ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్- కారికోమ్ రెండో శిఖరాగ్ర సదస్సు ప్రారంభ సందర్భంలో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
21 NOV 2024 1:00AM by PIB Hyderabad
గౌరవనీయులారా,
భారత్-కారికోమ్ రెండో శిఖరాగ్ర సదస్సును నా మిత్రులు అధ్యక్షుడు శ్రీ ఇర్ఫాన్ అలీ, ప్రధాని శ్రీ డికాన్ మిచెల్లతో కలసి నిర్వహిస్తుండడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. కారికోమ్ కుటుంబ సభ్యులందరికీ నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. మరీముఖ్యంగా ఈ శిఖరాగ్ర సదస్సును చాలా చక్కగా నిర్వహిస్తున్నందుకు అధ్యక్షుడు శ్రీ ఇర్ఫాన్ అలీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కొన్ని నెలల కిందట, ‘బెరిల్ గాలివాన’ సృష్టించిన విధ్వంసకాండలో కొన్ని దేశాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఆస్తినష్టం కూడా సంభవించింది. భారతదేశ ప్రజలందరి పక్షాన, నేను నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను.
గౌరవనీయులారా,
అయిదు సంవత్సరాలు గడిచాక మనమిక్కడ సమావేశమయ్యాం. ఈ అయిదేళ్లలో, ప్రపంచంలో ఎన్నో మార్పులు జరిగాయి. మానవ జాతి అనేక ఉద్రిక్త స్థితుల్ని, సంకటాల్ని ఎదుర్కొంది. ఇవి గ్లోబల్ సౌత్ దేశాల్లో ఒకటైన మా వంటి దేశాలపైన ఇదివరకు ఎన్నడూ ఎరుగనంత పెద్ద స్థాయిలో ప్రతికూల ప్రభావాన్ని కలగజేశాయి. ఈ కారణంగానే, భారత్ ఉమ్మడి సవాళ్లను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ కారికోమ్ తో కలిసే పాటుపడుతూ వస్తోంది.
అది కోవిడ్ కావచ్చు, ప్రాకృతిక విపత్తులు కావచ్చు, సామర్థ్యాన్ని పెంచడం కావచ్చు, లేదా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు.. భారత్ ఒక విశ్వసనీయ భాగస్వామ్య దేశంగా మీతో భుజం భుజం కలిపి నిలచింది.
గౌరవనీయులారా,
మనం కిందటిసారి సమావేశమైనప్పుడు, అనేక కొత్త కార్యక్రమాలను, సకారాత్మక కార్యక్రమాలను గుర్తించాం. ఆ కార్యక్రమాలన్నిటిలో పురోగతి పథంలో పయనిస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. మన సహకారాన్ని భవిష్యత్తులో కూడా మరింత బలపరుచుకోవడానికి, నేను కొన్ని ప్రతిపాదనలను మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను.
ఈ ప్రతిపాదనలకు ఏడు అంశాలు ప్రధాన స్తంభాలుగా ఉంటాయి. మరి ఆ స్తంభాలు ఏమేమిటి అంటే, అవి.. సీ, ఏ, ఆర్, ఐ, సీ, ఓ ఇంకా ఎమ్ .. అదే కారికోమ్ (CARICOM).
వీటిలో మొదటిది, ‘సి’. ఇది కెపాసిటీ బిల్డింగు (సామర్థ్యాల పెంపు)ను సూచిస్తుంది. కారికోమ్ సభ్య దేశాల సామర్థ్యాన్ని పెంచడానికి భారత్ ఎల్లప్పుడూ తోడ్పాటును అందించింది. దీనికోసం ఉపకార వేతనాలు, శిక్షణ, సాంకేతిక సహాయాన్నందించడం అనే మార్గాలను ఎంచుకొంది. ఈ రోజు నేను, రాబోయే అయిదు సంవత్సరాల కాలంలో ఐటీఈసీ స్కాలర్షిప్ల విషయంలో 1,000 స్లాట్లను పెంచాలని ప్రతిపాదిస్తున్నాను.
