ప్రధాన మంత్రి కార్యాలయం

గ్రీస్ లో పత్రికా విలేకరుల ఉమ్మడి సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన ఆంగ్ల అనువాదం

Posted On: 25 AUG 2023 8:08PM by PIB Hyderabad

యువర్  ఎక్సలెన్సీ, ప్రధానమంత్రి మిత్సోటకిస్, ఉభయ దేశాలకు చెందిన ప్రతినిధులు, మీడియా మిత్రులారా

నమస్కార్.  

గ్రీస్  లో అటవీ అగ్నిప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నా తరఫున, భారత ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులైన వారు త్వరితంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

మిత్రులారా,

ప్రపంచంలోని రెండు ప్రాచీన నాగరికతల మధ్య సహజసిద్ధమైన పున:  సంధాన క్షణం ఇది. అలాగే రెండు ప్రాచీన నాగరికతా సిద్ధాంతాలు, రెండు ప్రాచీన వాణిజ్య, సాంస్కృతిక బంధం అనుసంధానం ఇది.

మిత్రులారా,

మన మధ్య బాంధవ్య బలం అత్యంత ప్రాచీనమైనది. సైన్స్, కళలు, సంస్కృతి సహా అనేక అంశాల్లో మనం ఒకరి నుంచి ఒకరం ఎంతో నేర్చుకున్నాం. నేడు మనం భౌగోళిక, రాజకీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలన్నింటిలోనూ ప్రత్యేకించి ఇండో-పసిఫిక్, మధ్యధరా ప్రాంతాల్లోను అద్భుతమైన సమన్వయం కలిగి ఉన్నాం. ఇద్దరు మిత్రుల తరహాలోనే మనం ఒకరి భావాలు ఒకరం అర్ధం చేసుకుని పరస్పరం గౌరవించుకుంటున్నాం. 40 సంవత్సరాల తర్వాత భారత ప్రధానమంత్రి గ్రీస్  పర్యటించడం ఇదే ప్రథమం. అయినప్పటికీ మన మధ్య ప్రగాఢమైన, సాదరపూర్వకమైన  సంబంధాలు ఏ మాత్రం తగ్గలేదు. అందుకే మిస్టర్  ప్రైమ్  మినిస్టర్ నేడు నేను భారత-గ్రీస్ భాగస్వామ్యాన్ని ‘‘వ్యూహాత్మక’’ స్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించాను. రక్షణ, భద్రత, మౌలిక వసతులు, వ్యవసాయం, విద్య, నవ్య/వర్థమాన టెక్నాలజీలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో మన సహకారాన్ని విస్తరించుకోవడం ద్వారా మన వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పటిష్ఠం చేసుకోవాలని మేం నిర్ణయించాం.

మిత్రులారా,

రక్షణ, భద్రత రంగాల విషయానికి వస్తే మిలిటరీ సంబంధాలు సహా రక్షణ పరిశ్రమల రంగంలో బంధాన్ని పటిష్ఠం చేసుకోవాలని మేం అంగీకారానికి వచ్చాం. నేడు మనం ఉగ్రవాదం, సైబర్  భద్రత రంగాల గురించి కూడా చర్చించుకున్నాం. మన జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో కూడా చర్చలకు సంప్రదింపుల వేదిక ఒకటి ఉండాలని మేం నిర్ణయించాం. మరింత వేగంగా విస్తరిస్తున్న మన ద్వైపాక్షిక వాణిజ్యం వృద్ధికి అవకాశం ఎంతో ఉన్నదని కూడా నేను, ప్రధానమంత్రి అంగీకారానికి వచ్చాం. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. మరికొద్ది క్షణాల్లో నేను, ప్రధానమంత్రి ఒక వ్యాపారవేత్తల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వబోతున్నాం. ఉభయ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలతో కొన్ని ప్రత్యేక రంగాలపై చర్చించబోతున్నాం. ఉభయ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా పారిశ్రామిక, ఆర్థిక సహకారాన్ని కొత్త స్థాయికి పెంచగలమని మేం విశ్వసిస్తున్నాం. వ్యవసాయ రంగంలో సహకారంపై నేడు ఒక ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం సహాయంతో వ్యవసాయం, విత్తన ఉత్పత్తి రంగాల్లో సహకరించుకోవడమే కాదు, పరిశోధన, పశుసంవర్థకం, పశు సంపద ఉత్పత్తి వంటి రంగాల్లో కూడా సహకరించుకోబోతున్నాం.

మిత్రులారా,

ఉభయ దేశాల మధ్య నిపుణుల మార్పిడికి వీలు కల్పిస్తూ మైగ్రేషన్, మొబిలిటీ ఒప్పందంపై కూడా త్వరలో అంగీకారం కుదుర్చుకోనున్నాం. ప్రాచీన కాలం నుంచి ఉభయ దేశాల ప్రజల మధ్య సంబంధానికి కొత్త రూపం ఇచ్చే దిశగా కూడా సహకారం విస్తరించుకోబోతున్నాం. ఉభయ దేశాల విద్యా సంస్థల మధ్య విద్య, సాంస్కృతిక భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహించనున్నాం.

మిత్రులారా,  

జాతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా మేం చర్చించాం. భారత-ఇయు వాణిజ్య, పెట్టుబడుల అంగీకారానికి కూడా గ్రీస్  మద్దతు ప్రకటించింది. ఉక్రెయిన్  పై కూడా దౌత్యానికి, చర్చలకు ఉభయ దేశాలు మద్దతు ఇవ్వనున్నాయి. జి-20కి భారతదేశ అధ్యక్షతను ప్రోత్సహించి, శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రధానమంత్రికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.

మిత్రులారా,

గ్రీస్  కు చెందిన అత్యున్నత పురస్కారం గ్రాండ్  క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆనర్ అందచేస్తున్నందుకు హెలెనిక్  రిపబ్లిక్  ప్రజలకు, అధ్యక్షునికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. 140 కోట్ల మంది భారతీయుల తరఫున నేను ఈ అవార్డును అంగీకరిస్తూ ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. దీర్ఘకాలిక, విశ్వసనీయ భాగస్వామ్యానికి భారత, గ్రీస్  ల భాగస్వామ్య విలువలే పునాది. ప్రజాస్వామిక విలువలు, ఆదర్శాలకు ఉభయ దేశాలు చారిత్రక వాటా అందించాయి. భారత, గ్రీకో-రోమన్ కళల సమ్మేళనం అయిన గాంధార స్కూల్  ఆఫ్ ఆర్ట్ వలెనే భారత, గ్రీస్  స్నేహబంధం కాలంపై చెరగని ముద్ర వేస్తుంది. ఈ సుందరమైన, చారిత్రక గ్రీస్  నగరంలో నాకు అద్భుతమైన  ఆతిథ్యం అందించినందుకు నేను  మరోసారి ప్రధానమంత్రికి, గ్రీస్  ప్రజలకు హృద‌యపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.  

ధన్యవాదాలు.

గమనిక – ప్రధానమంత్రి హిందీలో జారీ చేసిన పత్రికా ప్రకటనకు ఇది అనువాదం మాత్రమే.   
 

***



(Release ID: 1952636) Visitor Counter : 121