ప్రధాన మంత్రి కార్యాలయం

ఈస్ట‌ర్న్ ఇక‌నామిక్ ఫోర‌మ్ 2021 లో ప్ర‌ధాన మంత్రి వ‌ర్చువల్ మాధ్య‌మం ద్వారా ఇచ్చిన ప్ర‌సంగం పాఠం

Posted On: 03 SEP 2021 2:43PM by PIB Hyderabad

ర‌ష్య‌న్ ఫెడ‌రేశ‌న్ అధ్య‌క్షుడు,
ప్రియ‌మైన నా మిత్రుడు శ్రీ పుతిన్‌,
ఎక్స్‌లన్సిజ్,
ఈస్ట‌ర్న్ ఇక‌నామిక్ ఫోర‌మ్ లో పాలుపంచుకొంటున్న వారంద‌రికీ
న‌మ‌స్తే,

ఈస్ట‌ర్న్ ఇక‌నామిక్ ఫోర‌మ్ ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.  మ‌రి ఈ గౌర‌వాన్ని ఇచ్చినందుకు అధ్య‌క్షుడు శ్రీ పుతిన్ కు నేను ధ‌న్యావాదాలు వ్యక్తం చేస్తున్నాను.

మిత్రులారా,

‘సంగమ్’ అనే మాట కు భార‌త‌దేశం చ‌రిత్ర లో, భార‌త‌దేశం నాగ‌రక‌త లో ఒక ప్ర‌త్యేక‌మైన అర్థమంటూ ఉంది.  దీనికి న‌దుల క‌ల‌యిక‌, ప్ర‌జ‌ల స‌మ్మేళ‌నం  లేదా ఆలోచ‌న‌ల క‌ల‌బోత అనేటటువంటి అర్థాలు ఉన్నాయి.  నా దృష్టి లో, వ్లాదివోస్తోక్ అనేది ప‌సిఫిక్, ఇంకా యూరేశియా ల వాస్త‌విక ‘సంగమం’గా ఉంది.  ర‌ష్యా లో దూర ప్రాచ్య ప్రాంతం అభివృద్ధి ప‌ట్ల శ్రీ పుతిన్ కు ఉన్న దృష్టి కోణాన్ని నేను మెచ్చుకొంటున్నాను.  ఈ దార్శ‌నిక‌త ను సాకారం చేయ‌డం లో ర‌ష్యా కు భార‌త‌దేశం ఒక న‌మ్మ‌ద‌గిన భాగ‌స్వామి గా ఉండగలదు.  2019 లో ఈ ఫోరానికి హాజ‌రు కావ‌డం కోసం  నేను వ్లాదివోస్తోక్ ను సంద‌ర్శించిన‌ప్పుడు భార‌త‌దేశం ‘‘యాక్ట్ ఫార్-ఈస్ట్‌’’ విధానాని కి కట్టుబడి ఉందని ప్రక‌టించాను.  ర‌ష్యా తో మాకు గల ప్ర‌త్యేక‌మైన‌టువంటి, విశేష అధికారాలు కలిగివున్న‌టువంటి వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం లో ఈ విధానాని కి ఒక ముఖ్య‌మైన పాత్ర అంటూ ఉంది.  

ఎక్స్‌లన్సి,

2019 లో నా సందర్శన వేళ వ్లాదివోస్తోక్ నుంచి జ్వెజ్ దా కు ప‌డ‌వ లో ప్ర‌యాణించిన సంద‌ర్భం లో అధ్య‌క్షుడు శ్రీ పుతిన్‌ తో నేను జ‌రిపిన ఒక స‌మ‌గ్ర‌ సంభాష‌ణ ను నేను జ్ఞ‌ప్తి కి తెచ్చుకొంటున్నాను.  మీరు జ్వెజ్ దా లో ఆధునిక నౌకా నిర్మాణ కేంద్రాన్ని నాకు చూపెట్టారు.  ఆ ఘ‌న‌మైనటువంటి వాణిజ్య సంస్థ లో భార‌త‌దేశం పాలుపంచుకోగ‌ల‌ద‌న్న ఆశాభావాన్ని కూడా మీరు వ్య‌క్తం చేశారు.  ఈ రోజు న, భార‌త‌దేశం లో అతి పెద్ద శిప్ యార్డుల లో ఒక శిప్ యార్డ్ అయిన‌టువంటి మాఝ్ గావ్ డాక్స్ లిమిటెడ్ ప్ర‌పంచం లో అత్యంత ముఖ్య‌మైన‌టువంటి వాణిజ్య త‌ర‌హా నౌక‌ల ను కొన్నింటిని నిర్మించ‌డం కోసం ‘జ్వెజ్ దా’ తో భాగస్వామ్యం ఏర్పరచుకోనుండడం తో నాకు సంతోషం కలుగుతున్నది.  గ‌గ‌న్ యాన్ కార్య‌క్ర‌మం ద్వారా అంత‌రిక్షాన్ని అన్వేషించ‌డం లో ర‌ష్యా, భార‌త‌దేశం భాగ‌స్వామ్య దేశాలు గా ఉన్నాయి. అంత‌ర్జాతీయ వ్యాపారం మ‌రియు వాణిజ్యం కోసం నార్థ‌ర్న్ సీ రూట్ ను తెర‌వ‌డం లో కూడాను భార‌త‌దేశం, ర‌ష్యా చేతులు కలుపుతాయియి.

