ప్రధాన మంత్రి కార్యాలయం

మూడవ ఎఫ్ ఐ పి ఐ సి సమ్మిట్ లో ప్రధాన మంత్రి ప్రారంభ ప్రకటన తెలుగు l అనువాదం

Posted On: 22 MAY 2023 12:58PM by PIB Hyderabad

ప్రముఖులారా,

 

మూడవ ఎఫ్ఐపిఐసి శిఖరాగ్ర సమావేశానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం! ప్రధాన మంత్రి జేమ్స్ మరాప్ నాతో కలిసి ఈ సదస్సుకు సహ ఆతిథ్యం ఇస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. పోర్ట్ మోరెస్బీలో ఇక్కడ సమ్మిట్ కోసం చేసిన అన్ని ఏర్పాట్లకు గానూ నేను ఆయనకు , వారి బృందానికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను..

 

ప్రముఖులారా,

 

ఈసారి చాలా కాలం తర్వాత కలుస్తున్నాం. ఈ లోగా, ప్రపంచం కోవిడ్ మహమ్మారి , అనేక ఇతర సవాళ్లతో క్లిష్టమైన కాలాన్ని ఎదుర్కొంది. ఈ సవాళ్ల ప్రభావాన్ని గ్లోబల్ సౌత్ దేశాలు ఎక్కువగా అనుభవించాయి.

 

వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, ఆకలి, పేదరికం, ఆరోగ్యానికి సంబంధించిన అనేక సవాళ్లు ఇప్పటికీ ప్రబలంగా ఉన్నాయి. ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఆహారం, ఇంధనం, ఎరువులు, ఔషధాల సరఫరా గొలుసుల్లో అవరోధాలు తలెత్తుతున్నాయి.

 

మనం నమ్మదగినవారిగా భావించిన వారు, అవసరమైన సమయాల్లో మనకు అండగా నిలవడం లేదని తేలింది. ఈ క్లిష్ట సమయాల్లో, ఒక పాత సామెత నిజ౦గా నిరూపి౦చబడి౦ది: "అవసర౦లో దగ్గరున్న స్నేహితుడే నిజమైన స్నేహితుడు."

 

ఈ క్లిష్ట సమయంలో భారతదేశం తన పసిఫిక్ ద్వీప మిత్రులకు అండగా ఉండగలిగినందుకు l నేను సంతోషిస్తున్నాను. అది వ్యాక్సిన్ లు, లేదా అత్యవసర మందులు, గోధుమలు లేదా చక్కెర కావచ్చు; భారత్ తన సామర్థ్యానికి అనుగుణంగా అన్ని భాగస్వామ్య దేశాలకు సాయం చేస్తోంది.

 

ప్రముఖులారా,

 

నేను ఇంతకు ముందు చెప్పినట్లు, నా దృష్టిలో, మీవి చిన్న ద్వీప దేశాలు కాదు, పెద్ద మహాసముద్ర దేశాలు. ఈ సువిశాల సముద్రం భారతదేశాన్ని మీ అందరితో కలుపుతుంది. భారతీయ తత్వశాస్త్రం ఎల్లప్పుడూ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూస్తుంది.

 

'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే ఈ ఏడాది జరుగుతున్న జీ-20 సదస్సు థీమ్ కూడా ఈ భావజాలంపైనే ఆధారపడి ఉంది.

 

ఈ సంవత్సరం, జనవరిలో, మేము వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ను నిర్వహించాము, ఇందులో మీ ప్రతినిధులు పాల్గొని వారి ఆలోచనలను పంచుకున్నారు. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. జి-20 వేదిక ద్వారా ప్రపంచ దేశాల సమస్యలు, అంచనాలు, ఆకాంక్షలను ప్రపంచం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యతగా భారత్ భావిస్తోంది.

 

ప్రముఖులారా,

 

గత రెండు రోజులుగా జీ-7 సదస్సులోనూ ఇదే ప్రయత్నం చేశాను. అక్కడ పసిఫిక్ ఐలాండ్ ఫోరమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ మార్క్ బ్రౌన్ ఈ విషయాన్ని ధృవీకరించగలరు.

 

ప్రముఖులారా,

 

వాతావరణ మార్పుల అంశంపై భారతదేశం ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకుంది, మేము వాటి కోసం వేగంగా పనిచేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.

 

గత ఏడాది ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ తో కలిసి లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్ మెంట్ అనే మిషన్ ను ప్రారంభించాను. మీరు కూడా ఈ ఉద్యమంలో చేరాలని కోరుకుంటున్నాను.

 

ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, సీడీఆర్ఐ వంటి కార్యక్రమాలను భారత్ చేపట్టింది. మీలో చాలా మంది ఇప్పటికే సోలార్ అలయన్స్ లో భాగమని నేను అర్థం చేసుకున్నాను. సిడిఆర్ఐ కార్యక్రమాలు కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. ఈ సందర్భంగా మీ అందరినీ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాను.

 

ప్రముఖులారా,

 

ఆహార భద్రతకు ప్రాధాన్యమిస్తూనే పోషకాహారం, పర్యావరణ పరిరక్షణపై కూడా దృష్టి సారించాం. ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఈ సూపర్ ఫుడ్ కు భారతదేశం "శ్రీ యాన్" హోదా ఇచ్చింది.

వీటి సాగుకు తక్కువ నీరు అవసరం, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మీ దేశాలలో కూడా సుస్థిర ఆహార భద్రతను నిర్ధారించడానికి చిరుధాన్యాలు గణనీయమైన సహకారాన్ని అందించగలవని నేను నమ్ముతున్నాను.

 

ప్రముఖులారా,

 

భారత్ మీ ప్రాధాన్యతలను గౌరవిస్తుంది. మీ అభివృద్ధి భాగస్వామిగా ఉన్నందుకు గర్వంగా ఉంది. అది మానవతా సహాయం కావచ్చు లేదా మీ అభివృద్ధి కావచ్చు, మీరు భారతదేశాన్ని నమ్మదగిన భాగస్వామిగా పరిగణించవచ్చు. మా దృక్పథం మానవీయ విలువలపై ఆధారపడి ఉంటుంది.

 

పాలవ్ లోని కన్వెన్షన్ సెంటర్;

నౌరులో వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు;

ఫిజీలో తుఫాను బాధిత రైతులకు విత్తనాలు;

కిరిబాటిలో సోలార్ లైట్ ప్రాజెక్టు.

 

ఇవన్నీ ఒకే సెంటిమెంట్ మీద ఆధారపడి ఉంటాయి.

 

మా సామర్థ్యాలు ,అనుభవాలను ఎటువంటి సంకోచం లేకుండా మీతో పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము.

 

అది డిజిటల్ టెక్నాలజీ అయినా, స్పేస్ టెక్నాలజీ అయినా; ఆరోగ్య భద్రత అయినా, ఆహార భద్రత అయినా; అది వాతావరణ మార్పు అయినా, పర్యావరణ పరిరక్షణ అయినా; మేము మీకు అన్ని విధాలుగా అండగా ఉన్నాం.

 

ప్రముఖులారా,

 

బహుళపక్షవాదంపై మీ నమ్మకాన్ని మేము పంచుకుంటాము. స్వేచ్ఛాయుత, బహిరంగ, సమ్మిళిత ఇండో-పసిఫిక్ కు మేము మద్దతు ఇస్తున్నాము. అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, సమగ్రతను గౌరవిస్తాం.

 

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కూడా గ్లోబల్ సౌత్ గళం బలంగా ప్రతిధ్వనించాలి. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థల సంస్కరణ - మన ఉమ్మడి ప్రాధాన్యతగా ఉండాలి.

 

క్వాడ్ లో భాగంగా హిరోషిమాలో ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ లతో చర్చలు జరిపాను. ఇండో-పసిఫిక్ ప్రాంతంపై ఈ చర్చ ప్రత్యేక దృష్టి సారించింది. క్వాడ్ సమావేశంలో- పాలవ్ లో రేడియో యాక్సెస్ నెట్ వర్క్ (ఆర్ ఏఎన్ ) ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. బహుళ పక్ష ఫార్మాట్ లో పసిఫిక్ ద్వీప దేశాలతో భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటాం.

 

ప్రముఖులారా,

 

ఫిజీలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ పసిఫిక్ లో సస్టెయినబుల్ కోస్టల్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఎస్ సి ఒ ఆర్ ఐ) ను ఏర్పాటు చేసినట్లు తెలిసి సంతోషిస్తున్నాను. ఈ సంస్థ సుస్థిర అభివృద్ధిలో భారతదేశ అనుభవాలను పసిఫిక్ ద్వీప దేశాల విజన్ తో అనుసంధానిస్తుంది.

 

పరిశోధన, అభివృద్ధితో పాటు, వాతావరణ మార్పుల సవాళ్లను పరిష్కరించడంలో ఇది విలువైనది. ఈ రోజు, 14 దేశాల పౌరుల శ్రేయస్సు, పురోగతి , సౌభాగ్యం కోసం ఎస్ సి ఒ ఆర్ ఐ) అంకితం చేయబడినందుకు నేను సంతోషిస్తున్నాను.

 

అదేవిధంగా జాతీయ, మానవాభివృద్ధి కోసం, స్పేస్ టెక్నాలజీ కోసం వెబ్ సైట్ ను ప్రారంభించడం సంతోషంగా ఉంది. దీని ద్వారా, మీరు భారత శాటిలైట్ నెట్వర్క్ నుండి మీ దేశానికి చెందిన రిమోట్ సెన్సింగ్ డేటాను డౌన్ లోడ్ చేసుకోవచ్చు ఇంకా మీ సంబంధిత జాతీయ అభివృద్ధి ప్రణాళికలలో ఉపయోగించుకోవచ్చు.

 

ప్రముఖులారా,

 

ఇప్పుడు, నేను మీ ఆలోచనలను వినడానికి ఆత్రుతగా ఉన్నాను. ఈ రోజు ఈ సదస్సులో పాల్గొన్నందుకు మరోసారి ధన్యవాదాలు.

 

డిస్ క్లెయిమర్- ఇది ప్రధాని ప్రసంగానికి సుమారు అనువాదం. ప్రధాన మంత్రి అసలు ప్రసంగం హిందీలో చేశారు.

 

****



(Release ID: 1926526) Visitor Counter : 147