ప్రధాన మంత్రి కార్యాలయం

సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్’ప్రెస్‌ను తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రారంభించిన ప్రధానమంత్రి

Posted On: 08 APR 2023 5:00PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్’ప్రెస్‌ను తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జెండా ఊపి సాగనంపారు. అంతకుముందు రైల్వే స్టేషన్‌ ప్రాంగణానికి చేరుకున్న ఆయన, ఈ రైలును పరిశీలించి, దానిని నడిపే సిబ్బందితోపాటు బాలబాలికలతో కాసేపు ముచ్చటించారు.

దీనిపై ఒక ట్వీట్‌ ద్వారా పోస్ట్‌ చేసిన సందేశంలో:

   “సికింద్రాబాద్-తిరుపతి మధ్య అనుసంధానాన్ని పెంచే వందే భారత్ ఎక్స్‌’ప్రెస్‌ను ఇవాళ జెండా ఊపి సాగనంపాను. ఈ రైలు ఇక్కడి నుంచి ప్రారంభం కావడంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా అభినందనలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

   సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌’ప్రెస్‌ ఐటీ నగరం హైదరాబాద్‌ను, శ్రీ వేంకటేశ్వరుని నిలయమైన తిరుపతి నగరంతో కలుపుతుంది. ఇది మూడు నెలల స్వల్ప వ్యవధిలో తెలంగాణ నుంచి ప్రారంభించబడిన రెండో వందే భారత్ రైలు. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని ఈ రైలు దాదాపు మూడున్నర గంటలు తగ్గిస్తుంది. ప్రత్యేకించి యాత్రికులకు ఇదెంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

   ఈ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర రైల్వేశాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

***

DS/TS



(Release ID: 1915084) Visitor Counter : 161