సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
దృఢమైన, ఆరోగ్యకరమైన భారత్ దిశగా: సమష్టి కృషితో ఊబకాయంపై పోరాటం
Posted On:
01 MAR 2025 10:41AM by PIB Hyderabad
“ఆహారపు అలవాట్లలో చిన్నచిన్న మార్పుల ద్వారా మరింత దృఢమైన, రోగాలు దరిచేరని భవిష్యత్తును మనం సొంతం చేసుకోగలం.” – ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
|
పరిచయం
దేశంలో ప్రజారోగ్యాన్ని సవాలు చేస్తున్న ప్రధాన సమస్య ఊబకాయం. ఈ బాధితుల్లో అన్ని వయసుల వారూ ఉన్నారు. మధుమేహం, గుండెజబ్బు, రక్తపోటు వంటి అసాంక్రమిక వ్యాధుల ప్రమాదాన్ని ఇది పెంచుతోంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, కూర్చున్న చోటు నుంచి లేవని జీవనశైలి, పలు పర్యావరణపరమైన అంశాల వల్ల ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న స్థూలకాయం.. పల్లె, పట్టణమన్న తేడా లేకుండా జనాన్ని బాధిస్తోంది. ప్రాసెస్ చేసిన ఆహార వినియోగం పెరగడం, శారీరక శ్రమ తగ్గడం, జీవన శైలిలో మార్పులు కూడా ఈ సంక్షోభం ముదరడానికి కారణమయ్యాయి.
ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటీవలి మన్ కీ బాత్ ప్రసంగంలో దేశవ్యాప్తంగా ఊబకాయాన్ని తగ్గించడంపై అవగాహన పెంచాలని, ఈ దిశగా సమష్టి కృషి అత్యావశ్యకమని స్పష్టం చేశారు. ముఖ్యంగా వంటనూనెల వాడకాన్ని తగ్గించాలని కోరారు. ఉద్యమస్థాయిలో ఈ అవగాహన ప్రచారాన్ని నిర్వహించాలన్న ఆయన.. దీనికి నేతృత్వం వహించాల్సిందిగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులను నామినేట్ చేశారు. సమష్టి కృషి దిశగా ప్రధానమంత్రి పిలుపు దృఢమైన, ఆరోగ్యకరమైన భారత్ ఆవశ్యకతను స్పష్టం చేస్తోంది. వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ ఊబకాయాన్ని ఎదుర్కోవడం ఇందులో ముఖ్యమైన అంశం. ఫిట్ ఇండియా మూమెంట్, ఎన్పీ-ఎన్సీడీ, పోషణ్ అభియాన్, ఈట్ రైట్ ఇండియా, ఖేలో ఇండియా సహా అనేక కార్యక్రమాల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి, మెరుగైన పోషకాహారం, శారీరక వ్యాయామాలను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రజలందరికీ ఆరోగ్యకరమైన భవిష్యత్తు దిశగా భరోసా కల్పించేలా జీవనశైలిలో దీర్ఘకాలిక మార్పులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమాల లక్ష్యం. అమృత కాలం దిశగా భారత్ అడుగులేస్తున్న తరుణంలో.. విధానపరమైన సంస్కరణలు, సామాజిక భాగస్వామ్యం, నియంత్రణ చర్యల ద్వారా ప్రభుత్వమూ సమాజమూ పూర్తి అంకితభావంతో, సమష్టిగా ఊబకాయంతో పోరాడుతున్నాయి. ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం, అవగాహనను పెంపొందించడం అన్నవి ఈ సమస్యను తిప్పికొట్టడానికి, సంబంధిత విపత్తుల నుంచి భవిష్యత్తు తరాలను రక్షించడానికి ముఖ్య సాధనాలు.
ఊబకాయంపై అవగాహన: నిర్వచనం, కారణాలు
ఊబకాయమంటే ఏమిటి?
ఆరోగ్యానికి ప్రమాదం కలిగించేలా సాధారణ స్థాయిని మించి లేదా అధికంగా కొవ్వు పేరుకుపోవడాన్ని ఊబకాయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచించింది. సాధారణంగా స్థూలకాయాన్ని వర్గీకరించడానికి ఉపయోగించే ప్రమాణం ‘బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)’. 25 లేదా అంతకుమించి ఉన్న బీఎంఐని అధిక బరువుగా పరిగణిస్తారు. 30 లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న బీఎంఐని ఊబకాయ జాబితాలో చేరుస్తారు. భారత్ లో బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 23 నుంచి 24.9 కి.గ్రా/మీ² ఉన్న వ్యక్తులను అధికంగా బరువున్న వారిగా, బీఎంఐ 25 కి.గ్రా/మీ² లేదా అంతకు మించి ఉంటే ఊబకాయంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి బీఎంఐ 35 లేదా అంతకుమించి ఉంటే దానిని అనారోగ్యకరమైన ఊబకాయంగా పరిగణిస్తారు.
బీఎంఐ అంటే ఏమిటి?
బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)ను గతంలో క్యూట్లెట్ ఇండెక్స్ అని పిలిచేవారు. యువత బరువు ఆరోగ్యకరంగానే ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఇది సులభమైన మార్గం. ఓ వ్యక్తి బరువును (కిలోగ్రాముల్లో) తన ఎత్తుతో (మీటర్లలో) భాగించగా వచ్చిన ఫలితపు వర్గాన్ని (కి.గ్రా/మీ²) బీఎంఐగా పేర్కొంటారు. ఒక వ్యక్తి బరువు (కేజీల్లో)ను తీసుకుని, తన ఎత్తుతో (మీటర్లలో) భాగించి, ఆ ఫలితపు వర్గాన్ని కనుగొనడం ద్వారా బీఎంఐని తెలుసుకోవచ్చు.
ఆరోగ్యకరమైన బీఎంఐ పరిధి
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం సాధారణ బీఎంఐ పరిధి 18.5 నుంచి 24.9 మధ్య ఉండాలి.
అంతర్జాతీయ గణాంకాలు
ప్రపంచవ్యాప్తంగా పిల్లలూ పెద్దల్లో అధిక బరువు, ఊబకాయం తీవ్రత క్రమంగా పెరుగుతోంది. 1990 – 2022 మధ్య ఊబకాయంతో ఉన్న పిల్లలు, యువత (5 – 19 సంవత్సరాలు) సంఖ్య 2 శాతం నుంచి నుంచి 8 శాతానికి, అంటే నాలుగు రెట్లు పెరిగింది. ఇదే సమయంలో ఊబకాయంతో కూడిన యువత (18 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు) నిష్పత్తి రెట్టింపును మించి 7 శాతం నుంచి 16 శాతానికి పెరిగింది.
భారత్ లో గణాంకాలు
-
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్ హెచ్ఎస్)-5 (2019-21) ప్రకారం మొత్తం భారతీయ స్త్రీలలో 24%, పురుషులలో 23% అధిక బరువు లేదా ఊబకాయాన్ని ఎదుర్కొంటున్నారు.
-
ఎన్ఎఫ్ హెచ్ఎస్-5 (2019-2021) ప్రకారం.. 15-49 సంవత్సరాల మధ్య వయస్కులలో, 6.4% మంది మహిళలు, 4% మంది పురుషులు ఊబకాయంతో ఉన్నారు.
-
దేశవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో అధికంగా బరువు (ఎత్తును బట్టి బరువు) ఉన్న వారు ఎన్ఎఫ్ హెచ్ఎస్-4 (2015-16)లో 2.1 శాతంగా ఉండగా, ఎన్ఎఫ్ హెచ్ఎస్-5 (2019-21) నాటికి అది 3.4 శాతానికి పెరిగింది.
భారత్ లో ఊబకాయం పెరగడానికి ముఖ్య కారణాలు

ఊబకాయాన్ని నిరోధించేందుకు భారత ప్రభుత్వ వ్యూహాత్మక ఫ్రేమ్ వర్క్
విధానపరమైన ఆవిష్కరణలు, గణనీయమైన ఫలితాలు
స్థూలకాయాన్ని ప్రధాన ప్రజారోగ్య సమస్యగా గుర్తించిన భారత ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనూ దానిని నిరోధించడానికి, తగ్గించడానికి సమగ్రమైన, బహుముఖీనమైన కార్యక్రమాలను ప్రారంభించింది. సమగ్ర విధానాన్ని ప్రోత్సహించే దిశగా పలు మంత్రిత్వ శాఖలు వ్యూహాత్మకంగా ఈ కార్యక్రమాలను రూపొందించాయి. తద్వారా ఆరోగ్యం, పోషకాహారం, శారీరక శ్రమ, ఆహార భద్రత, జీవనశైలి మార్పులను ఒకేచోటికి తెచ్చాయి. కేంద్రప్రభుత్వ చర్యలను కింద పేర్కొన్న విధంగా వర్గీకరించవచ్చు:
1. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ – ప్రజారోగ్య సదుపాయాలను బలోపేతం చేసింది:
1.1 జాతీయ అసాంక్రమిక వ్యాధుల నిరోధక, నియంత్రణ కార్యక్రమం (ఎన్పీ-ఎన్సీడీ)
డబ్ల్యూహెచ్ వో 2018 – ఎన్సీడీ ఇండియా ప్రొఫైల్ ప్రకారం.. భారత్ లో మొత్తం 63% మరణాలకు అసాంక్రమిక వ్యాధులు కారణమవుతున్నాయి. హృదయ సంబంధ వ్యాధులు (27%), దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు (11%), క్యాన్సర్లు (9%), మధుమేహం (3%), ఊబకాయం (13%) సహా ఇతర సమస్యలు ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
పొగాకు వాడకం, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, మద్యపానం సహా అనేక జీవనశైలి అంశాలు హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్లు, మధుమేహం, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల వంటి అసాంక్రమిక వ్యాధులకు ముఖ్య కారణాలు. వీటిని మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. వాయు కాలుష్యం ఈ ముప్పును ఇంకా పెంచుతోంది. ఈ అంశాలు ఊబకాయం, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలూ కొలెస్టరాలూ పెరగడానికి కారణమవుతున్నాయి. ఇవన్నీ అసాంక్రమిక వ్యాధులు సోకే అవకాశాన్ని గణనీయంగా పెంచుతాయి. వీటిలో చాలావరకూ నివారించదగినవే కాబట్టి ఊబకాయ సమస్యను పరిష్కరించడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను విడనాడడం అసాంక్రమిక వ్యాధుల భారాన్ని తగ్గించడంలో కీలకమైన అంశాలు.
జాతీయ అసాంక్రమిక వ్యాధుల నిరోధక, నియంత్రణ కార్యక్రమం (ఎన్పీ-ఎన్సీడీ) కింద జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ఎం) ద్వారా.. వివిధ సమూహాలు, పౌర సమాజం, మీడియా, ఇతర పక్షాలను భాగస్వాములను చేయడం ద్వారా ప్రజారోగ్యాన్ని ప్రోత్సహించాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆరోగ్య రక్షణకు సంబంధించి అన్ని స్థాయిల్లోనూ.. అంటే వ్యాధి పరీక్ష, ముందస్తు నిర్ధారణ, నిర్వహణ, సూచనలు, అనంతర పరీక్షలపై ప్రధానంగా దృష్టి సారించడం ద్వారా నిరంతర రక్షణకు ఇది భరోసా కల్పిస్తుంది. నివారణ, చికిత్స, పునరుద్ధరణ, అవగాహన (ఐఈసీ/ బీసీసీ), పర్యవేక్షణ, పరిశోధన అంశాల్లో హాస్పిటళ్ల సామర్థ్యాన్ని పెంచడం కూడా ఈ కార్యక్రమ లక్ష్యం. అంతేకాకుండా అత్యవసర ఔషధాలు, వైద్య సామగ్రి, రవాణాకు సంబంధించి సరఫరా వ్యవస్థ నిర్వహణను కూడా ఇది మెరుగుపరుస్తుంది. తద్వారా ఒకే రకమైన ఐసీటీ వ్యవస్థ ద్వారా సమర్థవంతమైన పర్యవేక్షణ, అంచనా, జాతీయ స్థాయిలో అమలుకు హామీ ఇస్తుంది.

ముఖ్యాంశాలు
-
ఎన్పీసీడీసీడీ కింద కల్పించిన సదుపాయాలు – 682 జిల్లా ఎన్సీడీ క్లినిక్ లు, 191 జిల్లా హృదయ సంరక్షణ యూనిట్లు, 5,408 సీహెచ్ సీ ఎన్సీడీ క్లినిక్ లు.
-
ముందస్తు సంరక్షణ, అవగాహన – ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య, సంక్షేమ కేంద్రాల ద్వారా ఇది అమలవుతోంది. సంక్షేమ, సామాజిక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
2. ఆయుష్ మంత్రిత్వ శాఖ: సాంప్రదాయక, సమగ్ర ఆరోగ్య విధానాలకు ప్రోత్సాహం
ఊబకాయం, అధిక బరువు సమస్యను ఆయుర్వేదం ద్వారా సమర్థవంతంగా పరిష్కరించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలను అమలు చేసింది:
-
ప్రత్యేక ఆయుర్వేద సంరక్షణ: న్యూఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ) ఊబకాయం, సంబంధిత జీవనశైలి రుగ్మతలకు ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది. ఈ చికిత్సల్లో పంచకర్మ చికిత్సలు, ఆయుర్వేద ఔషధాలు, వ్యక్తిగత ఆహార మార్గదర్శకాలు, యోగా విధానాలను మిళితం చేస్తున్నారు. ఇప్పటి వరకు మధుమేహం, జీవక్రియ వ్యాధులతో బాధపడుతున్న దాదాపు 45,000 మంది రోగులకు ఈ సేవల ద్వారా ప్రయోజనం లభించింది.
-
పరిశోధన, ప్రమాణాల నిర్ధారణ: ఊబకాయం సహా జీవనశైలి వ్యాధుల నుంచి సమర్థవంతమైన రక్షణను అందించడం కోసం కేంద్ర ఆయుర్వేద శాస్త్రాల పరిశోధన మండలి (సీసీఆర్ఏఎస్) పరిశోధన నిర్వహిస్తోంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, ఊబకాయం వంటి సమస్యలను నివారించడంలో దినచర్య (రోజువారీ నియమావళి), ఋతుచర్య (కాలానుగుణ నియమావళి), ఆహార (ఆహార మార్గదర్శకాలు), యోగా వంటి అభ్యాసాలు ప్రభావవంతంగా ఉన్నాయని అధ్యయనాల ద్వారా వెల్లడైంది.
-
ఆయుర్ స్వస్థ్య యోజన: 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కేంద్ర పథకం అమలవుతోంది. సామాజిక ఆరోగ్య సంరక్షణ కోసం ఆయుష్ చేపట్టిన కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ‘ఆయుష్, ప్రజారోగ్యం’ ఇందులో భాగంగా ఉంటాయి. జీవనశైలి రుగ్మతలు, అసాంక్రమిక వ్యాధుల నిర్వహణకు ఉద్దేశించిన ప్రాజెక్టులకు ఈ పథకం చేయూతనిస్తుంది. ప్రస్తుతం 11 ప్రాజెక్టులు స్థూలకాయం, మధుమేహం, రక్తపోటు, బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తున్నాయి.
-
సమష్టి పరిశోధన చర్యలు: ఆయుర్వేదంలో శాస్త్రీయ పరిశోధనలను పెంచడానికి శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్)తో ఆయుష్ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనిద్వారా సాంప్రదాయక ఆయుర్వేద పరిజ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానంతో అనుసంధానించే పరిశోధనల అభివృద్ధి, అమలుపై.. ప్రత్యేకించి ఊబకాయం వంటి జీవనశైలి సంబంధిత రుగ్మతల నిర్వహణపై దృష్టి సారిస్తారు.
ఈ సమగ్ర చర్యల ద్వారా ఊబకాయం నివారణ, తగిన విధానాల కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది.
3. మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ
పోషణ్ అభియాన్: బాల్యంలో ఊబకాయాన్ని నివారిస్తుంది
2018 మార్చి 8న ప్రారంభించిన పోషణ్ అభియాన్ సంపూర్ణ పోషణ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం. పోషకాహార పరిమాణం, సరఫరా, ప్రజల్లో అవగాహనను పెంచి పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కోవడంతోపాటు సంక్షేమాన్ని ప్రోత్సహించడం.. తద్వారా చిన్నారులు, కౌమార దశలో ఉన్న బాలికలు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపాలను నివారించడం దీని లక్ష్యం

పోషణ్ అభియాన్, పోషణ్ 2.0 లోని ముఖ్య భాగాలు
సాంకేతికతను ఉపయోగించి పర్యవేక్షణ, వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం, జన ఆందోళన్ మూమెంట్ ద్వారా సామాజిక భాగస్వామ్యంతో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు సమగ్ర విధానాన్ని ‘పోషణ్ అభియాన్’ అవలంబిస్తోంది. ఇంట్లోనే పోషకాహారం లభించేలా పోషణ వాటిక (న్యూట్రి గార్డెన్)లను ప్రోత్సహిస్తుంది. మిషన్ సక్షం అంగన్వాడీ- పోషణ్ 2.0 (2021) కింద అంగన్వాడీ సేవలను బలోపేతం చేయడంతోపాటు కౌమార దశలోని పిల్లల ఆరోగ్యాన్ని పోషణ్ అభియాన్ మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఆయుష్ ఆధారిత సంక్షేమ విధానాలను ఏకీకృతం చేస్తుంది. మాతా శిశు పోషణ, ఆహార వైవిధ్యం, బలవర్ధకమైన ఆహారం, చిరుధాన్యాలు, పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహార వినియోగాన్ని ప్రోత్సహిస్తూ రక్తహీనతను, లోపాలను అరికట్టడానికి ఈ కార్యక్రమం ప్రాధాన్యమిస్తుంది.
4. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ: శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడం
4.1. ఫిట్ ఇండియా మూమెంట్: ప్రజారోగ్య విప్లవం

‘ఫిట్ ఇండియా సైక్లింగ్ డ్రైవ్’ను ప్రారంభించిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ
4.2 ఖేలో ఇండియా కార్యక్రమం: చేతనాశీలత గల తరాన్ని నిర్మించడం

దేశవ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా పాఠశాల నుంచి ఉన్నత పోటీల వరకు అన్ని స్థాయిల్లో క్రీడా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కోసం ‘ఖేలో ఇండియా’ - క్రీడల అభివృద్ధి కోసం జాతీయ కార్యక్రమాన్ని 2016-17లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. తమతమ క్రీడల్లో రాణించడం కోసం అవసరమైన అన్ని వనరులనూ సమకూరుస్తూ.. యువ అథ్లెట్లకు అత్యున్నత స్థాయి శిక్షణ, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడం దీని లక్ష్యం. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమానంగా క్రీడా అవకాశాలు లభించేలా ఈ పథకం భరోసా ఇస్తుంది.
ప్రధాన విజయాలు:

5. భారత ఆహార భద్రత, ప్రమాణాల ఆధీకృత సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ): ప్రజారోగ్యం కోసం ఆహార నియంత్రణ
5.1 ఈట్ రైట్ ఇండియా మూమెంట్ (ఎఫ్ఎస్ఎస్ఏఐ): ఆహారాన్ని ఎంచుకోవడంలో మార్పుల ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తు
భారత ఆహార భద్రత, ప్రమాణాల ఆధీకృత సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఈట్ రైట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది. అందరికీ సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి ఉద్దేశించిన పలు కీలక కార్యక్రమాలు ఇందులో భాగంగా ఉన్నాయి. కొన్ని మౌలిక కార్యక్రమాలు కింద పేర్కొన్న విధంగా ఉన్నాయి:

ఈట్ రైట్ ఇండియా కింద ముఖ్యమైన కార్యక్రమాలు
ప్రభుత్వ శాఖలు చేయాల్సినవి:
-
ఆహార భద్రత శిక్షణ, ధ్రువీకరణ (ఎఫ్ వోఎస్టీఏసీ): ఆహార భద్రత, ధ్రువీకరణ సర్టిఫికేట్ ను ఎఫ్ఎస్ఎస్ఏఐ జారీ చేస్తుంది. ప్రతి ఆహార వ్యాపారంలో ఆహార భద్రత పర్యవేక్షకులుండేలా ఇది నిర్దేశిస్తుంది.
-
ధ్రువీకరణ కార్యక్రమాలు: స్ట్రీట్ ఫుడ్ కేంద్రాలు, మార్కెట్లు, స్టేషన్లు, ప్రార్థన స్థలాలలో పరిశుభ్రత ఉండేలా చూస్తుంది.
-
పరిశుభ్రతకు రేటింగ్: రెస్టారెంట్లు, కేటరింగ్ సేవలు, మిఠాయి దుకాణాలు, మాంసం విక్రేతలకు పరిశుభ్రత ప్రమాణాలపై రేటింగ్ ఇస్తారు.
ప్రజా కేంద్రీకృత కార్యక్రమాలు:
-
వినియోగదారుల్లో అవగాహన: ఈట్ రైట్ క్యాంపస్, ఈట్ రైట్ స్కూల్ కార్యక్రమాల ద్వారా సురక్షితమైన ఆహార వినియోగాన్ని ప్రోత్సహించడం.
-
కల్తీని గుర్తించడం: ఇంట్లో, బడిలో ఆహారాన్ని పరీక్షించడం కోసం డార్ట్ బుక్, మ్యాజిక్ బాక్స్ లను అందించడం.
సురక్షితమైన ఆహార డార్ట్ బుక్ – వేగవంతమైన పరీక్షతో కల్తీని గుర్తించేందుకు (డిటెక్ట్ అడల్ట్రేషన్ విత్ ర్యాపిడ్ టెస్ట్ - డీఏఆర్టీ) ఉపయోగపడే పుస్తకమిది. చిన్నచిన్న వస్తువులను ఉపయోగించి ఆహార కల్తీని గుర్తించడం కోసం ఇంట్లోనే పరీక్షించుకునేలా 50కి పైగా వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ప్రజలు ఈ పుస్తకాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దు. ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలను ఇది సూచిస్తుంది.
|
ఫుడ్ సేఫ్టీ మ్యాజిక్ బాక్స్ – ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ మ్యాజిక్ బాక్స్, దానితోపాటు వచ్చే పుస్తకం పాఠశాలలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అభ్యసన సాధనం. ఆహార కల్తీలను గుర్తించడానికి 102 సాధారణ పరీక్షలు, అలాగే వాటితోపాటు ఓ పుస్తకం ఇందులో ఉంటాయి.
|


-
మొబైల్ టెస్టింగ్: మారుమూల ప్రాంతాల్లో పరీక్షలు, శిక్షణ కోసం వాహనాల ద్వారా సదుపాయాన్ని అందిస్తుంది.
-
ఆహారానికి పోషకాలను జోడించడం: సూక్ష్మ పోషక లోపాలను నివారించడం కోసం బలవర్ధకమైన ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది.
ఆహారం విషయంలో మార్గనిర్దేశం చేసి స్థూలకాయం, జీవనశైలి సంబంధిత వ్యాధులను ప్రజలు సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఆహార భద్రతా ప్రమాణాలను నియంత్రించడంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది.
5.2 దేశవ్యాప్త అవగాహన ప్రచారం – ‘ఆజ్ సే తోడా కమ్’
ప్రజలు కొవ్వు, చక్కెర, ఉప్పు వినియోగాన్ని క్రమంగా తగ్గించాలని కోరుతూ.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం కోసం ‘ఆజ్ సే తోడా కమ్’ ప్రచారాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రారంభించింది. ఈ మల్టీమీడియా ప్రచారంలో కింది అంశాలు ముఖ్యమైనవి:

5.3 అధికంగా కొవ్వు, లవణాలు, చక్కెర (హెచ్ఎఫ్ఎస్ఎస్) ఉన్న ఆహారాలను నియంత్రించడం
అధికంగా కొవ్వు, లవణాలు, షుగర్ (హెచ్ఎఫ్ఎస్ఎస్) ఉన్న ఆహారాలపై తప్పనిసరిగా వాటి వివరాలను ముద్రించాలని (లేబులింగ్) ఐసీఎంఆర్- జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్)తో కలిసి ఎఫ్ఎస్ఎస్ఏఐ సిఫార్సు చేసింది. దీని లక్ష్యాలు:
-
-
తినడానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాల ప్యాక్ ముందు భాగంలో స్పష్టమైన లేబులింగ్ ఉండేలా చూడడం.
-
ఆహారం విషయంలో వినియోగదారులు వివేచనతో కూడిన నిర్ణయాలను తీసుకునేలా సహాయపడడం, అనారోగ్యకరమైన ఆహార వినియోగాన్ని తగ్గించుకునేలా చూడడం.
5.4 వివిధ వేదికల ద్వారా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు
ఎఫ్ఎస్ఎస్ఏఐ నేతృత్వంలో కింది చర్యల ద్వారా ప్రభుత్వం క్రియాశీలకంగా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది:
a. ముద్రణ, ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాలు ఆహారం విషయంలో వివేచనతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి.
b. ఊబకాయ నివారణ, ఆరోగ్యకరమైన జీవనంపై రాష్ట్ర స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించే - క్యాన్సర్, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, గుండెపోటు నివారణ, నియంత్రణ కార్యక్రమం (ఎన్పీసీడీసీఎస్)తో అనుసంధానం చేయడం.
5.5 రూకో కార్యక్రమం

ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రారంభించిన ఉపయోగించిన వంట నూనె పునరుద్ధరణ (రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్- రూకో) కార్యక్రమం ఒకసారి ఉపయోగించిన వంట నూనెను తిరిగి ఆహార కార్యకలాపాల కోసం వినియోగించకుండా, దానిని సురక్షితంగా పునరుద్ధరించేలా చూస్తుంది. నూనెను పదేపదే వేయించడానికి ఉపయోగిస్తే హానికరమైన టోటల్ పోలార్ కాంపౌండ్స్ (టీపీసీ) ఏర్పడతాయి. రక్తపోటు, ధమనులు పెళుసుబారడం, కాలేయ రుగ్మతల వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ 25% టీపీసీ పరిమితిని నిర్దేశించింది. అంతకు మించి నూనెను ఉపయోగించకూడదు. ఈఈఈ వ్యూహం ప్రకారం (ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఎకోసిస్టమ్) - ఉపయోగించిన వంట నూనెను ఆహార వ్యాపారుల నుంచి సేకరించి బయోడీజిల్ లేదా సబ్బు ఉత్పత్తి కోసం వినియోగిస్తారు. తద్వారా ఆరోగ్యం, ఇంధన భద్రత, పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహిస్తారు.
ముగింపు
స్థూలకాయం దేశంలో తీవ్రమైన ప్రజారోగ్య సవాలుగా ఉంది. అయితే సమగ్రమైన, వివిధ రంగాల మధ్య సమన్వయంతో కూడిన విధానాలతో భారత్ క్రియాశీలకంగా దానిని ఎదుర్కొంటోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆరోగ్యం, పోషకాహారం, ఫిట్నెస్, నియంత్రణ చర్యలను ఏకీకృతం చేస్తూ... వ్యూహాత్మక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఫిట్ ఇండియా మూమెంట్, ఎన్పీ-ఎన్సీడీ, పోషణ్ అభియాన్, ఈట్ రైట్ ఇండియా, ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలు ఆరోగ్య స్పృహ, ముందస్తు సంరక్షణ, క్రియాశీల జీవనాలను పెంపొందిస్తున్నాయి. అమృతకాలం దిశగా భారత్ అడుగులేస్తున్న తరుణంలో.. దృఢమైన, ఆరోగ్యకరమైన భారత లక్ష్యం సాకారమవుతోంది. నిరంతర నిబద్ధత, వివిధ రంగాల మధ్య సహకారం, క్రియాశీల పౌర భాగస్వామ్యం ద్వారా స్థూలకాయాన్ని తిప్పికొట్టి భవిష్యత్తు తరాలను పరిరక్షించుకునేలా అత్యున్నత స్థానంలో దేశం నిలిచి ఉంది. ప్రజల్లో అవగాహన పెంచడానికి, జీవనశైలిలో మార్పులు, విధానపరమైన కార్యాచరణకు ప్రాధాన్యమివ్వడం ద్వారా ఊబకాయాన్ని ఎదుర్కోవడంలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలదు. తద్వారా ఆరోగ్యం, చైతన్యం, సంపూర్ణ శ్రేయస్సు పునాదులుగా పురోగామి పథంలో దేశం పయనిస్తుంది.
***
(Release ID: 2107903)