్రమం విజయవంతమవడం వెనుక చాలా మంది ప్రముఖుల కృషి ఉందన్నారు. కార్యక్రమానికి హాజరైన వాళ్లంతా గొప్ప అనుభవజ్ఞులు కావడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
యువత, మహిళలు ఈ సదస్సుకు ఎక్కువగా హాజరవడం సంతోషదాయకమన్నారు. డ్రోన్ దీదీలు, లఖ్పపతీ దీదీలు పంచుకున్న అనుభవాలు అందరికీ స్ఫూర్తినిచ్చేలా ఉన్నాయన్నారు. వారి కథలు స్ఫూర్తినిస్తాయన్నారు.
ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేస్తూ శరవేగంగా పురోగమిస్తున్న భారత్కు ఈ సదస్సు అద్దం పడుతోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్నదే భారత్ దృఢ సంకల్పమని స్పష్టం చేశారు. భారతదేశ శక్తియుక్తులు దృఢ సంకల్పాన్ని ప్రతిబింబించేలా- ‘లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరేదాకా పట్టు విడవకండి’ అన్న స్వామి వివేకానందుడి మాటలను ఆయన ఉటంకించారు. ఈ అచంచలమైన స్ఫూర్తి ప్రతి పౌరుడిలోనూ నేడు కనిపిస్తోందన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను నిలపడంలో ఇలాంటి సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ అద్భుతమైన సదస్సు నిర్వాహకులను అభినందించారు. శ్రీ అతిదేవ్ సర్కార్, శ్రీ రజనీశ్, ఏబీపీ వార్తా సంస్థ బృందానికి అభినందనలు తెలిపారు.
భారతదేశ చరిత్రలో నేడు ఓ చారిత్రక ఘట్టమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధానమంత్రితో తాను మాట్లాడానని, భారత్ - బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారవడం హర్షణీయమని అన్నారు. రెండు ప్రధాన స్వేచ్ఛా విపణి ఆర్థిక వ్యవస్థల మధ్య కుదిరిన ఈ ఒప్పందం వాణిజ్య, ఆర్థిక సహకారంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని స్పష్టం చేశారు. ఇది ఇరుదేశాల అభివృద్ధికీ దోహదపడుతుందన్నారు. భారత యువతకు ఇది శుభవార్త అన్నారు. ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుందని, భారతీయ వ్యాపారాలూ ఎంఎస్ఎంఈలకు కొత్త అవకాశాలను అందిస్తుందని పేర్కొన్నారు. యూఏఈ, ఆస్ట్రేలియా, మారిషస్లతో కూడా భారత్ ఇటీవల వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నదని ప్రధానమంత్రి ప్రస్తావించారు. భారత్ సంస్కరణలను అమలు చేయడం మాత్రమే కాకుండా.. వర్తక వాణిజ్యాలకు శక్తిమంతమైన కేంద్రంగా నిలిచేలా ప్రపంచంతో భాగస్వామ్యమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకోవాలన్నా, లక్ష్యాలను సాధించాలన్నా దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వడంతోపాటు దేశ సామర్థ్యంపై నమ్మకముంచాలని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. దురదృష్టవశాత్తు భారత్ దశాబ్దాలుగా దానికి విరుద్ధమైన విధానంలో చిక్కుకుపోయిందని, అది పురోగతికి ఆటంకం కలిగించిందని అన్నారు. గతంలో అంతర్జాతీయ అభిప్రాయాలు, ఎన్నికల లెక్కలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచించడం కారణంగా కీలక నిర్ణయాల్లో జాప్యం జరిగిందని గుర్తు చేశారు. అవసరమైన సంస్కరణల కన్నా స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారని, దీనివల్ల దేశానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. స్వల్పకాలిక రాజకీయ అంశాలే నిర్ణయాలను నిర్దేశిస్తే ఏ దేశమూ ముందుకు సాగదని ఆయన స్పష్టం చేశారు. అన్నింటికన్నా దేశం మిన్న అన్నది నిర్ణయం తీసుకోవడానికి ఏకైక ప్రమాణంగా ఉన్నప్పుడు మాత్రమే నిజమైన పురోగతి సాధ్యమవుతుందని పునరుద్ఘాటించారు. దశాబ్దకాలంగా భారత్ ఈ సూత్రానికి కట్టుబడి ఉందని, ఈ విధానం ఫలితాలు దేశానికి ఇప్పుడు లభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
