హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"విపత్తు నష్టాలను తగ్గించుకోవడం"పై ఫిలిప్పీన్స్ లోని మనీలా వేదికగా జరిగిన ఆసియా-పసిఫిక్ మంత్రిత్వ స్థాయి సదస్సు

(ఏపీఎంసీడీఆర్ఆర్)-2024లో పాల్గొన్న కేంద్ర హోం వ్యవహారాల సహాయమంత్రి శ్రీ నిత్యానంద రాయ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం

విప్తతు నష్టాల తగ్గింపు(డీఆర్ఆర్) వ్యూహాలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సూచించిన 10 సూత్రాల అజెండాకు అనుగుణంగా విపత్తు ప్రభావాన్ని తగ్గించేందుకు సమగ్ర, చురుకైన చర్యలను అమలు చేయడానికి భారత్ కట్టుబడి ఉంది

విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల కల్పన సమితి (సీడీఆర్ఐ)లో ఉన్న 47 సభ్యదేశాలకు సంబంధిత మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టడానికి, సాంకేతిక, సామర్ధ్య నిర్మాణానికి భారత్ తోడ్పాటు

Posted On: 16 OCT 2024 12:31PM by PIB Hyderabad

విపత్తు నష్టాల తగ్గింపుపై ఫిలిప్పీన్స్ లోని మనీలాలో జరిగిన ఆసియా పసిఫిక్ మంత్రి స్థాయి సదస్సు (ఏపీఎంసీడీఆర్‌ఆర్)కు కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్  నేతృత్వంలోని ఉన్నత స్థాయి భారత ప్రతినిధి బృందం హాజరైంది. ఈ సదస్సును రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు బోంగ్ బోంగ్ మార్కస్ ప్రారంభించారు. ‘‘2030 నాటికి లక్ష్యసాధన : విపత్తు ప్రమాద తగ్గింపును వేగవంతం చేసే ఆశయాన్ని ఆసియా పసిఫిక్ ప్రాంతంలో పెంపొందించడం’’ అనే అంశంపై సాగుతున్న ఈ సదస్సు ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి చెందిన మంత్రులు, విధాన రూపకర్తలను ఒక్క చోట చేర్చింది. విపత్తు ముప్పులను తగ్గించేందుకు, పర్యావరణ మార్పులు వల్ల పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇందులో చర్చించారు.

పెరుగుతున్న ప్రాణ, ఆర్థిక, అభివృద్ధి నష్టాలతో కూడిన విపత్తులను తోసిపుచ్చలేని వాస్తవాలుగా తన మంత్రివర్గ ప్రకటనలో హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ అభివర్ణించారు. విపత్తుల ప్రభావాన్ని తగ్గించేందుకు గాను విపత్తు ప్రమాద తగ్గింపు (డీఆర్ఆర్) వ్యూహాలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సూచించిన 10 పాయింట్ల అజెండాకు అనుగుణంగా సమగ్ర, క్రియాశీల చర్యలను అమలు చేసే విషయంలో భారత్ నిబద్ధతను తెలియజేశారు.

విపత్తు ప్రమాద తగ్గింపు (డీఆర్ఆర్)కు సంబంధించిన ముందస్తు హెచ్చరికల వ్యవస్థ(ఈడబ్ల్యూఎస్), ముందస్తు చర్యలు, విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలు, డీఆర్ఆర్ నిర్వహణకు ఆర్థిక కేటాయింపులు తదితర ముఖ్యమైన అంశాలపై మంత్రి ప్రధానంగా దృష్టి సారించారు. ఈడబ్ల్యూఎస్ కోసం కామన్ అలర్టింగ్ ప్రొటోకాల్(సీఏపీ), సెల్ బ్రాడ్ కాస్ట్ వ్యవస్థలు తదితర అత్యాధునిక టెక్నాజీలతో సహా 25 హిందూ మహాసముద్ర తీరప్రాంత దేశాలకు సునామీ సూచనలను అందించే భారత సునామీ ముందస్తు హెచ్చరికల కేంద్రం (ఐటీఈడబ్ల్యీ) ఏర్పాటు గురించి సహాయమంత్రి వివరించారు.

సుస్థిరాభివృద్ధిలో కీలకమైన మౌలిక సదుపాయాల పునరుద్ధరణను ప్రోత్సహించడంలో భారత నాయకత్వాన్ని శ్రీ నిత్యానంద రాయ్ ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే భారత్ ప్రారంభించిన విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల కల్పన సమితి (సీడీఆర్ఐ)లో ప్రస్తుతం 47 సభ్యదేశాలున్నాయి. ఇది విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల నిమిత్తం పెట్టుబడులు పెట్టడానికి, సాంకేతిక సహాయాన్ని, సామర్థ్య నిర్మాణాన్ని అందించేందుకు తోడ్పడుతుంది.  

వివిధ ఆర్ధిక సంస్థల సహకారంతో డీఆర్ఆర్ కు నిధులు సమకూర్చిన అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటని  హోం వ్యవహారాల సహాయ మంత్రి తెలిపారు. 2021-22 నుంచి 2025-26 వరకు 15వ ఆర్థిక సంఘం ద్వారా జాతీయ విపత్తు ప్రమాద నిర్వహణ నిధి (ఎన్‌డీఆర్‌ఎంఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రమాద నిర్వహణ నిధి (ఎస్‌డీఆర్‌ఎంఎఫ్) లకు  30 బిలియన్ అమెరికన్ డాలర్లు కేటాయించినట్లు చెప్పారు.


 

***



(Release ID: 2065360) Visitor Counter : 26