మిత్రులారా,

భార‌త‌దేశాని కి , ర‌ష్యా కు మ‌ధ్య గల మైత్రి కాల ప‌రీక్ష కు త‌ట్టుకొని నిల‌చింది.  ఈ మైత్రి ని ఇటీవ‌లే కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి కాలం లో టీకా మందు ల రంగం సహా పలు అంశాల లో మ‌న మ‌ధ్య ఏర్ప‌డినటువంటి ప‌టిష్ట‌మైన స‌హ‌కారం లో సైతం గ‌మనించ‌వ‌చ్చును.  మ‌న ద్వైపాక్షిక స‌హ‌కారం లో ఆరోగ్య రంగానికి, ఔష‌ధ నిర్మాణ రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని విశ్వ‌మారి ప్ర‌ముఖం గా చాటి చెప్పింది.  శ‌క్తి రంగం మ‌న వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం లో మ‌రొక ప్ర‌ధాన‌మైన స్తంభం గా ఉంది.  ప్ర‌పంచ శ‌క్తి బ‌జారు లో స్థిర‌త్వాన్ని తీసుకు రావ‌డం లో భార‌త‌దేశం- ర‌ష్యా శ‌క్తి భాగ‌స్వామ్యం స‌హాయ‌కారి కాగ‌ల‌దు.  ఈ ఫోర‌మ్ లో భార‌త‌దేశాని కి ప్రాతినిధ్యం వ‌హించ‌డం కోసం నా ప్ర‌భుత్వం లో పెట్రోలియ‌మ్‌, స‌హ‌జ‌ వాయువు ల శాఖ మంత్రి శ్రీ హ‌ర్ దీప్ పురి వ్లాదివోస్తోక్ కు  విచ్చేశారు.  అంతేకాదు, భార‌త‌దేశ శ్రామికులు అమూర్ ప్రాంతం లో, యామల్ నుంచి వ్లాదివోస్తోక్ వ‌ర‌కు, అలాగే చెన్నై వ‌ర‌కు ఉన్న ప్ర‌ధాన‌మైన గ్యాస్ ప్రాజెక్టుల లో పాల్గొంటున్నారు.  మ‌నం ఒక శ‌క్తి మ‌రియు వ్యాపార ద‌ళాన్ని ఏర్పాటు చేయాలి అని ఆశిస్తున్నాం.  చెన్నై-వ్లాదివోస్తోక్ మేరిటైమ్ కారిడార్ ప‌నులు పురోగ‌మిస్తూ ఉండ‌టం నాకు సంతోషాన్ని ఇస్తోంది.  ఈ సంధాన ప‌థ‌కం తో పాటు, ఇంట‌ర్ నేశన‌ల్ నార్థ్-సౌథ్ కారిడార్ భార‌త‌దేశాన్ని, ర‌ష్యా ను భౌతికం గా ఒక‌దానితో మ‌రొక‌దానిని స‌న్నిహితం చేయ‌నున్నాయి.  మ‌హ‌మ్మారి సంబంధిత ఆంక్ష‌ లు అమ‌లవుతున్నా కూడాను అనేక రంగాల లో మ‌న వ్యాపార సంబంధాల ను ప‌టిష్ట ప‌ర‌చుకోవ‌డం లో చ‌క్క‌ని పురోగ‌తి చోటుచేసుకొంది.   భార‌త‌దేశ ఉక్కు ప‌రిశ్ర‌మ కు కోకింగ్ కోల్ ను దీర్ఘ‌కాలం పాటు స‌ర‌ఫ‌రా చేయ‌డం అనేది దీనిలో భాగం గా ఉంది.  మ‌నం వ్యావ‌సాయ‌క ప‌రిశ్ర‌మ‌, సిరామిక్స్‌, స్ట్ర‌టీజిక్ అండ్ రేర్ అర్థ్ మిన‌రల్స్, వ‌జ్రాల వంటి రంగాల లో కొత్త కొత్త అవ‌కాశాల ను సైతం అన్వేషిస్తున్నాం.  స‌ఖా-యాకూతియా, గుజ‌రాత్ ల వ‌జ్రాల రంగ ప్ర‌తినిధులు ఈ ఫోర‌మ్ లో భాగం గా విడి గా  స‌ంభాషణ జ‌రుపుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను.   2019 లో ప్ర‌క‌టించిన బిలియ‌న్ డాల‌ర్ సాఫ్ట్ క్రెడిట్ లైన్ ఉభ‌య దేశాల మ‌ధ్య అనేక వ్యాపార అవ‌కాశాల ను ఏర్పరుస్తుంద‌న్న న‌మ్మ‌కం నాలో ఉంది.

ర‌ష్యా లో దూర ప్రాచ్య ప్రాంతాల‌ కు చెందిన అతి ముఖ్య‌మైన భాగ‌స్వాముల‌ ను, అలాగే భార‌త‌దేశం లో కొన్ని రాష్ట్రాల వారిని ఒకే వేదిక మీద‌కు తీసుకు రావ‌డం కూడా ప్ర‌యోజ‌నాల‌ ను అందించేదే.  2019 లో కీల‌క భార‌త‌దేశ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల సంద‌ర్శ‌న కాలం లో జ‌రిగిన ఉప‌యోగ‌క‌ర‌మైన చ‌ర్చ‌ల ను మ‌నం మరింత ముందుకు తీసుకు పోవ‌ల‌సి ఉంది.   వీలైనంత త్వ‌ర‌గా భార‌త‌దేశం సంద‌ర్శ‌న కు త‌ర‌లి రావ‌ల‌సిందిగా ర‌ష్యా లో 11 దూర ప్రాచ్య ప్రాంతాల గ‌వ‌ర్న‌ర్ లను నేను ఆహ్వానించ‌ద‌ల‌చుకొన్నాను.

మిత్రులారా,

2019 లో ఈ ఫోర‌మ్ లో నేను చెప్పినట్లు, ప్ర‌పంచం లో వ‌న‌రులు స‌మృద్ధం గా ఉన్న అనేక ప్రాంతాల లో అభివృద్ధి ప్ర‌క్రియ కు భార‌త‌దేశ ప్ర‌తిభావంతులు తోడ్ప‌డ్డారు.  భార‌త‌దేశం లో ప్ర‌తిభావంతులైన‌టువంటి మ‌రియు స‌మ‌ర్ప‌ణ భావం క‌లిగిన‌టువంటి శ్ర‌మ శ‌క్తి ఉన్నది.  దూర ప్రాచ్య ప్రాంతాల లో వ‌న‌రులు పుష్క‌లం గా ఉన్నాయి.  అంటే ర‌ష్యా లోని దూర ప్రాచ్య ప్రాంతాల అభివృద్ధి కి తోడ్పాటు ను అందించ‌డానికి భార‌త‌దేశం శ్ర‌మ శ‌క్తి కి ఎంతో అవ‌కాశం ఉంద‌న్న‌ మాట‌.  ఈ ఫోర‌మ్ ను నిర్వహిస్తున్న ఫార్ ఈస్టర్న్ ఫెడ‌ర‌ల్ యూనివ‌ర్సిటి లో భార‌త‌దేశాని కి చెందిన చాలా మంది విద్యార్థులకు విద్యాబోధన ను అందిస్తున్నది.

ఎక్స్‌లన్సి,

అధ్య‌క్షుడు శ్రీ పుతిన్, ఈ ఫోర‌మ్ లో ప్ర‌సంగించే అవకాశాన్ని ఇచ్చినందుకు గాను మీకు నేను మరో సారి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను.  మీరు ఎల్ల‌వేళ‌లా భార‌త‌దేశాని కి ఒక గొప్ప స్నేహితుడి గా ఉన్నారు.  మ‌రి మీ మార్గ‌ద‌ర్శ‌క‌త్వం లో మ‌న వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం మ‌రింత‌గా బ‌లోపేతం అవుతూపోతుంది.  ఈస్టర్న్ ఇక‌నామిక్ ఫోర‌మ్ లో పాలుపంచుకొంటున్న వ‌ర్గాల‌న్నింటికీ స‌ఫ‌ల‌త సిద్ధించాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను.

స్పసీబా.

మీకు ధ‌న్య‌వాదాలు,

మీకు చాలా చాలా ధ‌న్య‌వాదాలు.


 

***



(Release ID: 1751759) Visitor Counter : 215