సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ముంబయిలో మే 1 నుంచి జరగనున్న ప్రపంచ దృశ్య, శ్రవణ, వినోద సదస్సు నేపథ్యంలో అంతర్జాతీయ సమాజాన్ని ఆహ్వానిస్తున్న భారత ప్రభుత్వం.. కీలక అంతర్జాతీయ మీడియా సమావేశంలో విస్తృతంగా పాల్గొనాలని అభ్యర్థన
విస్తృతమవుతున్న మీడియా, వినోద రంగంలో సమన్వయ విధానం కోసం అంతర్జాతీయ వేదికగా వేవ్స్ ప్రయోజనాలను 100 మందికి పైగా రాయబారులు, హైకమిషనర్లకు వివరించనున్న ఆతిథ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు డాక్టర్ ఎస్. జయశంకర్, శ్రీ అశ్వినీ వైష్ణవ్, సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్..
న్యూఢిల్లీలో మార్చి 13న కార్యక్రమం
వేవ్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయంగా సమన్వయాన్ని పెంపొందించడమే లక్ష్యం.. మీడియా, వినోద రంగాల్లో అన్ని దేశాలకు గల అవకాశాలు, ఉమ్మడిగా ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం ఈ సమవేశంలో ముఖ్య ఎజెండా
Posted On:
12 MAR 2025 4:09PM by PIB Hyderabad
ప్రపంచ దృశ్య, శ్రవణ, వినోద సదస్సు (వేవ్స్) నేపథ్యంలో భారత ప్రభుత్వం అంతర్జాతీయ సమాజాన్ని ఆహ్వానిస్తోంది. మార్చి 13న న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో సాయంత్రం 4.30 గంటలకు ఈ మేరకు సమావేశాన్ని నిర్వహించనుంది. మే 2న ముంబయిలో ప్రారంభం కానున్న మొదటి వేవ్స్ పై ప్రకటన సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ.. ఈ కీలకమైన అంతర్జాతీయ మీడియా సమావేశంలో పాల్గొనాల్సిందిగా వివిధ ప్రభుత్వాలను అభ్యర్థిస్తోంది. మీడియా, వినోద రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా ఇదొక కీలకమైన ముందడుగు.
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్, కేంద్ర సమాచార, ప్రసార, రైల్వే, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్, కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ తోపాటు ఆతిథ్య రాష్ట్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశంలో పాల్గొంటారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా, వినోద రంగంలో ఏకీకృత అంతర్జాతీయ వేదికగా వేవ్స్ సమర్థంగా నిలిచే తీరును వారు వివరిస్తారు. ఈ కార్యక్రమానికి 100 మందికి పైగా రాయబారులు, హై కమిషనర్లు హాజరవుతుండగా.. మీడియా, వినోద రంగంలో సమన్వయ విధానం కోసం ఉన్న అవకాశాలను వారికి వివరించనున్నారు.
ప్రపంచ మీడియా రంగంతో ముఖాముఖి
2025 మే 2 న ముంబయిలో జరగనున్న ప్రపంచ ఆడియో విజువల్ - ఎంటర్టైన్మెంట్ సదస్సు 2025లో భాగంగా నిర్వహించనున్న ప్రపంచ మీడియా రంగ సమావేశం.. అంతర్జాతీయ సహకారం, సాంకేతిక ఆవిష్కరణలు, నైతిక పద్ధతులపై దృష్టి సారించనుంది. ఆడియో-విజువల్, ఎంటర్టైన్మెంట్ రంగాల భవిష్యత్తును రూపొందించే లక్ష్యంతో నిర్మాణాత్మక, డైనమిక్ సంభాషణలో పాల్గొనడానికి ప్రపంచ దేశాల నాయకులు, విధానకర్తలు, పరిశ్రమ భాగస్వాములు, మీడియా నిపుణులు, కళాకారులను ఏకతాటిపైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
చర్చించే కీలకాంశాలు
మీడియా, వినోద రంగం న్యాయబద్ధమైన, పారదర్శకమైన వృద్ధి పొందేలా చూసేందుకు దేశాల మధ్య బహిరంగ చర్చలు, సహకారాన్ని ప్రోత్సహించడం ఈ చర్చల ప్రధాన లక్ష్యం. వివిధ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించే వ్యూహాలపై చర్చలు దృష్టి సారించనున్నాయి. సాధారణ సవాళ్ళను పరిష్కరించేందుకు, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు జ్ఞానాన్ని పంచుకోవటం, భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకునేందుుకు ఒక వేదికగా పనిచేయనున్నాయి. మీడియా, వినోద రంగంలో బహిరంగ, నిష్పాక్షిక వాణిజ్య పద్ధతుల ప్రాముఖ్యతను కూడా ఈ చర్చల ప్రధానంగా దృష్టి సారించనున్నాయి. భాగస్వాములందరికి వనరులు సమానంగా అందుబాటులో ఉండేలా, వృద్ధి సాధించేలా చూసుకోనున్నాయి. గ్లోబల్ సామరస్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో మీడియా, వినోద రంగంలో అన్ని దేశాలకు ఉన్న సమస్యలు, అవకాశాలపై చర్చ ఈ ప్రపంచ మీడియా రంగ సమావేశంలో ప్రధాన ఎజెండాగా ఉంది.
