రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

నాలున్నర లక్షల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ దిగుమతి చేసుకుంటున్న భారత్‌ మొదటి దశలో, నేడు భారత్‌ చేరనున్న 75 వేల వయల్స్‌

Posted On: 30 APR 2021 11:56AM by PIB Hyderabad

దేశంలో రెమ్‌డెసివిర్‌ కొరతను పరిష్కరించేందుకు ఇతర దేశాల నుంచి ఆ ఔషధాన్ని కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటోంది. మొదటి దశలో, నేడు 75 వేల వయల్స్‌ వస్తున్నాయి.

    అమెరికాకు చెందిన గిలియడ్‌ సైన్సెస్‌, ఈజిప్టుకు చెందిన ఎవా ఫార్మా నుంచి నాలుగున్న లక్షల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌ కొనుగోలు చేస్తోంది. వచ్చే రెండు రోజుల్లో గిలియడ్‌ సంస్థ 75 వేల నుంచి లక్ష వయల్స్‌ను పంపిస్తుందని అంచనా వేస్తున్నారు. మే 15లోగా ఇంకో లక్ష వయల్స్‌ వస్తాయి. ఎవా ఫార్మా ప్రస్తుతానికి 10 వేల వయల్స్‌ పంపుతోంది. తర్వాత ప్రతి 15 రోజులకు 50 వేల చొప్పున జులై వరకు అందిస్తుంది.

    దేశంలో రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఏప్రిల్‌ 27 నాటికి నెలకు 38 లక్షలుగా ఉన్న ఏడు దేశీయ సంస్థల ఉత్పత్తి సామర్థ్యం ఇప్పుడు నెలకు 1.03 కోట్లకు పెరిగింది. గత వారం రోజుల్లో (21-28 ఏప్రిల్‌) ఔషధ సంస్థలు దేశవ్యాప్తంగా 13.73 లక్షల వయల్స్‌ను సరఫరా చేశాయి. ఏప్రిల్‌ 11 నాటికి రోజుకు 67,900గా ఉన్న వయల్స్‌ సరఫరా, 28వ తేదీ నాటికి 2.09 లక్షలకు పెరిగింది. వీటిని ఆయా ఆస్పత్రులకు ఆటంకాలు లేకుండా సరఫరా చేసేలా 'కేంద్ర హోం మంత్రిత్వ శాఖ' నుంచి రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు ఆదేశాలు అందాయి.
 
    దేశంలో రెమ్‌డెసివిర్‌ లభ్యతను పెంచేందుకు ఈ ఔషధం ఎగుమతిని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దీని ధర ప్రజలకు అందుబాటులో ఉండేలా, 'సవరించిన గరిష్ట ధర'ను ఏప్రిల్‌ 17న ఎన్‌పీపీఏ ప్రకటించింది. దీని ఫలితంగా పెద్ద బ్రాండ్ల ధరలు వయల్‌కు రూ.3500 లోపునకు దిగివచ్చాయి.
 
    దేశంలో రెమ్‌డెసివిర్‌ గరిష్ట ఉత్పత్తి, లభ్యతను పెంచేందుకు; ఔషధం ఇంజెక్షన్, దాని ఏపీఐ, ముడి పదార్ధమైన బీటా సైక్లోడెక్‌స్ట్రిన్‌పై కస్టమ్స్‌ సుంకాన్ని ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు మినహాయిస్తూ, ఏప్రిల్‌ 20న "27/2021-కస్టమ్స్‌" ప్రకటనను రెవెన్యూ శాఖ విడుదల చేసింది.
 
    'కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ'కు చెందిన "ఎయిమ్స్‌/ఐసీఎంఆర్‌-కొవిడ్‌ 19 జాతీయ కార్యదళం/సంయుక్త పర్యవేక్షణ బృందం", "క్లినికల్‌ గైడెన్స్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ అడల్ట్‌ కొవిడ్‌ 19 పేషెంట్స్‌" ద్వారా "జాతీయ ప్రామాణిక చికిత్స పద్ధతి"ని ఏప్రిల్‌ 22న తేదీన నవీకరించింది. రెమ్‌డెసివిర్‌ న్యాయబద్ధ వినియోగం, డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉండేలా ఈ కొత్త పద్ధతి భరోసానిస్తుంది.

***



(Release ID: 1715030) Visitor Counter : 207