హోం మంత్రిత్వ శాఖ

పద్మ పురస్కారాలు – 2025 నామినేషన్లకు చివరి తేదీ సెప్టెంబర్ 15

Posted On: 22 AUG 2024 12:38PM by PIB Hyderabad

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ పురస్కారాలు – 2025కు నామినేషన్లు/సిఫార్సులు ఈ ఏడాది మే ఒకటో తేదీన ప్రారంభమయ్యాయి. ఈ పురస్కారాల నామినేషన్లకు గడువు సెప్టెంబర్ 15వ తేదీతో ముగుస్తోంది. రాష్ట్రీయ పురస్కార పోర్టల్ (https://awards.gov.in) ద్వారా నామినేషన్లు/సిఫార్సులను స్వీకరిస్తారు.

పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు దేశంలోనే అత్యున్నత పౌరపురస్కారాలు. 1954 నుంచి గణతంత్ర దినోత్సవ సందర్భంలో ప్రతి ఏటా ఈ పురస్కారాలను ప్రకటిస్తున్నారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యరంగం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్రజావ్యవహారాలు, ప్రజాసేవ, వ్యాపారం, పారిశ్రామికం తదితర రంగాలు/విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారికి గుర్తింపుగా ఈ పురస్కార ప్రదానం చేస్తారు. జాతి, వృత్తి, స్థాయి, లింగ వివక్ష లేకుండా అందరూ ఈ పురస్కారం స్వీకరించడానికి అర్హులే. ప్రభుత్వ రంగంలో పనిచేసే వైద్యులు, శాస్త్రవేత్తలు మినహా మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు పద్మ పురస్కారాలకు అనర్హులు.

పద్మ పురస్కారాలను ‘‘ప్రజల పద్మ’’గా’ మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందుకే అర్హులైన వారిని నామినేట్ చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మహిళలు, బలహీన వర్గాలకు చెందినవారు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగుల్లో నిస్వార్థంగా సమాజ సేవ చేస్తున్నవారిని గుర్తించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.

పైన పేర్కొన్న పోర్టల్ లో సూచించిన విధానంలో నామినేషన్/ సిఫార్సు చేయాలనుకున్న వ్యక్తి వివరాలతో పాటుగా 800 పదాలకు మించకుండా ఆ వ్యక్తి విశిష్టతను, సంబంధిత రంగం/విభాగంలో సాధించిన విజయాలు/సేవను స్పష్టంగా వివరించాలి

కేంద్ర హోంమంత్రిత్వ వ్యవహారాల వెబ్సైట్ (https://mha.gov.in) లో ‘‘అవార్డ్స్ అండ్ మెడల్స్’’ శీర్షిక కింద, పద్మ పురస్కారాల పోర్టల్ (https://padmaawards.gov.in ) లోనూ ఈ వివరాలు అందుబాటులో ఉంటాయి. ఈ పురస్కారాలకు సంబంధించిన నిబంధనలు, నియమాలు https://padmaawards.gov.in/AboutAwards.aspx లింక్ లో ఉన్నాయి.

 

****



(Release ID: 2047871) Visitor Counter : 8