హోం మంత్రిత్వ శాఖ
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో నక్సలైట్లపై ఎంతమాత్రం రాజీ పడని విధానాన్ని
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోంది: కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
ఛత్తీస్గఢ్లో రెండు వేర్వేరు ఆపరేషన్లలో 22 మంది నక్సలైట్లను మట్టుబెట్టిన భద్రతా దళాలు
‘నక్సల్ ముక్త్ భారత్ అభియాన్’ దిశలో మరో పెద్ద విజయం సాధించిన జవాన్లు
లొంగుబాటు నుంచి జనజీవన స్రవంతిలో కలవడం వరకు అన్ని సదుపాయాలనూ అందిస్తున్నప్పటికీ, ఇంకా లొంగిపోని నక్సలైట్లను ఉపేక్షించేది లేదన్న హోం మంత్రి
వచ్చే ఏడాది మార్చి 31లోగా నక్సల్ రహితంగా భారత్: హోం మంత్రి
Posted On:
20 MAR 2025 5:39PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లపై ఏమాత్రం రాజీ పడని విధానంతో ముందుకెళ్తోందని కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు.
భద్రతా దళాలు రెండు వేర్వేరు ఆపరేషన్లలో 22 మంది నక్సలైట్లను మట్టుబెట్టిన అనంతరం.. కేంద్ర హోం మంత్రి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఓ పోస్టు చేశారు. ‘నక్సల్ ముక్త్ భారత్ అభియాన్’లో నేడు మన జవాన్లు మరో పెద్ద విజయాన్ని సాధించారని వ్యాఖ్యానించారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, కాంకేర్లలో భద్రతా దళాలు నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 22 మంది నక్సల్స్ హతమయ్యారని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం నక్సలైట్లపై ఏమాత్రం రాజీ పడని విధానాన్ని అవలంభిస్తోందన్నారు. లొంగుబాటు నుంచి జనజీవన స్రవంతిలో కలవడం వరకు అన్ని సదుపాయాలనూ అందిస్తున్నప్పటికీ ఇంకా లొంగిపోకుండా ఉన్న నక్సలైట్లను సహించబోమని ఆయన చెప్పారు. వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి దేశంలో నక్సల్స్ నిర్మూలన జరగబోతోందని శ్రీ అమిత్ షా అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో, కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మార్గనిర్దేశంలో.. నక్సలిజాన్ని ఏమాత్రం ఉపేక్షించబోని విధానంలో భాగంగా 2025లో ఇప్పటి వరకు 90 మంది నక్సలైట్లను హతమార్చగా, 104 మంది అరెస్టయ్యారు. 164 మంది లొంగిపోయారు. 2024లో 290 మంది నక్సలైట్లను హతమార్చడంతోపాటు 1090 మందిని అరెస్టు చేశారు. 881 మంది లొంగిపోయారు. ఇప్పటి వరకు మొత్తం 15 మంది నక్సల్ అగ్రనాయకులు హతులయ్యారు.
2004 – 2014 మధ్య మొత్తం 16,463 హింసాత్మక ఘటనలకు నక్సలైట్లు పాల్పడ్డారు. అయితే, 2014 నుంచి 2024 వరకు శ్రీ మోదీ ప్రభుత్వ హయాంలో ఈ హింసాత్మక ఘటనల సంఖ్య 7,744కు తగ్గింది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇది 53 శాతం తక్కువ. అదేవిధంగా, భద్రతా దళాల మరణాల సంఖ్య 73 శాతం తగ్గింది. 2004-14 మధ్య 1851 మంది మృత్యువాత పడగా, 2014-24 మధ్య 509 మంది మృతిచెందారు. మరణించిన పౌరుల సంఖ్య కూడా 4766 నుంచి 1,495కి.. అంటే 70 శాతం తగ్గింది.
2014 నాటికి మొత్తంగా 66 పటిష్ట పరిచిన పోలీస్ స్టేషన్లు (ఫోర్టిఫైడ్ పోలీస్ స్టేషన్లు) ఉన్నాయి. అయితే, గత పదేళ్లలో శ్రీ మోదీ ప్రభుత్వ హయాంలో వాటి సంఖ్య 612కు పెరిగింది. అదేవిధంగా, 2014లో దేశంలో 126 నక్సల్ ప్రభావిత జిల్లాలు ఉండేవి. అయితే, 2024 నాటికి ఆ జిల్లాల సంఖ్య భారీగా తగ్గి 12కు చేరింది. గత అయిదేళ్లలో మొత్తం 302 కొత్త భద్రతా శిబిరాలను, రాత్రి వేళ కూడా ల్యాండ్ కావడానికి వీలుగా 68 హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు.
***
(Release ID: 2113472)
Visitor Counter : 35
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam