హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పాకిస్థాన్, నేపాల్‌తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో జరిగిన భద్రత సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా


* ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం పట్ల ప్రధాని మోదీ, త్రివిధ దళాలకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు

* భారత్ సరిహద్దులు, మిలటరీ, పౌరుల జోలికి వచ్చిన వారికి భారత్ ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సిందూర్

* పహల్గాం ఉగ్రదాడికి దీటైన సమాధానమిచ్చిన ఆపరేషన్ సిందూర్, ప్రపంచానికి బలమైన సందేశం పంపింది

* ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించని మోదీ ప్రభుత్వ విధానాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఆపరేషన్ సిందూర్

* ఈ సమయంలో దేశం ప్రదర్శించిన ఐక్యత దేశ ప్రజల మనోధైర్యాన్ని పెంచింది

* ఆసుపత్రులు, అగ్నిమాపక సేవలు వంటి అత్యవసరమైన సేవలు సజావుగా సాగేలా, నిత్యవసరాల సరఫరాలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశం

* ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎస్‌డీఆర్ఎఫ్, సివిల్ డిఫెన్స్, హోం గార్డులు, ఎన్‌సీసీ తదితరమైన వాటిని అప్రమత్తంగా ఉంచాలని హోం మంత్రి ఆదేశం

* సామాజిక మాధ్యమాలు, ఇతర మీడియా వేదికల్లో దేశానికి వ్యతిరేకంగా అవాంఛనీయ అంశాల ప్రసారం జరగకుండా కఠిన పర్యవేక్షణ ఉండాలి: రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర సంస్థల సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలి

* సమాచార ప్రసారం సజావుగా సాగేందుకు అన్ని విధాల ప్రయత్

Posted On: 07 MAY 2025 7:12PM by PIB Hyderabad

పాకిస్థాన్, నేపాల్‌తో సరిహద్దు పంచుకొంటున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో న్యూఢిల్లీలో జరిగిన భద్రత సమీక్షా సమావేశానికి కేంద్ర హోం వ్యవహారాలు, సహకార మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షత వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్, లధాఖ్ గవర్నర్లు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు, సిక్కిం ప్రభుత్వ ప్రతినిధి హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ సహా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ)కి చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

2025, ఏప్రిల్ 22న కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి అనంతరం నిర్వహించిన సమావేశంలో ఈ ఘటనకు పాల్పడిన వారికి, ఉగ్రవాద మద్ధతుదారులకు తగిన సమాధానమిస్తామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారని కేంద్ర హోం వ్యవహారాల మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో దృఢ సంకల్పతో నిర్ణయం తీసుకున్న ప్రధానికి హోం మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. భారత్ సరిహద్దులు, మిలటరీ, పౌరుల జోలికి వచ్చినవారికి ఆపరేషన్ సిందూర్ సరైన సమాధానమని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం పట్ల ఈ సమావేశంలో పాల్గొన్న లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి మోదీకి, త్రివిధ దళాలకు అభినందనలు తెలిపారు.

 

పహల్గామ్ ఉగ్రవాద దాడికి మనం ఆపరేషన్ సిందూర్ ద్వారా గట్టి జవాబిచ్చి, ప్రపంచానికి బలమైన సందేశాన్నిచ్చామని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. కచ్చితమైన సమాచారం ఆధారంగా ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించని మోదీ ప్రభుత్వ విధానాన్ని ప్రపంచానికి చాటిందని ఆయన అన్నారు. ఈ సమయంలో దేశం చూపిన ఐక్యత దేశ ప్రజల మనోధైర్యాన్ని మరింత పెంచిందని శ్రీ అమిత్ షా వ్యాఖ్యానించారు.

ఈనెల 6-7 తేదీల మధ్య రాత్రి సమయంలో భారత సాయుధ దళాలు ఉగ్రవాదులకు చెందిన తొమ్మిది నిర్దిష్ట ప్రదేశాలపై దాడి చేసి, వారి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయని శ్రీ అమిత్ షా తెలిపారు. భారత సాయుధ దళాలు నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాద శిక్షణ శిబిరాలు, ఆయుధ స్థావరాలతో పాటు లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థల రహస్య ప్రదేశాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని హోంమంత్రి పేర్కొన్నారు.

మాక్ డ్రిల్ కోసం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ అన్ని రాష్ట్రాలు తమ సన్నాహాలు చేసుకోవాలని కేంద్ర హోం మంత్రి సూచించారు. ఆసుపత్రులు, అగ్నిమాపక దళం వంటి ముఖ్యమైన సేవలను సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలనీ, నిత్యావసర సరుకుల నిరంతర సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకోవాలన్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఎస్‌డిఆర్ఎఫ్, సివిల్ డిఫెన్స్, హోమ్ గార్డ్స్, ఎన్‌సీసీ మొదలైన విభాగాలను అప్రమత్తంగా ఉంచాలని హోం మంత్రి రాష్ట్రాలను కోరారు. పౌరుల, ప్రభుత్వేతర సంస్థల ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సామాజిక, ఇతర మీడియా వేదికల ద్వారా అవాంఛిత శక్తులు చేసే దేశ వ్యతిరేక ప్రచారాలపై గట్టి నిఘా ఉంచాలని, అటువంటి చర్యలకు పాల్పడే వారి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీలు సమన్వయంతో పనిచేసి సత్వర చర్యలు తీసుకోవాలని శ్రీ అమిత్ షా సూచించారు. కమ్యూనికేషన్‌ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలనీ, ముప్పు ఎక్కువగా ఉన్న ప్రదేశాల భద్రతను మరింత బలోపేతం చేయాలని హోంమంత్రి కోరారు. ప్రజల్లో అనవసరమైన భయాల వ్యాప్తిని అడ్డుకుంటూ, తప్పుడు వార్తలను గురించి ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. స్థానిక పరిపాలన, సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య సమన్వయాన్ని మరింత పెంపొందించాలని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.

 

***


(Release ID: 2127712)