యువతలో సాంకేతిక శిక్షణనూ, నైపుణ్యాభివృద్ధినీ ప్రోత్సహించడానికి ఒక సాంకేతిక అభివృద్ధి కేంద్రాన్ని బెలీజ్లో మనం ఏర్పాటు చేశాం. కారికోమ్ దేశాలన్నిటికీ ఉపయోగపడేటట్లుగా దీని పరిధిని విస్తరించుదాం.
కారికోమ్ రీజియన్కు ఒక ఫోరెన్సిక్ సెంటరును ఏర్పాటు చేసేందుకు కూడా కృషిచేద్దాం. ప్రభుత్వోద్యోగుల సామర్థ్యాన్ని పెంచుతూపోయేందుకు, భారత్లో మేం ‘‘ఐ-జీఓటీ కర్మయోగి పోర్టల్’’ను తీసుకువచ్చాం.
ఈ పోర్టల్ టెక్నాలజీ, పరిపాలన, న్యాయ శాస్త్రం, విద్య వంటి రంగాలలో ఆన్లైన్ మాధ్యమంలో పాఠ్యక్రమాలను అందుబాటులోకి తెచ్చింది. ఇలాంటి పోర్టల్నే కారికోమ్ దేశాల కోసం రూపొందించుకోవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థకు జననిగా భారత్ సైతం, పార్లమెంట్ సభ్యులకు శిక్షణను ఇవ్వడంలో కారికోమ్ భాగస్వామ్య దేశాలతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది.
రెండోదైన ‘ఎ’ వ్యవసాయాన్నీ, ఆహార భద్రతనూ సూచిస్తుంది. వ్యవసాయ రంగానికొచ్చి, డ్రోన్లు, డిజిటల్ ఫార్మింగ్, ఫార్మ్ మెకనైజేషన్, భూసార పరీక్ష.. ఇవి భారత్లో సాగు రూపురేఖలను మార్చివేశాయి. నానో ఫర్టిలైజర్స్తోపాటు మేం ప్రాకృతిక వ్యవసాయంపైన కూడా శ్రద్ధ తీసుకొంటున్నాం. ఆహార భద్రతపై స్పృహను పెంచడానికి మేం ‘శ్రీ అన్న’ను ప్రోత్సహిస్తున్నాం. భారత్ చొరవ తీసుకొన్నందునే, ఐక్య రాజ్య సమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ శ్రీ అన్న సంవత్సరంగా ప్రకటించింది.
శ్రీ అన్న ఒక మహా ఆహారం (సూపర్ఫూడ్). ఇవి అన్ని రకాలైన వాతావరణంలో అందివస్తాయి. కారికోమ్ దేశాల విషయంలో, ఇవి వాతావరణ మార్పుతో పోరాడడానికీ, ఆహార భద్రతను పెంపొందించడానికీ ఒక దీటైన పరిష్కారంగా ఉంటాయి. మా ప్రాంతంలో, ‘‘సర్గాసమ్ సీవీడ్’’ ఓ పెద్ద చిక్కుసమస్యగా ఉంది. ఇది హోటల్, పర్యాటక పరిశ్రమపైనా ప్రభావాన్ని చూపుతోంది.
భారతదేశంలో, మేం ఈ సీవీడ్ నుంచి ఎరువులను ఉత్పత్తి చేసే టెక్నాలజీని అభివృద్ధి చేశాం. ఈ టెక్నాలజీ పంట దిగుబడులను పెంచుతూనే ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని అందించగలుగుతుంది. భారత్ ఈ అనుభవాలనన్నింటినీ కారికోమ్ దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది.
మూడోదైన ‘ఆర్’ పునరుత్పాదక ఇంధనాన్నీ, వాతావరణ మార్పునూ సూచిస్తుంది. పర్యావరణ సంబంధ సవాళ్లు మనకందరికీ ఒక ప్రాథమ్యతా అంశం. ఈ రంగంలో ప్రపంచ సహకారాన్ని పెంపొందింపచేయడానికి, మేం అంతర్జాతీయ సౌర కూటమి (ఇంటర్నేషనల్ సోలర్ అలయన్స్.. ఐఎస్ఏ)నీ, కొయలిషన్ ఫర్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ)నీ, ఎల్ఐఎఫ్ఈ (లైఫ్స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్)లతోపాటు గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్సును కూడా ప్రారంభించాం.
మీరు అంతర్జాతీయ సౌర కూటమిలో భాగస్తులు అయినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇతర కార్యక్రమాలలో కూడా పాలుపంచుకోవాలంటూ మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పునరుత్పాదక ఇంధన రంగంలో, మేం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాం. కారికోమ్ లో ప్రతి దేశంలో కనీసం ఒక ప్రభుత్వ భవనం సౌర విద్యుత్తు సదుపాయాన్ని కలిగి ఉండేటట్లు తోడ్పడాలనేదే మా ప్రతిపాదన.
నాలుగోదైన ‘ఐ’ నవకల్పన, టెక్నాలజీలతోపాటు వ్యాపారాన్ని కూడా సూచిస్తుంది. ప్రస్తుతం, భారత్ టెక్నాలజీ, అంకుర సంస్థల కూడలిగా గుర్తింపు తెచ్చుకొంది. భారత్కున్న విశిష్టత ఏమిటంటే ఇక్కడ అభివృద్ధిచేస్తున్న టెక్నాలజీ ప్రధాన పరిష్కారాలు మా సమాజంలోని భిన్నత్వంలో నుంచి పెల్లుబుకినవీ, కాల పరీక్షకు తట్టుకొని నిలబడుతున్నవీ. అందువల్ల, అవి ప్రపంచంలో ఏ దేశంలో అయినా సఫలం అవుతాయన్న హామీ ఉందన్నమాట. భారత్ అనుసరిస్తున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో మేం ఆర్థిక వ్యవస్థలో ప్రతి రంగంలో పెనుమార్పులను ప్రవేశపెడుతున్నాం.
ప్రస్తుతం, ఇండియాలో ఒకే క్లిక్తో ప్రయోజనాలు లక్షల కొద్దీ ప్రజలకు నేరుగా బదిలీ అవుతున్నాయి. యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, శ్రీ లంక, నేపాల్, మారిషస్ వంటి దేశాలు భారత్కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)తో ఇప్పటికే జతపడ్డాయి.
యూపీఐని కారికోమ్ దేశాలలో సైతం స్వీకరించేటట్లుగా మనం కలసి కృషి చేద్దామంటూ నేను ఒక ప్రతిపాదనను మీ ముందుకు తీసుకువస్తున్నాను. మేం పౌరులు వారి దస్తావేజులను సురక్షితంగా అట్టిపెట్టుకోవడానికి క్లౌడ్ ఆధారంగా పనిచేసే డిజిలాకర్ (DigiLocker) ప్లాట్ఫారాన్ని రూపొందించాం.
ఈ ప్లాట్ఫారాన్ని కారికోమ్ దేశాల్లో ఒక ప్రయోగాత్మక ప్రాజెక్టుగా మనం ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ రంగంలో కొనుగోళ్ల ప్రక్రియను సులభతరంగా, పారదర్శకంగా మార్చడానికి మేం గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మార్కెట్ప్లేస్ పోర్టల్ను సిద్ధం చేశాం.
వైద్య పరికరాలు, కంప్యూటర్ల నుంచి గృహోపకరణాలు, పిల్లలు ఆడుకొనే బొమ్మల వరకు అన్నీ ఈ పోర్టల్లో అందుబాటులో ఉంటాయి. ఈ పోర్టల్ను కారికోమ్ దేశాలతో పంచుకోవడానికి మేం సంతోషిస్తున్నాం. అయిదు టీలు - ట్రేడ్ (వాణిజ్యం), టెక్నాలజీ (సాంకేతికత), టూరిజం (పర్యాటకం), టాలెంట్ (ప్రతిభ), ట్రెడిషన్ (సంప్రదాయం)లను ప్రోత్సహించడానికి, అలాగే అన్ని దేశాల నుంచి ప్రైవేటు రంగాలు, సంస్థలను అనుసంధానించేలా ఆన్లైన్ పోర్టల్ను మేం రూపొందించగలం.
ఎస్ఎంఈ రంగంలో భారత్ వేగంగా పురోగతి సాధిస్తోంది. గతేడాది జరిగిన ఇండియా-కారికోమ్ సమావేశంలో ఎస్ఎంఈ ప్రాజెక్టుల కోసం ఒక మిలియన్ డాలర్ల నిధిని ప్రకటించాం. దీని అమలును మనం వేగవంతం చేయాలి. అంతరిక్ష సాంకేతికతలో అగ్రదేశాలుగా పరిగణిస్తున్నవాటిలో భారత్ కూడా ఒకటి. అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించుకుంటూ కారికోమ్ దేశాల్లో వనరులు గుర్తించడం, వాతావరణ అధ్యయనాలు, వ్యవసాయం తదితర రంగాల్లో మనం కలసి పనిచేయవచ్చు.
గతేడాది సెప్టెంబర్లో నిర్వహించిన జీ -20 సదస్సులో పర్యావరణం, వాతావరణ పరిశీలన కోసం జీ-20 ఉపగ్రహాన్ని ప్రకటించాం. దాన్ని 2027 నాటికి ప్రయోగిస్తాం. దీనికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ప్రపంచంలోని అన్ని దేశాలతో ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలతో పంచుకుంటాం.
ఐదోదైన ‘సి’ క్రికెట్, సంప్రదాయాన్ని సూచిస్తుంది. మన దేశాలను అనుసంధానించే ప్రధానమైన అంశం క్రికెట్. అది 1983 ప్రపంచ కప్ ఫైనల్ అయినా, లేదా ఐపీఎల్ అయినా, వెస్ట్ ఇండియన్ క్రికెటర్లంటే భారతీయులకు ప్రత్యేక అభిమానం ఉంది.
ఈ ఏడాది మీ ప్రాంతంలో జరిగిన టీ-20 ప్రపంచకప్ భారత క్రికెట్ అభిమానులను కరీబియన్కు తీసుకువచ్చింది. ఆ ప్రపంచకప్ను భారత్ గెలిచిందని ఈ మాట నేను చెప్పడం లేదు. క్రికెట్ సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు, మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి ప్రతి కారికోమ్ దేశం నుంచి 11 మంది చొప్పున యువ మహిళా క్రికెటర్లను భారత్లో తీర్చిదిద్దుతాం.
అంతర్జాతీయ వేదికలపై మన ఉమ్మడి సంప్రదాయ వారసత్వాన్ని ప్రదర్శించేందుకు, వచ్చే ఏడాది నుంచి కారికోమ్ దేశాల్లో భారతీయ సంస్కృతీ దినోత్సవాలను మనం నిర్వహించవచ్చు. బాలీవుడ్కున్న ప్రజాదరణ దృష్ట్యా కారికోమ్ దేశాలతో కలసి చిత్రోత్సవాలను నిర్వహించవచ్చు.
ఆరోదైన ‘ఒ’ సముద్ర ఆర్థిక వ్యవస్థ, సముద్ర రవాణా భద్రతను సూచిస్తుంది. భారత్ దృష్టిలో మీరు చిన్న ద్వీప దేశాలు కాదు.. పెద్ద మహాసముద్ర దేశాలు.
ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు గాను ప్రజారవాణా, సరకు రవాణాకు ఉపయోగించే ఫెర్రీలను సరఫరా చేస్తామని నేను ప్రతిపాదిస్తున్నాను. సముద్ర డొమైన్ మ్యాపింగ్, హైడ్రోగ్రఫీపై మనం కలసి పనిచేయవచ్చు. తమ సముద్ర రవాణా భద్రతా వ్యూహాన్ని గతేడాది కారికోమ్ విడుదల చేసింది.
ఈ వ్యూహం మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సముద్ర దోపిడీలు, అక్రమ చేపల వేట, మానవ అక్రమ రవాణా తదితర సమస్యలను ప్రస్తావించింది. అలాగే ఆర్థిక సహకారంలో ఇంకా వినియోగించని సామర్థ్యాన్ని కూడా ప్రముఖంగా తెలియజేస్తోంది. ఈ అన్ని అంశాల్లోనూ మీతో సహకారం పెంపొందించుకొనేందుకు భారత్ ఎదురుచూస్తోంది.
