WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

విశ్వసనీయతను కాపాడుకోండి, హద్దులను నిర్దేశించుకోండి, నిజాయితీగా చెప్పండి – సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు వేవ్స్ ప్యానెల్ సలహా


సోషల్ మీడియాలో ప్రకటనలకు సంబంధించి ఇన్‌ఫ్లూయెన్సర్ల కోసం ఉత్తమ విధానాలను నిర్దేశించిన వేవ్స్- 2025

 Posted On: 04 MAY 2025 1:39PM |   Location: PIB Hyderabad

ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న ప్రపంచ దృశ్య, శ్రవణ వినోద సదస్సు (వేవ్స్)-2025 నాలుగో రోజున ‘సోషల్ మీడియాలో ప్రకటనలకు సంబంధించి ఇన్‌ఫ్లూయెన్సర్ల కోసం ఉత్తమ విధానాలు’ అంశంపై ఓ ప్రత్యేక బ్రేకవుట్ సెషన్ నిర్వహించారు.

ఏఎస్‌సీఐఐ డైరెక్టర్ సహేలీ సిన్హా, సినీనటీ ఇన్‌ఫ్లూయెన్సర్ షిబానీ అక్తర్, ఎంటర్‌టైన్‌మెంట్ జర్నలిస్ట్ శ్రీ మయాంక్ శేఖర్, పాకెట్ ఏసెస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శ్రీ వినయ్ పిళ్ళై ఈ ప్యానెల్‌లో ఉన్నారు. ఖైతాన్ అండ్ కో భాగస్వామి శ్రీమతి తనూ బెనర్జీ ఈ సదస్సుకు సంధానకర్తగా వ్యవహరించారు.

డిజిటల్ ఎకానమీలో ఇన్‌ఫ్లూయెన్సర్ల పాత్ర పెరుగుతుండటం, ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రకటనల విశ్వసనీయతను బలోపేతం చేయడం కోసం అవసరమైన నైతిక, సృజనాత్మక, చట్టపరమైన వ్యవస్థలపై ఈ చర్చ ప్రధానంగా దృష్టి సారించింది. సురక్షితమైన ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్‌కు ప్రామాణికత, పారదర్శకత, కంటెంటుపై బాధ్యత ముఖ్యమైన ప్రాతిపదికలని ప్యానెల్ స్పష్టం చేసింది.

బ్రాండెడ్ కంటెంటును క్రియేట్ చేసే సమయంలో నిజానికి కట్టుబడి ఉండడం ప్రధానమైన అంశమని షిబానీ అక్తర్ పేర్కొన్నారు. కంటెంట్, బ్రాండింగ్ ప్రక్రియల్లో క్రియేటర్లు భాగస్వాములు కావడం, వ్యక్తిగత నమ్మకాలూ ఉద్దేశాలను కాంపెయిన్లు ప్రతిబింబించేలా చూసుకోవడమన్నవి ప్రభావవంతమైన ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్‌కు ఆవశ్యకమని ఆమె వ్యాఖ్యానించారు. నిజాయితీగా బ్రాండ్‌ను ఏర్పరచుకోవాలని, అన్ని భాగస్వామ్యాలకూ ప్రామాణికతనే ప్రాతిపదికగా కొనసాగించాలని ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఆమె విజ్ఞప్తి చేశారు.


ప్లాట్ఫాంకు తగ్గ వ్యూహాలను అవలంబించాలని, అన్నింటికీ ఒకే విధానాన్ని వీడాలని శ్రీ వినయ్ పిళ్లై క్రియేటర్లకు సూచించారు. ప్రతీ డిజిటల్ ప్లాట్‌ఫాంలోనూ విభిన్నమైన ప్రేక్షకులు ఉంటారని, కథన విధానం దానికి అనుగుణంగా ఉండాలని వివరించారు. జాగ్రత్తగా బ్రాండ్‌ బిల్డ్ చేసుకోవడం, విశ్వసనీయంగా ఉండడం ముఖ్యమైన అంశాలనీ.. సమాచారం తెలుసుకుని కంటెంట్‌పై నిర్ణయం తీసుకోవడం ద్వారా టార్గెట్ ఆడియన్స్‌కు విషయం చేరుతుందని ఆయన చెప్పారు.  

