సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
నమామి గంగే ద్వారా మహాకుంభ మేళా-2025లో శుభ్రతను పునర్నిర్వచిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు
భక్తుల సౌకర్యార్థం పర్యావరణహిత పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా 28,000 మరుగుదొడ్లు, 20,000 మూత్రశాలల ఏర్పాటు, 37.75 లక్షల సంచులతో వ్యర్థాల సేకరణ
Posted On:
10 JAN 2025 4:41PM by PIB Hyderabad
క్లీన్ గంగా జాతీయ మిషన్లో భాగంగా మహాకుంభ మేళా-2025లో రూ.152.37 కోట్లతో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఆధునిక సాంకేతికత, సంప్రదాయ పద్ధతులను మేళవించి శుభ్రమైన, సుస్థిరమైన వాతావరణాన్ని ఈ ఉత్సవంలో అందిచనున్నారు.
గంగా నది పవిత్రతను కాపాడటం, వ్యర్థాల సమర్థ నిర్వహణ, ప్లాస్టిక్ రహిత జోన్లను రూపొందించడం మహాకుంభ మేళా- 2025 ఏర్పాట్లలో ప్రాధాన్యతాంశాలుగా ఉన్నాయి. ఈ ఉత్సవం జరుగుతున్న ప్రదేశంలో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యమివ్వడం ద్వారా పర్యావరణం పట్ల బాధ్యతగా వ్యవహరించే విషయంలో ప్రామాణికంగా ఉండేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
సెప్టిక్ ట్యాంకులతో పాటు నిర్మించిన 12,000 ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ (ఎఫ్ఆర్పీ) టాయిలెట్లు, ఇంకుడు గుంతలతో నిర్మించిన 16,100 ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్టీల్ టాయిలెట్లతో సహా మొత్తం పాటు 28,000కు పైగా టాయిలెట్లను ఈ ఉత్సవంలో ఏర్పాటు చేశారు. శుభ్రతను అందించడంతో పాటు, పర్యావరణహిత విధానాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా వీటిని నిర్మించారు. అలాగే ప్రకృతిహిత పద్ధతులను ప్రోత్సహిస్తూ భక్తులకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు గాను 20,000 మూత్ర శాలలు ఏర్పాటు చేశారు.
కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో మెరుగైన వ్యర్థాలను నిర్వహణ నిమిత్తం ఆరంభంలోనే చెత్తను వేరు చేసి పునర్వినియోగించుకోవడానికి, రీసైక్లింగ్ చేయడానికి వీలుగా 20,000 చెత్త బుట్టలను ఏర్పాటు చేశారు. వ్యర్థాలను సేకరించి వాటిని పారవేయడానికి 37.75 లక్షల సంచులను ఉపయోగించనున్నారు. ఇలా వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ పకడ్బందీగా నిర్వహించడం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా, పర్యావరణహితంగా ఉంచుతారు. మహాకుంభ 2025 నిర్వహణ కోసం అనుసరిస్తున్న వ్యూహాలు శుభ్రతలో అత్యున్నత ప్రమాణాలను నిర్దేశించడంతో పాటు పర్యావరణ సుస్థిరత విషయంలో దేశానికున్న అంకితభావాన్ని తెలియజేస్తాయి.
మహాకుంభ 2025 కేవలం ఆధ్యాత్మిక ఉత్సవంగానే కాకుండా పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతకు ఉదాహరణగా నిలవనుంది. గంగా నది స్వచ్ఛతను కాపాడుతూ, సుస్థిరమైన వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ రహిత జోన్లను ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వ అంకిత భావాన్ని ఈ కార్యక్రమాలు తెలియజేస్తున్నాయి. ఈ పవిత్ర ఉత్సవం ద్వారా పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై సమాజంలో అవగాహన పెరుగుతుంది. మహాకుంభ మేళా 2025 నిమిత్తం చేపడుతున్న ఈ పారిశుద్ధ్య కార్యక్రమం ప్రస్తుత తరానికి మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాలకు కూడా స్ఫూర్తినిస్తుంది.
***
(Release ID: 2092262)