ప్రధాన మంత్రి కార్యాలయం

జూన్ 14వ తేదీన మహారాష్ట్ర లో పర్యటించనున్న - ప్రధానమంత్రి


పూణే లోని దేహు లో జగద్గురు శ్రీశాంత్ తుకారాం మహారాజ్ ఆలయాన్ని ప్రారంభించనున్న - ప్రధానమంత్రి

ముంబై లోని రాజ్‌ భవన్‌ లో జల్ భూషణ్ భవనం, విప్లవకారుల గ్యాలరీ లను ప్రారంభించనున్న - ప్రధానమంత్రి

మహారాష్ట్రకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు, విప్లవకారుల సేవలు స్మరించు కోవడానికి ఒక ప్రత్యేకమైన ప్రదర్శనశాల గా అభివృద్ధి చేసిన - విప్లవకారుల గ్యాలరీ


200 సంవత్సరాలు గా నిరంతరాయంగా ప్రచురితమవుతున్న ముంబై సమాచార్ అనే వార్తా పత్రిక ద్విశతాబ్ది మహోత్సవాల్లో కూడా పాల్గొంటున్న - ప్రధానమంత్రి

Posted On: 12 JUN 2022 11:43AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 14వ తేదీన మహారాష్ట్రలో పర్యటించనున్నారు.  మధ్యాహ్నం ఒంటిగంట 45 నిమిషాలకు, పూణే లోని దేహు లో జగద్గురు శ్రీశాంత్ తుకారాం మహారాజ్ ఆలయాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.  సాయంత్రం నాలుగు గంటల 15 నిమిషాలకు, ముంబై లోని రాజ్ భవన్‌ లో జల్ భూషణ్ భవనాన్నీ, విప్లవకారుల గ్యాలరీ ని, ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.  అనంతరం, సాయంత్రం 6 గంటలకు, ముంబై లోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ లో ముంబై సమాచార్ ద్విశతాబ్ది మహోత్సవంలో ప్రధానమంత్రి పాల్గొంటారు.

పూణే లో ప్రధానమంత్రి

పూణే లోని దేహు లో జగద్గురు శ్రీశాంత్ తుకారాం మహారాజ్ ఆలయాన్ని ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు.  సంత్ తుకారాం, ప్రముఖ వార్కారీ సాధువు, కవి.  అభంగ అనే భక్తి గీతాల  రచన తో  పాటు, కీర్తనలు గా ప్రాచుర్యం పొందిన ఆధ్యాత్మిక పాటల ద్వారా సమాజ ఆధారిత ఆరాధనకు ఆయన ప్రసిద్ధి చెందారు.  ఆయన దేహు లో నివసించారు.  ఆయన మరణానంతరం శిలా మందిర నిర్మాణం జరిగింది కానీ, అది అధికారిక ఆలయం గా రూపుదిద్దుకోలేదు.  ఇది ఇప్పుడు 36 శిఖరాల రాతి కట్టడం గా పునర్నిర్మించడం జరిగింది. అందులో సంత్ తుకారాం విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. 

ముంబై లో ప్రధానమంత్రి

ముంబై లోని రాజ్‌ భవన్‌ లో జల్ భూషణ్ భవనంతో పాటు, విప్లవకారుల గ్యాలరీ ని కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.  "జల్ భూషణ్" 1885 నుండి మహారాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసంగా ఉంది.  ఈ భవన జీవితకాలం పూర్తి కావడంతో,  దానిని కూల్చివేసి దాని స్థానంలో కొత్త భవనాన్ని మంజూరు చేశారు.  2019 ఆగస్టు లో గౌరవనీయులైన రాష్ట్రపతి కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు.  పాత భవనానికి చెందిన అన్ని విలక్షణమైన లక్షణాలను కొత్తగా నిర్మించిన భవనం లో భద్రపరచారు. 

2016 లో అప్పటి మహారాష్ట్ర గవర్నర్‌ శ్రీ విద్యాసాగర్‌ రావు రాజ్‌ భవన్‌ లో ఒక బంకర్‌ ను కనుగొన్నారు.  దీనిని గతంలో బ్రిటిష్ ప్రభుత్వం ఆయుధాలు, మందుగుండు సామాగ్రి రహస్య నిల్వ స్థావరం గా ఉపయోగించారు.  ఈ బంకర్ ను 2019 లో పునరుద్ధరించారు.   మహారాష్ట్రకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు, విప్లవకారుల సేవలను స్మరించుకోవడానికి, ఆ బంకర్‌ లో ఒక ప్రత్యేకమైన మ్యూజియం (ప్రదర్శనశాల) గా ఈ గ్యాలరీని  అభివృద్ధి చేశారు.  వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే, చాపేకర్ సోదరులు, సావర్కర్ సోదరులు, మేడమ్ భికాజీ కామా, వి.బి. గోగటే ల వంటి ప్రముఖుల సేవలతో పాటు, 194 6లో నౌకాదళ తిరుగుబాటు వంటి చారిత్రిక సంఘటనలకు ఈ గ్యాలరీ నివాళులర్పిస్తుంది.

ముంబై లోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ లో ముంబై సమాచార్ ద్విశతాబ్ది మహోత్సవంలో ప్రధానమంత్రి పాల్గొంటారు.  ముంబై సమాచార్‌ ను ఒక వారపత్రిక గా ఫర్దుంజీ మార్జ్‌ బాంజీ, 1822 జులై 1వ తేదీన ముద్రించడం ప్రారంభించారు.  ఆ తర్వాత, 1832 లో ఇది ఒక దినపత్రిక గా మారింది.  ఈ వార్తాపత్రిక ప్రచురణ రెండు వందల సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతోంది.  ఈ విశిష్ట ప్రస్థానానికి గుర్తుగా, ఈ సందర్భంగా ఒక తపాలా బిళ్ళ ను కూడా విడుదల చేయనున్నారు.

 

*****

 



(Release ID: 1833386) Visitor Counter : 102