ఏడోదైన ‘ఎం’, ఔషధాలు, ఆరోగ్య రంగాన్ని సూచిస్తుంది. కారికోమ్ దేశాల ఆరోగ్య భద్రత భారత్కు అత్యంత ప్రధానమైన అంశం.
సామాన్యుడికి నాణ్యమైన, సరసమైన ధరల్లో ఆరోగ్యసేవలను అందించేందుకు జన ఔషధి కేంద్రాలను భారత్ ప్రారంభించింది. అన్ని కారికోమ్ దేశాల్లోనూ ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని నేను ప్రతిపాదిస్తున్నాను. భారత్, కారికోమ్ దేశాల ఫార్మకోపియాలను పరస్పరం గుర్తించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా మనం ఈ ప్రయత్నాలను చేపట్టవచ్చు.
కారికోమ్ దేశాల్లో డ్రగ్ టెస్టింగ్ ల్యాబులను స్థాపించడానికి కూడా మేం సిద్ధంగా ఉన్నాం. కారికోమ్ దేశాల్లో క్యాన్సర్, ఇతర దీర్ఘకాల వ్యాధులు ప్రధాన సమస్యగా పరిణమించాయి. వీటిని ఎదుర్కోవడానికి భారత్లో తయారుచేసిన సిద్ధార్థ్ టూ క్యాన్సర్ థెరపీ యంత్రాన్ని మేం అందిస్తాం.
మారుమూల ప్రాంతాల్లో సత్వరమే చికిత్సను అందించేందుకు మేం ‘భీష్మ’ మొబైల్ ఆసుపత్రులను అభివృద్ధి చేశాం. నిమిషాల వ్యవధిలో ఏర్పాటు చేసే ఈ ఆసుపత్రిలో అన్ని రకాల గాయాలకు తక్షణం చికిత్స అందించవచ్చు. కారికోమ్ స్నేహితులకు ఈ మొబైల్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.
మానవతా దృక్పథంతో వికలాంగులకు కృత్రియ అవయవాలు అందించేందుకు కారికోమ్ దేశాల్లో జైపూర్ ఫుట్ క్యాంపులను ప్రతి ఏడాది నిర్వహించేందుకు ప్రతిపాదిస్తున్నాను. డయాలసిస్ యూనిట్లు, సీ అంబులెన్సులను అందించేందుకు సైతం మేం ప్రతిపాదిస్తున్నాం.
మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులను ఎదుర్కొనేందుకు యోగా సమర్థవంతంగా పనిచేస్తుంది. మనసు, శరీరాన్ని సమన్వయం చేయడంపై దృష్టి సారించిన ఈ పద్ధతిని యావత్ మానవాళికి భారతీయ నాగరికత బహుమతిగా అందించింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015లో ఐక్యరాజ్యసమితి గుర్తించింది. చిన్నతనం నుంచే దీన్ని అనుసరించడాన్ని ప్రోత్సహించేందుకు పాఠశాల స్థాయిలోనే దీన్ని తప్పనిసరి చేయాలి. భారత్ నుంచి యోగా ఉపాధ్యాయులను, శిక్షకులను కారికోమ్ దేశాలకు పంపించేందుకు ప్రతిపాదిస్తున్నాం. అదనంగా, కారికోమ్ దేశాల్లో యోగా థెరపీ, భారతీయ సంప్రదాయ ఔషధాలను వినియోగించేందుకు మనం కలసి పనిచేయవచ్చు.
గౌరవనీయులారా,
కారికోమ్ కు సంబంధించిన ఏడు ప్రధాన అంశాల్లో ఉమ్మడిగా ఉన్న ఒక అంశం ఏంటంటే - అవన్నీ మీ ప్రాధాన్యాలు, అవసరాలపై ఆధారపడి ఉన్నాయి. ఇదే మన సహకారానికి ప్రాథమిక సూత్రం. ఈ అంశాలపై మీ అభిప్రాయాలను వినేందుకు నేను ఎదురు చూస్తున్నాను.
ధన్యవాదాలు.
సూచన: ఇది ప్రధాన మంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి ఇంచుమించుగా చేసిన తెలుగు అనువాదం.
***
(Release ID: 2106430)
Visitor Counter : 25
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam