హోం మంత్రిత్వ శాఖ

అఖిల భారత మొక్కలు నాటే కార్యక్రమం కింద ఈరోజు ఉత్తరప్రదేశ్‌ గ్రేటర్ నోయిడాలోని సి.ఆర్.పి.ఎఫ్. గ్రూప్ సెంటర్‌ లో 4 కోట్లవ మొక్కను నాటిన - కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా

5 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో చేపట్టిన 'ఆల్ ఇండియా ట్రీ ప్లాంటేషన్ క్యాంపెయిన్' పర్యావరణ పరిరక్షణలో మహా కుంభ మేళా లాంటిది


ధైర్యసాహసాలతో పాటు భూమి, వాతావరణ మార్పుల పరిరక్షణ పట్ల కేంద్ర సాయుధ పోలీసు బలగాల సున్నితత్వానికి సంబంధించిన కొత్త కోణాన్ని ఈ కార్యక్రమం మనకు తెలియజేస్తుంది.


చెట్లు నాటడం ద్వారానే పర్యావరణ పరిరక్షణ సాధ్యం, నాటిన మొక్క భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ అందజేస్తుంది


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన పర్యావరణ పరిరక్షణ సంస్కృతిని ప్రోత్సహించారు. వాతావరణ మార్పు, హరిత విప్లవం ద్వారా ఆయన భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా మార్చారు


"ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్" అనే ప్రాజెక్టు ను ప్రారంభించడానికి భారతదేశం అంతర్జాతీయ సౌర కూటమిని ఏర్పాటు చేసింది. అనేక దేశాలు ఇప్పుడు ఈ కూటమిలో పాలుపంచుకుంటున్నాయి, సహకరిస్తున్నాయి, ఇది మోడీ ప్రభుత్వం సాధించిన గణనీయమైన విజయం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యావరణ సమస్యలపై అనేక ప్రచారాల ద్వారా మన దేశంలో పర్యావరణ పరిరక్షణ యొక్క పురాతన సంస్కృతిని పునఃస్థాపించే దిశగా కృషి చేశారు


లైఫ్-స్టైల్-ఫర్-ఎన్విరాన్‌మెం

Posted On: 18 AUG 2023 4:53PM by PIB Hyderabad

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అఖిల భారత మొక్కల పెంపకం ప్రచార కార్యక్రమం కింద - కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు ఉత్తరప్రదేశ్‌, గ్రేటర్ నోయిడాలోని సి.ఆర్.పి.ఎఫ్. గ్రూప్ సెంటర్‌ లో  4 కోట్లవ మొక్కను నాటారు.

 

 

కేంద్ర రిజర్వు పోలీసు దళం (సి.ఆర్.పి.ఎఫ్) కి చెందిన 8 వేర్వేరు ప్రాంగణాల్లో 165 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా  నిర్మించిన 15 భవనాలను కూడా శ్రీ అమిత్ షా ప్రారంభించారు.  వీటిలో 102 ర్యాపిడ్ టాస్క్ ఫోర్స్ వద్ద 57 కోట్ల రూపాయలతో నిర్మించిన 220 కుటుంబ వసతి గృహాలు; రాయ్‌ పూర్‌ లోని గ్రూప్ సెంటర్‌ లో 17 కోట్ల రూపాయలతో నిర్మించిన 50 పడకల ఆసుపత్రి; జోధ్‌పూర్‌ లోని రిక్రూట్ ట్రైనింగ్ సెంటర్ వద్ద 16 కోట్ల రూపాయలతో నిర్మించిన పరిపాలనా భవనం, క్వార్టర్ గార్డ్, పరేడ్ గ్రౌండ్; రాయ్‌పూర్‌ గ్రూప్ సెంటర్ లో 11 కోట్ల రూపాయల వ్యయంతో 240 మంది పురుషుల బ్యారక్ నిర్మాణంతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన ఆసుపత్రులు, జిమ్‌ లు, మెస్‌ లు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, క్యాంటీన్లు మొదలైనవి ఉన్నాయి. కేంద్ర హోంశాఖ కార్యదర్శి తో పాటు, సి.ఆర్.పి.ఎఫ్., సి.ఐ.ఎస్.ఎప్., ఎన్.ఎస్.జి., ఎన్.డి.ఆర్.ఎఫ్., ఐ.టి.బి.పి., ఎస్.ఎస్.బి., బి.ఎస్.ఎఫ్., అస్సాం రైఫిల్స్ వంటి వివిధ కేంద్ర బలగాల డైరెక్టర్ జనరళ్ళు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో, ఈ రోజు అన్ని కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు (సి.ఏ.పి.ఎఫ్. లకు) ముఖ్యమైన రోజు అని అన్నారు.  2023 డిసెంబరు నాటికి 5 కోట్ల మొక్కలను నాటాలని మూడేళ్ల క్రితమే తీర్మానించామని, ఈ లక్ష్యం నెరవేరిన అనంతరం వాటిని ప్రపంచానికి అంకితం చేస్తామని చెప్పారు.   2023 డిసెంబరు నాటికి 5 కోట్  మొక్కలు నాటాలనే లక్ష్యం నెరవేరుతుందని శ్రీ షా విశ్వాసం వ్యక్తం చేశారు.  అసాధ్యమని అనిపించే ఈ పనిని సుసాధ్యం గా మార్చడానికి, మన కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బంది, వారి కుటుంబీకులందరూ దీనిని సవాలుగా స్వీకరించారని, మొక్కలను తమ స్నేహితులుగా భావించి, వాటి సంరక్షణకు తగిన సమయాన్ని వెచ్చించారని ఆయన వ్యాఖ్యానించారు.  నేడు 40 మిలియన్ల మొక్కలు నాటడం ద్వారా, భూమిని పచ్చగా మార్చడంలో  కేంద్ర సాయుధ పోలీసు బలగాల సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆయన అన్నారు.  ధైర్యసాహసాలతో పాటు భూమి, వాతావరణ మార్పుల పరిరక్షణ పట్ల కేంద్ర సాయుధ పోలీసు బలగాల సున్నితత్వానికి సంబంధించిన కొత్త కోణాన్ని ఈ కార్యక్రమం మనకు తెలియజేస్తుంది.  ఈ ఏడాది ఒక కోటి 50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, నేటి వరకు మొత్తం 4 కోట్ల మొక్కలు నాటామని, త్వరలో 5 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. 

 

 

ఈ రోజు, దేశ భద్రత కోసం అత్యున్నత త్యాగం చేయడంతో పాటు, ముందుండి నడిపించి అందరి మనోధైర్యాన్ని పెంపొందించడం ద్వారా అద్భుతమైన ఉదాహరణగా నిలిచిన పరమవీర చక్ర అవార్డు గ్రహీత లెఫ్టినెంట్ కల్నల్ ఎ.బి. తారాపూర్ జయంతి అని కేంద్ర హోంమంత్రి తెలియజేశారు.   అండమాన్-నికోబార్‌ లోని ఒక ద్వీపానికి లెఫ్టినెంట్ కల్నల్ ఎ.బి. తారాపూర్ పేరు పెట్టడం ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపారనీ, ఆయన ప్రజల హృదయాల్లో, మనస్సుల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా చేశారని శ్రీ షా పేర్కొన్నారు. 

 

 

5 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో చేపట్టిన "అఖిల భారత మొక్కలు పెంచే కార్యక్రమం" పర్యావరణ పరిరక్షణలో మహా కుంభ మేళా వంటిదని శ్రీ అమిత్ షా అభివర్ణించారు.   మన  కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బంది దేశ అంతర్గత భద్రతను నిర్ధారించడానికి, వారి ధైర్యం, త్యాగం, అంకితభావం, కృషితో సరిహద్దులను రక్షించడానికి ఎల్లప్పుడూ స్థిరంగా నిలబడి ఉన్నారని ఆయన ప్రశంసించారు.  దేశ అంతర్గత భద్రత, విపత్తు నిర్వహణ, సరిహద్దు భద్రత, సరిహద్దుల్లో ఉన్న మొదటి గ్రామాలకు ప్రజా సౌకర్యాలను నిర్ధారించడం తో పాటు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఇప్పుడు మొక్కలు పెంచే కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణకు అపూర్వమైన కృషి చేస్తున్నాయి.   ప్రకృతి వైపరీత్యాలు లేదా కోవిడ్-19 వంటి మహమ్మారి ఏదైనా సరే, ప్రతి సంక్షోభంలోనూ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి వెనుకాడకుండా ప్రజల పక్షాన నిలబడేందుకు అచంచలమైన నిబద్ధతను కనబరిచాయని అమిత్ షా అభినందించారు.  "వైబ్రంట్ విలేజ్" కార్యక్రమం ద్వారా, దేశ సరిహద్దుల్లో ఉన్న మన మొదటి గ్రామాలకు ప్రజా సేవ, సౌకర్యాలు అందుబాటులో ఉండేలా మన కేంద్ర సాయుధ పోలీసు బలగాలు నిర్ధారిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.  ఇప్పుడు మరో కోణాన్ని జోడించామని, ఇందులో  మన కేంద్ర సాయుధ పోలీసు బలగాలు 4 కోట్ల మొక్కలు నాటడం, పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో స్థిరమైన ప్రయత్నాలు చేశాయని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి 5 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యాన్ని సాధిస్తాయని ఆయన చెప్పారు.   ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు భద్రతా సంబంధిత సంస్థలు అందించే అతిపెద్ద సహకారం ఇది అని శ్రీ షా తెలిపారు.  కేంద్ర సాయుధ పోలీసు బలగాలు అన్నీ కలిసి 4 కోట్ల మొక్కలు నాటాయని, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు వివిధ స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారని, ఆయన  చెప్పారు.   వివిధ కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన డి.జి.లు అందరూ ఈ కార్యక్రమానికి నిబద్ధతను చూపించారు,   ప్లాటూన్ మరియు సెక్టార్ స్థాయిల్లో అందరూ ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా స్వీకరించారు.  పలు చోట్ల చిన్న మొక్కలను సంరక్షించేందుకు రక్షణ కంచెలు, వలలు ఏర్పాటు చేసి వాటి సంరక్షణ కోసం కందకాలు కూడా తవ్వారు.  ఈ ప్రయత్నాల వల్ల ఇప్పుడు 4 కోట్ల చెట్లు భూమిని పచ్చగా మారుస్తున్నాయని ఆయన చెప్పారు. 