“గత 10-11 ఏళ్లుగా మా ప్రభుత్వం అనేక నిర్ణయాత్మక చర్యలు తీసుకుని దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించింది. రాజకీయ సంకల్పం లేకపోవడం వల్ల దశాబ్దాలుగా అవి అపరిష్కృతంగా ఉండిపోయాయి” అని ప్రధానమంత్రి అన్నారు. బ్యాంకింగ్ రంగాన్ని ముఖ్యమైన ఉదాహరణగా పేర్కొంటూ, అది ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిదన్నారు. 2014కు ముందు భారత బ్యాంకులు పతనం అంచున ఉండేవని, ప్రతి ఆర్థిక సదస్సులోనూ బ్యాంకింగ్ నష్టాలపై అనివార్యంగా చర్చించాల్సి వచ్చేదని గుర్తు చేశారు. అయితే నేడు దేశ బ్యాంకింగ్ రంగం ప్రపంచంలోనే బలంగా ఉందని, బ్యాంకులు రికార్డు స్థాయిలో లాభాలు నమోదు చేశాయని, సంస్కరణల ద్వారా డిపాజిటర్లకు ప్రయోజనం లభిస్తోందని పేర్కొన్నారు. కీలక సంస్కరణలు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా చిన్న బ్యాంకుల విలీనాలు, ఆర్థిక సంస్థల బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ.. బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ నిరంతర కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఎయిరిండియా గత పరిస్థితిని కూడా ఆయన ప్రస్తావించారు. విమానయాన సంస్థలు నష్టాల్లో మునిగిపోతూ, దేశానికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లేలా పరిస్థితులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి వెనుకాడాయని విమర్శించారు. మరింత నష్టపోకుండా ఉండేందుకు తమ ప్రభుత్వం అవసరమైన నిర్ణయాలు తీసుకుందన్నారు. “దేశ ప్రయోజనాలే మా ప్రభుత్వానికి అత్యున్నతమైనవి” అని పునరుద్ఘాటించారు.
పేదల సంక్షేమానికి ఉద్దేశించిన ప్రభుత్వ నిధుల్లో 15 శాతం మాత్రమే వారికి చేరాయని ఓ మాజీ ప్రధాని అంగీకరించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. తమ హయాంలో పాలనలో గణనీయమైన మార్పులు వచ్చాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ప్రభుత్వాలు మారినా లబ్ధిదారులకు నేరుగా ఆర్థిక సాయం అందేలా పటిష్టమైన చర్యలు తీసుకోలేదన్నారు. పేదల కోసం ఉద్దేశించిన నిధులు పక్కదారి పట్టకుండా, ప్రతి రూపాయీ వారికి చేరేలా తమ ప్రభుత్వం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ సంస్కరణ ప్రభుత్వ పథకాల్లోని అసమర్థతలను తొలగించి, అర్హులైన వారికి నేరుగా ఆర్థిక ప్రయోజనాలను కల్పించిందని ఆయన పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ రికార్డుల్లో 10 కోట్ల మంది మోసపూరిత లబ్ధిదారులు ఉన్నారని, వారు లేకపోయినా ప్రభుత్వ ప్రయోజనాలు వారికి దక్కుతూనే ఉండేవంటూ విమర్శించారు. గత పాలకులు సృష్టించిన వ్యవస్థ వల్ల ఈ పేర్లను అందులో చేర్చారన్నారు. తప్పుగా నమోదై ఉన్న ఈ 10 కోట్ల పేర్లను తమ ప్రభుత్వం అధికారిక రికార్డుల నుంచి తొలగించిందని, డీబీటీ ద్వారా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నిధులు బదిలీ అయ్యేలా చూశామని శ్రీ మోడీ స్పష్టం చేశారు. ఈ సంస్కరణ వల్ల రూ.3.5 లక్షల కోట్లకు పైగా అనర్హుల చేతికి వెళ్లకుండా అడ్డుకోగలిగామన్నారు.