వేవ్స్ 2025
వేవ్స్ అనేది పూర్తి మీడియా, వినోద రంగాన్ని (ఎం&ఈ) రంగాన్ని ఏకతాటిపైకి తెచ్చే ఒక ప్రధాన ప్రపంచ స్థాయి కార్యక్రమం. ఇది 2025 మే 1 నుంచి 4 వరకు మహారాష్ట్రలోని ముంబయిలో జరగనుంది. ఇది భారత ఎం-ఈ పరిశ్రమలను ప్రపంచ మార్కెట్తో, ప్రపంచ మార్కెట్ను దేశీయ పరిశ్రమలతో అనుసంధానించటం..వృద్ధి, సహకారం, ఆవిష్కరణలను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మీడియా, వినోద పరిశ్రమకు ఒక ప్రపంచ స్థాయి సదస్సుగా మారాలని వేవ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. కంటెంట్ క్రియేషన్, మేధో సంపత్తి, సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా తన స్థానాన్ని పెంచుకుంటూ భారత్ సృజనాత్మక శక్తిని పెంచడానికి ఈ వేదిక సిద్ధంగా ఉంది. ప్రసారాలు, పత్రికా రంగం, టీవీ, రేడియో, సినిమా, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, సౌండ్ అండ్ మ్యూజిక్, ప్రకటనలు, డిజిటల్ మీడియా, సామాజిక మాధ్యమాలు, జనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఎక్స్టెండెడ్ రియాలిటీ(ఎక్స్ఆర్) వంటి రంగాలపై ఈ సదస్సు దృష్టి సారించనుంది.
ఈ విజన్ ఆధారంగా సహకారం, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి అనేక డైనమిక్ ప్లాట్ఫామ్లను వేవ్స్ 2025 కలిగి ఉంది. వేవ్స్ బజార్ వ్యాపార భాగస్వామ్యాలు, కంటెంట్ సేకరణకు ఒక మార్కెట్ను అందించనుంది. ఏడాది పొడవునా ప్రపంచ స్థాయి కంటెంట్ వాణిజ్యం కోసం మొట్టమొదటి ఈ-బజార్ను కూడా ప్రారంభించనున్నారు. ఆవిష్కరణ, నిధుల సమకూర్చుకోవటాన్ని ప్రోత్సహించడానికి లైవ్ పిచింగ్ సెషన్ల ద్వారా ఎం అండ్ ఈ అంకురాలను పెట్టుబడిదారులు, మెంటార్లతో వేవ్-ఎక్స్లేటర్ అనుసంధానిస్తుంది. క్రియేటోస్పియర్ మాస్టర్ క్లాస్లు, వర్క్ షాప్లు, గేమింగ్ ఎరీనా లాంటి అద్భుతమైన అనుభవాలను వేవ్స్ అందించనుంది. వేవ్స్ సీఐసీ అవార్డులతో ముగిసే క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజెస్ల గ్రాండ్ ఫైనళ్లను కూడా కొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఈ కార్యక్రమాలు వేవ్స్ 2025ను ప్రపంచ ఎం-ఈ పరిశ్రమకు ఏకీకృత, సమన్వయ విధానంలో నడిపించే విషయంలో భారీ మార్పులు తీసుకొచ్చే వేదికగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
***
(Release ID: 2111137)
Visitor Counter : 36
Read this release in:
Malayalam
,
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil