గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

స్వచ్ఛంద స్పూర్తితో చరిత్ర సృష్టించిన 'ఏక్ తారీఖ్ ఏక్ ఘంటా ఏక్ సాథ్' కార్యక్రమం

స్వచ్ఛ భారత్ మిషన్ కింద 9 లక్షలకు పైగా ప్రాంతాల్లో స్వచ్చందంగా శ్రమదానం చేసిన 8.75 కోట్ల మంది ప్రజలు

1.5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరిశుభ్రత కార్యక్రమాల నిర్వహణ (గ్రీస్,ఇంగ్లాండ్ వంటి దేశాల పరిమాణం కంటే ఎక్కువ)

Posted On: 03 OCT 2023 3:36PM by PIB Hyderabad

స్వచ్ఛ భారత్ మిషన్ సరికొత్త చరిత్ర లిఖించింది. అక్టోబరు 1వ తేదీ ఉదయం 10 గంటలకు చారిత్రాత్మక ఘట్టం నమోదయింది. పరిశుభ్రత సాధన కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో కోట్లాది మంది ప్రజలు స్వచ్చందంగా పాల్గొని శ్రమదానం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రముఖ వ్యాయమ నిపుణులు శ్రీ అంకిత్ బైయన్‌పురియాతో కలిసి శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. “ఈ రోజు, దేశం స్వచ్ఛత పై దృష్టి సారించింది, అంకిత్ బైయన్‌పురియాతో కలిసి నేను అదే చేసాను! కేవలం పరిశుభ్రతకు పరిమితం కాకుండా శరీర దృధత్వం శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తూ మేము కార్యక్రమంలో పాల్గొన్నాం! . ఇదంతా స్వచ్ఛత, దృఢ భారత్ కోసం" అని శ్రీ నరేంద్ర మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

 

 

ప్రజల నాయకత్వంలో ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, గ్రామాలు, నగరాల్లో పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమం అమలు జరిగింది. 9 లక్షలకు పైగా ప్రాంతాల్లో స్వచ్చందంగా పాల్గొన్న 8.75 కోట్ల మంది ప్రజలు శ్రమదానం చేశారు. 

 వీధులు,రహదారులు,  రైల్వే ట్రాక్‌లు,  స్టేషన్లు, టోల్ ప్లాజాలు, ఆరోగ్య సంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వారసత్వ  పర్యాటక ప్రదేశాలు, నివాస ప్రాంతాలు, నీటి వనరులు, ప్రార్థనా స్థలాలు, మురికివాడలు, మార్కెట్ ప్రాంతాలు, విమానాశ్రయాలు, జంతుప్రదర్శనశాలలు, వన్యప్రాణుల ప్రాంతాలు, గోశాలలు వాటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు అమలు జరిగాయి.  అక్టోబర్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి గంట సేపు జరిగిన కార్యక్రమంలో స్వచ్చందంగా పాల్గొన్న అన్ని వర్గాలకు చెందిన  ప్రజల సమిష్టిగ  కృషి చేసి  సుమారు 1.5 లక్షల చ.కి.మీ విస్తీర్ణం (గ్రీస్, ఇంగ్లాండ్ వంటి దేశాల పరిమాణం కంటే ఎక్కువ)లో పరిసరాలను శుభ్రం చేశారు.గంట కాలంలో  ప్రజలు సుమారు 1.2 లక్షల కిలోమీటర్ల పొడవు ప్రాంతాన్ని అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 30 ట్రిప్పులు!శుభ్రం చేశారు.

అక్టోబర్ 1వ తేదీన అనేక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. కార్యక్రమంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, జిల్లాలు , రాష్ట్ర సరిహద్దులను అధిగమించి కార్యక్రమం అమలు జరిగింది. . అనేక మంది గవర్నర్‌లు, ముఖ్యమంత్రులు, స్థానిక రాజకీయ నాయకులతో పాటు వేలాది మంది  ప్రజలు కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు.  జవాన్లు, పౌరులు, ఎన్ సిసి,ఎన్ వై కె వాలంటీర్లు, స్వయం సహాయక బృందాలు,స్వచ్చంద సేవా సంస్థలు, నివాస ప్రాంత సంక్షేమ సంఘాలు, మార్కెట్ అసోసియేషన్లు, పరిశ్రమలు,మాట పెద్దలు , ప్రముఖులు, ప్రభావశీలులు, యూట్యూబర్‌లు, కళాకారులు తదితరులు ఈ మెగా కార్యక్రమం విజయం సాధించడానికి సమిష్టిగా కృషి చేశారు.  సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో  1000 ప్రజా మరుగుదొడ్లను  సుమారు 50,000 మంది శుభ్రం చేశారు.స్థానిక ప్రజలు, భక్తుల సహకారంతో  అమృతానందమయి సంస్థల నెట్‌వర్క్ వివిధ ప్రాంతాలలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించింది. ఇషా ఫౌండేషన్ వాలంటీర్లు సెంటర్ సమీపంలోని గ్రామాల్లో వీధులు, కాలనీలు, మరుగుదొడ్లు శుభ్రం చేశారు. 30,000 మంది ప్రజలను సమీకరించిన బాబా రాందేవ్ యోగా పీఠం  పార్కులు, నివాస ప్రాంతాలు, రహదారులతో  సహా 1000 ప్రాంతాల్లో  స్వచ్ఛత  కార్యక్రమాలు చేపట్టింది. . వందలాది మంది ఇస్కాన్ వాలంటీర్లు రోడ్డు శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రెడాయ్,సీఐఐ.ఫిక్కీ, అసోచామ్, బ్రిటానియా, బజాజ్, ఆదిత్య బిర్లా, అమెజాన్ వంటి సంస్థలు కూడా స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాయి.   అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, ఇళయరాజా వంటి ప్రముఖులు, భారత క్రికెట్ జట్టు సభ్యులు కార్యక్రమానికి ప్రోత్సాహం అందించారు.  రికీ కేజ్, అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, రాజ్‌కుమార్ రావు వంటి వారు స్వయంగా శ్రమదానం చేశారు.   వక్ఫ్ బోర్డు, గురుద్వారా వాలంటీర్లు, రోటరీ క్లబ్, అగా ఖాన్ ఫౌండేషన్, రామకృష్ణ మిషన్, బీఎం జిఎఫ్,యుఎస్ ఎయిడ్,యూనిసెఫ్, జిఐజెడ్ లాంటి సంస్థలు స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాయి. 

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో పనిచేస్తున్న  వివిధ సంస్థలు విన్నూత కార్యక్రమాలు నిర్వహించాయి. వివిధ ప్రాంతాల్లో  కేంద్ర మంత్రులు శ్రమదానం కార్యక్రమంలో  పాల్గొన్నారు. 'మొత్తం ప్రభుత్వ విధానం' లో ఒకేసారి అనేక ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నవారికి అవసరమైన సౌకర్యాలు కల్పించారు. తాము ఎంచుకున్న ప్రాంతాలను  అనుకున్న విధంగా శుభ్రం చేసిన ప్రజా బృందాలు సంతృప్తి పొందాయి.   పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థలు, జిల్లా యంత్రాంగం సహకారం లభించడంతో కార్యక్రమం లక్ష్యాల మేరకు అమలు జరిగి విజయం సాధించింది. చెత్త సేకరణ, రవాణా, సురక్షితంగా  పారవేయడం మొదలైన కార్యక్రమాల్లో ప్రజలు  పాల్గొన్నారు.  వ్యర్థాలు, ప్లాస్టిక్ నుంచి తొలగించడం లక్ష్యంగా కార్యక్రమం అమలు జరిగింది. 

 2023 సెప్టెంబర్, 24న నిర్వహించిన 105వ మన్ కీ బాత్ సందర్భంగా స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టాలని  ప్రధానమంత్రి పిలుపు ఇచ్ఛారు. దీనికి స్పందించిన స్వచ్ఛత మిషన్ కార్యక్రమం అమలు చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను రూపొందించింది. కార్యక్రమంలో పాల్గొనడానికి పేర్లు  నమోదు చేసుకోవడం, శ్రమదానం చేయడానికి తమకు నచ్చిన ప్రాంతాన్ని ఎంచుకోవడానికి సౌకర్యాలు కల్పించింది. నగర అధికారులు, పౌర సమాజ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు మొదలైనవాటిని నమోదు చేసుకునేందుకు వీలుగా మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. వ్యర్ధాలు ఎక్కువగా ఉన్న  ప్రాంతాలను గుర్తించి  పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో  ప్రజలు తమకు నచ్చిన ప్రాంతాన్ని  ఎంచుకోవడానికి, అక్కడకు సులువుగా  చేరడానికి సహాయపడింది. శ్రమదానం చేస్తున్న చిత్రాలను కూడా అప్‌లోడ్ చేయడానికి అవకాశం కల్పించిన ప్రభుత్వం  పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందించింది. . సామాజిక ప్రవర్తనలో  మార్పు తీసుకు వచ్చే అంశంలో   ప్రచారంకీలకంగా ఉంటుంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం కార్యక్రమ వివరాలు విస్తృతంగా ప్రచారం చేసి, ప్రజల్లో అవగాహన కల్పించింది.  డిజిటల్ మీడియా, సోషల్ మీడియా మరియు ఇతర వినూత్న కమ్యూనికేషన్ సాధనాల మిశ్రమాన్ని ఉపయోగించి దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించి కార్యక్రమానికి ప్రజలను సమాయత్తం చేసింది. 

ప్రజలు స్వచ్చందంగా పెద్ద ఎత్తున పాల్గొని చేపట్టిన కార్యక్రమాలు  శుభ్రత కనిపించేలా చేశాయి.  9 సంవత్సరాల స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా అమలు చేసిన కార్యక్రమాల్లో  ప్రజలు అనేక సందర్భాలలో ఒకచోట చేరారు. పరిశుభ్రమైన దేశం కోసం స్వచ్ఛంద కృషిని అందించడానికి ఒక లక్ష్యం కోసం ఒకే గంట కాలంలో  ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు కలిసి రావడం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు.  స్వచ్ఛ భారత్ మిషన్-2.0 కింద  శాస్త్రీయ విధానంలో  వ్యర్థాల నిర్వహణ, డంప్‌సైట్‌లను సరిదిద్దడం ద్వారా 2026 నాటికి ‘చెత్త రహిత నగరాల’ నిర్మాణం కోసం జరిగే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.  

 

***



(Release ID: 1963767) Visitor Counter : 143