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) పథకం అమలులో దశాబ్దాలుగా జరుగుతున్న జాప్యాన్ని ప్రధానమంత్రి ఎత్తిచూపారు. గత ప్రభుత్వాలు ఆర్థిక భారాన్ని సాకుగా చూపి ఈ ప్రతిపాదనను తిరస్కరించాయని, కానీ తమ ప్రభుత్వం దేశ భద్రత కోసం జీవితాలను అంకితం చేసిన వారి ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చిందని పేర్కొన్నారు. లక్షలాది సైనిక కుటుంబాలకు ఓఆర్ఓపీ లబ్ధి చేకూర్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం కింద తమ ప్రభుత్వం మాజీ సైనికులకు రూ.1.25 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసి, వారి న్యాయబద్ధమైన హక్కులకు భరోసా కల్పించిందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు రిజర్వేషన్ల అంశాన్ని కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. గతంలో ఏళ్ల తరబడి చర్చలు జరిపినప్పటికీ నిర్దిష్ట చర్యలు తీసుకోలేదన్నారు. ఈ విధానాన్ని అమలు చేయడానికి తమ ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. లోకసభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్ అంశంపై మాట్లాడుతూ.. రాజకీయ అవరోధాలు గతంలో దాని పురోగతికి ఆటంకం కలిగించాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. స్వార్థ ప్రయోజనాల వల్ల ఎంతో కీలకమైన ఈ సంస్కరణలో జాప్యం జరిగిందని విమర్శించారు. అయితే, రాజకీయ ప్రాతినిధ్యం ద్వారా మహిళా సాధికారత సాధించడానికి చట్టం చేయడం ద్వారా తమ ప్రభుత్వం దేశ ప్రయోజనానికే పట్టం కట్టిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా గతంలో పలు కీలక అంశాలను ఉద్దేశపూర్వకంగా వదిలేశారని శ్రీ మోదీ విమర్శించారు. ట్రిపుల్ తలాక్ అంశాన్ని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. అనేక మంది ముస్లిం మహిళలను దయనీయ పరిస్థితుల్లోకి నెట్టివేసినప్పటికీ, గత ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించాయన్నారు. న్యాయం, సాధికారతకు భరోసానిస్తూ.. ట్రిపుల్ తలాక్పై చట్టం చేయడం ద్వారా తమ ప్రభుత్వం మహిళా హక్కులు, ముస్లిం కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చిందని స్పష్టం చేశారు. వక్ఫ్ చట్టంలో సంస్కరణల ఆవశ్యకత గురించి కూడా ఆయన ప్రస్తావించారు. రాజకీయ కారణాల వల్ల అవసరమైన సవరణల్లో దశాబ్దాలుగా జాప్యం జరిగిందని పేర్కొన్నారు. ముస్లింతల్లులు, సోదరీమణులు, వారిలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నిజంగా ప్రయోజనం చేకూర్చే కీలక మార్పులను తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
నదుల అనుసంధానమనే బృహత్తరమైన కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం చేపట్టిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దశాబ్దాలుగా జల వివాదాలే ప్రధాన చర్చలుగా ఉన్నాయని, అయితే తమ హయాంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి నదుల అనుసంధానం కోసం ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. కెన్-బెత్వా, పార్వతి-కాళీసింధ్-చంబల్ అనుసంధాన ప్రాజెక్టుల వంటి కీలక ప్రాజెక్టులను ఉదహరించారు. వీటి వల్ల తగినంత నీరు లభించి లక్షలాదిగా రైతులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. జలవనరులపై జరుగుతున్న మీడియా చర్చను ఆయన ప్రస్తావిస్తూ.. దేశ న్యాయబద్ధమైన నీటి వాటా దేశం దాటి పోయేదంటూ గత పరిస్థితులను వివరించారు. “భారత జలాలు దేశంలోనే ఉంటాయి, దేశాభివృద్ధి కోసం అవి ఉపయోగపడాలన్న న్యాయబద్ధమైన లక్ష్యం నెరవేరుతుంది” అని ఆయన స్పష్టం చేశారు.
కొత్త పార్లమెంటు భవన నిర్మాణంపై విస్తృతంగా చర్చ జరుగుతున్నప్పటికీ, ఢిల్లీలో డాక్టర్ అంబేడ్కర్ జాతీయ స్మారక నిర్మాణం చాలావరకు విస్మరణకు గురయిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. అటల్ బిహారీ వాజపేయీ ప్రభుత్వ హయాంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారనీ.. కానీ దశాబ్దం పాటు నిర్మాణం నిలిచిపోయిందని తెలిపారు. తమ ప్రభుత్వం ఈ స్మారక నిర్మాణాన్ని పూర్తి చేయడమే కాకుండా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసేలా.. ఆయనకు సంబంధించిన కీలక స్థలాలను పంచతీర్థగా అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు.
2014లో తన ప్రభుత్వం ఏర్పాటైన పరిస్థితులను ప్రధాని గుర్తుచేస్తూ, ఆ కాలంలో పాలన తీవ్ర ఒడుదొడుకులకు లోనైందనీ, కొంతమందైతే ప్రజాస్వామ్యంతోపాటు అభివృద్ధి కలిసికట్టుగా మనుగడ సాగించగలుగుతాయా అనే ప్రశ్నను సైతం అడగడం మొదలుపెట్టారన్నారు. ‘‘నేటి భారత్ ప్రజాస్వామ్య శక్తికి ఒక నిదర్శనంగా నిలిచింది. ప్రజాస్వామ్యం ఏమైనా చేయగలదని గర్వంగా చాటిచెబుతోంది’’ అని ఆయన స్పష్టం చేశారు. గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారనీ, దీంతో ప్రజాస్వామిక పాలన ఎంత ప్రభావశీలమైందనే విషయంలో ఒక బలమైన సందేశం ప్రపంచానికి అందిందని ఆయన వ్యాఖ్యానించారు. ముద్రా యోజనలో భాగంగా రుణాలు అందుకున్న లక్షలాది చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రజాస్వామ్య సకారాత్మక ప్రభావాన్ని నేరుగా అనుభవంలోకి తెచ్చుకోగలిగారని ప్రధాని చెప్పారు. దీనికి అదనంగా, ఒకప్పుడు వెనుకబడిన జిల్లాలుగా పేరుపడ్డ అనేక జిల్లాలు ఇప్పడు అభివృద్ధి కోసం తపిస్తున్న జిల్లాలుగా మారిపోయాయి. ఇవి ముఖ్య అభివృద్దిసూచక కొలమానాలతో కొలిచిచూసినప్పుడు చక్కని ఫలితాలను చూపుతున్నాయనీ, ఇది ప్రజాస్వామ్యం బలమైన ఫలితాలను అందించగలదన్న విషయం ప్రస్ఫుటం అవుతోందని శ్రీ మోదీ అన్నారు. చారిత్రకంగా చూస్తే, దేశంలోని గిరిజన సముదాయాలు- వీటిలో అత్యంత నిరాదరణకు గురైన కొన్ని సమూహాలు కూడా కలిసి ఉన్నాయి... అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయాయని ఆయన ప్రధానంగా చెప్పారు. పీఎం జన్మన్ యోజనను అమలులోకి తీసుకురావడంతో, ఈ సముదాయాలు ఇక ప్రభుత్వ సేవలను అందుకోగలుగుతున్నాయి. దీంతో ప్రజాస్వామ్యానికి ఉన్న ఉద్ధరణ సామర్థ్యం పట్ల వారిలో విశ్వాసం బలపడుతోందని ఆయన తెలిపారు. అభివృద్ధి, జాతీయ వనరులు ఎలాంటి భేదభావానికీ తావు ఇవ్వకుండా పౌరులలో ఆఖరి వ్యక్తి వరకు చేరుకొనేటట్లుగా సిసలైన ప్రజాస్వామ్యం పూచీపడుతుందనీ, ఈ మౌలిక లక్ష్యాన్ని సాధించడానికి తన ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందనీ ఆయన స్పష్టం చేశారు.
శరవేగంగా అభివృద్ధిని సాధించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తుకు రూపురేఖలను భారత్ తీర్చిదిద్దుతోందనీ, ప్రగతిశీల ఆలోచనవిధానం, దృఢ సంకల్పం, కరుణ.. ఇవన్నీ దీనిలో సమృద్ధంగా ఉంటాయని శ్రీ మోదీ అన్నారు. మనిషిని కేంద్ర స్థానంలో నిలిపే (హ్యూమన్- సెంట్రిక్) ప్రపంచీకరణ వైపు పయనించాలన్న మార్పు చోటుచేసుకోవాలి అని ఆయన స్పష్టం చేశారు. ఆ వాతావరణంలో ప్రగతి సాధన అంటే అది ఒక్క విపణుల (మార్కెట్ల) అండతోనే ముందుకు సాగదు. ప్రజలకు ఆత్మగౌరవంతో పాటు వారి ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రగతిని సాధించాలని ఆయన అన్నారు. ‘‘మా ప్రభుత్వం జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)ని కేంద్ర స్థానంలో నిలిపే (జీడీపీ-సెంట్రిక్) వైఖరిని వదలిపెట్టి, జీఈపీ-సెంట్రిక్ (గ్రాస్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్)ని కేంద్ర స్థానంలో నిలిపే వైఖరిని అనుసరిస్తూ సమాజ సమష్టి అభ్యున్నతిపైన తన దృష్టిని కేంద్రీకరిస్తూ ముందుకు సాగుతోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దార్శనికతను చాటే ప్రధాన చర్యలను గురించి ఆయన వివరిస్తూ... ఒక పేద కుటుంబానికి పక్కా ఇల్లు సమకూరినప్పుడు వారికి సాధికారితతోపాటు ఆత్మగౌరవం ఇనుమడిస్తుందన్నారు. పారిశుద్ధ్య సౌకర్యాలు అమరినప్పుడు వ్యక్తి ఆరుబయలు ప్రదేశాల్లో మల మూత్రాదులను విసర్జించాల్సిన అవమానాస్పద స్థితి నుంచి బయటపడతారన్నారు. ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులు రూ.5 లక్షల విలువైన ఆరోగ్యసంరక్షణ సేవలను ఉచితంగా పొందుతూ ఉంటే అప్పడు వారికి ఆర్థికపరంగా అతి పెద్ద ఆందోళనల నుంచి విముక్తి లభిస్తుందని ప్రధాని అన్నారు. ఇలాంటి అనేక కార్యక్రమాలు అన్ని వర్గాలనూ కలుపుకొని ముందుకువెళ్లే, బాధలను పంచుకొనే తరహా అభివృద్ధి సాధనకు మార్గాన్ని సుగమం చేస్తున్నాయనీ, దీనివల్ల దేశంలో ప్రతి ఒక్కరికీ సాధికారత సమకూరుతుందన్నారు.
‘నాగరిక్ దేవో భవ’ (పౌరుడు దైవం) అనేది ప్రభుత్వ మౌలిక సూత్రమని ప్రధాని పునరుద్ఘాటించారు. ప్రజలకు సేవ చేయాలన్న నిబద్ధతను ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తన పాలనాయంత్రాంగం పాత ‘‘మాయీ-బాప్’’ (తల్లీ-తండ్రీ) సంస్కృతిని అనుసరించే కన్నా పాలనలో పౌరులే కీలకం అనే భావనను అవలంబిస్తోందని ఆయన చెప్పారు. సేవ చేయడమే ప్రధానం అనే సూత్రం దిశగా మార్పు చోటుచేసుకోవడాన్ని గురించి ప్రధాని తెలియజేస్తూ, ఈ విధానంలో పౌరుల చెంతకు చేరుకోవడానికి ప్రభుత్వం చురుకుగా పనిచేస్తుందన్నారు. ఇంతకు ముందు, ప్రజలు వారి దస్తావేజులను సరిచూసే పనికి పదే పదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సివచ్చేదనీ, అలాంటిది ఇప్పుడు, స్వీయ నిర్ధారణ పద్ధతి ఈ ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా మార్చేసిందన్నారు. ఎంతో మంది యువజనులు ఈ కార్యక్రమంలో పాల్గొనడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, పాలన ప్రక్రియల్ని డిజిటల్ పురోగతి ఎంతలా సువ్యవస్థితం చేసేసిందో, ఫలితంగా సార్వజనిక సేవలు మరింత సమర్ధంగా, పౌరులకు అనుకూలంగా ఎలా మారిపోయాయో వివరించారు.
