ప్రధాన మంత్రి కార్యాలయం

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు జమ్మూ, కాశ్మీర్ ను సందర్శించిన - ప్రధానమంత్రి


సాంబ జిల్లా లోని పల్లి పంచాయతీ నుంచి దేశవ్యాప్తంగా అన్ని గ్రామ సభలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు

20,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు

జమ్మూ, కాశ్మీర్ ప్రాంతాలను మరింత దగ్గరకు తీసుకురావడానికి సహాయపడే బనిహాల్ ఖాజిగుండ్ రోడ్ టన్నెల్‌ ను ప్రారంభించారు


ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్‌ మార్గం, రాటిల్ మరియు క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టులకు చెందిన మూడు రహదారి ప్యాకేజీలకు శంకుస్థాపన చేశారు

దేశంలోని ప్రతి జిల్లాలో 75 జలాశయాలను అభివృద్ధి చేయడం, పునరుజ్జీవింపచేయడం లక్ష్యంగా "అమృత్-సరోవర్‌" పధకాన్ని ప్రారంభించారు

"జమ్మూ కశ్మీర్‌ లో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలు పెద్ద మార్పును సూచిస్తాయి"

“ప్రజాస్వామ్యం కావచ్చు లేదా అభివృద్ధి కోసం సంకల్పం కావచ్చు, ఈ రోజు జమ్మూ-కశ్మీర్ ఒక కొత్త ఉదాహరణగా నిలిచింది. గత 2, 3 సంవత్సరాలలో, జమ్మూ-కశ్మీర్‌ లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది"

"జమ్మూ-కశ్మీర్‌ లో ఏళ్ల తరబడి రిజర్వేషన్‌ ప్రయోజనం పొందని వారు ఇప్పుడు రిజర్వేషన్‌ ప్రయోజనాలను పొందుతున్నారు&q

Posted On: 24 APR 2022 2:56PM by PIB Hyderabad

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జమ్మూ-కశ్మీర్‌ లో పర్యటించి, దేశవ్యాప్తంగా అన్ని గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించారు.  సాంబ జిల్లా లోని పల్లి పంచాయతీ ని ఆయన సందర్శించారు.  దాదాపు 20,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి ఈ సందర్భంగా  ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.  అమృత్ సరోవర్ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో,  జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా,  కేంద్ర మంత్రులు శ్రీ గిరిరాజ్ సింగ్, డాక్టర్ జితేంద్ర సింగ్, శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ ప్రభృతులు పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, జ‌మ్మూ-క‌శ్మీర్ అభివృద్ధి ప్రయాణంలో ఈరోజు ఒక మైలురాయి అని అభివర్ణించారు.   జమ్మూ-కశ్మీర్ ప్రజల ఉత్సాహానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.  రాష్ట్రంతో తనకున్న సుదీర్ఘ అనుబంధం కారణంగా,  వాటిలో ఇమిడి ఉన్న సమస్యలను తాను అర్థం చేసుకున్నాననీ, ఈ రోజు శంకుస్థాపన చేసిన, ప్రారంభించిన ప్రాజెక్టులలో కనెక్టివిటీ పై దృష్టి పెట్టడం పట్ల తాను సంతోషం వ్యక్తం చేస్తున్నాననీ, ప్రధానమంత్రి చెప్పారు.  “ఇక్కడ కనెక్టివిటీ మరియు విద్యుత్‌ కు సంబంధించి 20 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి.  జమ్మూ-కశ్మీర్ అభివృద్ధికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలు జమ్మూ-కశ్మీర్‌ లోని పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి కల్పిస్తాయి” అని ఆయన అన్నారు.  ఈ రోజు చాలా కుటుంబాలు గ్రామాల్లో తమ ఇళ్లకు సంబంధించిన ఆస్తి కార్డులు కూడా పొందాయి.   ఈ యాజమాన్య కార్డులు గ్రామాల్లో కొత్త అవకాశాలకు ఊతమిస్తాయి.  జమ్మూ-కశ్మీర్‌ లోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు సరసమైన మందులు, శస్త్రచికిత్స వస్తువులు అందించడానికి, 100 జన్-ఔషధి కేంద్రాలు, ఒక మాధ్యమంగా పనిచేస్తాయని, ఆయన చెప్పారు.  జమ్మూ-కశ్మీర్‌ లో కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ అమలవుతున్నాయని, వాటి ద్వారా ప్రజలు లబ్ధి పొందుతున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  ఎల్‌.పి.జి., మరుగుదొడ్లు, విద్యుత్, భూమి హక్కులు, నీటి కనెక్షన్‌ లకు సంబంధించిన పథకాల వల్ల గ్రామాల్లోని ప్రజలు అత్యధికంగా లబ్ధి పొందుతున్నారు.  వేదిక వద్దకు చేరుకోవడానికి ముందు, ప్రధానమంత్రి యు.ఎ.ఈ. నుండి వచ్చిన ప్రతినిధులతో సమావేశమయ్యారు.  జమ్మూ-కశ్మీర్‌ పై చాలా మంది ప్రయివేటు పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నారని, అభివృద్ధికి కొత్త రూపకల్పన చేస్తున్నారని, ప్రధానమంత్రి పేర్కొన్నారు.  స్వాతంత్య్రం వచ్చిన తర్వాత  7 దశాబ్దాలలో జమ్మూ-కశ్మీర్‌ లో కేవలం 17 వేల కోట్ల రూపాయల మేర ప్రైవేటు పెట్టుబడులు పెట్టడం జరిగింది.  అయితే, ఇప్పుడు అవి, దాదాపు 38,000 కోట్ల రూపాయలకు చేరుకుంటున్నాయి.  పర్యాటక రంగం కూడా మరోసారి అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి వివరించారు. 

జమ్మూ-కశ్మీర్‌ లో మారిన పని విధానాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా పేర్కొంటూ,  మూడు వారాల్లో ఏర్పాటు చేయనున్న 500 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంటు ను ఉదాహరణగా చెప్పారు.  ఇంతకు ముందు ఢిల్లీ నుంచి ఫైళ్ల తరలింపు కే  2, 3 వారాలు పట్టేదని ఆయన అన్నారు.   పల్లి పంచాయతీలో అన్ని ఇళ్లకు సోలార్ విద్యుత్ అందడం గ్రామ ఊర్జ స్వరాజ్యానికి నిలువెత్తు ఉదాహరణ అని పేర్కొంటూ,  మారిన పని విధానం జమ్మూ-కశ్మీర్‌ ను నూతన శిఖరాలకు చేరుస్తుందని అన్నారు. జమ్మూ యువతకు ప్రధానమంత్రి హామీ ఇస్తూ,  “మిత్రులారా, నా మాటలు నమ్మండి.  ఈ లోయకు చెందిన యువతీ యువకులు నా మాటలు గుర్తించండి, మీ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఎదుర్కొన్న ఇబ్బందులు మీరు ఎదుర్కోవలసిన అవసరం లేదు.  ఇది నేను నెరవేరుస్తాను. దాని గురించి మీకు హామీ ఇవ్వడానికి నేను వచ్చాను." అని పేర్కొన్నారు. 

అంతర్జాతీయ పర్యావరణ, వాతావరణ మార్పుల వేదికలపై భారతదేశ నాయకత్వాన్ని శ్రీ మోదీ ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, మొదటి కర్బన రహిత పంచాయతీగా పల్లి పంచాయతీ అవతరిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.   "పల్లి పంచాయతీ దేశంలోనే తొలి కర్బన రహిత పంచాయతీగా అవతరిస్తోంది. ఈ రోజు పల్లి గ్రామం నుంచి, దేశంలోని వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులతో మమేకమయ్యే అవకాశం కూడా నాకు లభించింది. ఈ గొప్ప విజయం మరియు అభివృద్ధి పనులకు జమ్మూ-కశ్మీర్‌ కు అనేక అభినందనలు” అని ఆయన అన్నారు.

"జమ్మూ-కశ్మీర్‌ లో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకోవడం ఒక పెద్ద మార్పును సూచిస్తుంది" అని ప్రధానమంత్రి అన్నారు.  జమ్మూ-కశ్మీర్‌ లో ప్రజాస్వామ్యం క్షేత్ర స్థాయి నుంచి అమలౌతున్నందుకు శ్రీ మోదీ గొప్ప సంతృప్తి మరియు గర్వాన్ని వ్యక్తం చేశారు.  “ప్రజాస్వామ్యం కావచ్చు లేదా అభివృద్ధి కోసం సంకల్పం కావచ్చు, ఈ రోజు జమ్మూ-కశ్మీర్ ఒక కొత్త ఉదాహరణగా నిలిచింది.   గత 2, 3 సంవత్సరాలలో, జమ్మూ-కశ్మీర్‌ లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది”, అని ప్రధానమంత్రి ప్రత్యేకంగా పేర్కొన్నారు.   జమ్మూ-కశ్మీర్‌ లో తొలిసారిగా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు - గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, డి.డి.సి. ఎన్నికలు జరిగాయి.

దేశ అభివృద్ధి ప్రయాణంలో జమ్మూ-కశ్మీర్‌ను చేర్చే ప్రక్రియ గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, జమ్మూ-కశ్మీర్‌ లో 175 కంటే ఎక్కువ కేంద్ర చట్టాలు వర్తిస్తాయని తెలియజేశారు.  ఈ ప్రాంతంలోని మహిళలు, నిరుపేదలు, అణగారిన వర్గాల ప్రజలే దీని ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్నారు.  రిజర్వేషన్ నిబంధనల్లోని అవకతవకలను తొలగించడంపై కూడా ఆయన మాట్లాడారు.  “వాల్మీకి సమాజం దశాబ్దాలుగా వారి పాదాలకు బంధించిన సంకెళ్ల నుండి విముక్తి పొందింది.  ఈ రోజున ప్రతి సమాజంలోని కుమారులు, కుమార్తెలు తమ కలలను నెరవేర్చుకోగలుగుతున్నారు.  జమ్మూ-కశ్మీర్‌ లో ఏళ్ల తరబడి రిజర్వేషన్ల ప్రయోజనం పొందని వారు, ఇప్పుడు రిజర్వేషన్ల ప్రయోజనం పొందుతున్నారు” అని ఆయన వివరించారు. 

తమ ‘ఏక్-భారత్-శ్రేష్ఠ్-భారత్’ దార్శనికత గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ,  అనుసంధానత , దూరాల తొలగింపు పై దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు వివరించారు. "దూరాలు, హృదయాలు, భాషలు, వనరులు, ఆచారాలు మొదలైన వాటి నిర్మూలన ఈ రోజు మనకు చాలా పెద్ద ప్రాధాన్యత" అని ఆయన చెప్పారు.

దేశాభివృద్ధిలో పంచాయ‌తీల పాత్ర గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ,  “ఈ స్వాతంత్య్ర ‘అమృత్ కాల్’ భారతదేశానికి స్వర్ణ కాలం కానుంది.  ఈ సంకల్పం 'సబ్-కా-ప్రయాస్' ద్వారా సాకారం కానుంది.  ఇందులో ప్రజాస్వామ్యంలోని క్షేత్ర స్థాయి యూనిట్ అయిన గ్రామ పంచాయతీ పాత్రతో పాటు, మీ అందరి సహచరుల పాత్ర చాలా ముఖ్యమైనది” అని పేర్కొన్నారు.   గ్రామాభివృద్ధికి సంబంధించిన ప్రతి ప్రాజెక్టు ప్రణాళిక రూపకల్పన, అమలులో పంచాయతీ పాత్ర మరింత లోతుగా ఉండాలని ప్రభుత్వం కృషిచేస్తోందని, ఆయన నొక్కి చెప్పారు.  "దీనితో, జాతీయ తీర్మానాల సాధనలో పంచాయతీ ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా ఉద్భవిస్తుంది" అని ఆయన అన్నారు.  2023 ఆగష్టు, 15వ తేదీ నాటికి ప్రతి జిల్లాలో 75 జలాశయాలు రానున్నాయని, ప్రధానమంత్రి చెప్పారు.  ఈ సరోవరాల చుట్టుపక్కల అమరవీరులు, స్వాతంత్య్ర సమరయోధుల పేర్లతో చెట్లను పెంచాలని, ఆయన కోరారు. గ్రామ పంచాయితీల పారదర్శకత, సాధికారత గురించి కూడా శ్రీ మోదీ విశదీకరించారు.  ప్రణాళిక నుండి చెల్లింపు వరకు ప్రక్రియలను ఈ-గ్రామ స్వరాజ్ వంటి చర్యలు అనుసంధానం చేస్తున్నాయి.  పంచాయతీల కార్యకలాపాలను ఆన్‌ లైన్‌ తనిఖీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సభలు అనేక కార్యక్రలాపాలు నిర్వహించడానికి పౌర చార్టర్ వ్యవస్థ గ్రామ సభలను ప్రోత్సహిస్తోంది.  ఈ సంస్థలతో పాటు, గ్రామ పాలనలో ముఖ్యంగా నీటి పాలనలో మహిళల పాత్రను కూడా ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. 

సహజ వ్యవసాయం కోసం తమ ఆకాంక్షను ప్రధానమంత్రి పునరుద్ఘాటిస్తూ, భూమి, భూగర్భ జలాలకు హాని కలిగిస్తున్నన రసాయనాల నుండి భూమాతను పరిరక్షించడం చాలా కీలకమని సూచించారు.   మన గ్రామాలు సహజ వ్యవసాయం వైపు పయనిస్తే యావత్ మానవాళికి మేలు జరుగుతుందని, ఆయన అన్నారు.  గ్రామ పంచాయతీల స్థాయిలో సహజ వ్యవసాయాన్ని ఎలా ప్రోత్సహించవచ్చో అన్వేషించాలని, ఇందుకు సమిష్టి కృషి అవసరమని ఆయన సూచించారు.  అదేవిధంగా, 'సబ్-కా-ప్రయాస్' సహాయంతో పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడంలో గ్రామ పంచాయతీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.  "పోషకాహార లోపం, రక్తహీనత నుండి దేశాన్ని రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న చర్యల గురించి క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇప్పుడు ప్రభుత్వ పథకాల కింద ఇస్తున్న బియ్యం సరఫరాను మరింత పటిష్టపరుస్తున్నాము." అని ఆయన తెలియజేశారు. 

ఆగష్టు 2019 లో జమ్మూ-కశ్మీర్ కి సంబంధించి రాజ్యాంగ సంస్కరణలను ప్రవేశపెట్టినప్పటి నుండి,  అపూర్వమైన వేగంతో ఈ ప్రాంతంలోని ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి, పాలనను గణనీయంగా మెరుగుపరచడానికి, విస్తృత శ్రేణి సంస్కరణలను తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.  ఈ రోజు ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ప్రాథమిక సౌకర్యాలను అందించడంలో, ఈ ప్రాంతంలో చైతన్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధిని సులభతరం చేయడంలో ఎంతో ఉపయోగపడతాయి. 

3100 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించిన బనిహాల్ ఖాజిగుండ్ రోడ్ టన్నెల్‌ ను ప్రధానమంత్రి ప్రారంభించారు.  8.45 కి.మీ. పొడవైన ఈ సొరంగం బనిహాల్ - ఖాజిగుండ్ మధ్య రహదారి దూరాన్ని 16 కి.మీ తగ్గిస్తుంది, ప్రయాణ సమయం సుమారు గంటన్నర తగ్గుతుంది.  ప్రయాణం యొక్క ప్రతి దిశకు ఒకటి చొప్పున - ఇది రెండు గొట్టపు మార్గాలతో ఉన్న సొరంగం - నిర్వహణ మరియు అత్యవసర తరలింపు కోసం ప్రతి 500 మీటర్లకు ఒక చోట ఒక మార్గం నుంచి రెండో మార్గంలోకి వెళ్ళడానికి వీలుగా రెండు గొట్టాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. ఈ సొరంగం జమ్మూ-కశ్మీర్ మధ్య అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ, రెండు ప్రాంతాలను దగ్గరికి తీసుకురావడానికి సహాయపడుతుంది.

సుమారు 7,500 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించే, ఢిల్లీ-అమృత్‌ సర్-కత్రా ఎక్స్‌ప్రెస్ వే కు చెందిన మూడు రోడ్ ప్యాకేజీలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.   వీటిలో, 4/6 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ ఢిల్లీ-కత్రా-అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం కోసం: ఎన్.హెచ్-44 లో బల్సువా నుండి గుర్హాబైల్‌దారన్, హీరానగర్ వరకు; గుర్హాబైల్దారన్, హీరానగర్ నుంచి జాఖ్, విజయపూర్ వరకు;  అదేవిధంగా, గుర్హాబైల్దారన్, హీరానగర్ నుండి జాఖ్, విజయపూర్ వరకు మార్గాలు ఉన్నాయి.  

రాటిల్ మరియు క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.  కిష్త్వార్ జిల్లాలోని చీనాబ్ నదిపై దాదాపు 5,300 కోట్ల రూపాయల వ్యయంతో 850 మెగావాట్ల రాటిల్ జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. మరో 4,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ వ్యవయంతో క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ కూడా కిష్త్వార్ జిల్లాలోని చీనాబ్ నదిపై నిర్మిస్తున్నారు.   ఈ ప్రాంతంలోని విద్యుత్ అవసరాలను తీర్చడంలో, రెండు ప్రాజెక్టులు సహాయపడతాయి.

జమ్మూ-కశ్మీర్ లో జన్-ఔషధి కేంద్రాల నెట్‌-వర్క్‌ ను మరింత విస్తరించే దిశగా,  సరసమైన ధరలకు మంచి నాణ్యమైన జెనరిక్ ఔషధాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో, 100 కేంద్రాలను ప్రధానమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ని మారుమూల ప్రదేశాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు.  పల్లిలో 500 కిలోవాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను కూడా ఆయన ప్రారంభిస్తారు, దీంతో ఇది దేశంలో కర్బన రహిత మొదటి పంచాయతీగా అవతరిస్తుంది.

లబ్ధిదారులకు స్వామిత్వ కార్డులను ప్రధానమంత్రి అందజేశారు.  జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా వివిధ కేటగిరీల వారీగా అవార్డులు సాధించిన పంచాయతీలకు అవార్డుల కింద ప్రధానమంత్రి ఈ సందర్భంగా నగదు బదిలీ చేశారు.  ఈ ప్రాంతానికి చెందిన గ్రామీణ వారసత్వాన్ని వర్ణించే "ఐ.ఎన్.టి.ఏ.సి.హెచ్." ఫోటో గ్యాలరీ తో పాటు, భారతదేశంలో ఆదర్శవంతమైన స్మార్ట్ గ్రామాలను తయారుచేయడానికి రూపొందించబడిన గ్రామీణ వ్యవస్థాపకత ఆధారిత నమూనా - "నోకియా స్మార్ట్‌-పూర్" ని కూడా ప్రధానమంత్రి తమ పర్యటనలో భాగంగా సందర్శించారు. 

నీటి వనరుల పునరుజ్జీవనాన్ని నిర్ధారించాలనే ఉద్దేశ్యంతో, "అమృత్-సరోవర్" అనే కొత్త కార్యక్రమాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు.  "ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్"  వేడుకల్లో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాలో 75 జలాశయాలను అభివృద్ధి చేయడం, పునరుద్ధరించడం దీని లక్ష్యం.

 

*****



(Release ID: 1819667) Visitor Counter : 142