డిజిటల్ ప్రాబల్యంలో పోకడలు, సెలెబ్రిటీలూ క్రియేటర్ల మధ్య హద్దులు చెరిగిపోతుండంపై శ్రీ మయాంక్ శేఖర్ మాట్లాడారు. నేడు ఇన్‌ఫ్లూయెన్స్ అన్నది సినిమాలూ టీవీలకే పరిమితం కాలేదని, వివిధ వేదికలతోపాటు అవకాశమున్న ప్రతీ చోటా ఇన్‌ఫ్లూయెన్స్ నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. క్రియేటర్లు విశ్వసనీయతను కాపాడుకోవాలని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని, ఇతరుల వర్క్‌ను నకలు చేయొద్దని ఆయన హెచ్చరించారు. స్పాన్సర్డ్ కంటెంట్‌లో సమగ్రత, వాస్తవ ధ్రువీకరణ ప్రాధాన్యాన్ని వివరించారు.

ఇన్‌ఫ్లూయెన్సర్లు భాగస్వామ్యాల విషయంలో పారదర్శకంగా ఉండాలని, ఒక పోస్టు పెయిడ్ పోస్టా లేదా ప్రమోషనల్‌ పోస్టా అన్నది వెల్లడించాలని సహేలి సిన్హా అన్నారు. నైతికమైన, సమాచారం అందించే, ప్రేక్షకుల నమ్మకాన్ని ప్రతిబింబించే కంటెంటును రూపొందించాలని ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఆమె సూచించారు. చట్టపరమైన బాధ్యతలు, ప్రకటనల ప్రమాణాలు, కంటెంట్ బాధ్యతపై కొత్త క్రియేటర్లకు మార్గనిర్దేశం చేసేలా ఏఎస్‌సీఐఐ పలు కోర్సులు నిర్వహిస్తోందని ఆమె తెలిపారు.

కంటెంట్ క్రియేటర్లు తమ హద్దులను నిర్దేశించుకోవాలని, ఫాలోవర్లకు నిజాయితీగా సమాచారాన్ని అందించాలని, ప్రకటనల మార్గదర్శకాలూ ప్లాట్‌ఫామ్ నిబంధనలకు అనుగుణంగా మెలగాలని ప్యానెల్ సమష్టిగా సిఫార్సు చేసింది. ప్రేక్షకులతో దీర్ఘకాలిక సంబంధాలను ఏర్పరచుకోవడమన్నది ప్రకటనల ఉద్దేశంలో విశ్వాసం, స్పష్టతపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని వారు చెప్పారు.

ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రకటనలకు సంబంధించి అధికారికంగా ఉత్తమ విధానాలను రూపొందించాలని బలంగా కోరడంతోపాటు డిజిటల్ ప్రకటనల్లో పారదర్శకతనూ ప్రొఫెషనలిజాన్నీ పెంచేలా ఈ రంగంలో నిరంతర కృషి జరగాలని పిలుపునిస్తూ ఈ సదస్సు ముగిసింది.

 

ఎప్పటికప్పుడు అధికారిక అప్‌డేట్ల కోసం ఫాలో అవ్వండి:

‘ఎక్స్’లో: 

https://x.com/WAVESummitIndia

https://x.com/MIB_India

https://x.com/PIB_India

https://x.com/PIBmumbai

ఇన్‌స్టాగ్రామ్‌లో: 

https://www.instagram.com/wavesummitindia

https://www.instagram.com/mib_india

https://www.instagram.com/pibindia 

 

***


Release ID: (Release ID: 2126910)   |   Visitor Counter: 12