ప్రభుత్వ ప్రక్రియల్లో తెచ్చిన మార్పును శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. వాటిని మరింత సులభంగా, పౌరులకు అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దినట్లు చెప్పారు. సీనియర్ సిటిజన్లు ఎదుర్కొన్న సవాళ్లను ఆయన గుర్తుచేస్తూ, ఇదివరకు తాము జీవించే ఉన్నామన్న రుజువును సమర్పించడానికి వారు ప్రతి ఏటా కార్యాలయాల చుట్టూనో, బ్యాంకుల చుట్టూనో తిరుగుతూ ఉండాల్సివచ్చేదన్నారు. తన ప్రభుత్వం డిజిటల్ వ్యవస్థను ప్రవేశపెట్టిందనీ, దీంతో సీనియర్ సిటిజన్లు తమ జీవన ప్రమాణ్ ధ్రువ పత్రాలను దూర ప్రాంతంలో ఉంటూనే దాఖలు చేసేందుకు వీలు కలిగిందన్నారు. విద్యుత్తు కనెక్షన్లు పొందాలన్నా, నల్లాలు ఏర్పాటు చేసుకోవాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా, గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకోవాలన్నా, డెలివరీలు అందుకోవాలన్నా.. ఇలా తరచుగా పూర్తి చేయాల్సిన ఏ పనుల కోసమైనా సరే మళ్లీ మళ్లీ చక్కర్లు కొట్టాల్సివచ్చేదనీ, చివరకు ఉద్యోగానికి సెలవు కూడా పెట్టాల్సివచ్చేదన్నారు. ప్రస్తుతం, ఈ విధమైన సేవల్లో చాలా వరకు ఆన్లైన్ వేదికల ద్వారా సువ్యవస్థీకరించామనీ, దీంతో పౌరులకు అసౌకర్యం తగ్గిందన్నారు. పాస్పోర్టులు, పన్ను రిఫండులు, లేదా ఇతర సేవల కోసం ప్రభుత్వానికీ, పౌరులకూ మధ్య మాటామంతీని సరళతరం, వేగవంతం, దక్షతాయుతంగా మార్చాలన్నదే తన ప్రభుత్వ నిబద్ధత అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. ఈ వైఖరి ‘నాగరిక్ దేవో భవ’ అనే సిద్ధాంతానికి అనుగుణంగా ఉందనీ, ఇది 2047కల్లా అభివృద్ధి చెందిన భారత్కు పునాదిని పటిష్ఠపరుస్తుందనీ ఆయన తెలిపారు.
సంప్రదాయాన్నీ, ప్రగతినీ ఏకకాలంలో ముందుకు తీసుకుపోవాలన్న భారత్ అద్వితీయ దృష్టికోణాన్ని ప్రధానమంత్రి వివరిస్తూ, ‘‘వికాస్ భీ, విరాసత్ భీ’’ (అభివృద్ధితోపాటు వారసత్వం కూడా) అనే అంశం పట్ల దేశం నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు. సంప్రదాయం, టెక్నాలజీ కలిసికట్టుగా ఎలా వర్ధిల్లగలుగుతాయో ఇండియా చాటిచెబుతోందని ఆయన అన్నారు. డిజిటల్ మాధ్యమం ద్వారా లావాదేవీలు జరపడంలో ప్రపంచంలో అగ్రగామి దేశాల సరసన భారత్ నిలిచిందనీ, యోగానూ, ఆయుర్వేదాన్నీ ప్రపంచ సమక్షానికి తీసుకుపోయిందనీ ఆయన చెప్పారు. గత పది సంవత్సరాల్లో రికార్డు స్థాయి ఎఫ్డీఐలతో పెట్టుబడికి భారత్ చాలా ఆకర్షణీయ దేశంగా మారిందన్నారు. దొంగిలించిన కళాకృతులను, వారసత్వ వస్తువులను ఇంతవరకు ఎరుగనంత స్థాయిలో మనకు తిరిగి ఇచ్చేశారని కూడా