 

 

మొక్కలు నాటడం ద్వారానే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని, ఈరోజు నాటిన చెట్టు భవిష్యత్ తరాలకు ఆక్సిజన్‌ ను అందిస్తుందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి పేర్కొన్నారు.  పెరుగుతున్న కాలుష్యం తో ఓజోన్ పొర దెబ్బతింటోందనీ, ఫలితంగా భవిష్యత్తులో సౌర కిరణాలు నేరుగా భూమిపై ప్రభావం చూపుతాయనీ, దీని వల్ల భూమి మానవ జీవనానికి సురక్షితంగా ఉండదనీ శ్రీ అమిత్ షా వివరించారు.   ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటడం ద్వారా కార్బన్-డై-ఆక్సైడ్ విడుదలను తగ్గించడం ఒక్కటే మార్గమని ఆయన చెప్పారు.   మొక్కలు నాటేటప్పుడు రెండు అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు శ్రీ షా తెలిపారు.  మొదటి అంశం - నాటిన మొక్కలు సుదీర్ఘ జీవితకాలం కలిగి ఉండాలి.  రెండవ అంశం - అవి పీపల్, మర్రి, వేప, జామున్ వంటి గరిష్ట ఆక్సిజన్‌ విడుదల చేసేవిగా ఉండాలి.   ఈ చెట్లు 60 నుంచి 100 శాతం వరకు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయనీ, అనేక సంవత్సరాల పాటు భూమిని పరిరక్షించడానికి దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. 

 

 

భారతదేశాన్ని వివిధ రంగాలలో అభివృద్ధి చేసి, ఆత్మనిర్భర్‌ గా మార్చేందుకు, తద్వారా ప్రపంచంలో మన దేశ స్థానాన్ని బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృషి చేశారని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.   మన వారసత్వం, సంస్కృతి ఎల్లప్పుడూ పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తున్నాయని, మన మనోభావాలు, చర్యల ద్వారా పర్యావరణ పరిరక్షణకు మనం ఎల్లప్పుడూ హామీ ఇస్తున్నామని ఆయన తెలిపారు.  హరిత విప్లవం ద్వారా వాతావరణ మార్పు, గ్లోబల్ వార్మింగ్‌ పై పోరాటంలో భారతదేశాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అగ్రగామిగా నిలిపారని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు.  ఈ కారణంగానే "వసుధైవ కుటుంబకం" - ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు, జి-20 మిషన్ ఇతివృత్తంగా స్వీకరించడం జరిగిందని, శ్రీ షా తెలియజేశారు.   ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్‌ ను రూపొందించే లక్ష్యంతో ఫ్రాన్స్‌ తో కలిసి భారతదేశం అంతర్జాతీయ సౌర కూటమిని ప్రారంభించిందని కూడా ఆయన తెలిపారు.  అనేక దేశాలు ఇప్పుడు ఈ కూటమిలో పాల్గొంటున్నాయి, సహకరిస్తున్నాయి.  ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం సాధించిన ఒక ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం ఇది.  లైఫ్‌-స్టైల్-ఫర్-ఎన్విరాన్‌మెంట్ (లైఫ్) మిషన్ కార్యక్రమం ద్వారా, భూమిని రక్షించే సాధనంగా ప్రధానమంత్రి మోదీ మన సాంప్రదాయ జీవన విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని హోంమంత్రి అన్నారు.  ప్రపంచ దేశాలు ఇప్పుడు ఈ కార్యక్రమాలను అనుసరిస్తున్నాయనీ, ఈ ప్రయత్నాల కారణంగానే, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి సుస్థిర అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతను, ఐక్యరాజ్యసమితి గుర్తించి, ఆయన్ని ‘ఛాంపియన్స్-ఆఫ్-ఎర్త్’ అవార్డుతో సత్కరించిందనీ, అమిత్ షా తెలియజేశారు. 

 

 

ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్‌ వస్తువుల వాడకాన్ని తగ్గించేందుకు భారతదేశం కూడా కొత్త పద్ధతులను అన్వేషించిందని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు.  స్వచ్ఛ-భారత్-అభియాన్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యావరణ పరిరక్షణ దిశగా గణనీయమైన అడుగు వేశారని శ్రీ అమిత్ షా చెప్పారు. దేశంలో మొదట్లో కేవలం 39 శాతం ఇళ్ళలో మాత్రమే మరుగుదొడ్లు ఉండేవని, ఇప్పుడు 99.9 శాతం ఇళ్ళలో మరుగుదొడ్లు ఉన్నాయని, పర్యావరణ పరిరక్షణ కోసం మనం చేస్తున్న కృషిలో ఇది అద్భుతమైన విజయమని కేంద్ర హోంమంత్రి అభివర్ణించారు.  నికర-కర్బన రహిత ఉద్గారాలు, అంతర్జాతీయ సౌర కూటమి, 20 శాతం ఇథనాల్ కలపడం, బయో-గ్యాస్‌ను జీవ ఇంధనంగా మార్చడానికి 12 ఆధునిక రిఫైనరీల నిర్మాణం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వంటి కార్యక్రమాలను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోందనీ, అనుసరిస్తోందనీ, శ్రీ షా చెప్పారు.  జాతీయ సౌర మిషన్; మెరుగైన శక్తి సామర్థ్యం కోసం జాతీయ మిషన్; సుస్థిర నివాసంపై జాతీయ మిషన్; జాతీయ జల మిషన్; హరిత భారతదేశం కోసం జాతీయ మిషన్; హిమాలయ పర్యావరణ వ్యవస్థను నిలబెట్టడం కోసం జాతీయ మిషన్; సుస్థిర వ్యవసాయం కోసం జాతీయ మిషన్; వాతావరణ మార్పు కోసం వ్యూహాత్మక పరిజ్ఞానంపై జాతీయ మిషన్ వంటి ఎనిమిది కీలక మిషన్ల ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యావరణ పరిరక్షణకు భారతదేశ నిబద్ధతను ప్రపంచదేశాలకు తెలియజేశారని కూడా ఆయన వివరించారు.  ఈ కార్యక్రమాలు మన దేశంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పురాతన సంస్కృతిని పునఃప్రతిష్టించాయని హోంమంత్రి పేర్కొన్నారు. 

 

 

ఈ మొక్కలు పెంచే కార్యక్రమంలో భాగంగా మన కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఇంతవరకు నాలుగు కోట్ల మొక్కలను నాటినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు.  ఐదు కోట్ల చెట్లను నాటాలనే లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు పౌరుల జీవితాలను రక్షించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు కూడా శ్రద్ధగా పనిచేస్తున్నందున, మొత్తం దేశానికి మన సున్నితత్వాన్ని గర్వంగా ప్రదర్శిస్తాము.  నేడు, మన కేంద్ర సాయుధ పోలీసు బలగాలు అసాధ్యమని అనిపించిన వాటిని సుసాధ్యం చేశాయని కూడా ఆయన పేర్కొన్నారు.  దేశానికి భద్రత, శౌర్యం కేంద్ర సాయుధ పోలీసు బలగాల నైతికత కాబట్టి, వారు మొక్కల పెంపకాన్ని కూడా తమ ధర్మంగా స్వీకరిస్తారని కేంద్ర హోం మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

 

 

*****



(Release ID: 1950388) Visitor Counter : 178