ఆయన తెలిపారు. ప్రపంచంలో భారత్ స్థాయి పెరుగుతోందని ఈ పరిణామాలు చాటుతున్నాయన్నారు. ఇండియా ఇక ప్రపంచంలో మొబైల్ ఫోన్లను తయారు చేస్తున్న రెండో అతి పెద్ద దేశం. చిరుధాన్యాల వంటి సూపర్ఫూడ్స్ను ఉత్పత్తి చేస్తున్న అగ్రగామి దేశం కూడా అని ప్రధాని చెప్పారు. దీనికి తోడు, సౌర ఇంధనంలో దేశం 100 గిగావాట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అధిగమించింది... ఇది పునరుత్పాదక ఇంధన రంగంలో భారత నాయకత్వం వహిస్తున్న తీరు ఎలా ఉందో తెలియజేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రగతిని సాధించాలంటే మన సాంస్కృతిక మూలాలను వదలివేయాల్సిన పని లేదని శ్రీ మోదీ ప్రధానంగా చెప్పారు. భారత్ తన వారసత్వాన్ని ఎంత బలంగా అట్టిపెట్టుకొంటుందో, ఆధునిక ప్రగతితో దేశ ఏకీకరణ అంత బలంగానూ ఉంటుందని ఆయన చెప్పారు. భారత్ తన ప్రాచీన వారసత్వాన్ని పరిరక్షించుకొంటోందనీ, అదే సమయంలో భారత్ ప్రాచీన వారసత్వం దేశ భవిష్యత్తుకు ఒక మూలంగా కూడా ఉంటోందనీ ప్రధాని తెలిపారు. 2047కల్లా అభివృద్ది చెందిన భారత్ వైపునకు పయనించే క్రమంలో ప్రతి అడుగుకు ఎంతో ప్రాధాన్యం ఉందని ఆయన స్పష్టం చేశారు. తరచుగా ప్రజలు ప్రభుత్వ నిర్ణయాల విస్తృత ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతుంటారని ఆయన అన్నారు. మీడియా, కంటెంట్ సృజన రంగాలను ఆయన ఉదాహరించారు. ఓ పది సంవత్సరాల కిందట తాను డిజిటల్ ఇండియా విషయమై మాట్లాడితే అప్పట్లో చాలా మంది దీనిపై సందేహాన్ని వ్యక్తం చేశారని గుర్తుకుతెచ్చారు. ప్రస్తుతం, డిజిటల్ ఇండియా ప్రజల దైనందిన జీవనంలో ఓ భాగంగా కలిసిపోయిందని ఆయన అన్నారు. డిజిటల్ రంగంలో విప్లవాన్ని తీసుకువచ్చిన ఖ్యాతి చౌకైన డేటా, దేశీయంగా తయారవుతున్న స్మార్ట్ఫోన్లకు దక్కుతుందని శ్రీ మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా జీవన సౌలభ్యాన్ని పెంచగా, కంటెంట్పైన, సృజనాత్మకతపైనా దీని ప్రభావం ఎంతో ఉందని, అయితే దీనిని తరచు గుర్తించడం లేదని ఆయన అన్నారు. డిజిటల్ వేదికలు వ్యక్తులకు ఎలా సాధికారతను అందించిందీ కొన్ని ఉదాహరణలతో సహా ఆయన వివరించారు. ఆయన ఓ గ్రామీణ మహిళను ఉదాహరణగా చెప్పారు. ఆమె లక్షలాది సబ్స్క్రైబర్లను కూడగట్టి విజయాన్ని సాధించారు. ఒక గిరిజన యువ ప్రతినిధి ప్రపంచ ప్రేక్షకుల సమక్షంలో సాంప్రదాయక కళను ప్రదర్శించగా, ఒక విద్యార్థి నవీన పద్ధతుల్లో టెక్నాలజీని వివరించిన వైనాన్ని ప్రధాని గుర్తుచేశారు.
***
(Release ID: 2127883)
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada